జీఎస్టీ కేసుల్లో నిర్బంధానికి సరైన కారణం ఉండాలి | Sakshi
Sakshi News home page

జీఎస్టీ కేసుల్లో నిర్బంధానికి సరైన కారణం ఉండాలి

Published Sun, Mar 24 2024 1:55 AM

SC Judge Ujjal Bhuyan Inaugurated National Tax Conference - Sakshi

జీఎస్టీ చట్టంకింద విచక్షణారహితంగా అరెస్టులు సరికాదు

జాతీయ పన్నుల సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 

ప్రభుత్వాన్ని నడపడానికి పన్నులు అవసరం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే  

సాక్షి, హైదరాబాద్‌: జీఎస్టీ చట్టం కింద విచక్షణారహితంగా వ్యాపారులను అరెస్టులు చేయడం మంచిది కాదని, నిర్బంధానికి సరైన కారణాలు అధికారుల వద్ద ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అభిప్రాయపడ్డారు. అను మానాలు ఉన్నాయన్న కారణంతో జీఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 69 కింద నిర్బంధం సరికాదని వ్యాఖ్యానించారు. జీఎస్టీ అంశంలో వ్యాపారులను అరెస్టు చేయడానికి అనుమతించే ముందు అందుకు కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

శనివారం ది ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్యాక్స్‌ ప్రాక్టీషనర్స్‌ (సౌత్‌జోన్‌), తెలంగాణ ట్యాక్స్‌ ప్రాక్టీషనర్స్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ పన్నుల సదస్సుకు జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం రెండు రకాల సంతోషానిచ్చింది. పన్ను అంశంపై అనుభవం ఉన్న న్యాయవాదిగా ఇంత మంది ట్యాక్స్‌ ప్రాక్టీషనర్ల మధ్య పాల్గొనడం ఒకటైతే.. హైదరాబాద్‌ను సందర్శించడం మరొకటి.

ఇక్కడ న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడంతో నగరంతో అనుబంధం ఏర్పడింది. హైదరాబాద్‌ వస్తే ఇంటికి వచి్చనట్లే ఉంటుంది. ఇలాంటి అవకాశాలు వచి్చనప్పుడు వీలున్నంత వరకు నగరాన్ని సందర్శిస్తా’అని చెప్పారు. ఎవరైనా ఆదాయపు పన్ను నివేదిక సమరి్పస్తే.. అది తప్పుడు నివేదిక అని పూర్తిగా నమ్మితే మాత్రమే అసెస్‌మెంట్‌ను తిరిగి ప్రారంభించాలని సుప్రీంకోర్టు గతంలో పేర్కొందని ఆయన వివరించారు. 

‘ఆయుధాన్ని’దుర్వినియోగం చేయొద్దు.. 
‘సీజీఎస్టీలోని సెక్షన్‌ 69, సెక్షన్‌ 83.. రాష్ట్ర జీఎస్టీలోని ఇవే నిబంధనలు అధికారులకు కఠిన అధికారాలను అందించాయి. ఈ రెండు నిబంధనలు రెవెన్యూ చేతిలో బలమైన ఆయుధాలు. వీటిని జాగ్రత్తగా, తక్కువగా ఉపయోగించాలి. ఆయుధాన్ని అతిగా ప్రయోగించినా.. దురి్వనియోగపరచినా.. దాని శక్తిని కోల్పోతుందని మనకు తెలుసు. ఇదే జరిగితే అధికారులపై నమ్మకం పోతుంది. ఒక నిబంధన ఎంత కఠినంగా ఉంటే న్యాయపరమైన పరిశీలన కూడా అంతే కఠినంగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి’అని జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సూచించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే మాట్లాడుతూ.. ‘పన్ను వసూలు అనేది సమాజానికి నాడు, నేడు కీలకమైన అంశాల్లో ఒకటి. ఇది ఏ దేశంలో అయినా ప్రభుత్వాన్ని నడపడానికి ఎంతో అవసరం.

శతాబ్దాల నుంచి పన్ను విధింపు చట్టాలు మారుతూ వస్తున్నాయి. ఒక తేనెటీగ పువ్వు నుంచి మకరందాన్ని ఎలా సేకరిస్తుందో పన్ను వసూలు కూడా అంతే సున్నితంగా జరగాలని కౌటిల్యుడు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆధునిక భారత్‌లో కొత్త పన్ను విధానాలతో దేశం పురోగతిలో పయనిస్తోంది’అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ తుకారాంజీ, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి, జస్టిస్‌ అనిల్‌కుమార్, అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) నరసింహ శర్మ, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు మీలా జయ్‌దేవ్, టీటీపీఏ అధ్యక్షుడు కె.నర్సింగ్‌రావు, ఏఐఎఫ్‌టీపీ (సౌత్‌జోన్‌) చైర్మన్‌ రామరాజు శ్రీనివాస్‌రావు, సు«దీర్‌ వీఎస్, మహమ్మద్‌ ఇర్షాద్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement