Priyanka Gandhi Unlikely To Contest From Amethi And Raebareli For Lok Sabha Elections, Says Sources | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీకి దూరం!

Published Tue, Apr 30 2024 10:33 AM

sources Priyanka Gandhi unlikely to contest Lok Sabha elections

కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. మరోవైపు.. ఉత్తర​ప్రదేశ్‌లో కీలకమైన అమేథీ, రాయ్‌ బరేలీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయటంతో కాంగ్రెస్‌  పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఖరారు నిర్ణయాన్ని కాంగ్రెస్‌ నేతలు.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వదిలిపెట్టారు. 

ఈ క్రమంలో ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట ప్రియాంకా గాంధీ లేదా ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా, మరో స్థానంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బరిలో​కి దిగుతారని వార్తలు వస్తున్నాయి.  అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

ప్రియాంకా గాంధీ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయకుండా.. కేవలం కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేయటానికి పరిమితం కానున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీకి కీలకమైన అమేథీ, రాయ్‌ బరేలీలో ఏదో ఒక చోట రాహుల్‌ గాంధీ పోటీ దిగే నిర్ణయాన్ని అదిష్టానం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు... యూపీకి చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఉత్తరప్రదేవ్‌లో పోటీ చేయాలని కోరుతున్నారు. 

అమేథీ స్థానంలో మూడుసార్లు గెలిచిన రాహు​ల్‌ మళ్లీ ఇక్కడ పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రియాంకా గాంధీ రాయ్‌బరేలీలో పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే  అమేథీ, రాయ్‌బరేలీ రెండు స్థానాలు కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక.. ఇక్కడ ఐదో విడతలో మే 20న పోలింగ్‌ జరగనుంది.

Advertisement
Advertisement