ములుగు రూరల్: ఉపాధి, ఉత్పాదకతే లక్ష్యంగా జీవాల పెంపకందారులకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో సబ్సిడీ రుణాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం(ఎన్ఎల్ఎం)పేరుతో పెంపకందారులకు 50శాతం సబ్సిడీ అందించి జీవాల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తోంది. ఎన్ఎల్ఎం పథకం ద్వారా గొర్రెలు, కోళ్లు, పందుల పెంపకంతో పాటు దానా ప్రాసెసింగ్ యూనిట్లకు రుణాలు మంజూరు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఒక్కో యూనిట్ విలువ రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అందించాలని నిర్ణయించింది. గొల్ల కురుమలకు కాకుండా అన్ని సా మాజిక వర్గాల ప్రజలను అర్హులుగా గుర్తించింది. దీంతో పాటు పరపతి సంఘాలు, సొసైటీలకు రుణాలను మంజూరు చేయనుంది. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది.
యూనిట్ ఐదు విభాగాలుగా విభజన
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకొచ్చింది. పథకం ప్రారంభంలో కేవలం యూనిట్ విలువ రూ.కోటి కేటాయించింది. బ్యాంకు రుణం రూ.40 లక్షలు, లబ్ధిదారుడి వాటా ధనం రూ.10 లక్షలు, ప్రభుత్వ సబ్సిడీ రూ.50 లక్షలుగా నిర్ణయించింది. యూనిట్ విలువలో బ్యాంకు రుణాలకు బ్యాంకర్లు నిరాకరించడంతో యూనిట్ విలువను తగ్గించింది. దీంతో యూనిట్ విలువను ఐదు విభాగాలుగా విభజించి రుణాలు అందజేయాలని సడలించింది. దీంతో 105 గొర్ల నుంచి 525 గొర్రెల వరకు రూ.10 లక్షల నుంచి కోటి వరకు రుణాలు ఇస్తుంది.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే విధానం
లబ్ధిదారుడు ఎంపిక చేసుకున్న యూనిట్ను బట్టి రెండు ఎకరాల భూమి నుంచి 10ఎకరాల భూమి అవసరం ఉంటుంది. భూమిలేని లబ్ధిదారులు లీజుకు తీసుకొని రుణాలు పొందవచ్చు. లబ్ధిదారుడు యూనిట్ పెంచుకునే స్థలంలో పశుగ్రాసం పెంచి బ్యాంక్ కాన్సెంట్ తీసుకురావాలి. లబ్ధిదారుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు జత చేస్తూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కాపీలను జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. చివరి తేదీ లేకుండా లబ్ధిదారుడు ఎప్పుడైన దరఖాస్తు చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
సద్వినియోగం చేసుకోవాలి..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. యూనిట్ విలువలో 50 శాతం సబ్సిడీ ఇస్తుంది. పథకం పూర్తి స్థాయి సబ్సిడీ డబ్బులు రెండు సంవత్సరాల కాల పరిమితిలో చెల్లించబడుతాయి. ఆసక్తి కలిగిన రైతులు దరఖాస్తులు చేసుకోవాలి.
– జిల్లా పశు పంవర్ధకశాఖ అధికారి రవికుమార్
ఎంపిక విధానం
ఎన్ఎల్ఎం పథకంలో ఆన్లైన్ దరఖాస్తులు చేసుకున్న వారి ఎంపిక కోసం రాష్ట్ర, కేంద్ర స్థాయిలో రెండు కమిటీలు ఉంటాయి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. లబ్ధిదారుడికి బ్యాంకు రుణం మంజూరైన తర్వాత 25 శాతం, యూనిట్ గ్రౌండింగ్ తర్వాత 25 శాతం సబ్సిడీ నిధులను బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. బ్యాంకు రుణం అవసరం లేని వారు సొంతంగా పెట్టుబడి పెట్టి షెడ్లు, పశుగ్రాసం పెంపకం చేపట్టిన అనంతరం సబ్సిడీని పొందవచ్చు.