‘అహ్లాన్‌ మోదీ’కి 65 వేల రిజిస్ట్రేషన్లు | Sakshi
Sakshi News home page

PM Modi UAE Visit: ‘అహ్లాన్‌ మోదీ’కి 65 వేల రిజిస్ట్రేషన్లు

Published Tue, Feb 13 2024 8:38 AM

65000 Register for PMS Ahlan Modi Event - Sakshi

మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోదీకి అపరిమితమైన ఆదరణ ఉంది. యూఏఈలో జరగబోయే ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏకంగా 65 వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 

ఫిబ్రవరి 13న అంటే నేడు (మంగళవారం) యూఏఈలో జరిగే ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇండియన్ పీపుల్ ఫోరమ్ ప్రెసిడెంట్, ‘అహ్లాన్ మోదీ’ ఇనిషియేటివ్ హెడ్‌ జితేంద్ర వైద్య ఈ ఈవెంట్ గురించి మీడియాకు తెలిపారు. ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమమని, ప్రవాస భారతీయుల కమ్యూనిటీ దీనికి సకల ఏర్పాట్లు చేస్తున్నదని అన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 65 వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, అంతకుమించి జనం వస్తే, వసతి కల్పించలేమని, అందుకే రిజిస్ట్రేషన్లు ఇక నిలిపివేయాల్సి వచ్చిందని యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 13నుంచి ప్రారంభమయ్యే తన పర్యటనలో యూఏఈ, ఖతార్‌లోని ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. యూఏఈలో నిర్మితమైన హిందూ దేవాలయాన్ని 14న ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐదు వేల మంది భక్తులు  హాజరుకానున్నరని అంచనా. 2015 తర్వాత ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించడం ఇది ఏడోసారి.

Advertisement
 
Advertisement