తగ్గేదేలే.. ముఖ్యమంత్రి స్టాలిన్‌ | Sakshi
Sakshi News home page

తగ్గేదేలే.. ముఖ్యమంత్రి స్టాలిన్‌

Published Mon, Jun 19 2023 9:42 AM

స్టాలిన్‌  - Sakshi

సాక్షి, చైన్నె: రాష్ట్ర హక్కుల పరిరక్షణలో తగ్గేది లేదని సీఎం స్టాలిన్‌ స్పష్టం చేశారు. డీఎంకే కార్యకర్తలకు ఆదివారం ఆయన లేఖ రాశారు. ఇందులో రాష్ట్రంలో ఇటీవల కాలంగా జరుగుతున్న పరిణామాలను గుర్తు చేశారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. దివంగత నేత కరుణానిధి శత జయంతి ఉత్సవాలను గుర్తుచేస్తూ, ఏడాది పొడవునా వేడుకలను జయప్రదం చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రాల హక్కులను హరించే విధంగా కేంద్రం తీరు ఉందని ధ్వజమెత్తారు.

తమిళనాడు హక్కుల పరిరక్షణలో తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఎంత వరకై నా వెళ్లి ఢీకొట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు వ్యాఖ్యలు చేశారు. యువత మేధాసంపతికి దోహదపడే విధంగా మదురైలో కలైంజ్ఞర్‌ కరుణానిధి స్మారక గ్రంథాలయం రూపుదిద్దుకుంటున్నదని వివరించారు. ఇది మరి కొద్ది రోజుల్లో ప్రజాపయోగంలోకి వస్తుందని పేర్కొన్నారు. తిరువారూర్‌లో నిర్మించిన కలైంజ్ఞర్‌ కోట్టం ఈనెల 20న ప్రారంభం కాబోతోందన్నారు. ఈ వేడుకకు బిహార్‌ సీఎం నితీష్‌కుమార్‌హాజరు కానున్నారని గుర్తు చేశారు.

ఈ వేడుక జయప్రదం చేయడానికి పెద్ద ఎత్తున కేడర్‌ తరలిరావాలని పిలుపునిచ్చారు. బెదిరింపులకు భయపడ వద్దని, తాను ఉన్నానని కేడర్‌కు భరోసా ఇచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం స్వస్థలం తిరువారూర్‌కు ఆదివారం రాత్రి సీఎం స్టాలిన్‌ బయలుదేరి వెళ్లారు. సీఎం రాకతో మూడు రోజుల పాటు తిరువారూర్‌లో డ్రోన్లపై నిషేధం విధించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సీఎం పర్యటనకు భద్రతను పోలీసు యంత్రాంగం మరింత కట్టుదిట్టం చేసింది.

Advertisement
Advertisement