
ఆ నలుగురు కూటమి తరపున పోటీ చేశారు. వారిలో ముగ్గురు పచ్చ పార్టీ నాయకులే. తమకు ఇవే చివరి ఎన్నికలని చెప్పారు. లాస్ట్ ఛాన్స్ ఇవ్వాంటూ ప్రజల్ని బ్రతిమాలారు. కాని ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి? వారి ఆశలు నెరవేరతాయా? ప్రజలు వారికి చివరి అవకాశం ఇచ్చారా? మరి వారందరిని ఓటమి భయం ఎందుకు వెన్నాడుతోంది? ఇంతకీ ఆ నలుగురు ఎవరు?
ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేతలు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణలు ఇవే తమకు చివరి ఎన్నికలని ప్రచారం చేసుకున్నారు. ఈ ఎన్నికల తర్వాత తాము రాజకీయాల్లో ఉండేది లేదని కూడా చెప్పుకుంటూ ఊళ్ళలో ప్రచారం చేసుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని ప్రకటించారు. అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నుంచి, గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి, బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల నుంచి, కొణతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు.
ఈ నాలుగు నియోజకవర్గాలు వైఎస్సార్సీపీ ఖాతాలోనే పడతాయని ఆయా సెగ్మెంట్లలోని ప్రజలు లెక్కలేసి చెబుతున్నారు. నలుగురు నేతలు పోటీ చేసే నియోజకవర్గాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సిపి బలం గత ఎన్నికల కంటే మరింతగా పెరిగింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు వైఎస్సార్సీపీకి ఏకపక్షంగా ఓట్లు వేశారు. వైఎస్ జగన్ మీద ప్రజల్లో ఉన్న నమ్మకంతోనే నాలుగు నియోజకవర్గాల్లోనూ మళ్ళీ వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయి. దీంతో నలుగురు నాయకులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇవే తమకు చివరి ఎన్నికలని చెప్పుకుని ప్రజల్లో ప్రచారం చేసినా వారికి లభించిన మద్దతు నామ మాత్రంగానే కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారాల్లో సైతం ఇదే అంశం స్పష్టం అయ్యింది.
అనకాపల్లి, భీమిలి నియోజకవర్గాల్లో సీఎం జగన్ సిద్ధం బహిరంగ సభను, బస్సు యాత్ర సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ రెండు సభలు ఊహించిన దానికంటే ఎక్కువగా విజయవంతమయ్యాయి.
అందుకే గంటా, అయ్యన్న, బండారు, కొణతాల వంటి నేతలు తమకు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పుకు తిరిగినా ప్రజలు పట్టించుకోలేదు. వారికి ఎదురైన నిరాదరణతోనే భయం మొదలైంది. చివరగా పోటీ చేసిన ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది..