రోహిత్‌ శర్మ సంచలన నిర్ణయం.. త్వరలోనే రిటైర్మెంట్‌!? | Reports: Rohit Sharma to retire post T20 World Cup 2024 | Sakshi
Sakshi News home page

#Rohit Sharma: రోహిత్‌ శర్మ సంచలన నిర్ణయం.. త్వరలోనే రిటైర్మెంట్‌!?

May 13 2024 8:25 PM | Updated on May 14 2024 8:53 AM

Reports: Rohit Sharma to retire post T20 World Cup 2024

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 త‌ర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ పొట్టి ఫార్మాట్‌కు విడ్కోలు పలకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే రోహిత్‌ శర్మ తన నిర్ణయాన్ని బీసీసీఐకు వెల్లడించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. టీ20ల్లో భారత కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ స్ధానంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను ఎంపిక చేయాలని భారత క్రికెట్‌ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే హార్దిక్‌ను టీ20 వరల్డ్‌కప్‌-2024లో భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా సెలక్టర్లు ఎంపిక చేసినట్లు వినికిడి. అంతేకాకుండా ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టులో హార్దిక్‌కు చోటు దక్కాలని సెలక్టర్లపై బీసీసీఐ ప్రత్యేక ఒత్తిడి తీసుకువచ్చినట్లు దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.

కాగా ఇప్పటివరకు రోహిత్‌ శర్మ గైర్హజరీలో టీ20ల్లో భారత జట్టును హార్దిక్‌ పాండ్యానే నడిపిస్తున్నాడు. రోహిత్‌ తర్వాత హార్దిక్‌ భవిష్యత్తు కెప్టెన్‌ అని అంతా ఫిక్స్‌ అయిపోయారు. కానీ ఐపీఎల్‌-2024 సీజన్‌ తర్వాత అందరి అభిప్రాయం మారిపోయింది.

ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ నూతన కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్‌ తన మార్క్‌ చూపించలేకపోయాడు. రోహిత్‌ శర్మను తప్పించి మరి తమ జట్టు పగ్గాలను హార్దిక్‌కు ముంబై ఫ్రాంచైజీ అప్పగించింది.

జట్టును విజయం నడిపించడంలో హార్దిక్‌ విఫలమయ్యాడు. అంతేకాకుండా ముంబై డ్రెస్సింగ్‌ రూమ్‌ రెండు వర్గాలగా కూడి చీలిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది రోహిత్‌ శర్మ వర్గంలో ఉంటే మరి కొంతమంది పాండ్యాకు సపోర్ట్‌గా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా త‌న మార్క్ చూపించ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్న హార్దిక్‌.. ఒక వేళ పూర్తి స్దాయిలో భార‌త జ‌ట్టు ప‌గ్గాలు చేప‌డితే ఏ మెర‌కు విజ‌య‌వంత‌మ‌వుతాడో చూడాలి.
 

Advertisement
 
Advertisement
Advertisement