Ind Vs WI: Shikhar Dhawan 3 Records Yashasvi Jaiswal Could Break In Tests, See Details - Sakshi
Sakshi News home page

#Yashasvi Jaiswal: ధావన్‌ పేరును కనుమరుగు చేసే పనిలో యశస్వి! అదే జరిగితే.. పాపం గబ్బర్‌ అరుదైన రికార్డులు

Published Thu, Jul 20 2023 5:39 PM

Ind Vs WI: Shikhar Dhawan 3 Records Yashasvi Jaiswal Could Break in Tests - Sakshi

Yashasvi Jaiswal: అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత శతకం సాధించి అనేకానేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు టీమిండియా యువ బ్యాటర్‌ యశస్వి జైశ్వాల్‌. వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ 21 ఏళ్ల లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. 387 బంతులు ఎదుర్కొని 171 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(103)కు జోడీగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన యశస్వి.. డబుల్‌ సెంచరీకి దూరమైనా అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తన మొదటి మ్యాచ్‌లోనే అవార్డు అందుకున్నాడు. మరి విండీస్‌తో రెండో టెస్టులోనూ అతడు ఓపెనింగ్‌ చేయడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ట్రినిడాడ్‌ వేదికగా జూలై 20న ఆరంభం కానున్న ఈ మ్యాచ్‌ నుంచి యశస్వి జైశ్వాల్‌ ఇదే దూకుడు కొనసాగిస్తే టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ పేరిట ఉన్న మూడు రికార్డులు బద్దలవడం ఖాయం. అవేంటంటే..

తొలి 10 టెస్టు ఇన్నింగ్స్‌లో..
టీమిండియా తరఫున మొదటి 10 టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ధావన్‌ (532 రన్స్‌) ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నాడు. 

వినోద్‌ కాంబ్లీ(880), సునిల్‌ గావస్కర్‌(831), మయాంక్‌ అగర్వాల్‌(605) ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. యశస్వి అరంగేట్ర మ్యాచ్‌లో మాదిరి చెలరేగితే ధావన్‌ను అధిగమించడం కష్టమేమీ కాదు. 

టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేటు(మినిమం 100 బాల్స్‌) 
టీమిండియా తరఫున తన తొలి మ్యాచ్‌లో యశస్వి 44.19 స్ట్రైక్‌రేటుతో 171 పరుగులు సాధించాడు. మొదటి మ్యాచ్‌ కాబట్టి ఆచితూచి ఆడుతూనే సెంచరీ మార్కు అందుకున్న అతడు ఇకపై దూకుడు పెంచాల్సి ఉంది.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మాదిరి తన అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ చూపిస్తే ధావన్‌ రికార్డును బద్దలు కొట్టవచ్చు. టీమిండియా క్రికెటర్లలో రిషభ్‌ పంత్‌ ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు. 

2022లో ఇంగ్లండ్‌తో టెస్టులో తొలి 100 బంతుల్లో 131.53 స్ట్రైక్‌రేటు నమోదు చేయగా.. 2009లో శ్రీలంక మీద సెహ్వాగ్‌ 115.35 స్ట్రైక్‌రేటుతో పరుగులు సాధించాడు. ఇక ధావన్‌ 2017లో శ్రీలంక మీద 113.09తో వీరితో పాటు ఈ జాబితాలో చేరాడు.

మొదటి సెషన్‌లో మోస్ట్‌ రన్స్‌
టీమిండియా బ్యాటర్లెవరికీ సాధ్యం కాని రీతిలో శిఖర్‌ ధావన్‌ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు మ్యాచ్‌లో తొలి సెషన్‌లో అత్యధిక పరుగులు(104- నాటౌట్‌) సాధించిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.

2018లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా.. మొదటి సెషన్‌లోనే 104 పరుగులు రాబట్టాడు. అంతకు ముందు వీరేంద్ర సెహ్వాగ్‌ వెస్టిండీస్‌ మీద 2006లో 99 పరుగులు సాధించాడు. ఇక యశస్వి ప్రస్తుత ఫామ్‌ చూస్తుంటే ధావన్‌ను వెనక్కి నెట్టడం అసాధ్యమేమీ అనిపించడం లేదు. మీరేమంటారు?!

చదవండి: పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం.. 18 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై
ఇదేమి ఔట్‌రా అయ్యా.. పాకిస్తాన్‌ ఆటగాళ్లు అంతే! వీడియో వైరల్‌ 

Advertisement
Advertisement