టెక్కలి రూరల్: స్థానిక కండ్రవీధిలో బుధవారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మూడు ఇళ్లు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కండ్రవీధికి చెందిన అనంత కార్తీక్ బెహరా ఇంటిలో ముందుగా మంటలు రేగాయి. అనంతరం ఆ ఇంటికి ఇరువైపులా ఉన్న అనంత ఉపేంద్ర బెహరా, అనంత అమర్ బెహరాలకు చెందిన ఇళ్లకు సైతం మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక అధికారి ఎస్.మల్లేశ్వరరావు తెలిపారు. దాదాపు రూ.3 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని చెప్పారు.
అగ్ని ప్రమాదంలో జీడితోట దగ్ధం
మెళియాపుట్టి: మండలంలోని మెళియాపుట్టి రెవెన్యూ పరిధిలోని సుమారు ఎకరా జీడితోట మంటల్లో కాలిపోయినట్లు బాధితురాలు నక్క ముత్యాలమ్మ తెలిపారు. బుధవారం సాయంత్రం సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు విషయం తెలుసుకుని వెంటనే టెక్కలి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించి ఉంటారని బాధితురాలు తెలిపారు.