Q4: కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌ | Sakshi
Sakshi News home page

Q4: కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌

Published Fri, Apr 12 2024 4:36 AM

Q4 Results: Corporate company results season - Sakshi

నేటి నుంచి ప్రారంభం

టీసీఎస్‌ రిజల్ట్‌తో షురూ

వచ్చే వారం ఇన్ఫీ, విప్రో, టెక్‌ఎం

క్యూ4, గైడెన్స్‌పై అంచనాలు వీక్‌!

న్యూఢిల్లీ: ఐటీ సేవల నంబర్‌వన్‌ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాల సీజన్‌కు శ్రీకారం చుడుతోంది. నేడు (శుక్రవారం) క్యూ4తోపాటు.. మార్చితో ముగిసిన గత పూర్తిఏడాది(2023–24)కి సైతం పనితీరు వెల్లడించనుంది. అయితే క్యూ4సహా.. గతేడాదికి ఐటీ కంపెనీలు నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించే అవకాశమున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

వెరసి సాఫ్ట్‌వేర్‌ రంగ కంపెనీల క్యూ4, పూర్తి ఏడాది పనితీరు వెల్లడికానుండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) ఆదాయ అంచనాలు(గైడెన్స్‌) సైతం ప్రకటించనున్నాయి. అయితే పలు కంపెనీలు నిరుత్సాహకర ఫలితాలనే ప్రకటించనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఇందుకు బలహీన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఐటీ వ్యయాలు తగ్గడం తదితర అంశాలు ప్రభావం చూపనున్నట్లు పేర్కొంటున్నాయి. ఆర్థిక అనిశి్చతుల కారణంగా టెక్నాలజీ సేవలకు డిమాండ్‌ మందగించడం, ఐటీపై క్లయింట్ల వ్యయాలు తగ్గడం ఈ ఏడాది అంచనాలను సైతం దెబ్బతీసే వీలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వెరసి ఐటీ కంపెనీలు అప్రమత్తతతో కూడిన గైడెన్స్‌ను ప్రకటించనున్నట్లు తెలియజేశాయి.

బ్రోకింగ్‌ వర్గాల అంచనాలు
నేడు(12న) ఐటీ సేవల నంబర్‌వన్‌ కంపెనీ టీసీసీఎస్‌ క్యూ4సహా.. 2023–24 ఫలితాలను విడుదల చేయనుంది. ఈ బాటలో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలు ఇన్ఫోసిస్‌ 18న, విప్రో 19న, టెక్‌ మహీంద్రా 25న, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 26న క్యూ4, గతేడాదికి పనితీరును వెల్లడించనున్నాయి. దేశీ ఐటీ కంపెనీలు క్యూ4లో అంతంతమాత్ర ఫలితాలను సాధించనున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ ఎమ్‌కే ఇటీవల అంచనా వేసింది.

ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్‌–మార్చి)లో మాత్రమే రికవరీ ఆశలనుపెట్టుకోవచ్చునంటూ పేర్కొంది. అయితే క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌)లో సాధించిన నిరాశామయ పనితీరుతో పోలిస్తే క్యూ4లో త్రైమాసికవారీగా కాస్తమెరుగైన ఫలితాలు సాధించవచ్చని బ్రోకింగ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల రీత్యా ఐటీ సరీ్వసులకు డిమాండ్‌ మందగించినట్లు పేర్కొంది.

వెరసి కరోనా మహమ్మారి తలెత్తిన 2019–20ను మినహాయిస్తే వార్షికంగా 2008–09 తదుపరి బలహీన ఫలితాలు విడుదలయ్యే వీలున్నట్లు తెలియజేసింది. వ్యయాలు తగ్గడం ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. ఐచి్చక వ్యయాలు తగ్గడంతో ఐటీ పరిశ్రమలో ప్రస్తావించదగ్గ మార్పులకు అవకాశంతక్కువేనని అభిప్రాయపడింది. కాగా.. యూఎస్‌ ఫెడ్‌ సానుకూల ధృక్పథం, పూర్తి చేయవలసిన భారీ ఆర్డర్లు వంటి అంశాలు ఈ ఏడాది(2024–25)లో ప్రోత్సాహక ఫలితాలకు దారిచూపవచ్చని అంచనా వేసింది.

క్యూ4లో డీల్స్‌ ద్వారా సాధించే మొత్తం కాంట్రాక్టుల విలువ(టీసీవీ) సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ ఆదాయంపై స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ఒత్తిడి కనిపించవచ్చని వివరించింది. ఐటీ సేవలకు ప్రధానమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సరీ్వసులు, ఇన్సూరెన్స్‌(బీఎఫ్‌ఎస్‌ఐ)తోపాటు, రిటైల్, హైటెక్, కమ్యూనికేషన్స్‌ విభాగాలతోపాటు.. ప్రాంతాలవారీగా కూడా బలహీనతలు కనిపిస్తున్నట్లు ఐటీ విశ్లేషకులు పేర్కొన్నారు.  

గ్లోబల్‌ దిగ్గజాలు సైతం
గ్లోబల్‌ దిగ్గజాలు యాక్సెంచర్, కాగి్నజెంట్‌ టెక్నాలజీ, క్యాప్‌జెమిని సైతం ఈ క్యాలండర్‌ ఏడాది(2024) ఓమాదిరి పనితీరును ఊహిస్తున్నాయి. ఫలితంగా తొలి అర్ధభాగం(జనవరి–జూన్‌)లో అంతంతమాత్ర వృద్ధిని అంచనా వేశాయి. అయితే ద్వితీయార్ధం(జూలై–డిసెంబర్‌)లో రికవరీకి వీలున్నట్లు అభిప్రాయపడ్డాయి. కాగా.. దేశీ ఐటీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రక్షణాత్మక బిజినెస్‌ మిక్స్‌ ద్వారా లబ్ది పొందే వీలున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది. ఇక డిజిటల్, బిజినెస్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ విభాగాల కారణంగా టీసీఎస్, ఇన్ఫోసిస్‌ కీలక పురోగతిని సాధించవచ్చని అభిప్రాయపడింది.

Advertisement
Advertisement