2019 ఫార్ములా రిపీట్.. కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లంటే.. | Sakshi
Sakshi News home page

2019 ఫార్ములా రిపీట్.. కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లంటే..

Published Sat, Mar 9 2024 9:48 PM

Congress Lok Sabha 2024 Sharing Deal With DMK - Sakshi

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో డీఎంకే 2019 ఫార్ములాను మళ్ళీ పునఃప్రారంభించింది. పార్టీ తన మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల ఒప్పందం ఎట్టకేలకు ఖరారు చేసుకుంది. దీంతో తమిళనాడులో 9 స్థానాలు, పుదుచ్చేరిలో ఒక్క స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయనుంది.

సీట్ల పంపకాల ఒప్పందం డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీఎన్‌సీసీ చీఫ్ కే సెల్వపెరుంతగై, ఏఐసీసీ నేతలు కేసీ వేణుగోపాల్, అజయ్ కుమార్ సమక్షంలో జరిగింది.

తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకే నేతృత్వంలోని కూటమి మొత్తం 40 సీట్లను గెలుచుకుంటుందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. కాంగ్రెస్, డీఎంకే మధ్య బంధం పటిష్టంగా ఉందని, కలిసికట్టుగా పోరాడి రాబోయే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని అన్నారు.

తమిళనాడు, పుదుచ్చేరిలో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)తో అధికారిక పొత్తును ప్రకటించడం సంతోషంగా ఉందని, తమిళనాడులో 9 స్థానాలు మరియు పుదుచ్చేరిలో ఒక స్థానంలో కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని వేణుగోపాల్ అన్నారు. మిగిలిన స్థానాల్లో డీఎంకే అభ్యర్థులకు మద్దతు ఇస్తామని పేర్కొన్నారు.

కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ (MNM) పార్టీ కూడా డీఎంకే నేతృత్వలోని కూటమిలో భాగమే. కానీ త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో వారికి స్థానం కేటాయించలేదు. ఆ తరువాత జరిగే రాజ్యసభ ఎన్నికలకు సీటు కేటాయించనున్నట్లు సమాచారం. కాగా ప్రజా సంక్షేమం కోసం మాత్రమే డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరినట్లు కమల్ హాసన్ తెలిపారు.

Advertisement
Advertisement