బొమ్మనహళ్లి: బెంగళూరు దక్షిణ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి శుక్రవారం కర్ణాటక రెడ్డి సముదాయానికి చెందిన శ్రీశ్రీ వేమాననంద స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నారు. నగరంలోని మంత్రి రామలింగారెడ్డి నివాసారికి వచ్చిన స్వామీజీ సౌమ్యారెడ్డిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చంద్రప్ప,రెడ్డి జన సంఘం సభ్యులు శేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి(కిట్టి) ప్రముఖులు పాల్గొన్నారు.
అవినీతికి పాల్పడిన వారిని ప్రజలు క్షమించరు : సీఎం
గౌరిబిదనూరు: కరోనా కాలంలో అవినీతికి పాల్పడిన వారిని ప్రజలు క్షమించరని, అందువల్లే మాజీ మంత్రి డా సుధాకర్ను గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఓడించారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. గురువారం రాత్రి దాకా నగరంలో జరిగిన ఎన్నికల రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. బాగేపల్లి నుండి ఆలస్యంగా వచ్చిన ముఖ్యమంత్రి నగరంలోని బీహెచ్ రోడ్డులోని శనిమహాత్ముని ఆలయం నుంచి రాత్రి దాకా ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ నియోజక వర్గంలో ప్రస్తుతం వున్న ఎమ్మెల్యే పుట్టస్వామిగౌడ, మాజీ మంత్రి శివశంకరరెడ్డి గ్రూపులు ఒకటయ్యిందని, ఇక్కడనే 50 వేల ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థి రక్షా రామయ్యకు వస్తుందన్నారు. మోదీ ఎన్నికల సమయంలో మాత్రమే రాష్ట్రానికి వస్తారని, వరదలు వచ్చినపుడు ఎందుకు రాలేదన్నారు. రోడ్ షోలో శివశంకరరెడ్డి, పుట్టస్వామిగౌడ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మోదీపై పాట,
యువకుడిపై దాడి
మైసూరు: ప్రధాని మోదీకి మద్దతుగా పాట రాసిన యువకుడిపై ఓ వర్గం తీవ్రంగా కొట్టి హత్య చేస్తామని బెదిరించిన ఘటన మైసూరు నగరంలో చోటుచేసుకుంది. రోహిత్ దుండగుల చేతిలో దాడిలో గాయపడిన యువకుడు. రోహిత్ గతవారం ప్రధాని మోదీ గురించి పాటను రాసి యూట్యూబ్లో పోస్టు చేశాడు. ఈ క్రమంలో మైసూరు నగరంలో ప్రభుత్వ అతిథి గృహం వద్ద ఉన్న సమయంలో ఓ యువకుడు వచ్చిన సమయంలో అతనికి చూపిస్తుండగా తన స్నేహితులు కూడా చూపిస్తామని చెప్పి తీసుకెళ్లి దాడి చేశారని రోహిత్ వాపోయాడు. బాధితుడు లక్ష్మీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.