Is Kohli The Individual Who Is Going To Win You T20 WC: Matthew Hayden Raises Questions | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: కోహ్లి ఒక్కడు ఉంటేనే గెలుస్తారా?.. అతడి కంటే..

Published Tue, Apr 30 2024 2:01 PM

Is Kohli The Individual Who To Win You T20 WC: Hayden Raises Questions

‘‘విరాట్‌ కోహ్లి ఒక్కడే టీమిండియాకు వరల్డ్‌కప్‌ అందించగలడా? గతేడాది వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో అతడు అద్భుతంగా ఆడాడు. గణాంకాలు సైతం చాలా బాగున్నాయి.

ఎన్నో రికార్డులు సాధించాడు కూడా. ఏ టోర్నీలోనైనా అతడికి ఇవి అలవాటే. అయితే, సెలక్టర్లు అతడి అనుభవానికి ఓటేస్తారా?.. నిలకడగా రాణిస్తున్న యువ ఆటగాళ్లకు ఛాన్స్‌ ఇస్తారా? అన్నదే ప్రశ్న.

నిజానికి ఈసారి వరల్డ్‌కప్‌ టోర్నీ అమెరికా- వెస్టిండీస్‌లో జరుగనుంది. కరేబియన్‌ దీవుల్లోనైనా పిచ్‌ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు. కానీ అమెరికా పిచ్‌లపై ఏ జట్లకు పెద్దగా అవగాహన లేదు.

ఇక విండీస్‌ పిచ్‌లపై మిడిల్‌ ఓవర్లలో కచ్చితంగా ఎక్కువ శాతం స్పిన్నర్లే అటాక్‌కు దిగుతారు. పవర్‌ ప్లే ముగిసిన వెంటనే వారు వరుస ఓవర్లు బౌల్‌ చేసే అవకాశం ఉంటుంది. నిజం చెప్పాలంటే.. అక్కడ స్పిన్నర్లను ఎదుర్కోవడం విరాట్‌ కోహ్లికి సవాలే.

అలాంటపుడు శివం దూబే, రింకూ సింగ్‌ వంటి ఆటగాళ్లు మనకు గుర్తుకు వస్తారు. స్పిన్‌ బౌలింగ్‌లో వీళ్లు చితక్కొట్టగలరు. టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాను ఓడించిన విషయం గుర్తుండే ఉంటుంది.

గతేడాది నవంబరులో వరల్డ్‌ చాంపియన్స్‌ అయిన మమ్మల్ని 4-1తో వాళ్లు చిత్తు చేశారు. అప్పుడు రాణించిన రుతురాజ్‌ గైక్వాడ్‌ గురించి కనీసం ఒక్కరు కూడా చర్చించకపోవడం విచారకరం.

నాటి సిరీస్‌లో జైస్వాల్‌ సైతం సెంచరీలు బాది సత్తా చాటాడు. కేవలం అనుభవానికి పెద్ద పీట వేయకుండా.. ఎవరైతే వరల్డ్‌కప్‌ టోర్నీలో గెలిపించగల సత్తా కలిగి ఉంటారో వారినే ఆస్ట్రేలియా క్రికెట్‌ ఎంపిక చేస్తుంది.

మరి బీసీసీఐ అనుభవం వైపు మొగ్గు చూపుతుందా? లేదంటే యువ హిట్టర్లకు అవకాశం ఇస్తుందో తెలియదు’’ అంటూ ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓపెనింగ్‌ జోడీగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి ఓపెనింగ్‌ చేస్తాడన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు హెడెన్‌.

అనుభవం కంటే కూడా ప్రస్తుతం జట్టుకు అవసరమైన ఆటగాళ్లను ఏ స్థానంలో ఆడిస్తే బాగుంటుందో బీసీసీఐ సెలక్టర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. కాగా కోహ్లి ఐపీఎల్‌-2024లో ఆర్సీబీ తరఫున ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్‌లో కలిపి 500 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ శతకం కూడా ఉండటం విశేషం. అయితే, స్ట్రైక్‌రేటు 147.49గా నమోదైన నేపథ్యంలో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement