IPL 2024: పాపం పాండ్యా!.. ఇక రోహిత్‌దే బాధ్యత! | Sakshi
Sakshi News home page

IPL 2024: పాపం పాండ్యా!.. ఇక రోహిత్‌దే బాధ్యత! అప్పుడు కోహ్లి..

Published Mon, Apr 1 2024 6:23 PM

IPL 2024 Onus On Rohit To Rescue MI Captain Hardik From Crowd Fire - Sakshi

ఐపీఎల్‌-2024లో తొలి విజయం కోసం ముంబై ఇండియన్స్‌ ఉవ్విళ్లూరుతోంది. రాజస్తాన్‌ రాయల్స్‌పై గెలుపుతో పదిహేడో ఎడిషన్‌లో  బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. తొలుత గుజరాత్‌ టైటాన్స్‌.. మరుసటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ముంబై ఓటమిపాలైన విషయం తెలిసిందే.

ఫలితంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే, రాజస్తాన్‌పై గత ఐదు మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్‌దే పైచేయి కావడం కాస్త ఊరట కలిగించే అంశం. మ్యాచ్‌ విషయం పక్కనపెడితే.. ముంబై కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి హార్దిక్‌ పాండ్యాపై విపరీతమైన ట్రోల్స్‌ వస్తున్న విషయం తెలిసిందే.

కేవలం సోషల్‌ మీడియాకే పరిమితం కాకుండా మైదానంలో దిగిన ప్రతిసారీ పాండ్యాను హేళన చేసేలా కొంతమంది ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా అహ్మదాబాద్‌ ప్రేక్షకుల్లో కొందరు.. గ్రౌండ్‌లోకి కుక్క రాగానే పాండ్యా అని అరిచారు.

ఇంకొందరేమో రోహిత్‌ శర్మ నామస్మరణతో పాండ్యాను ట్రోల్‌ చేశారు. హైదరాబాద్‌లోనూ ఇదే పునరావృతమైంది. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యాకు వాంఖడేలో కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురుకాకుండా రోహిత్‌ శర్మనే చొరవ తీసుకోవాలని అతడి అభిమానులు అంటున్నారు.

ఇందుకు విరాట్‌ కోహ్లి పేరును ఉదాహరణగా పేర్కొంటూ గతాన్ని గుర్తుచేస్తున్నారు. అడిలైడ్‌లోని ఓవల్‌ మైదానంలో టీమిండియా- ఆస్ట్రేలియా తలపడిన సందర్భంలో స్టీవ్‌ స్మిత్‌ను తన ఫ్యాన్స్‌ గేళి చేయగా.. విరాట్‌ కోహ్లి వద్దని వారిని వారించాడు. దీంతో వాళ్లు మిన్నకుండిపోయారు. అనంతరం స్టీవ్‌ స్మిత​ సైతం తన పట్ల కోహ్లి వ్యవహరించిన తీరుకు కృతజ్ఞతా భావం చాటుకోవడం విశేషం. మరి రాజస్తాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఏం చేస్తాడో చూడాలి!

Advertisement
 
Advertisement