ఎల్‌ఐసీ పాలసీ దారులకు ముఖ్యగమనిక! | These Big Changes Going To Happen From 1st November 2023 - Sakshi
Sakshi News home page

ల్యాప్‌ట్యాప్‌లపై ఆంక్షలు.. గ్యాస్‌ ధరల్లో మార్పులు..ఎల్‌ఐసీ పాలసీ దారులకు అలెర్ట్‌.. నవంబర్‌ 1 నుంచి రాబోయే మార్పులివే!

Published Tue, Oct 31 2023 3:47 PM

New Rules From 1st November 2023 - Sakshi

క్యాలెండర్‌లో పేజీ ఎప్పుడు మారుతుందా? ఆశగా ఎదురుచూస్తాడు మధ్యతరగతి వ్యక్తి. నెలంతా కష్టపడి పనిచేసినందుకు గానూ ప్రతిఫలం దక్కేది ఆరోజే కాబట్టి. తీరా జీతం వచ్చాక ఖర్చైపోయిందంటూ నిట్టూరుస్తూ యథావిధిగా తన పనిలో నిమగ్నమైపోతాడు. అయితే, ప్రతి నెలా చోటుచేసుకునే కొన్ని మార్పులు మన జేబుపై ప్రభావం చూపేవి అయితే.. మరికొన్ని ఊరట కల్పిస్తాయి. అలా నవంబర్‌ 1 నుంచి కొన్ని మార్పులు రానున్నాయి. దీపావళికి ముందే వచ్చే కొన్ని మార్పులు సామాన్యుడికి తీపిని పంచేనా..? చేదు గుళికను అందిస్తాయా? చూసేయండి.

గ్యాస్‌ ధరలు : చమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన సీఎన్‌జీ (కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) ఎల్‌పీజీ (లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌), పీఎన్‌జీ (పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) ధరల పెంపు, తగ్గుదలపై ప్రకటన చేస్తాయి. 

ఈ-చలాన్ : నేషనల్‌ ఇన్ఫ్రమెటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ప్రకారం.. వ్యాపార లావాదేవీల విలువ రూ.100 కోట్లుంటే తప్పని సరిగా ఈ-పోర్టల్‌లో రానున్న 30 రోజుల్లోపు జీఎస్టీ చలాన్‌ను అప్‌లోడ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

ల్యాప్‌ట్యాప్‌లపై ఆంక్షలు : ఆగస్ట్‌ 3న కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఆయా సంస్థలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసే 7 రకాల ఎలక్ట్రానిక్‌ వస్తువులపై ఆంక్షలు విధించింది. హెచ్‌ఎస్‌ఎన్‌ 8741 విభాగం కింద ల్యాప్‌ట్యాప్‌, పర్సనల్‌ కంప్యూటర్‌, ట్యాబ్లెట్స్‌లు ఉన్నాయి. కేంద్రం విధించిన ఈ కొత్త నిబంధనలు నవంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పైన పేర్కొన్న 7 రకాల ఉత్పత్తులపై వ్యాలిడ్ లైసెన్స్ ఉన్నవారికే పరిమిత సంఖ్యలో దిగుమతులు ఉంటాయని పేర్కొంది 

ల్యాప్స్‌డ్‌ ఎల్‌ఐసీ పాలసీలు : ఎల్‌ఐసీ 67వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రయాణంలో అద్భుతమైన విజయాలు సాధించినట్లు కంపెనీ తెలిపింది. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సెప్టెంబరు 1 నుంచి విలువైన పాలసీదార్ల కోసం నిలిచిపోయిన (ల్యాప్స్‌డ్‌) పాలసీల పునరుద్ధరణ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.

 ఇందులో భాగంగా ఎవరైతే ఏళ్ల కేళ్లు ప్రీమియం చెల్లించకుండా వదిలేస్తారో.. వాళ్లు ల్యాప్స్‌ అయిన పాలసీలను తిరిగి పునరుద్ధరించుకునే అవకాశాన్ని అక్టోబర్‌ 31వరకు కల్పిచ్చింది. ఆ గడువు నేటితో ముగియనున్న తరుణంలో ఖాతా దారులు తమ పాలసీలను పునరుద్ధరించుకోవాలని ఎల్‌ఐసీ అధికారులు చెబుతున్నారు.  

లావాదేవీలపై అదనపు ఛార్జీలు: అక్టోబర్‌ 20న బాంబే స్టాక్‌ ఎక్ఛేంజ్‌ (బీఎస్‌ఈ) కీలక ప్రకటన చేసింది.స్టాక్‌ మార్కెట్‌లోని ఈక్విటీ డెరివేటివ్‌లపై నిర్వహించే లావాదేవీలపై విధించే ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు నవంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement