CM Jagan: సింహంలా ఒక్కరే వస్తారు | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయంతో సీఎం జగన్‌ చరిత్ర తిరగరాశారు

Published Tue, Dec 12 2023 4:55 PM

YSRCP Samajika Sadhikara Bus Yatra Rajampet Public Meeting - Sakshi

సాక్షి, అన్నమయ్య: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. మంగళవారం అన్నమయ్య జిల్లాలో రాజంపేట నియో­జకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర జరుగుతోంది. రాజంపేట బహిరంగ సభలో వైఎస్సార్‌ జిల్లా అధ్యక్షుడు సురేష్‌ బాబు మాట్లాడారు.

ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చేశామని, కానీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం సామాజిక సాధికారత సాధించి చరిత్ర తిరగరాశారని అన్నారు. సీఎం జగన్‌ ఎంతో మంది సామాన్యులకు పదవులిచ్చారని తెలిపారు. బీసీలను రాజ్యసభకు పంపిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. మళ్లీ కొందరు అబద్దపు హామీలతో మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు. వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. వైఎస్ జగన్‌ను అశీర్వదించండని కోరారు.

రాజంపేట ప్రజలు అదృష్టవంతులని.. రామలక్ష్మణుల్లా మల్లికార్జునరెడ్డి, అమరనాథ్‌రెడ్డిలు రాజంపేటను కాపాడుతున్నారని డిప్యూటి సీఎం అంజాద్ బాషా అన్నారు. రాజంపేట బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మల్లికార్జునరెడ్డి, అమరనాథ్‌రెడ్డి వంటి నాయకులు రాజంపేటకు ఉండటం అదృష్టమని తెలిపారు. సామాజిక న్యాయాన్ని ఇంత వరకు ఎప్పుడైనా చూశామా? బీసీలు తనకు పేటెంట్ అని చెప్పిన చంద్రబాబు బీసీలను వాడుకొని వదిలేశారని ఆరోపించారు. కానీ ఆచరణలో సీఎం వైఎస్ జగన్ చేసి చూపారని గుర్తుచేశారు. ఇంటికొకరు ఇంజనీరు, వైద్యలు ఉండాలని ఆనాడు దివంగత వైఎస్సార్‌ ఆశించారని తెలిపారు. ఇప్పుడు ఆయన తనయుడు అదే పరిపాలనను కొనసాగిస్తున్నారని అన్నారు.

టీడీపీ హాయంలో మైనార్టీ మంత్రి, ఎమ్మెల్యే లేరని, ఓట్ల కోసమే చివరలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారని మండిపడ్డారు. అదే వైఎస్ జగన్ మైనార్టీని డిప్యూటి సీఎంను చేశారని గుర్తుచేశారు. అనేక మందిని కార్పోరేషన్లకు చైర్మన్లుగా చేశారని పేర్కొన్నారు. కేవలం జగన్‌ను ఎదుర్కొవడానికి అన్ని పార్టీలు ఎకమవుతున్నాయని అన్నారు. ఎంతమంది ఏకమైనా సింహంలా జగన్ ఒక్కరే వస్తారని తెలిపారు. సీఎం జగన్‌ను ప్రతి ఒక్కరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని అంజాద్‌ బాషా అన్నారు.

రాజంపేటలో అభివృద్ది జరిగిందంటే దివంగత వైఎస్అర్, వైఎస్ జగన్ హాయంలోనే జరిగిందని కడప జడ్పీ ఛైర్మన్ అకేపాటి అమరనాధరెడ్డి తెలిపారు. రాజంపేట బహిరంగ సభలో అకేపాటి అమరనాధరెడ్డి మాట్లాడారు. రాజంపేటలో తాగునీరు సమస్య లేదంటే అది వైఎస్అర్ చలువే అన్నారు. రాజంపేటకు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, తాను ప్రజలకు వాచ్‌మెన్లలా ఉన్నామని, అందరికీ అండగా ఉన్నామని తెలిపారు.

ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించి రాష్టంలో సీఎంగా వైఎస్ జగన్ గెలిపించాలని అన్నారు. అన్ని కులాలపై ప్రేమ చూపిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. అందరినీ విద్యావంతులను చేయ్యాలని అనేక సంస్కరణలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడున్న పథకాలన్ని అమలవ్వాలంటే మళ్లీ జగనే రావాలని తెలిపారు.

Advertisement
Advertisement