-
ఫెడరల్ బ్యాంక్ ఫ్లాట్
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 906 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2022–23) క్యూ4లో రూ. 903 కోట్లు ఆర్జించింది. ఇందుకు పెన్షన్ ప్రొవిజన్లు కారణమయ్యాయి. నికర వడ్డీ ఆదాయం 15 శాతం ఎగసి రూ. 2,195 కోట్లను తాకింది. 20 శాతం రుణ వృద్ధి ఇందుకు సహకరించగా.. నికర వడ్డీ మార్జిన్లు 3.36 శాతం నుంచి 3.21 శాతానికి నీరసించాయి. పెన్షన్లకు రూ. 162 కోట్ల ప్రొవిజన్లు చేపట్టింది. ఇక పూర్తి ఏడాదికి బ్యాంక్ రూ. 3,720 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2022–23లో రూ. 3,010 కోట్లు మాత్రమే నమోదైంది. ఈ ఏడాది(2024–25) 18 శాతం రుణ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా స్లిప్పేజీలు రూ. 436 కోట్ల నుంచి రూ. 352 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు 2.13 శాతానికి చేరగా.. కనీస మూలధన నిష్పత్తి 16.13 శాతంగా నమోదైంది. ఎండీ, సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ సెప్టెంబర్లో బాధ్యతల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో కొత్త చీఫ్ ఎంపికకు బోర్డు కసరత్తు చేస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. అభ్యర్ధుల జాబితాలను కొద్ది వారాలలో సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 3.2 శాతం బలపడి రూ. 168 వద్ద ముగిసింది. -
ఫెడ్ రేట్లు తగ్గితే... అంతా బాగేనా?
అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఈ మధ్య కాలం వరకూ వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. అనంతరం గత కొద్ది దఫాల తమ సమావేశాలలో ఆ పెరిగిన వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణ యాలు తీసుకుంటూ వచ్చింది. ఈ వడ్డీరేట్ల పెంపు ఉద్దేశ్యం దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం. ఈ చర్య వల్ల ప్రస్తుతం ఆ దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. నవంబర్ 2023కు సంబంధించి వెలువడిన అమెరికా ‘వినియోగదారుల ధరల సూచీ’ 3.1 శాతంగా నమోదు అయింది. అంతకుముందరి అక్టోబర్ మాసంలో ఈ ద్రవ్యోల్బణం 3.2 శాతంగా ఉంది. ముఖ్యంగా, కోర్ ఇన్ఫ్లేషన్గా పిలవబడే ఆహార, ఇంధన ధరల పెరుగుదలను లెక్కలలోంచి తీసివేసి, అంచనా వేసే ద్రవ్యోల్బణం 4 శాతం వద్ద స్థిరంగా ఉంది. నిన్నా మొన్నటి వరకూ పెరుగుతూ వచ్చిన వడ్డీరేట్ల వలన అమెరికా ప్రజల కొనుగోలు శక్తీ, వారు తమ అవసరాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే అవకాశాలూ తగ్గిపోతూ వచ్చాయి. అలాగే వారు తాము గృహాలు లేదా వాహనాల కొనుగోలు కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ మొత్తాలు పెరిగిపోయిన కారణంగా కూడా ప్రజల కొనుగోలు శక్తి దెబ్బ తినటం, అనేక సందర్భాలలో వారు అసలు తిరిగి తమ రుణా లను చెల్లించలేని స్థితికి చేరడం వంటివీ జరిగాయి. ఈ నేప థ్యంలోనే నేడు అమెరికాలోని అనేక బ్యాంకింగ్, నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు మొండి బకాయిలు పెరిగి పోయి, ప్రస్తుతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ పెరిగిన వడ్డీరేట్ల వలన అమెరికా ఆర్థిక వ్యవస్థలో మెల్ల మెల్లగా మందగమనం మొదలవుతోంది. అక్టోబర్ 2023లో అమెరికాలో ఉపాధి కల్పన 8.7 మిలియన్లకు తగ్గడం దీనిపర్యవసానమే. ఈ రెండేళ్ల కాలంలో అతి తక్కువ స్థాయి ఇదే! ఒక పక్కన ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన దాఖలాలూ... మరో పక్కన తగ్గిపోతున్న ఉపాధి కల్పన గణాంకాలూ... డిసెంబర్ నెలలో జరిగిన అమెరికా ఫెడరల్ బ్యాంక్ సమావేశంలో 2024లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నా యంటూబ్యాంక్ ఛైర్మన్ జరోమ్ పావెల్ సంకేతాలను ఇచ్చేలా చేశాయి. పెరిగిపోతున్న ఆటోమేషన్ (మర మనుషులు, సాఫ్ట్ వేర్లలో పురోగతి), కొన్ని దేశాల్లో శ్రామిక శక్తి చౌకగా లభించడం వల్ల అమెరికా వంటి ధనిక దేశాల నుంచి పరి శ్రమలు, సేవారంగం భారీగా విదేశాలకు తరలిపోతున్నాయి. అమె రికాలో నేడు ప్రజల కొనుగోలు శక్తిని నిలిపి వుంచుతోంది షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ వంటి సట్టా వ్యాపారాలూ, ఉద్దీపనా పథకాలూ; రుణ స్వీకరణను సులువు చేస్తూ, బ్యాంక్వడ్డీరేట్ల తగ్గింపు వంటి చర్యలే! స్థూలంగా అటు ఉద్దీపన రూపంలో ఆర్థిక వ్యవస్థలో డబ్బు చలామణీని పెంచే చర్యలూ... అలాగే వడ్డీరేట్లను 0 (సున్నా) శాతానికి తగ్గించి వేస్తూ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా వంటి దేశాలలో మార్కెట్లో డబ్బు చలామణి విపరీతంగా పెరిగిపోయింది. అందుకే సరఫరా పెరిగిపోయిన ఏ సరుకైనా దాని విలువ పడి పోయినట్లుగానే అమెరికా డాలర్ విలువ కూడా పడిపోయింది. సూక్ష్మంగా చెప్పాలంటే డాలర్ కొనుగోలు శక్తి పతనమై, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇలా ద్రవ్యోల్బణం పెరిగి నప్పుడు అటు ప్రజల కొనుగోలు శక్తీ, ఇటు షేర్ మార్కెట్లవంటి ఎటువంటి ఉత్పత్తి లేకుండానే పెట్టుబడిగా పెట్టిన డబ్బును లాభాలతో కలిపి మరింత డబ్బుగా పెంచే వ్యాపా రాలు వంటివన్నీ నష్టపోతాయి. కాబట్టి ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత మరలా తిరిగి ప్రభుత్వంపైనో... లేకుంటే ఆ దేశం తాలూకూ కేంద్రబ్యాంకు పైనో పడుతుంది. ఇక ఇప్పుడు, కేంద్రబ్యాంకు వడ్డీరేట్ల తగ్గింపు రూపంలో, తాను చలామణీలోకి తెచ్చిన అధిక నగదు మొత్తాన్నో... లేదా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలోకి ఉద్దీపన రూపంలో పంపిన డబ్బునో తిరిగి మరలా వెనక్కి లాక్కోవలసి వస్తుంది. దీనికోసం కేంద్రబ్యాంకు వడ్డీరేట్లను పెంచుతుంది, ప్రభుత్వం ఉద్దీపన పథకాలను నిలిపివేస్తుంది. తద్వారా, ఆర్థిక వ్యవస్థలో ఉన్న అదనపు డబ్బును వెనక్కి లాగివేసి ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అమెరికాలో నేడు నడుస్తోన్న కథ ఇదే! ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఏర్పడితే డబ్బు చలామణీ పెంచడం... ఈ డబ్బు చలామణీ పెరగడం వలన ద్రవ్యోల్బణం పెరిగితే తిరిగి మరలా అధికంగా చలామణిలోకి తెచ్చిన ఆ డబ్బును వెనక్కి లాగివేయటం అనే వలయమే ఈ కథ సారాంశం. అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు ఈ రెండు దశల మధ్యనా ఉన్న కాలవ్యవధి నేడు వేగంగా కుచించుకు పోతోంది. నిజానికి, అమెరికా ఆర్థిక వ్యవస్థలో డాలర్ల ముద్రణ గత అనేక దశాబ్దాలుగా జరుగుతున్నప్పటికీ... మనం 2008 అనంతరం పరిణామాలను ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. 2008లో అమెరికాలో ఫైనాన్స్ సంక్షోభం ఏర్పడింది. ఈసంక్షోభ క్రమంలో, అమెరికా జనాభాలోని సగానికి సగంమంది రాత్రికి రాత్రే దారిద్య్ర రేఖకు దిగువకు నెట్టివేయ బడ్డారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు 2009 ఫిబ్రవరిలో ఒబామా ప్రభుత్వం 7,00,800 బిలియన్ డాలర్ల ఉద్దీపనను, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇచ్చింది. ఆ తరువాత కూడా కొద్ది దఫాలు మరిన్ని ఉద్దీపనలు ఇచ్చారు. తదనంతరం నెలవారీ (95 బిలియన్ల డాలర్ల మేర) ఉద్దీపనలను ఇస్తూ పోయారు. తరువాత ఈ ఉద్దీపనల స్టెరాయిడ్ల ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ ‘నిలదొక్కుకుందనే’ నమ్మకం కుదిరాక, కొంతమేర ఈ ఉద్దీప నలను తగ్గించివేశారు. అయితే, 2020 కోవిడ్, లాక్డౌన్ల అనంతరం మరలా లక్షల కోట్ల డాలర్ల మేర కరెన్సీనిముద్రించి అమెరికా ఉద్దీపనలను ఇచ్చింది. లాక్డౌన్ల వలన ఇళ్ళకే పరిమితం అయిపోయి... ఆదాయాలు నిలిచిపోయిన కుటుంబీకులను ఆదుకునేందుకు ఈ చర్య అవసరంఅయ్యింది. అయితే, 2008 తరువాతి ఉద్దీపనలూ, వడ్డీరేట్ల తగ్గింపులూ, తదనంతరం 2020 నాటి మరింత ఉద్దీపనలూ కలగలిసి 2022 నాటికి ద్రవ్యోల్బణం రూపంలో దాడి మొదలు పెట్టాయి. అప్పటికే శక్తికి మించిన భారాన్ని మోస్తోన్న ఒకఒంటె మూపుపై అదనంగా మరో గడ్డిపోచ వేసినా కుప్ప కూలి పోయినట్లు... 2008 నుంచి పెంచుతూ వచ్చిన డాలర్ల చలామణీ ప్రభావం, అంతిమంగా 2022లో తీవ్ర ద్రవ్యోల్బణ రూపంలో బయటపడింది. దీనికి విరుగుడుగా మరలా ద్రవ్య చలామణీని తగ్గించే వడ్డీరేట్ల పెంపు వంటి నిర్ణయాలు జరుగుతూ పోయాయి. ఈ క్రమంలోనే నేడు అమెరికా తిరిగి మందగమనం, ఉపాధి కల్పనలో బలహీన స్థితికి చేరింది. ప్రస్తుత ఫెడరల్ బ్యాంక్ సమావేశం 2024లో మూడు దఫాలుగా 75 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీరేట్లను తగ్గించే అవకాశం గురించి మాట్లాడిందంటే ఈ మందగమనం ద్రవ్యోల్బణాల విషవలయం తాలూకు మరో రౌండ్ మొదలయ్యిందన్న మాట! కానీ, ఈ రౌండ్... గత రౌండ్ (2008, 2022)లు ఉన్నంత కాలం ఉండే అవకాశమే లేదు. ప్రస్తుతరౌండు వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయాలు అతి స్వల్పకాలంలోనే ద్రవ్యోల్బణం తిరిగి తలెత్తే పరిస్థితిని తెచ్చి పెడతాయి. ఫలితంగా ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలుకూ ఈ గడియారం లోలకం పరస్పర విరుద్ధ కొసలు అయిన వృద్ధి మందగమనం– ద్రవ్యోల్బణం మధ్య... మరింత వేగంగా కొట్టుమిట్టాడుతుంది. ఆర్థిక వ్యవస్థలో అటువంటి అనిశ్చితి అమెరికా ప్రజా జీవితంలో మరింత తీవ్ర అభద్ర తకూ, అనిశ్చితికీ దారితీయగలదు. ఈ క్రమంలోనే అమెరికా డాలర్ పతనం ప్రమాదం కూడా మరింత తీవ్రతరం అవుతుంది. ఇదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తాలూకూ స్వరూప స్వభావాలనే పునర్నిర్వచించే పరిస్థితి తలెత్తవచ్చు! - డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
రెండు ప్రముఖ బ్యాంకులకు ఆర్బీఐ ఝలక్!
రెండు ప్రముఖ బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఝలక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ప్రభుత్వ ఆధీనంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్, ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్తో పాటు మరో రెండు ఫైనాన్స్ సంస్థలకు భారీగా జరిమానాలు విధించింది. వడ్డీ రేట్లు, బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ నిబంధనలు పాటించడంలో విఫలమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రూ.72 లక్షలు, కేవైసీ నిబంధనలు ఉల్లంఘించిన ఫెడరల్ బ్యాంక్కు రూ.30 లక్షల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఇక కేవైసీ నిబంధనలను పాటించనందుకు మెర్సిడెస్-బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్)కు రూ. 10 లక్షల పెనాల్టీని ఆర్బీఐ విధించింది. అలాగే ఎన్బీఎఫ్సీ నిబంధనలను ఉల్లంఘించిన కొసమట్టం ఫైనాన్స్ లిమిటెడ్పై రూ. 13.38 లక్షల నగదు పెనాల్టీ విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. -
బ్యాంక్ షేర్లలో తాజా కొనుగోళ్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో భాగంగా ఫెడరల్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్సహా పలు బ్యాంకులలో అదనపు వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకు ఆర్బీఐ నుంచి తాజాగా అనుమతులు లభించినట్లు హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ వెల్లడించింది. వెరసి అనుమతి పొందిన బ్యాంకులలో వాటాను 9.5 శాతంవరకూ పెంచుకునేందుకు గ్రీన్సిగ్నల్ లభించినట్లు తెలియజేసింది. బ్యాంకులలో అదనపు పెట్టుబడులను చేపట్టేందుకు పెట్టుకున్న దరఖాస్తుకు ఆర్బీఐ క్లియరెన్స్ ఇచి్చనట్లు వివరించింది. హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి పొందిన జాబితాలో డీసీబీ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ సైతం ఉన్నాయి. మరోవైపు చెల్లించిన మూలధనం లేదా వోటింగ్ హక్కులలో 9.5 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు హెచ్డీఎఫ్సీ ఏఎంసీకి ఆర్బీఐ నుంచి అనుమతి లభించినట్లు విడిగా ఈక్విటాస్ ఎస్ఎఫ్బీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా.. 2023 జూన్30కల్లా ఫెడరల్ బ్యాంక్లో 4.49 శాతం, ఈక్విటాస్ ఎస్ఎఫ్బీలో 4.68 శాతం చొప్పున హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ వాటాలు కలిగి ఉంది. అయితే తాజా కొనుగోళ్ల తదుపరి ఒక్కో బ్యాంకులో 9.5 శాతం వాటాను మించేందుకు అనుమతించరు. -
ఐపీవోకు మళ్లీ ఫెడ్ఫినా రెడీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ అనుబంధ కంపెనీ ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సరీ్వసెస్(ఫెడ్ఫినా) మరోసారి పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 7.03 కోట్ల షేర్లను ప్రమోటర్ ఫెడరల్ బ్యాంక్, ప్రస్తుత వాటాదారు ట్రూనార్త్ ఫండ్ వీఐ ఎల్ఎల్పీ.. విక్రయానికి ఉంచనున్నాయి. వీటిలో ఫెడరల్ బ్యాంక్ 1.65 కోట్లు, ట్రూ నార్త్ ఫండ్ 5.38 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది. కాగా.. ఇంతక్రితం 2022 ఫిబ్రవరిలోనూ ఫెడ్ఫినా లిస్టింగ్ కోసం ఫెడరల్ బ్యాంక్ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. తద్వారా రూ. 900 కోట్ల ఈక్విటీ జారీతోపాటు ఆఫర్ ఫర్ సేల్కు ప్రణాళికలు వేసిన విషయం విదితమే. -
ఫెడరల్ బ్యాంక్ లాభం హైజంప్
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 954 కోట్ల నికర లాభం ఆర్జించింది. 62 శాతం ఎగసింది. ఇది ఒక త్రైమాసికానికి బ్యాంక్ చరిత్రలోనే అత్యధికం కాగా.. ఇందుకు పెట్టుబడుల విక్రయ లాభాలు దోహదపడినట్లు బ్యాంక్ పేర్కొంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 61 శాతం ఎగసి రూ. 3,165 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) రూ. 1,970 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 25 శాతం పుంజుకుని రూ. 1,909 కోట్లను అధిగమించింది. ఇతర ఆదాయం 58 శాతం ఎగసి రూ. 734 కోట్లను తాకింది. దీంతో రికార్డ్ లాభం ఆర్జించినట్లు బ్యాంక్ వెల్లడించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.78 శాతం నుంచి 2.35 శాతానికి తగ్గాయి. -
సూచీలకు స్వల్పలాభాలు
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు బుధవారం స్వల్పలాభాలతో గట్టెక్కాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 170 పాయింట్లు పెరిగి 58,245 వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు లాభంతో 17,177 వద్ద ప్రారంభమయ్యాయి. తొలి దశలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 344 పాయింట్లు ఎగసి 58,418 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు బలపడి 17,207 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే దేశీయ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. ఫలితంగా సెన్సెక్స్ 140 పాయింట్ల స్వల్పలాభంతో 58,215 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్ల పెరిగి 17,152 వద్ద నిలిచింది. ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఐటీ కమోడిటీ షేర్లు రాణించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.50%, 0.18 శాతం చొప్పున లాభపడ్డాయి. మెటల్, మీడియా, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. -
ప్రతికూలంగానే సెంటిమెంట్
ముంబై: ఈ వారం దేశీయ స్టాక్ సూచీలపై ప్రపంచ పరిణామాలు ప్రభావం ఉండొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా బ్యాంక్ సంక్షోభం, ఫెడ్ రిజర్వ్ సమావేశ పరిణామాల నేపథ్యంలో సెంటిమెంట్ ప్రతికూలంగానే ఉండొచ్చంటున్నారు. వీటితో పాటు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, క్రూడాయిల్ కదలికలను ఇన్వెస్టర్లు వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. డాలర్ మారకంలో రూపాయి విలువ, బాండ్ల రాబడులపై దృష్టి సారించవచ్చు. ‘‘స్టాక్ సూచీల ఒడిదుడుకులకు ట్రేడింగ్ కొనసాగే వీలుంది. కొన్ని వారాలుగా జరిగిన ఏకపక్ష అమ్మకాలతో మార్కెట్ సెంటిమెంట్ పూర్తిగా బేరిష్గా మారింది. సాంకేతికంగా నిఫ్టీ గత ఏడు వారాల కన్సాలిడేషన్ రేంజ్ను చేధించి 17100 స్థాయి వద్ద ముగిసింది. అమ్మకాలు నెలకొంటే దిగువ స్థాయిలో 16,600–16,800 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది. ఎగువ స్థాయిలో 17,250–17,400 రేంజ్ని చేధించాల్సి ఉంటుంది’’అని రిలిగేర్ బ్రోకింగ్ సాంకేతిక నిపుణుడు అజిత్ మిశ్రా తెలిపారు. గడిచిన వారంలో సెన్సెక్స్ 1,145 పాయింట్లు, నిఫ్టీ 313 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. విస్తృత మార్కెట్లోనూ అమ్మకాలు కొనసాగడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2 శాతం, 2.5 శాతం చొప్పున క్షీణించాయి. 1. బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభ ఘంటికలు ద్రవ్యోల్బణం ముదిరి ఆర్థిక మాంద్యం కమ్ముకొస్తున్న వేళ బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లోనే ఏకంగా ఐదు బ్యాంకులు భారీ కుదుపులకు లోనయ్యాయి. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాలా, సిగ్నేచర్ బ్యాంక్ మూసివేత పరిణామాల తర్వాత తాజాగా శాన్ఫ్రాన్సిస్కో ఆధారిత ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ ఉదంతం తెరపైకి వచ్చింది. అయితే ఈ బ్యాంకును కాపాడేందుకు 11 పెద్ద బ్యాంకులు కలిపి 30 బిలియన్ డాలర్ల సమకూర్చాయి. ఈ ప్రకంపనలు అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచంలో ఇతర దేశాల బ్యాంకులకు విస్తరించవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతవారంలోనే క్రిడెట్ సూసీ ఆర్థిక ఐసీయూపైకి చేరడంతో స్విస్ నేషనల్ బ్యాంక్ 54 బిలియన్ డాలర్ల నగదు సాయం చేసింది. ‘‘ప్రభుత్వాలు జోక్యం చేసుకొని తక్షణ నిధులు సమకూర్చినంత మాత్రన బ్యాంకింగ్ సంక్షోభం ముగిసిందని చెప్పడం తొందరపాటే అవుతుంది. ప్రస్తుతానికి అదుపులో ఉందంతే. ఐరోపాలోని బ్యాంకుల పరిస్థితులను గమనిస్తే యూఎస్ పరిస్థితులు అక్కడి పాకినట్లు తెలుస్తుంది. ఈ సంకేతాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే కాకుండా ఈక్విటీ మార్కెట్లకు మంచిది కాదు’’ అని ఫస్ట్ వాటర్ క్యాపిటల్ ఫండ్ సహ వ్యవస్థాపకుడు అరుణ్ చులానీ తెలిపారు. మంగళవారం ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం మంగళవారం(మార్చి 21న) ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు బుధవారం ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య కమిటీ నిర్ణయాలను ప్రకటించనున్నారు. అమెరికా ద్రవ్యోల్బణం దిగివచ్చిన నేపథ్యంలో 50 బేసిస్ పాయింట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చని... అలాగే తదుపరి సమావేశాల నుంచి రేట్ల పెంపు ఉండకపోవచ్చనే ప్రకటన వెలువడుతుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇప్పుటికే యూరోపియన్ యూనియన్ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఇప్పుడు ఫెడ్ రిజర్వ్, బ్యాంక్ ఇంగ్లాండ్ (మార్చి 23న)లు ఏమేర రేట్ల పెంపు ఉంటుందోనని మార్కెట్ వర్గాలు ఆసక్తి ఎదురు చూస్తున్నాయి. వారం రోజుల్లో రూ. 8 వేల కోట్ల విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో వారం రోజుల్లో రూ. 8 వేల కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభ పరిస్థితులు ఇందుకు కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.9,200 కోట్ల షేర్లను కొనుగోలు చేసి దేశీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనాన్ని అడ్డుకుంటున్నారు. ‘‘ ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్ని అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఎఫ్ఐఐలు బంగారం, డాలర్ వంటి రక్షణాత్మక సాధనాల వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. ఇటీవల డాలర్ మారకంలో రూపాయి క్షీణత కొంత ప్రతికూలంగా మారింది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ప్రపంచ పరిణామాలు... ఈక్విటీ మార్కెట్లతో పాటు క్రూడాయిల్ ధరలు సైతం బేర్ గుప్పిట్లోకి వెళ్లాయి. ప్రస్తుత సంవత్సరంలోనే వారం ప్రాతిపదికన అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. క్రూడ్ ధరల పతనం భారత్ మార్కెట్కు కలిసొచ్చే అంశమైనప్పట్టకీ.., క్షీణత స్థిరంగా ఉంటేనే స్వాగతించాలని నిపుణులు చెబుతున్నారు. నేడు అమెరికా జనవరి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, రేపు యూరోజోన్ కన్స్ట్రక్షన్ అవుట్ డేటా వెల్లడి అవుతాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య కమిటీ నిర్ణయాలుతో పాటు బ్రిటన్ ఫిబ్రవరి ద్రవ్యోల్బణ డేటా బుధవారం విడుదల అవుతుంది. గురువారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లను ప్రకటిస్తుంది. వారాంతాపు రోజైన శుక్రవారం చైనా ఫిబ్రవరి రిటైల్ అమ్మకాలతో పాటు జపాన్ ఫిబ్రవరి ద్రవ్యోల్బణం, యూరోజోన్ మార్చి ప్రథమార్థపు తయారీ రంగ వివరాలు వెల్లడి అవుతాయి. -
ఫెడరల్ బ్యాంక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 54 శాతం దూసుకెళ్లి రూ. 804 కోట్లను తాకింది. అధిక వడ్డీ ఆదాయం, రుణాల నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 522 కోట్లు ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 3,927 కోట్ల నుంచి రూ. 4,967 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 27 శాతం పుంజుకుని రూ. 1,957 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.22 శాతం మెరుగై 3.49 శాతాన్ని తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.06 శాతం నుంచి 2.43 శాతానికి తగ్గాయి. ఈ బాటలో నికర ఎన్పీఏలు 1.24 శాతం నుంచి 0.73 శాతానికి నీరసించాయి. బాసెల్–3 నిబంధనల ప్రకారం కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) స్వల్ప వెనకడుగుతో 13.35 శాతంగా నమోదైంది. తొలి 9 నెలల్లో 60 బ్రాంచీలను జత చేసుకోగా క్యూ4లో మరో 20 ప్రారంభించనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 1.2 శాతం బలపడి రూ. 140 వద్ద ముగిసింది. -
ఈ బ్యాంకు కస్టమర్లకు...3 లక్షల క్రెడిట్, 3 లక్షల బీమా
సాక్షి,ముంబై: ఫెడరల్ బ్యాంక్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. తన కస్టమర్ల కోసంఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్తో కలిసి సాచెట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ 'గ్రూప్ క్రెడిట్ షీల్డ్'ను ప్రారంభించింది. ఈ కార్డు ద్వారా పలు సౌలభ్యాలు అందిస్తోంది. ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డు తీసుకున్న వారికి రూ.3 లక్షల జీవిత బీమా ఆఫర్ చేస్తోంది. ప్రమాదవశాత్తూ కార్డు దారుడు మరణిస్తే నామినీకి రూ. 3 లక్షలు బీమా లభిస్తుంది. అలాగే ఈ కార్డుపై రూ.3 లక్షల వరకు క్రెడిట్ అందించడం మరో విశేషం. అయితే ఈ సింగిల్ ప్రీమియం ప్లాన్ లైఫ్ కవర్ ఒక సంవత్సరం మాత్రమే. ఈ మేరకు ఏజిస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్తో ఒప్పందం చేసుకున్నట్లు ఫెడరల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్రూప్ క్రెడిట్ షీల్డ్ క్రెడిట్ కార్డ్ తన కస్టమర్లకు ప్రత్యేకమైన కవర్ను అందిస్తుంది. ఈ కార్డ్ క్రెడిట్ పరిమితి గరిష్టంగా రూ. 3 లక్షలు. ప్రస్తుతం Celesta, Imperio, Signet అనే మూడు వేరియంట్లను అందిస్తోంది. ఈ కార్డులపై కస్టమర్లకు జీవిత భద్రత కల్పిస్తున్నట్లు ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. తమ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు కేవలం 3 నిమిషాల్లో దీన్ని ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చని, బైట్ సైజ్, బండిల్డ్ ప్రొడక్ట్ల ద్వారా దేశంలో బీమా వ్యాప్తిని మరింత పెంచాలని భావిస్తున్నామని బ్యాంకు ఫెడరల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షాలిని వారియర్ అన్నారు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ల కోసం తమగ్రూప్ క్రెడిట్ షీల్డ్ నిమిత్తం ఫెడరల్ బ్యాంక్తో భాగస్వామ్యం చాలా సంతోషదాయకమని ఏజిస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, హెడ్-ప్రొడక్ట్స్ కార్తిక్ రామన్ తెలిపారు. గ్రూప్ క్రెడిట్ షీల్డ్ కస్టమర్లకు జీవిత బీమా కల్పించి దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు రుణాన్ని తిరిగి చెల్లించే భారం లేకుండా వారిని కాపాడుతుందన్నారు. -
ఫెడ్ రిజర్వ్, ఆర్బీఐ నిర్ణయాలు కీలకం
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ, ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ అత్యవసర సమావేశపు నిర్ణయాలు ఈ వారం మార్కెట్ను నడిపిస్తాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ప్రభావం చూపొచ్చంటున్నారు. హిందూ నూతన సంవత్సరం ‘2079 సంవత్’ తొలివారంలో సెన్సెక్స్ 650 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు స్థిరీకరణ దిశగా సాగొచ్చు. కార్పొరేట్ల రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్పై దృష్టి సారించడం శ్రేయస్కరం. కన్సాలిడేషన్లో భాగంగా దిగివచ్చిన నాణ్యమైన షేర్లను గుర్తించి ఎంపిక చేసుకోవాలి. సాంకేతికంగా నిఫ్టీకి 18,100 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దిగువ స్థాయిలో 17,400 స్థాయి వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ఫెడ్ రిజర్వ్ సమావేశం అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం మంగళవారం(నవంబర్ ఒకటిన) ప్రారంభం కానుంది. మరుసటి రోజు(బుధవారం) చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య కమిటి నిర్ణయాలను వెల్లడించనున్నారు. వరుసగా నాలుగోసారి వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ఆర్బీఐ ఎంపీసీ అత్యవసర భేటీ రిజర్వ్ బ్యాంక్ తన తదుపరి పరపతి ద్రవ్య సమీక్ష(ఎంపీసీ) సమావేశాన్ని గురువారం (నవంబర్ 3న) అత్యవసరంగా నిర్వహించనుంది. వరుసగా మూ డు త్రైమాసికాలుగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో విఫలంకావడంతో ఆర్బీఐ మరోదఫా వడ్డీరేట్లను పెంచడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు ఈ వారంలో సుమారు 100కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, యూపీఎల్, హీరో మోటోకార్ప్, హెచ్పీసీఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, గెయిల్ ఇండియా, టైటాన్, పవర్ గ్రిడ్ తదితర దిగ్గజ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. స్థూల ఆర్థిక గణాంకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసిక జీడీపీ డేటాతో పాటు జూలై ద్రవ్యోల్బణ లోటు, మౌలిక రంగ గణాంకాలు బుధవారం(ఆగస్టు 31న) వెల్లడి కానున్నాయి. సెప్టెంబర్ ద్రవ్యలోటు, మౌలిక రంగ గణాంకాలు సోమవారం విడుదల కానున్నాయి. మరసటి రోజు అక్టోబర్ నెల వాహన విక్రయ గణాంకాలతో పాటు అదే నెల తయారీ రంగ డేటా కూడా విడుదల అవుతుంది. సేవారంగ డేటా గురువారం వెల్లడి కానుంది. అలాగే శుక్రవారం ఆర్బీఐ అక్టోబర్ 21 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల 28వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. తగ్గిన ఎఫ్ఐఐల అమ్మకాల ఉధృతి దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఉధృతి తగ్గుముఖం పట్టింది. సెప్టెంబర్లో రూ.7,600 కోట్ల ఈక్విటీలను విక్రయించిన ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటి వరకు(29 తేదీ నాటికి) రూ.1,586 కోట్ల షేర్లను మాత్రమే అమ్మారు. ఆగస్ట్లో రూ. 51,200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాదిలో నికరంగా 1.70 లక్షల కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, రూపాయి పతనం, ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగడం, బ్రిటన్లో రాజకీయ అస్థిరత తదితర అంశాల నేపథ్యంలో భవిష్యత్లోనూ ఎఫ్పీఐల పెట్టుబడుల్లో ఆటుపోట్లు కనిపించవచ్చు’’ అని మార్నింగ్స్టార్ ఇండియా అసిసోయేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
రుణ రేట్లను పెంచిన ఎస్బీఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్)ను పెంచింది. రెండు ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకులు– కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్లు కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన ఆయా బ్యాంకుల వ్యక్తిగత, గృహ, ఆటో రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఆర్బీఐ రెపో రేటు (మే నుంచి 1.9 శాతం పెంపుతో 5.9 శాతానికి అప్) పెంపు బాట పట్టిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ, కోటక్, ఫెడరల్ బ్యాంక్ రేట్ల పెంపు వివరాలు ఇలా.. ► ఎస్బీఐ బెంచ్మార్క్ ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగి 7.95 శాతానికి చేరింది. ఈ రేటు అక్టోబర్ 15 నుంచీ అమల్లోకి వస్తుంది. మెజారీటీ కస్టమర్ల రుణ రేటు ఏడాది రేటుకే అనుసంధానమై ఉంటుంది. రెండు, మూడు సంవత్సరాల కాలపరిమితుల ఎంసీఎల్ఆర్ పావుశాతం చొప్పున పెరిగి వరుసగా 8.15 శాతం, 8.25 శాతానికి ఎగసింది. ఓవర్నైట్, నెల, మూడు, ఆరు నెలల రేట్లు 7.60–7.90 శాతం శ్రేణిలో ఉన్నాయి. ► కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంసీఎల్ఆర్ వివిధ కాలపరిమితులపై 7.70–8.95 శ్రేణిలో ఉంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.75 శాతం. అక్టోబర్ 16 నుంచి తాజా నిర్ణయం అమలవుతుంది. ► ఫెడరల్ బ్యాంక్ ఏడాది రుణ రేటు అక్టోబర్ 16 నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ రేటు కోత కాగా, ఎస్బీఐ సేవింగ్స్ డిపాజిట్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 2.70 శాతానికి దిగివచ్చింది. అక్టోబర్ 15 నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. రూ.10 కోట్ల కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్నవారికి తాజా రేటు అమలవుతుంది. కాగా, రూ.10 కోట్లు దాటిన సేవింగ్స్ అకౌంట్స్పై వడ్డీరేటును 2.75 శాతం నుంచి 3 శాతానికి పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటన పేర్కొంది. నిధుల భారీ సమీకరణ లక్ష్యంగా వివిధ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతున్న నేపథ్యంలో ఎస్బీఐ చేసిన ఈ సర్దుబాట్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లపై బీఓబీ రేట్ల పెంపు కాగా, ప్రవాస భారతీయుల ఫారిన్ కరెన్సీ (ఎఫ్సీఎన్ఆర్) డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వడ్డీరేట్లు పెంచింది. వివిధ కరెన్సీలు, మెచ్యూరిటీ కాలపరిమితులపై 135 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీరేటు పెరిగినట్లు బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 16 నుంచి నవంబర్ 15 వరకూ తాజా రేట్లు అమలవుతాయని కూడా వివరించింది. -
ఫెడరల్ బ్యాంక్ లాభం 52% అప్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ నికర లాభం 52 శాతం (స్టాండెలోన్ ప్రాతిపదికన) పెరిగింది. వడ్డీ రాబడి, ఇతర ఆదాయాలు మెరుగుపడటంతో రూ.704 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 460 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 3,871 కోట్ల నుంచి రూ. 4,630 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన లాభం 50 శాతం పెరిగి రూ. 733 కోట్లకు చేరింది. లాభాలపరంగా చూస్తే బ్యాంకు చరిత్రలోనే ఇది అత్యుత్తమ త్రైమాసికమని సంస్థ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ తెలిపారు. ప్రొవిజన్ కవరేజీ నిష్పత్తి (పీసీఆర్)కి సంబంధించి కేటాయింపులు భారీగా పెంచినప్పటికీ మెరుగైన ఫలితాలు సాధించగలిగామని ఆయన పేర్కొన్నారు. సమీక్షాకాలంలో మొత్తం కేటాయింపులు 12.6 శాతం పెరిగి రూ. 506 కోట్లకు చేరాయి. నికర వడ్డీ ఆదాయం 19.1 శాతం పెరిగి రూ. 1,762 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 0.10 శాతం పెరిగి 3.30 శాతానికి చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిమ్ 3.27–3.35 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు శ్రీనివాసన్ తెలిపారు. రుణ వృద్ధిని బట్టి 2023లో అదనపు మూలధనాన్ని సమీకరించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక ఇతర ఆదాయం రూ. 492 కోట్ల నుంచి రూ. 610 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 3.24 శాతం నుంచి 2.46 శాతానికి దిగి వచ్చింది. -
డిజిటల్గా కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ
న్యూఢిల్లీ: రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల (కేసీసీ) జారీని సులభతరం చేసే ప్రక్రియకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్ శ్రీకారం చుట్టాయి. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించాయి. కేసీసీ తీసుకునేందుకు పేపర్ రూపంలో స్థల రికార్డుల పత్రాలను దాఖలు చేయడం, భౌతికంగా బ్యాంకు శాఖను సందర్శించడం వంటి బాదరబందీ లేకుండా డిజిటల్గానే ప్రక్రియ పూర్తి చేయవచ్చని తెలిపాయి. ఇందుకోసం రెండు బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్బీఐహెచ్)తో జట్టు కట్టాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్లోని హర్దా జిల్లాలో, ఫెడరల్ బ్యాంక్.. చెన్నైలో ఈ ప్రాజెక్టులను ప్రారంభించాయి. బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేకుండా మొబైల్ హ్యాండ్సెట్ ద్వారా కేసీసీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఆన్లైన్లోనే పొలం వెరిఫికేషన్ కూడా జరుగుతుందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎడీ ఎ మణిమేఖలై తెలిపారు. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా,ఫెడరల్ బ్యాంకుకు ఆర్బీఐ షాక్!
ముంబై: నియంత్రణపరమైన నిబంధనల అమలులో లోపాలు ఉన్నట్టు గుర్తించిన ఆర్బీఐ ఫెడరల్బ్యాంక్కు రూ.5.72 కోట్ల జరిమానా విధించింది. అలాగే, కేవైసీ నిబంధనలు కొన్ని పాటించనందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.70 లక్షల జరిమానాను విధిస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. బీమా బ్రోకింగ్, కార్పొరేట్ ఏజెన్సీ సర్వీసెస్ కోసం ఉద్యోగులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వకుండా నిబంధనలను అమలు చేయడంలో ఫెడరల్ బ్యాంక్ విఫలమైనట్టు ఆర్బీఐ తెలిపింది. కేవైసీ నిబంధనలను అమలు చేయనందుకు గురుగ్రామ్కు చెందిన ధనిలోన్స్ అండ్ సర్వీసెస్కు సైతం ఆర్బీఐ 7.6 లక్షల జరిమానా విధించింది. -
నియో మిలీనియల్స్
బ్యాంకుల గురించి సామాజిక మాధ్యమాల్లో బోలెడు జోక్స్, మీమ్స్ కనిపిస్తుంటాయి. మచ్చుకు కొన్ని... ‘ఈరోజు మీకు బ్యాంకులో పని ఉందా? అయితే ఇవి మీతో పాటు తెచ్చుకోవడం అనివార్యం... 1. ఐడీ ప్రూఫ్, 2. లంచ్ బాక్స్, 3.ప్లేయింగ్ కార్డ్స్ 4. డిన్నర్ సరంజామా, 5.బెడ్షీట్, 6. మెత్తని దిండు, 7. బ్లాంకెట్ 8.ఫోన్ చార్జర్... వీటన్నికంటే ముఖ్యమైనది బోలెడు ఓపిక’ ‘ఈ అమ్మాయి పేరు సువర్ణముఖి. బ్యాంకుకు వెళ్లే ముందు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. బ్యాంకుకు వెళ్లి వచ్చిన తరువాత చంద్రముఖిగా మారిన సువర్ణముఖి రూపం ఇది’ ‘ఒక బ్యాంకు ఉద్యోగి వాచ్లో టైమ్ స్థానంలో లంచ్, లంచ్, లంచ్... అని ఉంటుంది. గడియారం ముళ్లు వాటి మీదే తిరుగుతుంటాయి’ ఇవి అతిశయోక్తితో కూడిన జోక్స్ అయినప్పటికీ, సంప్రదాయ బ్యాంకులకు వెళ్లడానికి నవతరంలో ఎక్కువమంది అంతగా ఆసక్తి చూపడం లేదు. దీని కారణాలలో క్యూ, దూరభారంలాంటివి ఉన్నాయి. బ్యాంకులకు వెళ్లడానికి ఇష్టపడని మిలీనియల్స్ నియో బ్యాంకులపై ఆసక్తి చూపుతున్నారు. ఏమిటీ నియో బ్యాంకులు? నియో బ్యాంకులు అనేవి వర్చువల్ బ్యాంక్స్. వీటికి ఫిజికల్ బ్రాంచ్లు ఉండవు. అయితే ఫిజికల్ బ్రాంచ్లు ఉన్న ప్రముఖ బ్యాంకులతో వీటికి భాగస్వామ్యం ఉంటుంది. ‘క్యూ’ కంటే ‘క్విక్’ విధానానికి ప్రాధాన్యత ఇచ్చే యువతరం ఈ బ్యాంకులను అమితంగా ఇష్టపడుతుంది. సంప్రదాయ బ్యాంకులకు ‘విశ్వసనీయత’ అనేది గట్టి పునాది అయినప్పటికీ, వీటితో పోల్చితే నియో బ్యాంకులు రకరకాల ప్రత్యా మ్నాయ అవకాశాలు కల్పిస్తున్నాయి. మనీ మేనేజ్మెంట్ టూల్స్ అనేవి మరో ప్లస్ పాయింట్గా మారింది. వీటి ద్వారా తమ ఖర్చులు, పొదుపు నకు సంబంధించి స్వీయ విశ్లేషణ చేసుకునే అవకాశం యూజర్కు కలుగుతుంది. బడ్జెటింగ్, సేవింగ్, ఇన్వెస్టింగ్, రుణ నిర్వహణకు సంబంధించి సులభంగా గ్రహించగలిగే ఆర్థిక సలహాలను బ్యాంకింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి కోరుకుంటున్నారు మిలీనియల్స్. వారి అంచనాలు సంప్రదాయ బ్యాంకులు అందుకోలేక పోవడం కూడా నియో బ్యాంకుల వైపు ఆకర్షితులు కావడానికి ఒక కారణం. రోబోటిక్స్ సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తక్కువ సమయంలో సేవలు అందిస్తున్నాయి నియో బ్యాంకులు. తక్కువ ఛార్జీలు, సులభంగా ఖాతా ప్రారంభించే అవకాశం ఉండడం, రుణాలు, బిల్లులు... మొదలైన చెల్లింపులను గుర్తు చేయడానికి రిమైండర్ సదుపాయం... ఇలాంటివి నియో విజయానికి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. రకరకాల ఫైనాన్షియల్ సర్వీస్లను నియో బ్యాంకులు ఒకే గొడుగు కిందికి తీసుకురావడం టెక్–సావి మిలీనియల్స్ను ఆకట్టుకునే అంశం. రేజర్ పే ఎక్స్, జూపిటర్, ఓపెన్... మొదలైనవి మన దేశంలోని కొన్ని నియో బ్యాంకులు. గూగుల్ పే క్రియేటర్స్ సుజిత్ నారాయణ్, సుమిత్లు మిలీనియల్స్ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ‘ఫై’ అనే నియోబ్యాంకును ప్రారంభించారు. ఇది ఫెడరల్ బ్యాంక్ భాగస్వామ్యంతో పనిచేస్తుంది. మన దేశంలో నియో బ్యాంక్ స్టార్టప్ల సంఖ్య పెరగడానికి కారణం మిలీనియల్స్ ఆదరణ. స్థూలంగా చెప్పాలంటే... నియో బ్యాంకింగ్ సెగ్మెంట్లో మిలీనియల్స్ అతి ముఖ్యమైన ప్రాధాన్యతను సంతరించుకున్నారు. అయితే నియో బ్యాంకుల మధ్య కూడా గట్టి పోటీ ఉంది. వాటి పనితీరు ఆధారంగా రేటింగ్స్ ఉంటున్నాయి. డిజైన్ లాంగ్వేజ్ అనేది వాటి ఆదరణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. -
ఓహ్! స్టాక్ మార్కెట్ జోరు.. ఆశ్చర్యపోతున్న ఇన్వెస్టర్లు
ముంబై: ప్రపంచ మార్కెట్ సూచీలను అనుసరించి దేశీ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో ఉంది. మార్కెట్ ఆరంభం కావడం మొదలు ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, అటు ఎన్ఎస్ఈ నిఫ్టీలు జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాయి. బంగారం, క్రూడ్ ఆయిల్ ధరలు కిందికి దిగడం, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేపు పెంపు ఊహించినట్టుగానే ఉండటంతో ఇన్వెస్టర్లు మార్కెట్పై ఆసక్తి చూపిస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెరిగితే మార్కెట్ నుంచి పెట్టుబడులు వెనక్కి పోతాయనే అంచనాలు తారుమారు అయ్యింది. మార్కెట్ చూపిస్తున్న జోరు ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ రోజు ఉదయం 9:45 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 760 పాయింట్లు లాభపడింది. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ మరోసారి 57 వేల మార్క్ని క్రాస్ చేసింది. మార్కెట్ ప్రారంభమైన 45 నిమిషాలకే 1.35 శాతం వృద్ధితో 57,576 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీలో సైతం ఇదే జోరు కొనసాగుతోంది. 209 పాయింట్ల లాభంతో 1.23 శాతం వృద్ధితో 17,184 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం కీలకమైన 17వేల మార్క్ని క్రాస్ చేసింది. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్బ్యాంక్, ఏషియన్ పేయింట్స్ షేర్లు భారీ లాభాలు పొందగా సెన్సెక్స్ 30లో అన్ని అన్ని షేర్లు సానుకూలంగా ఉన్నాయి. మిడ్ క్యాప్ షేర్లలోనూ ఇదే జోరు కనిపిస్తోంది. ముఖ్యంగా నిఫ్టీ మిడ్కాప్ ఇండెక్స్ 1.36 శాతం వృద్ధిని చూపిస్తోంది. -
పీకల్లోతు అప్పుల్లో అగ్రరాజ్యం అమెరికా..!
అగ్రరాజ్యం అమెరికాకు ఉన్న అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కరోనా సంక్షోభం తర్వాత అగ్రరాజ్యం అమెరికా పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోతున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఆ దేశ ట్రెజరీ డిపార్ట్ మెంట్ వెల్లడించిన డేటా ప్రకారం.. ఆ దేశ మొత్తం ప్రభుత్వ రుణ బకాయిలు ఇప్పుడు 30 ట్రిలియన్ డాలర్లకు పైగా చేరుకుంది. కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం నుంచి బయట పడటానికి అమెరికా ఎక్కువగా ఖర్చు చేయడంతో ప్రభుత్వ రుణాలు భారీగా పెరిగాయి. 2019 చివరి నుంచి ఇప్పటి వరకు జాతీయ రుణం సుమారు 7 ట్రిలియన్ డాలర్ల వరకు పెరిగింది. ఆ దేశ ఆర్థికవేత్తలు ఇది నిజంగా అతి పెద్ద సమస్య అని అంటున్నారు."ఇది స్వల్పకాలిక సంక్షోభం కాదు, కానీ మేము దీర్ఘకాలంలో పేదవారిగా ఉండబోతున్నామని అర్థం" అని ప్రపంచ ప్రధాన వ్యూహకర్త డేవిడ్ కెల్లీ అన్నారు. వడ్డీ ఖర్చులు మాత్రమే రాబోయే 10 సంవత్సరాలలో $5 ట్రిలియన్లను అధిగమిస్తుందని అంచనా వేశారు. ఇది 2051 నాటికి మొత్తం ఫెడరల్ ఆదాయంలో దాదాపు సగం ఉంటుందని పీటర్ జి. పీటర్సన్ ఫౌండేషన్ సంస్థ తెలిపింది. పెరుగుతున్న రుణ ఖర్చుల వల్ల వాతావరణ మార్పు వంటి ప్రధాన ప్రాధాన్యతలపై అమెరికా చేసే ఖర్చులు తగ్గే అవకాశం ఉన్నట్లు కెల్లీ అభిప్రాయపడ్డారు. ఫెడరల్ ప్రభుత్వం ఇప్పుడు జపాన్ & చైనా నేతృత్వంలోని విదేశీ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు దాదాపు 8 ట్రిలియన్ డాలర్లు బకాయి పడింది. (చదవండి: కష్టకాలంలో శ్రీలంకకు అండగా భారత్..!) -
ఫెడరల్ బ్యాంక్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రాం
ముంబై: ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ త్వరలో ప్రారంభించే ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో చేరేందుకు అర్హత గల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఫెడరల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం (ఎఫ్ఐపీ) పేరిట నిర్వహించే ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్లుగా ఉంటుంది. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ (ఎంఏజీఈ)తో కలిసి ఈ కోర్సును అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. కోర్సు పూర్తయిన తర్వాత మణిపాల్ అకాడెమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సర్టిఫికెట్ అందుకోవచ్చని ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. అంతేకాదు ప్రొబేషనరీ ఆఫీసర్గా ఫెడరల్ బ్యాంక్లోనే అవకాశాలు దక్కవచ్చు కూడా. ఈ ప్రోగ్రాంలో చేరే అభ్యర్థులు ఏటా రూ. 5.70 లక్షల దాకా ఆర్జించే అవకాశాలు ఉంటాయని పేర్కొంది. దరఖాస్తు చేసుకోవాలంటే.. ► ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు ► పదో తరగతి, ఇంటర్(ఫ్లస్ టూ), గ్రాడ్యుయేషన్.. ఏదైనా సరే 60 శాతం మార్కులకు పైబడి ఉండాలి ► 2021 అక్టోబర్ 1 నాటికి అభ్యర్థి వయస్సు 27 సంవత్సరాలకు మించకూడదు. ► దరఖాస్తు సమర్పించడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 23 ►నవంబర్ 11న ఆన్లైన్లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి కింద లింక్ను క్లిక్ చేయండి.. https://www.federalbank.co.in/federal-internship-program -
ఫెడరల్ బ్యాంక్లో ఐఎఫ్సీకి 5 శాతం వాటాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంకులో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్సీ) సుమారు అయిదు శాతం వాటాలు దక్కించుకుంది. ఇందుకోసం రూ. 916 కోట్లు వెచ్చింది. దీంతో ఫెడరల్ బ్యాంక్లో ఐఎఫ్సీ కీలక వాటాదారుగా మారింది. షేరు ఒక్కింటికి రూ. 87.39 రేటు చొప్పున ఐఎఫ్సీ, ఐఎఫ్సీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గ్రోత్ ఫండ్, ఎల్పీ (ఎఫ్ఐజీ), ఐఎఫ్సీ ఎమర్జింగ్ ఏషియా ఫండ్, ఎల్పీ (ఈఏఎఫ్)లకు 10.48 కోట్ల షేర్లను (4.99 శాతం వాటా) కేటాయించే ప్రతిపాదనకు ఫెడరల్ బ్యాంక్ బోర్డు గత నెలలో ఆమోదముద్ర వేసింది. తాజాగా సమీకరించిన నిధులను పర్యావరణ అనుకూల ప్రాజెక్టులతో (ఈఎస్జీ) పాటు ఇతరత్రా కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు బ్యాంక్ తెలిపింది. గ్రీన్హౌస్ గ్యాస్ (జీహెచ్జీ) ఉద్గారాలకు సంబంధించి అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానంలో ఉంది. ప్యారిస్ ఒప్పందం ప్రకారం 2030 నాటికి జీహెచ్జీ ఉద్గారాలను తగ్గించుకోవడానికి భారత్కు గణనీయంగా పెట్టుబడులు అవసరం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి పర్యావరణ అనుకూల పెట్టుబడులకు సంబంధించి భారత్లో 3 లక్షల కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు ఉన్నాయని ఐఎఫ్సీ అంచనా వేస్తోంది. -
టాటా కామ్- ఫెడరల్ బ్యాంక్ జోరు
హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మరింత జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 424 పాయింట్లు జంప్చేసి 40,407ను తాకింది. నిఫ్టీ 105పాయింట్లు ఎగసి 11,867 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపడంతో అటు టాటా కమ్యూనికేషన్స్, ఇటు.. ఫెడరల్ బ్యాంక్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టాటా కమ్యూనికేషన్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో టెలికం మౌలిక సదుపాయాల కంపెనీ టాటా కమ్యూనికేషన్స్ రూ. 385 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ2తో పోలిస్తే ఇది 7 రెట్లు అధికంకాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 4 శాతం పుంజుకుని రూ. 4,282 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో టాటా కామ్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 919 ఎగువన ఫ్రీజయ్యింది. తద్వారా 52 వారాల గరిష్టం రూ. 935కు చేరువైంది. ఫెడరల్ బ్యాంక్ ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో రూ. 308 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది 26 శాతం క్షీణతకాగా.. ప్రొవిజన్లకు అధిక కేటాయింపులు చేపట్టడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే నికర వడ్డీ ఆదాయం 23 శాతం వృద్ధితో రూ. 1,380 కోట్లకు చేరింది. రుణ మంజూరీ 6 శాతం పుంజుకోగా.. నికర వడ్డీ మార్జిన్లు 3.13 శాతంగా నమోదయ్యాయి. ప్రొవిజన్లు, తదితరాలు 135 శాతం పెరిగి రూ. 592 కోట్లను అధిగమించాయి. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 0.12 శాతం నీరసించి 2.84 శాతానికి చేరగా.. నికర ఎన్పీఏలు 0.23 శాతం మందగించి 0.99 శాతాన్ని తాకాయి. దీంతో ఎన్ఎస్ఈలో ఫెడరల్ బ్యాంక్ షేరు ప్రస్తుతం 5 శాతం జంప్చేసి రూ. 55 సమీపంలో ట్రేడవుతోంది. -
బంపర్ ఆఫర్ : రూపాయికే బైక్ బుక్
సాక్షి, ముంబై: కరోనా కాలంలో రవాణా సదుపాయాలు తగినంతగా లేక ఇబ్బందులు పడుతూ, ద్విచక్ర వాహనాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్న వారికోసం ఫెడరల్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. కేవలం ఒక్క రూపాయికే బైక్ బుక్ చేసుకోవచ్చంటూ తన కస్టమర్లకు ఊరటనిచ్చింది. బ్యాంక్ కస్టమర్లుఫెడరల్ డెబిట్ కార్డు ద్వారా కేవలం ఒక్క రూపాయి చెల్లించి, మిగిలిన సొమ్మును ఈఎంఐ చెల్లింపు అవకాశంతో కొనుగోలు చేయవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఎంపిక చేసిన హీరో, హోండా, టీవీఎస్ షోరూంలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. మరోవైపు ఫెస్టివల్ ఆఫర్గా ఎంపిక చేసిన హోండా మోటార్ సైకిల్ షోరూంల ద్వారా డెబిట్ కార్డు ఈఎంఐతో బైక్ కొనుగోలు చేసినవారికి 5 శాతం క్యాష్బ్యాక్ను సైతం బ్యాంక్ అందిస్తోంది. 3, 6, 9,12 నెలలకు ఈఎంఐను ఎంచుకునే అవకాశాన్ని ఖాతాదారులకు ఫెడరల్ బ్యాంక్ కల్పిస్తోంది. ఈఎంఐ అర్హతను తెలుసుకోవడానికి ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ‘DC-SPACE-EMI’ అని టైప్ చేసి 5676762 నంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి. అలాగే 7812900900 నంబరుకు మిస్డ్కాల్ ఇచ్చి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. హోండా మోటార్ సైకిల్ షోరూమ్ల నుండి ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేవారికి పండుగ ఆఫర్గా5 శాతం క్యాష్ బ్యాక ఆఫర్ కూడా ఉంది. 500సీసీ ఇంజన్ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైక్లపై 17 శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది. రానున్న పండుగ సీజన్, కరోనా మహమ్మారి ప్రోటోకాల్స్, కార్డ్ల ద్వారా ద్విచక్ర వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో ఈజీ ఫైనాన్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో కస్టమర్లకు ప్రోత్సాహాన్నివ్వాలని భావిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. భారతదేశం అంతటా 36,000 దుకాణాలలో వినియోగదారుల డ్యూరబుల్స్ కొనుగోలు కోసం బ్యాంక్ డెబిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయం అందిస్తోంది. కాగా ఈకామర్స్ పోర్టల్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొనుగోళ్లపై కూడా ఇటీవలఈఎంఐ ఆఫర్ అందించడం ప్రారంభించింది. -
పడగొట్టిన ‘ఫెడ్’!
అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా కాలమే పడుతుందని ఆ దేశ కేంద్ర బ్యాంక్ సంకేతాలివ్వడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గురువారం పతనమైంది. టెలికం కంపెనీలు ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిందేనంటూ సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించడం, ఇటీవల బాగా పెరిగిన బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణించడం, మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే వదంతులు, కరోనా కేసులు పెరుగుతుండటం... ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 34,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 709 పాయింట్లు క్షీణించి 33,538 పాయింట్ల వద్ద, నిఫ్టీ 214 పాయింట్లు పతనమై 9,902 పాయింట్ల వద్ద ముగిశాయి. గత మూడు వారాల్లో సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే ప్రథమం. ఇంట్రాడేలో సెన్సెక్స్ 767 పాయింట్లు, నిఫ్టీ 231 పాయింట్ల మేర నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. కాగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలు... ► ఎస్బీఐ షేర్ 6% నష్టంతో రూ.177 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా పడిన షేర్ ఇదే. ► 30 సెన్సెక్స్ షేర్లలో ఐదు షేర్లు–ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటొకార్ప్, పవర్ గ్రిడ్, మహీం ద్రా అండ్ మహీంద్రా, నెస్లే ఇండియా మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 25 షేర్లు నష్టపోయాయి. ► మార్కెట్ భారీగా నష్టపోయినా, 80కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. అరబిందో ఫార్మా, ముత్తూట్ ఫైనాన్స్, క్యాడిలా హెల్త్కేర్, గ్రాన్యూల్స్ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్లో భారీ క్షీణత చోటు చేసుకున్నా దాదాపు 350కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. పీఎన్బీ హౌసింగ్, ఫ్యూచర్ రిటైల్, లెమన్ ట్రీ హోటల్స్, ఫ్యూచర్ కన్సూమర్, డిష్ టీవీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ప్రముఖ ట్రేడర్ విజయ్ ఖేడియా 1.1 శాతం వాటా షేర్లను కొనుగోలు చేయడంతో రామ్కో సిస్టమ్స్ షేర్ 20 శాతం లాభంతో రూ.110 వద్ద ముగిసింది. ఇక ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో శంకర బిల్డింగ్ షేర్ 16 శాతం ఎగసి రూ.352 వద్ద ముగిసింది. ► ఏజీఆర్ బకాయిల విషయమై ఊరట లభించకపోవడంతో టెలికం షేర్లు నష్టపోయాయి. వొడాఫోన్ ఐడియా, భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్ఎఫ్సీఎల్, తేజాస్ నెట్వర్క్స్, ఐటీఐ, భారతీ ఎయిర్టెల్ షేర్లు 13 శాతం వరకూ నష్టపోయాయి. ► వరుసగా ఐదో రోజూ ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ పెరిగింది. ఒక్క వారంలో ఈ షేర్ 30 శాతం లాభపడింది. నష్టాలు ఎందుకంటే... ► ఫెడ్ కఠిన వ్యాఖ్యలు... వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, అమెరికాలో ఆర్థిక రికవరీకి దీర్ఘకాలమే పడుతుందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ వ్యాఖ్యానించడం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను పడగొట్టింది. వడ్డీరేట్లను మరో రెండేళ్ల పాటు సున్నా స్థాయిల్లోనే కొనసాగిస్తామని, తక్కువ రేట్లను కొనసాగించడానికి బాండ్ల కొనుగోళ్లు కొనసాగిస్తామని ఫెడ్ వెల్లడించింది. కరోనా కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా కాలమే పడుతుందని ఈ వ్యాఖ్యల ద్వారా ఫెడ్ అంగీకరించినట్లయింది. ఫెడ్ వ్యాఖ్యల కారణంగా ఆసియా, యూరప్ మార్కెట్లు 1–4 శాతం మేర నష్టపోయాయి. ► ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిందే... టెలికం కంపెనీలు ఏజీఆర్(సవరించిన స్థూల రాబడి)బకాయిలు చెల్లించాలాంటూ సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పడంతో బ్యాంక్ షేర్లు పడ్డాయి. ► బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ... లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పటి నుంచి ఆర్థిక రికవరీపై సానుకూల అంచనాలతో బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ షేర్లన్నీ బాగా పెరిగిన నేపథ్యంలో ఫెడ్ తాజా నిర్ణయం కారణంగా పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ► రూపాయి పతనం డాలర్తో రూపాయి మారకం విలువ 20 పైసలు పతనమై 75.79 వద్దకు చేరింది. ► మళ్లీ లాక్డౌన్...? కరోనా కేసులు బాగా పెరుగుతుండటంతో ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధిస్తారన్న వదంతులు చెలరేగాయి. ఈ వార్తలను కేంద్రం ఖండించినప్పటికీ, లాక్డౌన్ వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ► పెరుగుతున్న కరోనా కేసులు... ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్త కరోనా కేసులు 74 లక్షలకు, మరణాలు 4.2 లక్షలకు చేరువయ్యాయి. ఇక భారత్లో కరోనా కేసులు 2.9 లక్షలకు పైగా చేరగా, మరణాలు 8 వేలు దాటిపోవడం కూడా మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. ► ఎస్ అండ్ పీ రేటింగ్స్ ఆందోళన గత వారం మన రేటింగ్ను మూడీస్ సంస్థ డౌన్గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. అయితే స్డాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) గ్లోబల్ రేటింగ్స్ సంస్థ మన సావరిన్ రేటింగ్ను కొనసాగించడం ఒకింత ఊరటనిచ్చింది. అయితే ద్రవ్యలోటు, ఆర్థిక రంగ బలహీనతలపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రతికూల ప్రభావం చూపించింది. రూ.2.4 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.2.4 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.2.4 లక్షల కోట్లు తగ్గి రూ.133 లక్షల కోట్లకు పడిపోయింది. భారీ నష్టాల్లో అమెరికా మార్కెట్ కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటం, అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిరాశాపూర్వక వ్యాఖ్యలు చేయడంతో గురువారం అమెరికా స్టాక్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికాలో కరోనా కేసులు 20 లక్షలకు పైగా పెరిగిపోగా, మరణాలు 1.1 లక్షలకు చేరాయి. కరోనా కేసులు మళ్లీ తిరగబెడుతున్నాయని నిపుణులంటున్నారు. రాత్రి గం.11.30ని. సమయానికి డోజోన్స్ సూచీ 1,300 పాయింట్లు, (5 శాతం), నాస్డాక్ సూచీ 328 పాయింట్లు (3 శాతం), ఎస్ అండ్ పీ 500 సూచీ 128 పాయింట్లు(4 శాతం) మేర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక మన ఎన్ఎస్ఈ నిఫ్టీకి ప్రతీక అయిన ఎస్జీఎక్స్ నిఫ్టీ సూచీ 278 పాయింట్ల(2%) నష్టంతో 9,575 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో శుక్రవారం మన స్టాక్ సూచీలు భారీ గ్యాపప్తో మొదలవుతాయని అంచనా. -
అందుకే బంగారు రుణాల వైపు మొగ్గు
ముంబై: భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమొ అందరికి తెలిసిందే. పసిడి మన సంస్కృతిలో అంతర్భాగమని నిపుణులు చెబుతుంటారు. కరోనా వైరస్ విలయతాండవంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తుంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కి తిరిగి వ్యాపారంలో పుంజుకునేందుకు ప్రజలు బంగారు రుణాల వైపు మొగ్గు చూపుతున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. బ్యాంక్లు కూడా వివిధ ఆస్తుల గ్యారెంటీ కన్నా బంగారు రుణాలే మేలని భావిస్తున్నాయి. దేశంలో బంగారు రుణాలవైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రెసిల్ పేర్కొంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి, ఎక్కువ శాతం ప్రజలు బంగారు రుణాలు తీసుకోవడానికి సానుకూలంగా ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ హెడ్ పీఆర్ సోమ సుందరం పేర్కొన్నారు. కాగా దేశంలోని ప్రజలు సగటున (రూ.40,000) బంగారు రుణాలు తీసుకుంటున్నట్లు ముథుట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముథూట్ తెలిపారు. బంగారు రుణాలు ఇవ్వడానికే తమ బ్యాంక్ ప్రాధాన్యమిస్తున్నట్లు ఫెడరల్ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అశుతోష్ ఖాజురియా పేర్కొన్నారు. (చదవండి: మీ రుణం ‘బంగారం’ గాను..) -
ఆగని విలయం!
కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలం కొనసాగుతుండటంతో స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ల రేట్లను దాదాపు సున్నా స్థాయికి తగ్గించినప్పటికీ, భారత్తో పాటు ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లన్నీ పతనబాటలోనే సాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 32,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ చరిత్రలోనే రెండో అతి పెద్ద పతనాన్ని నమోదు చేసింది. 2,713 పాయింట్లు క్షీణించి 31,390 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 758 పాయింట్లు పతనమై 9,197 పాయింట్ల వద్దకు చేరింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 7.96 శాతం, నిఫ్టీ 7.61 శాతం చొప్పున క్షీణించాయి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. నిఫ్టీ మూడేళ్లు, సెన్సెక్స్ రెండున్నరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఆరంభం నుంచి అదే వరుస.... ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,000 పాయింట్ల నష్టంతో 33,103 పాయింట్ల వద్ద, నిఫ్టీ 368 పాయింట్లు పతనమై 9,588 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను ఆరంభించాయి. ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,827 పాయింట్లు, నిఫ్టీ 790 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఈ నెల 12న సెన్సెక్స్ 2,919 పాయింట్లు, నిఫ్టీ 868 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. చరిత్రలో ఇదే అతి పెద్ద పతనం. సోమవారం రెండో అతి పెద్ద పతనం నమోదైంది. వారం వ్యవధిలో స్టాక్ సూచీలు ఇలా భారీ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. శుక్రవారం విరామం అనంతరం స్టాక్ మార్కెట్లో నష్టాలు మళ్లీ కొనసాగాయి. ఎదురీదిన యస్ బ్యాంక్ అన్ని రంగాల షేర్లు భారీగా పతనమైనప్పటికీ, యస్ బ్యాంక్ షేర్ మాత్రం 45% ఎగసి రూ.37కు చేరింది. యస్ బ్యాంక్లో వివిధ బ్యాంక్లు రూ.10,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుండటం, నగదు విత్డ్రాయల్ పరిమితులను మరో 2 రోజుల్లో తొలగించనుండటం సానుకూల ప్రభావం చూపాయి. రూ.7.6 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.7.6 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.7.62 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.121.63 లక్షల కోట్లకు పడిపోయింది. నష్టాలు ఎందుకంటే.... కోవిడ్–19 వైరస్ కల్లోలం.... కోవిడ్–19 వైరస్ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతోంది. సోమవారం తాజాగా 9 కొత్త దేశాలకు పాకింది. మరోవైపు ఇటలీ, స్పెయిన్ దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో ఇప్పటివరకూ కరోనా కేసుల సంఖ్య 110కు, మరణాలు రెండుకు చేరాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 1.70 లక్షల మందికి ఈ వైరస్ సోకగా, 6,500 మందికి పైగా మరణించారు. గణాంకాలతో గజగజ.... చైనా తయారీ రంగ, రిటైల్ అమ్మకాల గణాంకాలు సోమవారం వెలువడ్డాయి. చైనా తయారీ రంగ సూచీ 30 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. రిటైల్ అమ్మకాలు కూడా బారీగా తగ్గాయి. కోవిడ్–19 వైరస్ కల్లోలం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందనే భయాలను ఈ గణాంకాలు మరింతగా పెంచాయి. ప్రపంచ మార్కెట్ల పతనం..... ఆసియా మార్కెట్లు 2–4 శాతం రేంజ్లో నష్టపోవడం, యూరప్ మార్కెట్లు ఆరంభంలోనే 8 శాతం పతనం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ముడి చమురు ధరలు మరింత పతనం.... ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో వినియోగం తగ్గి, డిమాండ్ కూడా తగ్గగలదన్న ఆందోళనతో ముడి చమురు ధరలు 10 శాతం మేర దిగివచ్చాయి. అమెరికా వడ్డీ రేట్లు @ 0 ఫెడ్ మరో అనూహ్య కోత వాషింగ్టన్: అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ రెండు వారాల్లోనే రెండోసారి వడ్డీ రేట్లలో కోత పెట్టింది. అదీ ఏకంగా 1 శాతం తగ్గించేసింది. వెరసి ప్రస్తుతం ఫెడ్ ఫండ్ రేటు సున్నా (0–0.25 శాతం) స్థాయికి చేరింది. రెండు వారాల్లోనే రేటును ఫెడ్ ఏకంగా 1.5 శాతం తగ్గించడం గమనార్హం. నిజానికి ఈ నెల 17, 18 తేదీల్లో ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశాన్ని నిర్వహించవలసి ఉంది. అయితే కోవిడ్–19 సృష్టిస్తున్న విలయం కారణంగా రెండు వారాల క్రితం తొలిసారి అత్యవసర ప్రాతిపదికన 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించింది. ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున) వడ్డీ రేట్లను సున్నా స్థాయికి చేర్చుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా 700 బిలియన్ డాలర్లతో భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు బాండ్లను కొనుగోలు చేయనుంది. తాజా రేటు కోత నేపథ్యాన్ని పరిశీలిస్తే, కరోనా వైరస్తో ప్రపంచం నిలువెల్లా వణుకుతోంది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ కోవిడ్–19 వైరస్ ప్రభావానికి లోనైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థసైతం తీవ్ర అనిశ్చితిలో పడిపోయింది. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ 2008 తదుపరి... 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు దారితీసిన సబ్ప్రైమ్ సంక్షోభ సమయంలో వృద్ధికి ఊతం అందించడానికి అమెరికా ఫెడ్ ఫండ్ రేటును సున్నా స్థాయికి తగ్గించడం జరిగింది. తరువాత కొన్ని సానుకూల ఆర్థిక అంశాలతో ఈ రేటు 2.5 శాతం వరకూ పెరుగుతూ వచ్చింది. అటు తర్వాత గడచిన సంవత్సర కాలంలో వేగంగా తిరిగి సున్నా స్థాయికి చేరింది. తాజాగా ఫెడ్ వడ్డీ రేట్లలో భారీ కోతలను చేపట్టడంతోపాటు.. బ్యాంకులు నగదు నిల్వలను వినియోగించుకునేందుకు వీలుగా రిజర్వ్ రిక్వైర్మెంట్స్ నిబంధనలు సడలించింది. అధ్యక్షుని ప్రశంసలు... మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడ్ నిర్ణయాలను ప్రశంసించారు. ఫెడ్ చర్యలను ఊహించలేదని..ఇదెంతో సంతోషకర విషయమని వ్యాఖ్యానించారు. ఇటీవల ఎదురవుతున్న సంక్షోభాల నుంచి ఆర్థిక వ్యవస్థ గట్టెక్కినట్లు విశ్వసించేవరకూ కనీస వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే బాటలో ఇటీవల ఫెడ్ 0.5 శాతం వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు.. 500 బిలియన్ డాలర్లను వ్యవస్థలోకి విడుదల చేసే చర్యలను చేపట్టిన సంగతి తెలిసిందే. అనుసరించనున్న ఆర్బీఐ! మరోవైపు భారత్ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కూడా రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.15%) బాటలో నిలు స్తుందన్న సంకేతాలను ఇచ్చారు గవర్నర్ శక్తికాంత దాస్. ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘కరోనా ప్రభావం నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ బయటపడటానికి ఆర్బీఐ వద్ద తగిన విధానపరమైన సాధనాలు ఉన్నాయి’’ అన్నారు. ఏప్రిల్ 3న పాలసీ సమీక్ష నేపథ్యంలో ఆర్బీఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి పాలసీ సమీక్ష సందర్భంగా రేటు కోత నిర్ణయం ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ, ‘‘ప్రస్తుత చట్టం ప్రకారం, రేట్ కోత నిర్ణయాన్ని ద్రవ్య విధాన కమిటీ తీసుకుంటుంది. రేటు కోత నిర్ణయాన్ని తోసిపుచ్చలేను. పరిస్థితులకు అనుగుణంగా తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’’ అన్నారు. వ్యవస్థలో లిక్విడిటీ సమస్యల్లేకుండా చర్యలు తీసుకుంటామని దాస్ పేర్కొ న్నారు. కోవిడ్ ఆందోళనలతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్సహా దాదాపు 43 సెంట్రల్ బ్యాంకులు రేటు కోత నిర్ణయం తీసుకున్నాయి. రూపాయి, క్రూడ్ క్రాష్ ముంబై: డాలర్ మారకంలో రూపాయి పతన ధోరణి కొనసాగుతోంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం ఒకేరోజు 50 పైసలు పడిపోయి 74.25 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా నెలకొన్న కోవిడ్–19 భయాలు, ప్రపంచాభివృద్ధిపై దీని ప్రభావం, రేటు కోతతో వృద్ధికి ఊతం ఇవ్వాలని భావించిన అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ నిర్ణయం... వెరసి మాంద్యం భయాలు భారత్ కరెన్సీపై ప్రభావం చూపుతున్నాయి. ఈక్విటీ భారీ నష్టాలూ ఇక్కడ గమనార్హం. శుక్రవారం రూపాయి ముగింపు 73.75. ట్రేడింగ్ మొత్తంమీద 74.09 గరిష్ట–74.35 కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. రూపాయి కనిష్ట స్థాయిల చరిత్ర గురించి చూస్తే ఈ నెల 12, 13తేదీల ఇంట్రాడేల్లో వరుసగా 74.50ని చూసినా, ఇప్పటి వరకూ కనిష్ట స్థాయి ముగింపు మాత్రం 74.39. క్రూడ్, బంగారం ‘బేర్’ మరోవైపు ఈక్విటీ మార్కెట్లతో పాటు కమోడిటీ మార్కెట్లూ కరోనా కాటుకు బలవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నైమెక్స్ క్రూడ్ బేరల్ ధర ఈ వార్త రాసే సమయం 10.35కు 8.35 శాతం నష్టంలో (2.68 డాలర్లు) 29.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఒక దశలో 28.52 డాలర్లనూ చూసింది. బ్రెంట్ బ్యారల్ ధర ఇదే సమయానికి 11.73 శాతం నష్టంతో 29.88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 29.55 డాలర్లనూ చూసింది. ఇక పసిడి విషయానికి వస్తే, ఔన్స్ (31.1గ్రా) ధర 5 డాలర్ల నష్టంతో 1,512 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ఈ యల్లో మెటల్ ధర 1,451 డాలర్లనూ చూడ్డం గమనార్హం. తాజా పరిస్థితుల నేపథ్యంలో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర దేశీయంగా రూ.40,000 లోపునకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్తరాసే సమయంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్–ఎంసీఎక్స్లో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.500కుపైగా నష్టంతో రూ.39,775 వద్ద ట్రేడవుతోంది. ఎస్బీఐ కార్డ్స్కు కరోనా సెగ ఎస్బీఐ అనుబంధ కంపెనీ, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేర్ల లిస్టింగ్పై కోవిడ్–19 వైరస్ తీవ్రంగానే ప్రభావం చూపించింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేర్ల లిస్టింగ్ కూడా పేలవంగానే జరిగింది. మరోవైపు కొన్ని కంపెనీలు తమ ఐపీఓలను వాయిదా వేశాయి. కాగా పార్క్ హోటల్స్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ, ఆమోదం తెలిపింది. 13 శాతం నష్టంతో లిస్టింగ్..... ఇష్యూ ధర, రూ.755తో పోల్చితే ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేర్ బీఎస్ఈలో 13 శాతం నష్టంతో రూ.658 వద్ద లిస్టయింది. ఈ షేర్కు ఇదే ఇంట్రాడే కనిష్ట స్థాయి. ఇంట్రాడేలో ఇష్యూ ధర, రూ.755కు ఎగసినప్పటికీ, చివరకు 9.5 శాతం నష్టంతో రూ.683 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 41.6 లక్షలు, ఎన్ఎస్ఈలో 6.08 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.57,199 కోట్లకు చేరింది. ఈ నెలలోనే వచ్చిన ఈ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 22 రెట్లకు పైగా ఓవర్ సబ్స్క్రైబయింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.10.000 కోట్ల మేర నిధులు సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.308 కోట్ల నష్టం.. పేలవంగా లిస్టింగ్ 10% నష్టంతో రూ. 683 వద్ద ముగింపు ఐపీఓలో భాగంగా రిటైల్ ఇన్వెస్టర్లకు (రూ.2 లక్షల కంటే తక్కువగా ఇన్వెస్ట్ చేసేవాళ్లు) 4.27 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించారు. ఇష్యూ ధర రూ.755తో పోల్చితే ఈ షేర్ బీఎస్ఈలో రూ.72 నష్టంతో రూ.683 వద్ద ముగిసింది. ఒక్కో షేర్కు రూ.72 నష్టం పరంగా చూస్తే, మొత్తం రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.308 కోట్ల నష్టం వచ్చింది. అలాగే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు రూ.174 కోట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు రూ.132 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. మరిన్ని విశేషాలు.... సెన్సెక్స్లోని అన్ని షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 17.5 శాతం క్షీణించి రూ.663 వద్ద ముగిసింది సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. టాటా స్టీల్ 11 శాతం, హెచ్డీఎఫ్సీ 11 శాతం, యాక్సిస్ బ్యాంక్ 10 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 10% మేర నష్టపోయాయి. ► యస్ బ్యాంక్ తరహానే త్వరలోనే సంక్షోభంలోకి జారిపోగలదన్న భయాలు చెలరేగడంతో ఆర్బీఎల్ బ్యాంక్ 21% నష్టపోయి రూ.163 వద్ద ముగిసింది. ► వివిధ రాష్ట్రాల్లో సినిమా హాళ్లను ఈ నెల 31 వరకూ మూసేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడంతో మల్టీప్లెక్స్లను నిర్వహించే పీవీఆర్, ఐనాక్స్ లీజర్ షేర్లు 19 శాతం వరకూ నష్టపోయాయి. ► దాదాపు 500కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బంధన్ బ్యాంక్, పీవీఆర్, ఆర్బీఎల్ బ్యాంక్, యూపీఎల్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, ఇక్రా, పిరామల్ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఈ జాబితా కొన్ని. ► 600కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. అవెన్యూ సూపర్మార్ట్స్, ఐఆర్సీటీసీ, ఆఫిల్ ఇండియా, సువెన్ ఫార్మా, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, అదానీ గ్రీన్ ఎనర్జీ, డీహెచ్ఎఫ్ఎల్, వెల్స్పన్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► సెన్సెక్స్ 2,700 పాయింట్ల నష్టంలో హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్ల వాటాయే దాదాపు నాలుగో వంతుగా ఉంది. ఈ రెండు షేర్లు కలిసి 660 పాయింట్ల మేర సెన్సెక్స్కు పడగొట్టాయి. సెన్సెక్స్ను....రిలయన్స్ ఇండస్ట్రీస్ 276 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 271 పాయింట్లు, ఇన్ఫోసిస్ 211 పాయింట్ల మేర నష్టపరిచాయి. ఫెడ్ తగ్గించినా... నష్టకష్టాలే! అమెరికా ఫెడరల్ రిజర్వ్ అత్యవసర చర్యల్లో భాగంగా ఆదివారం ఫండ్స్ రేట్ను దాదాపు సున్నా స్థాయికి తగ్గించింది. ప్రస్తుతం ఈ ఫండ్స్ రేటు 0–0.25 శాతం రేంజ్లో ఉంది. ఈ రేట్ల ఆధారంగానే బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు రుణాలపై వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి. అంతే కాకుండా 70,000 కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఒక్క వారంలో ఫండ్స్ రేట్లను ఫెడరల్ రిజర్వ్ తగ్గించడం ఇది రెండోసారి. 2008లో సబ్ప్రైమ్ సంక్షోభం నెలకొన్నప్పుడు కూడా ఇలానే ఫెడ్ రేట్లను తగ్గించింది. సాధారణ పరిస్థితుల్లో ఫెడ్ రేట్లను తగ్గిస్తే, అదీ సున్నా స్థాయికి వస్తే, ప్రపంచ మార్కెట్లు లాభాలతో ఊగిపోయేవి. కానీ ఈ సారి పరిస్థితి రివర్స్ అయింది. ఆర్థిక సంక్షోభం అంచనాలను మించి ఉంటుందని, ఫెడ్ రేట్లను తగ్గించడం దీనికి సంకేతమన్న భావనతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. పార్క్ హోటల్స్ ఐపీఓ @ రూ.1,000 కోట్లు... పార్క్ హోటల్స్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా రూ.400 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు రూ.600 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయిస్తారు. మొత్తం మీద ఈ ఐపీఓ సైజు రూ.1,000 కోట్లు. ఈ కంపెనీ హైదరాబాద్, విశాఖపట్టణం బెంగళూరు, చెన్నై, కోల్కతా, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, జైపూర్, జోధ్పూర్, కోయంబత్తూర్ తదితర నగరాల్లో ద పార్క్ బ్రాండ్ హోటళ్లను నిర్వహిస్తోంది. ఐపీఓలు వాయిదా...: కోవిడ్–19 వైరస్ ధాటికి స్టాక్ మార్కెట్ విలవిలలాడుతుండటంతో పలు కంపెనీలు తమ ఐపీఓలను వాయిదా వేశాయి. ఈ నెల 4నే మొదలైనా, ఐపీఓను ఈ నెల 16 వరకూ పొడిగించినప్పటికీ, ఇన్వెస్టర్ల నుంచి సరైన స్పందన లేకపోవడంతో అంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ కంపెనీ తన ఐపీఓను ఉపసంహరించుకుంది. కాగా బర్గర్ కింగ్ ఇండియా కంపెనీ తన ఐపీఓను వాయిదా వేసుకుందని సమాచారం. ఈ నెలాఖరులో ఐపీఓకు వచ్చి రూ.400 కోట్లు సమీకరించాలనేది ఈ కంపెనీ ప్రణాళిక. జీడీపీకి కరోనా కాటు! వృద్ధి 50 బేసిస్ పాయింట్లు తగ్గుతుందన్న ఆందోళన ముంబై: కరోనా వైరస్ మహమ్మారి ప్రతాపం మరింత వ్యవధిపాటు కొనసాగితే 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు అర శాతం వరకు తగ్గుతుందన్న ఆందోళన దేశీయ కంపెనీల నుంచి వ్యక్తమైంది. అంతేకాదు, ఈ వైరస్ ప్రభావం దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యలోటు మరింత పెరిగిపోవడమే కాకుండా బ్యాంకులకు మొండి బాకీలు (ఎన్పీఏలు) మరింత జోడవుతాయని పేర్కొన్నాయి. కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ఉండొచ్చన్న దానిపై రేటింగ్ ఏజెన్సీ కేర్ 150 మంది సీఈవోలు, సీఎఫ్వోలు, ఇన్వెస్టర్లు, అనలిస్టులు, ఇతర భాగస్వాముల నుంచి అభిప్రాయాలను సేకరించగా ఈ అంశాలు వెల్లడయ్యాయి. వైరస్ ఎక్కువ కాలం పాటు ఉంటే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం గణనీయంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. జీడీపీ అరశాతం వరకు తగ్గొచ్చని సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు అభిప్రాయపడితే, 22 శాతం మంది అయితే ఒక శాతం వరకు తగ్గిపోవచ్చని అంచనా వేశారు. రేట్ల కోతతో కీడే ఎక్కువ వివిధ దేశాల కేంద్ర బ్యాంక్లు రేట్లను తగ్గించడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతోంది. కోవిడ్ వైరస్ ఆర్థికంగా చూపించే ప్రభావం అంచనాల కంటే అధికంగానే ఉండగలదన్న సంకేతాలను కేంద్ర బ్యాంక్ల రేట్ల తగ్గింపు సూచిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. –వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ పతనం కొనసాగే అవకాశాలే అధికం దేశీయంగా కోవిడ్–19 వైరస్ మెల్లమెల్లగా విస్తరిస్తోంది. ఇది ఎక్కడ దాకా చేరుతుందో అంతూ, దరీ తెలియడం లేదు. రానున్న రోజుల్లో ఈ పతనం కొనసాగే అవకాశాలే అధికంగా ఉన్నాయి. –అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి
అభిషేక్ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్మన్ .. ఫొటోలు వైరల్
ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్
SRH: సన్రైజర్స్ కెప్టెన్ చేసిన పనికి అభిమానులు ఫిదా
జనసేన డీలా.. పిఠాపురంలోనూ పవన్ గెలుపుపై అనుమానాలే....
డర్టీ ఫెలో ట్రైలర్ రిలీజ్
ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు
సూర్య 'కంగువా'.. ఆ సీన్ కోసం ఏకంగా పదివేలమందిని!
ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్ టీటీ ప్లేయర్!(ఫొటోలు)
షుగర్ వచ్చిందా? పరగడుపున మెంతి నీళ్లు ట్రై చేశారా?
తప్పక చదవండి
- ట్విటర్ రీ బ్రాండింగ్పై మస్క్ ట్వీట్
- ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
- వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
- ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
Advertisement