కాంగ్రెస్‌కు ఓటేసి గోసపడుతున్రు.. | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఓటేసి గోసపడుతున్రు..

Published Tue, Apr 23 2024 8:10 AM

- - Sakshi

బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌

కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ఇప్పుడు ప్రజలందరూ గోసపడుతున్నారని, ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఆగమైతరని కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. మల్యాలలో సోమవా రం రాత్రి రోడ్‌షో చేపట్టారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఘన స్వాగతం పలికారు.

అంగడి బజార్‌లో వినోద్‌ మాట్లాడుతూ.. కరీంనగర్‌ ఎంపీగా బండి సంజయ్‌ బడి తేలే.. గుడి తేలేదని, ఐదేళ్లలో కనీసం ఐదు రూపాయలు తేలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసం బండి సంజయ్‌ వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్‌ ఆయనకు పునరావాసమా..? అని ప్రశ్నించారు.

తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌కు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ గారడీ మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని, నాలుగు నెలల్లోనే రాష్ట్రప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని తెలిపారు. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత హక్కుల కోసం పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతుక కావాలని, ఇందుకు వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవాలని కోరారు.

ఇవి చదవండి: నేను.. పక్కా లోకల్‌

Advertisement
Advertisement