Micromax explores electric vehicle business after decline in smartphone sales - Sakshi
Sakshi News home page

ఇప్పటివరకూ స్మార్ట్‌ఫోన్లు.. ఇక ఎలక్ట్రిక్‌ టూవీలర్లు! ప్రముఖ బ్రాండ్‌ ఎంట్రీ

Published Wed, Aug 9 2023 10:15 PM

Micromax enters electric vehicle business after decline smartphone sales - Sakshi

దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం బాగా పెరిగింది. వీటిలో అత్యధికంగా టూవీలర్లే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలోని పలు కొత్త కంపెనీలు ప్రవేశిస్తున్నాయి. దేశీయ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మైక్రోమ్యాక్స్‌ (Micromax) కొత్త వ్యాపార విభాగంలోకి అడుగుపెట్టబోతోంది. ఎలక్ట్రిక్‌ టీవీలర్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఎలక్ట్రిక్‌ టూవీలర్ల విభాగంలో ఇప్పటికే ఓలా, ఏథర్‌ వంటి కంపెనీలు సత్తా చాటుతున్నాయి. వీటికి తోడు హీరో, బజాజ్‌, టీవీఎస్‌ వంటి ప్రముఖ  ఆటోమొబైల్ కంపెనీలు సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో మైక్రోమ్యాక్స్‌ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. 

టెక్‌ క్రంచ్‌ నివేదిక ప్రకారం, మైక్రోమ్యాక్స్‌లో కొన్ని అస్థిరమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఉద్యోగుల తొలగింపులు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌తో సహా కీలక ఎగ్జిక్యూటివ్‌లు వైదొలగడం వంటి కారణాల నేపథ్యంలో కంపెనీ ఈవీ తయారీ రంగంలో అన్వేషణకు కారణమని చెప్పవచ్చు. 2021 ఏప్రిల్లో రాహుల్ శర్మ రాజీనామా తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన సహ వ్యవస్థాపకులలో ఒకరైన వికాస్ జైన్ కూడా కంపెనీ నుంచి వైదొలిగారు.

గత ఫిబ్రవరిలో కంపెనీ వ్యవస్థాపకులు రాజేష్ అగర్వాల్, సుమీత్ కుమార్, వికాస్ జైన్‌లు కలిసి మైక్రోమ్యాక్స్ మొబిలిటీ పేరుతో కొత్త సంస్థను స్థాపించారు. ఈ కొత్త వెంచర్ మొదట ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారిస్తుందని తెలిసింది. ఇందు కోసం వ్యూహాత్మక ప్రయత్నాల్లో భాగంగా గురుగ్రామ్‌లో కార్యాలయ పునరుద్ధరణను చేపడుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

మైక్రోమ్యాక్స్ 2014 ఆగస్టులో మార్కెట్ లీడర్ శాంసంగ్‌ను అధిగమించి భారతదేశపు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీగా అగ్రస్థానాన్ని పొందింది. ఆ తర్వాత షావోమీ, ఒప్పో, వివో వంటి చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల ఆవిర్భావంతో ప్రభను కోల్పోయింది. వాటి పోటీ ధరల వ్యూహాలను తట్టుకోలేక కిందకు జారిపోయింది.

Advertisement
Advertisement