BCCI: అంతకంటే చెత్త నిర్ణయం మరొకటి ఉండేది కాదు: గంభీర్‌ | Would Have Been Worst Decision By BCCI, Gautam Gambhir Straight Talk On IPL - Sakshi
Sakshi News home page

BCCI: అంతకంటే చెత్త నిర్ణయం మరొకటి ఉండేది కాదు: ఐపీఎల్‌పై గంభీర్‌ వ్యాఖ్యలు

Published Sun, Dec 24 2023 10:17 AM

Would Have Been Worst Decision By BCCI Gambhir Straight Talk On IPL - Sakshi

That would have been the worst decision made by BCCI: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌... ఎంతో మంది దేశీ, విదేశీ యువ క్రికెటర్ల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన టోర్నీ. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన నూనుగు మీసాల కుర్రాళ్లు.. అప్పటికే టీమిండియా తరఫున స్టార్లుగా వెలుగొందుతున్న అనుభవజ్ఞులైన క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం కల్పిస్తున్న మెగా ఈవెంట్‌.

ఐపీఎల్‌ ద్వారా కాసుల వర్షంలో తడవడంతో పాటు ఆటకు పదునుపెట్టి.. అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేసేందుకు దోహదం చేస్తున్నారు చాలా మంది. తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌ తదితరులు ఇందుకు తాజా ఉదాహరణలు. 

ఈసారి కనక వర్షం కురిసింది వీరిపైనే
కాగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి నేతృత్వంలో 2008లో మొదలైన ఈ టీ20 లీగ్‌ ఇప్పటికి పదహారు ఎడిషన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది జరుగనున్న పదిహేడో సీజన్‌కు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైపోయింది. ఇందుకు సంబంధించి.. దుబాయ్‌ వేదికగా ఇప్పటికే వేలం కూడా పూర్తైపోయింది. 

ఈ సందర్భంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యంత ధర పలికిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌(రూ. 24.75 కోట్లు) నిలవగా.. ఈ సీజన్‌ వేలంలో అత్యధిక మొత్తానికి అమ్ముడు పోయిన భారత క్రికెటర్‌గా పేసర్‌ హర్షల్‌ పటేల్‌(రూ. 11.75 కోట్లు) ఘనత దక్కించుకున్నాడు.

మరోవైపు.. సమీర్‌ రజ్వీ అత్యధిక మొత్తం(రూ. 8.4 కోట్లు) దక్కించుకున్న అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా నిలిచాడు. ఇలా ఎంతో మంది ఆటగాళ్లకు ఆర్థికంగా.. కెరీర్‌ పరంగా దన్నుగా నిలుస్తున్న ఐపీఎల్‌ గురించి ఎదురైన ప్రశ్నకు టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ఇచ్చిన సమాధానం అభిమానులను ఆకట్టుకుంటోంది.

అంతకంటే చెత్త నిర్ణయం మరొకటి ఉండేది కాదు
తాజాగా స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడిన గంభీర్‌కు.. ‘‘ఒకవేళ బీసీసీఐ ఐపీఎల్‌ ప్రవేశపెట్టి ఉండకపోతే పరిస్థితి ఎలా ఉండేది?’’ అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘బీసీసీఐ గనుక అలా చేసి ఉంటే(ప్రవేశపెట్టకపోతే) అంతకంటే చెత్త నిర్ణయం మరొకటి ఉండేది కాదు.

రెండుసార్లు ట్రోఫీ గెలిచిన ఘనత
ఎందుకంటే భారత క్రికెట్‌ చరిత్రలో జరిగిన గొప్ప మార్పునకు నాంది ఐపీఎల్‌’’ అంటూ గౌతీ తనదైన శైలిలో ఐపీఎల్‌ ప్రాధాన్యాన్ని ఒక్క మాటలో తేల్చిపడేశాడు. కాగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సారథిగా రెండుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన ఘనత గౌతం గంభీర్‌కు ఉంది. 2012, 2014 సీజన్లలో కేకేఆర్‌కు గౌతీ ట్రోఫీ అందించాడు. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంఛైజీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఇక రిటైర్మెంట్‌ అనంతరం కామెంటేటర్‌గా, విశ్లేషకుడిగా కొనసాగుతున్న ఈ మాజీ ఓపెనర్‌.. గతంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌గా పనిచేశాడు. ఐపీఎల్‌-2024 సీజన్‌తో తిరిగి కేకేఆర్‌ గూటికి చేరుకున్న గంభీర్‌.. శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలోని జట్టుకు మార్గదర్శనం చేయనున్నాడు. 

చదవండి: MS Dhoni: ధోని అభిమానులకు శుభవార్త!
 IPL 2024: ముస్తాబాద్‌ నుంచి ఐపీఎల్‌ దాకా.. సీఎస్‌కేకు ఆడే ఛాన్స్‌! 

Advertisement
Advertisement