-
కొవ్వు పేరుకుపోయింది: బాబర్పై మండిపడ్డ హఫీజ్
When the fat levels Checked Skin fold of all of them was high: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత బ్యాటర్ బాబర్ ఆజం తీరును హెడ్కోచ్ మహ్మద్ హఫీజ్ విమర్శించాడు. మాజీ కోచ్ మిక్కీ ఆర్థర్తో కలిసి జట్టును భ్రష్టుపట్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు క్రమశిక్షణ లేకుండా తయారు కావడానికి బాబర్, మిక్కీ కారణమని హఫీజ్ మండిపడ్డాడు. వరల్డ్కప్లో వైఫల్యం కాగా మిక్కీ ఆర్థర్ మార్గదర్శనంలో బాబర్ ఆజం కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు వన్డే వరల్డ్కప్-2023లో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్లో కనీసం సెమీస్ కూడా చేరుకుండానే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. హెడ్కోచ్ మిక్కీ ఆర్థర్పై వేటు పడింది. ఈ క్రమంలో మహ్మద్ హఫీజ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డైరెక్టర్గా నియమితుడయ్యాడు. అంతేకాదు హెడ్కోచ్ బాధ్యతలనూ తానే చేపట్టాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో చేదు అనుభవం ఇక బాబర్ స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది సారథులుగా ఎంపికయ్యారు. ఈ క్రమంలో కొత్త నాయకత్వంలో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైన పాక్.. న్యూజిలాండ్ టూర్లో టీ20 సిరీస్ను కోల్పోయింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో తనకు ఓ విచిత్రమైన విషయం తెలిసిందంటూ మహ్మద్ హఫీజ్ తాజాగా వెల్లడించాడు. బాబర్ ఆజం, మిక్కీ ఆర్థర్ కలిసి ఫిట్నెస్ విలువలు గాలికొదిలేసిన తీరు తెలిసి ఆశ్చర్యపోయానన్నాడు. ఈ మేరకు.. ‘‘ఆస్ట్రేలియాకు వెళ్లినపుడు ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆటగాళ్లకు చెప్పాను. ట్రైనర్తో కూడా ఇదే మాట అన్నాడు. కానీ అప్పుడతడు నాకో షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఆర్నెళ్ల క్రితం అప్పటి కెప్టెన్, డైరెక్టర్.. ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్స్ చెక్ చేయొద్దని చెప్పారన్నాడు. వారి శరీరాల్లో కొవ్వు పేరుకుపోయింది ఆటగాళ్లను స్వేచ్ఛగా వదిలేయాలని వాళ్లిద్దరు తనను ఆదేశించారన్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్స్ చెక్ చేయిస్తే.. ఉండాల్సిన దాని కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ కొవ్వు వారి శరీరాల్లో పేరుకుపోయినట్లు తెలిసింది. చాలా మంది అన్ఫిట్గా ఉన్నారు. కొంతమంది కనీసం 2 కిలోమీటర్ల ట్రయల్ రన్ కూడా పూర్తిచేయలేకపోయారు. ఆర్నెళ్ల క్రితం వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని నేను తారుమారు చేశాను. ఫిట్గా లేకుంటే ఓడిపోతూనే ఉంటారని ఆటగాళ్లను హెచ్చరించాను’’ అని మహ్మద్ హఫీజ్ ‘ఏ’ స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు. కాగా ప్రస్తుతం పాక్ ప్రధాన ఆటగాళ్లంతా పాకిస్తాన్ సూపర్ లీగ్తో బిజీగా ఉన్నారు. చదవండి: Ind Vs Eng 4th Test: బుమ్రాను రిలీజ్ చేసిన బీసీసీఐ.. అతడికి గ్రీన్ సిగ్నల్! -
ఉత్కంఠ పోరులో విజయం.. సెమీ ఫైనల్కు చేరిన పాకిస్తాన్
అండర్ 19 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బెనోని వేదికగా బంగ్లాదేశ్తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో 5 పరుగుల తేడాతో విజయం సాధించిన పాక్.. తమ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు 35.5 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. పాక్ విజయంలో పేసర్ ఉబైడ్ షా కీలక పాత్ర పోషించాడు. ఉబైడ్ షా 5 వికెట్లు పడగొట్టి పాక్ను సెమీస్కు చేర్చాడు. ఉబైడ్ షాతో పాటు అలీ రజా 3 వికెట్లు, జీషన్ ఒక్క వికెట్ సాధించాడు. బంగ్లా బ్యాటర్లలో మహ్మద్ షిహాబ్ జేమ్స్(26) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కూడా 40.4 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. ఆల్రౌండర్ అరాఫత్ మిన్హాస్(34) రాణించడంతో నామమాత్రపు స్కోరైనా పాక్ సాధించగల్గింది. బంగ్లా బౌలర్లలో షేక్ పావెజ్ జిబోన్, రోహనత్ డౌల్లా బోర్సన్ తలా 4 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మెగా టోర్నీ సెకెండ్ సెమీఫైనల్లో ఫిబ్రవరి 8న ఆస్ట్రేలియాతో పాక్ తలపడనుంది. అదే విధంగా తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, భారత్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. -
వార్నర్ ‘గ్రేట్’ కాదు.. ఆ జాబితాలో వాళ్లు ముగ్గురే: ఆసీస్ మాజీ కోచ్
ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి ఆ జట్టు మాజీ కోచ్ జాన్ బుకానన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వార్నర్ మెరుగైన బ్యాటరేనని.. అయితే, అంత గొప్ప ఆటగాడేమీ కాదని అన్నాడు. ఆసీస్ గ్రేట్ అన్న జాబితాలో అతడికి చోటు దక్కే ప్రసక్తే లేదన్నాడు. కాగా ఆసీస్ ఓపెనర్గా ఎన్నో రికార్డులు సాధించిన వార్నర్ ఇటీవలే టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. పాకిస్తాన్తో జరిగిన సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో సంప్రదాయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. వన్డేల నుంచి కూడా తప్పుకొంటున్నట్లు ప్రకటించిన అతడు ఇకపై టీ20లకు మాత్రమే పరిమితం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతున్న సందర్భంగా ఆసీస్ మాజీ కోచ్ జాన్ బుకానన్కు వార్నర్ను ‘గ్రేట్’ అనొచ్చా అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘లేదు.. నేనైతే అలా అనుకోవడం లేదు. తన కెరీర్ ఆసాంతం అతడు అద్భుతంగా ఆడాడు. వందకు పైగా టెస్టులు ఆడిన అనుభవం అతడికి ఉంది. 8 వేలకు పైగా పరుగులు సాధించాడు. 160కి పైగా వన్డేలు, 100 వరకు టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో అతడి బ్యాటింగ్ సగటు కూడా బాగానే ఉంది. స్ట్రైక్ రేటు కూడా బాగుంది. ప్రదర్శనపరంగా అతడు మెరుగైన స్థానంలో ఉన్నాడు. అయితే, ఒక క్రీడలో దిగ్గజాల గురించి చెప్పాల్సి వచ్చినపుడు నా వరకైతే ఆసీస్ తరఫున డాన్ బ్రాడ్మన్, గ్లెన్ మెగ్రాత్, షేన్ వార్న్ వంటి వాళ్లే గుర్తుకువస్తారు. నా దృష్టిలో వాళ్లు ముగ్గురే గ్రేట్ ప్లేయర్లు. మిగతా వాళ్లలో చాలా మంది వీరికి చేరువగా వచ్చిన గ్రేట్ కేటగిరీలో చోటు సంపాదించలేరు. వార్నర్ కూడా అంతే’’ అని బుకానన్ చెప్పుకొచ్చాడు. కాగా తన కెరీర్లో ఆఖరి సిరీస్లో వార్నర్ శతకం బాదాడు. ఇక పాక్తో జరిగిన ఆ సిరీస్లో ఆసీస్ 3-0తో వైట్వాష్ చేసింది. సొంతగడ్డపై పాకిస్తాన్పై వరుసగా పదిహేడవ విజయం నమోదు చేసింది. -
క్యూరేటర్ నుంచి ఆసీస్ స్పిన్ లెజెండ్గా.. ఏకంగా షేన్ వార్న్ సరసన!
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ మైదానం.. తర్వాతి మ్యాచ్ కోసం క్యురేటర్ల బృందం పిచ్ తయారు చేస్తోంది. అందులో ఒక 24 ఏళ్ల కుర్రాడు అమితోత్సాహంతో అందరికంటే వేగంగా చకచకా పని పూర్తి చేస్తున్నాడు. ముఖ్యంగా పిచ్ చివర్లో స్టంప్స్ వద్ద స్పిన్ బంతి టర్నింగ్కు సంబంధించి సహచరులకు ప్రత్యేక సూచనలు ఇస్తూ వాటరింగ్ చేయిస్తున్నాడు. అతను కొన్నాళ్ల క్రితమే ఆ మైదానానికి బదిలీపై వచ్చాడు. అంతకు ముందు నాలుగేళ్ల పాటు కాన్బెర్రాలోని మనుకా ఓవల్ గ్రౌండ్లోనూ ఇదే పని చేశాడు. పిచ్ తయారీపై బేసిక్స్ నేర్చుకొని అక్కడే పూర్తి స్థాయిలో శిక్షణ కూడా పొందాడు. అయితే క్యురేటర్గా అనుభవం మాత్రమే కాదు ఒక ఆటగాడి తరహాలో అతనికి ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ అడిలైడ్లోని కోచ్లను ఆకర్షించింది. అనంతరం జట్లు ప్రాక్టీస్కు సిద్ధమైనప్పుడు నెట్ బౌలర్లు తక్కువ పడటంతో నువ్వు బౌలింగ్ చేయగలవా అని కోచ్ డారెన్ బెరీ ఈ కుర్రాడిని అడిగాడు. కచ్చితంగా అని బదులిచ్చిన అతను వెంటనే బంతితో బరిలోకి దిగిపోయాడు. అతని స్పిన్ బౌలింగ్ శైలి, టర్నింగ్ రాబడుతున్న తీరు కోచ్ను అమితాశ్చర్యానికి గురి చేశాయి. అతని వివరాలను తెలుసుకోగా.. తాను అప్పటికే చాలా చోట్ల క్రికెట్ ఆడానని, అయితే అవేవీ గుర్తింపు పొందిన స్థాయిలో కాదని ఆ బౌలర్ చెప్పాడు. దాంతో నీకు తగిన అవకాశం కల్పిస్తానన్న కోచ్ బెరీ మాట తప్పలేదు. అతని ప్రతిభ గురించి అందరికీ చెప్పి అడిలైడ్ టి20 టీమ్ రెడ్బ్యాక్స్లోకి ఎంపిక చేశాడు. అంతే.. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తొలి అవకాశాన్ని అద్భుతంగా వాడుకొని సత్తా చాటడంతో వరుసగా మ్యాచ్లు దక్కాయి. ఆపై ఫార్మాట్ మారి ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడే అవకాశమూ లభించింది. దానిని అందిపుచ్చుకొని ఆ బౌలర్ ఉవ్వెత్తున ఎగశాడు. ఏడు నెలల వ్యవధిలోనే జాతీయ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత పుష్కరకాలంగా ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్న ఆ బౌలర్ పేరే నాథన్ లయన్. క్యురేటర్గా మొదలై టెస్టుల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందడం వరకు ఆఫ్స్పిన్నర్ లయన్ సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకం. స్టూవర్ట్ మెక్గిల్, మైకేల్ బీర్, డోహర్తి, క్రేజా, మెక్గెయిన్, హారిట్జ్, స్టీవ్ స్మిత్, హాగ్, హాలండ్, వైట్, కాసన్.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 11 మందితో కూడిన జట్టు ఇది. ఆల్టైమ్ గ్రేట్ స్పిన్నర్ షేన్ వార్న్ రిటైర్మెంట్ తర్వాత ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అన్వేషణ సుదీర్ఘంగా సాగింది. ఆ ప్రయత్నంలో భాగంగా వారు ప్రయత్నించిన 11 మంది స్పిన్నర్ల పేర్లు ఇవి. కానీ ఇందులో ఏ ఒక్కరూ ప్రతిభపరంగా వార్న్ దరిదాపుల్లోకి రావడం అటుంచి.. కనీసం పోలికకు కూడా అర్హత లేని స్థాయి వారిది. అందుకే ఎన్ని అవకాశాలు కల్పించినా ప్రతిభను చూపించలేక అతి తక్కువ సమయంలోనే కనుమరుగైపోయారు. వార్న్ స్థాయిలో కాకపోయినా, కనీసం ఉపఖండంలో సిరీస్లు ఆడేందుకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులకు తగినట్లుగా కొంతయినా ప్రభావం చూపించేవాడు ఉంటే చాలని ఆసీస్ క్రికెట్ భావించినా.. అది కూడా సాధ్యం కాలేదు. దాంతో ఇక స్పిన్నర్ల వేటను మానేసి ఆస్ట్రేలియా జట్టు ప్రపంచవ్యాప్తంగా ఏ మైదానంలో ఆడినా తమ పేసర్ల బలాన్ని నమ్ముకుంటూ బరిలోకి దిగుతూ వచ్చింది. అలాంటి సమయంలో నాథన్ లయన్ వచ్చాడు. ఎలాంటి గందరగోళం లేకుండా సంప్రదాయ స్పిన్ బౌలింగ్, క్లాసికల్గా బంతిని ఫ్లయిట్ చేయడానికి ఇష్టపడే స్పిన్నర్గా లయన్ వెలుగులోకి వచ్చాడు. ఇలాంటి స్పిన్నర్లు సాధారణంగా ఉపఖండంలోనే గుర్తింపు దక్కించుకుంటారు. కానీ ఆసీస్కు లయన్ రూపంలో అలాంటి ఆటగాడు దక్కాడు. అందుకే వారు అతడిని కళ్లకు అద్దుకొని జట్టులోకి తీసుకున్నాడు. లయన్ కూడా తన ఎంపికకు న్యాయం చేస్తూ వారిని ఎప్పుడూ నిరాశపరచలేదు. అటు ఉపఖండం పిచ్లపై కూడా సత్తా చాటడంతో పాటు స్పిన్ను ఏమాత్రం అనుకూలించని ఆసీస్ మైదానాల్లోనూ ప్రత్యర్థులపై చెలరేగి తాను లేకుండా ఆసీస్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడలేని స్థాయికి చేరుకున్నాడు. వార్న్కు సరైన వారసుడినని నిరూపించుకుంటూ 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత ఏకంగా 500 టెస్టు వికెట్లతో ఇప్పుడు శిఖరాన నిలిచాడు లయన్. అలా మొదలైంది.. 2011, సెప్టెంబర్ 1.. గాలేలో శ్రీలంకతో తొలి టెస్టు. లయన్ తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్కు దిగాడు. రౌండ్ ద వికెట్గా వచ్చి బంతిని సంధించాడు. గ్రిప్, ఫ్లయిట్, టర్న్, బౌన్స్.. అనూహ్యంగా వచ్చిన బంతిని ఆడలేక లంక దిగ్గజం సంగక్కర గందరగోళానికి గురయ్యాడు. బ్యాట్ను తాకిన బంతి స్లిప్స్లో కెప్టెన్ క్లార్క్ చేతుల్లో పడింది. అంతే.. అటు లయన్తో పాటు ఇటు ఆసీస్ బృందంలో సంబరాలు. టెస్టు క్రికెట్లో వేసిన తొలి బంతికే వికెట్ తీసిన అత్యంత అరుదైన జాబితాలో లయన్కు చోటు లభించింది. ఈ మ్యాచ్లో ఆరు వికెట్లతో అతనికి ఘనారంభం దొరికింది. అద్భుతంగా మొదలైన కెరీర్ ఆపై మరిన్ని ఘనతల దిశగా సాగింది. నాలుగేళ్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా తరఫున వికెట్లపరంగా అత్యుత్తమ ఆఫ్స్పిన్నర్గా లయన్ గుర్తింపు తెచ్చేసుకున్నాడు. యాషెస్తో మేలిమలుపు.. ఆటలో ఎంత సత్తా ఉన్నా, అద్భుతాలు చేసే నైపుణ్యం ఉన్నా ఆటగాళ్లకు తగిన అవకాశం, సరైన వేదిక ఎంతో ముఖ్యం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లకు సంబంధించి యాషెస్ సిరీస్ అలాంటిదే. ఈ చిరకాల ప్రత్యర్థుల జట్లలో ఎంతో మంది ఆటగాళ్లను యాషెస్ సిరీస్ హీరోలను చేస్తే, మరెంతో మందిని జీరోలను చేస్తుంది. వరుస అవకాశాలు దక్కించుకుంటున్న క్రమంలో 2011 యాషెస్ సిరీస్ కోసం లయన్కు చాన్స్ లభించింది. ఎంతో ఉత్సాహంతో తన టాలెంట్ చూపించేందుకు లయన్ సిద్ధం కాగా, వేర్వేరు పరిస్థితులను కారణాలుగా చూపుతూ టీమ్ మేనేజ్మెంట్ తొలి రెండు టెస్టుల్లో అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది. అయితే తర్వాతి మూడు టెస్టుల్లో అవకాశం సాధించి కీలక దశలో తొమ్మిది వికెట్లు పడగొట్టిన లయన్ రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ను కట్టడి చేసి ఆసీస్ను ఓటమి బారి నుంచి తప్పించాడు. ఆ తర్వాత కొన్ని నెలలకే జరిగిన రిటర్న్ యాషెస్ సిరీస్తో లయన్ విలువేమిటో ఆసీస్ మేనేజ్మెంట్కు బాగా తెలిసొచ్చింది. సొంత గడ్డపై 19 వికెట్లతో సత్తా చాటిన లయన్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఆ వెంటనే దక్షిణాఫ్రికాకు వెళ్లి అక్కడా తన స్పిన్ పదును చూపించడంలో అతను సఫలమయ్యాడు. ఆ తర్వాత 2022లో గాయం కారణంగా ఒక మ్యాచ్ దూరమయ్యే వరకు లయన్ లేకుండా ఆస్ట్రేలియా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదంటే అతిశయోక్తి కాదు. ఆసీస్ దిగ్గజంగా ఎదిగి.. షేన్వార్న్ తర్వాత ఆస్ట్రేలియా అత్యుత్తమ స్పిన్నర్గా లయన్కు ఎప్పుడో గుర్తింపు దక్కింది. స్పిన్నర్లకు వికెట్లే దక్కవని భావించే ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజీలండ్లాంటి దేశాల్లో కూడా అతను పెద్ద సంఖ్యలో వికెట్లు పడగొట్టాడు. కానీ ఏదో అసంతృప్తి. అతడిని ప్రత్యేకంగా నిలబెట్టే మరి కొన్ని ప్రదర్శనలు కావాలి. ఒక స్పిన్నర్ గుర్తింపు దక్కించుకునేందుకు భారత్కంటే సరైన వేదిక ఏముంటుంది. భారత గడ్డపై సత్తా చాటి స్పిన్కు అనుకూలించే మైదానాలే అయినా భారతీయేతర స్పిన్నర్లు ఎవరూ ఇక్కడ తమదైన ముద్ర వేయలేకపోయారు. ఇక్కడా రాణిస్తే అతని కీర్తి రెట్టింపవుతుంది. లయన్ సరిగ్గా అదే చేసి చూపించాడు. భారత గడ్డపై ఆడిన 11 టెస్టుల్లో కేవలం 27.35 సగటుతో 56 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు సాధించిన విదేశీ బౌలర్గా నిలిచాడు. అతని కెరీర్ సగటు (30.85) కంటే ఇది తక్కువ కావడం విశేషం. షేన్ వార్న్ సరసన లయన్ కెరీర్లో మూడు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు (8/50, 8/64, 7/94) భారత దేశంలోనే వచ్చాయి. లయన్ సాధించిన ఈ తొలి 8 వికెట్ల ప్రదర్శనకు బెంగళూరు వేదికైంది. సొంత గడ్డపై కంటే విదేశాల్లోనే ఎక్కువ వికెట్లు (258) సాధించిన అరుదైన బౌలర్ల జాబితాలో లయన్ కూడా ఉన్నాడు. కాగా స్వదేశంలో ఇటీవల పాకిస్తాన్ మూడో టెస్టు(2024) సందర్భంగా 250 వికెట్ల మైలురాయి అందుకుని షేన్ వార్న్ సరసన నిలిచాడు లయన్. ఆసీస్ ఓడిన మ్యాచ్లలో తీసిన వికెట్లకంటే (138) ఆ జట్టు గెలిచిన మ్యాచ్లలో అతను పడగొట్టిన వికెట్లు (301) అతని విలువను చూపిస్తూ దిగ్గజ స్థాయిని అందించాయి. ఆస్ట్రేలియా జట్టు అవసరాలు, కూర్పు కారణంగా లయన్ వన్డే కెరీర్ 29 మ్యాచ్లకే పరిమితం అయినా.. టెస్టుల్లో అతని కీర్తి శాశ్వతం. 36 ఏళ్ల వయసులోనూ అద్భుత ఫామ్తో చెలరేగుతున్న లయన్ టెస్టు క్రికెట్లో మున్ముందు మరిన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయం. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్కు ఆస్ట్రేలియా.. మరి భారత్?
సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 56.25 శాతం పాయింట్లతో కంగారూ జట్టు.. నాలుగో స్ధానం నుంచి టాప్ ప్లేస్కు ఎగబాకింది. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో ఇప్పటి వరకు 8 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా.. ఐదింట విజయం, ఓ మ్యాచ్ను డ్రాగా ముగించింది. కాగా ఇప్పటివరకు టాప్ ప్లేస్లో ఉన్న భారత్( 54.16 శాతంతో) రెండో స్ధానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టు తొలి స్ధానానికి చేరుకుంది. అయితే భారత్ టాప్ ప్లేస్ను 24 గంటల వ్యవధిలోనే కోల్పోయింది. ఇక భారత్ తర్వాతి స్ధానాల్లో బాకింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్(50.0), బంగ్లాదేశ్(50.0) పాకిస్తాన్(45.83) కొనసాగుతున్నాయి. చదవండి: PAK vs AUS: కెరీర్లో చివరి మ్యాచ్.. కన్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్నర్! వీడియో వైరల్ -
కెరీర్లో చివరి మ్యాచ్.. కన్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్నర్! వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన 13 ఏళ్ల సుదీర్ఘ టెస్టు కెరీర్కు ముగింపు పలికాడు. సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్టు అనంతరం టెస్టు క్రికెట్ నుంచి వార్నర్ తప్పుకున్నాడు. తన ఫేర్వెల్ సిరీస్ తొలి మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన వార్నర్.. తన కెరీర్ చివరి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో (75 బంతుల్లో 7 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీ సాధించాడు. ఆసీస్ విజయానికి చేరువైన సమయంలో పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ బౌలింగ్లో డేవిడ్ వార్నర్ ఎల్బీగా వెనుదిరాడు. మైదానాన్ని వీడి వెళ్తున్న క్రమంలో పాకిస్తాన్ ఆటగాళ్లు వార్నర్ను అభినందించారు. అదే విధంగా స్టేడియంలోని ప్రేక్షకులు సైతం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన వార్నర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వార్నర్ కన్నీరు పెట్టుకున్నాడు. "విజయంతో నా కెరీర్ను ముగించాలనుకున్నాను. నా కల నిజమైంది. మేము 3-0తో విజయం సాధించాము. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు గత 2 ఏళ్ల నుంచి అద్బుతమైన క్రికెట్ ఆడుతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజయం, యాషెస్ సిరీస్ డ్రా, ప్రపంచ కప్ విజయాల్లో భాగమైనందుకు గర్వపడుతున్నాను. కొంత మంది లెజెండరీ క్రికెటర్లతో కలిసి ఆస్ట్రేలియా జట్టు తరపున ఆడే అవకాశం దక్కినందుకు అదృష్టంగా భావిస్తున్నానని"వార్నర్ పేర్కొన్నాడు. తన టెస్టు కెరీర్లో 111 మ్యాచ్లు ఆడిన వార్నర్.. 44. 59 సగటుతో 8695 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 26 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: Ranji Trophy: చరిత్ర సృష్టించిన రాహుల్.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ! రెండో ఆటగాడిగా David Warner got emotional and crying when he was giving his interview. An emotional moment for him🫶 pic.twitter.com/BhXAsl2PQj — CricGuru (@Cse1Das) January 6, 2024 -
ముగిసిన వార్నర్ శకం.. ఎన్నో అద్బుతాలు! అదొక్కటే మాయని మచ్చ?
ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్లో ఓ శకం ముగిసింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు విడ్కోలు పలికాడు. పాకిస్తాన్తో మూడో టెస్టు అనంతరం రెడ్బాల్ క్రికెట్ నుంచి డేవిడ్ భాయ్ తప్పుకున్నాడు. నాలుగో రోజు ఆట సందర్భంగా వార్నర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. పాకిస్తాన్ ఆటగాళ్ల సైతం వార్నర్కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఇక మూడో టెస్టులో పాకిస్తాన్ను 8 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. ఈ విజయంతో వార్నర్కు ఆసీస్ ఘనమైన విడ్కోలు పలికింది. తన చివరి టెస్టు ఇన్నింగ్స్ను వార్నర్ హాఫ్ సెంచరీతో ముగించాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో 74 బంతులు ఎదుర్కొన్న వార్నర్.. 7 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. కివీస్తో మొదలెట్టి పాక్తో ముగింపు.. 2011లో న్యూజిలాండ్పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన వార్నర్.. 13 ఏళ్ల పాటు తన సేవలను ఆస్ట్రేలియా క్రికెట్కు అందించాడు. తన ఈ సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అద్భుతమైన విజయాల్లో డేవిడ్ భాయ్ భాగమయ్యాడు. ఓపెనర్గా ఎన్నో చిర్మసరణీయ విజయాలను కంగరూలకు అందించాడు. ఫార్మాట్ ఏదైనా వార్నర్ క్రీజులో ఉంటే ప్రత్యర్ధి బౌలర్లకు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అటువంటి విధ్వంసకర ఆటగాడు తప్పుకోవడం నిజంగా క్రికెట్ ఆస్ట్రేలియాకు తీరని లోటు అనే చెప్పాలి. తన టెస్టు కెరీర్లో 111 మ్యాచ్లు ఆడిన వార్నర్.. 44. 59 సగటుతో 8695 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 26 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. మాయని మచ్చలా.. అయితే వార్నర్కు తన అద్భుత కెరీర్లో బాల్టాంపరింగ్ వివాదం మాత్రం ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది. ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు 2018 మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. కేప్టౌన్లో టెస్టు మ్యాచ్ సమయంలో ఆసీస్ ఆటగాడు కామెరూన్ బ్యాన్క్రాఫ్ట్ సాండ్పేపర్తో బంతిని రుద్దుతూ కెమెరా కంట పడ్డాడు. బాల్ ట్యాంపరింగ్ చేసి బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన అతడిపై విచారణ జరపగా.. అందులో వార్నర్ హస్తం ఉందని తేలింది. దాంతో వార్నర్పై క్రికెట్ ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు నిషేదం విధించింది. తర్వాత అతడిపై బ్యాన్ ఎత్తివేసినప్పటికీ.. ఆ వివాదం ఓ పీడకలలా మిగిలిపోయింది. కాగా వార్నర్ టెస్టులతో పాటు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై టీ20ల్లో మాత్రమే వార్నర్ ఆడనున్నాడు. చదవండి: AUS vs PAK 3rd Test: పాకిస్తాన్ను చిత్తు చేసిన ఆసీస్.. సిరీస్ క్లీన్స్వీప్ One final time.#AUSvPAK pic.twitter.com/gbD9Fv28h8 — cricket.com.au (@cricketcomau) January 6, 2024 -
పాకిస్తాన్ను చిత్తు చేసిన ఆసీస్.. సిరీస్ క్లీన్స్వీప్
సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో ఆసీస్ క్లీన్స్వీప్ చేసింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తన టెస్టు కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన డేవిడ్ వార్నర్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో 74 బంతులు ఎదుర్కొన్న వార్నర్.. 7 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్నస్ లబుషేన్(62) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక 68/7 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్లో 115 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో లభించిన 14 పరుగుల అధిక్యాన్ని కలుపుకుని ఆసీస్ ముందు 130 పరుగుల లక్ష్యాన్ని పాక్ నిలిపింది. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్ 4 వికెట్లతో పాక్ను దెబ్బతీయగా.. లయోన్ 3 వికెట్లు, స్టార్క్, కమ్మిన్స్, హెడ్ తలా వికెట్ సాధించారు. కాగా అంతకముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 299 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో లబుషేన్(60) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. లబుషేన్తో పాటు మిచెల్ మార్ష్(54), ఖావాజా(47) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో అమీర్ జమీల్ 6 వికెట్లతో సత్తాచాటాడు. కాగా పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 313 పరుగులకు ఆలౌటైంది. -
ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ సరసన చేసిన పాక్ సంచలన ఆల్రౌండర్
ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్తాన్కు ఓ ఆణిముత్యం లభించింది. ఈ పర్యటనలో తొలి టెస్ట్తో సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన 27 ఏళ్ల పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆమిర్ జమాల్.. ఆసీస్ గడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీస్తున్నాడు. పెర్త్లో జరిగిన తొలి టెస్ట్లో 6 వికెట్ల ప్రదర్శనతో (మొత్తంగా 7 వికెట్లు, 10 పరుగులు) చెలరేగిన జమాల్.. ఆ తర్వాత మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్ట్లో 5 వికెట్లు, 33 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న జమాల్.. తొలి ఇన్నింగ్స్లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మెరుపు అర్ధ సెంచరీ (97 బంతుల్లో 82; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించిన జమాల్.. ఆతర్వాత బౌలింగ్లోనూ విజృంభించి (6/69) ఆసీస్ బ్యాటింగ్ లైనప్ను తునాతునకలు చేశాడు. జమాల్ ప్రదర్శన కారణంగా పాక్ ఈ పర్యటనలో తొలిసారి మ్యాచ్ గెలిచే అవకాశం దక్కించుకుంది. అయితే పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ 68 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి జమాల్ అందించిన సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఈ ఇన్నింగ్స్లో జమాల్ (0) ఇంకా క్రీజ్లోనే ఉండటంతో పాక్ అతనిపై భారీ అంచనాలే పెట్టుకుంది. అతనికి జతగా రిజ్వాన్ (6) క్రీజ్లో ఉన్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో జమాల్ సహా రిజ్వాన్ (88), అఘా సల్మాన్ (53) రాణించడంతో పాక్ 313 పరుగులు చేసింది. అనంతరం జమాల్ ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 299 పరుగులకు ఆలౌటైంది. ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ సరసన చేసిన పాక్ సంచలన ఆల్రౌండర్ పాక్ సంచలన ఆల్రౌండర్ ఆమిర్ జమాల్.. దిగ్గజ ఆల్రౌండర్లైన ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ సరసన చేరాడు. ఆస్ట్రేలియా గడ్డపై మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 125 అంత కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 15 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన పర్యాటక జట్టు ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో బోథమ్, వసీం అక్రమ్ మాత్రమే ఈ ఫీట్ను సాధించారు. స్కోర్ వివరాలు.. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: 313 ఆలౌట్ (రిజ్వాన్ 88, జమాల్ 82, కమిన్స్ 5/61) ఆస్ట్రేలియా తొల ఇన్నింగ్స్: 299 ఆలౌట్ (లబూషేన్ 60, మిచెల్ మార్ష్ 54, జమాల్ 6/69) పాకిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్: 68/7 (సైమ్ అయూబ్ 33, రిజ్వాన్ 6 నాటౌట్, జమాల్ 0 నాటౌట్, హాజిల్వుడ్ 4/9) మూడో రోజు ఆట ముగిసే సమయానికి 82 పరుగుల ఆధిక్యంలో పాక్ మూడు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో ఆసీస్ తొలి రెండు మ్యాచ్లను నెగ్గి ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. -
టీమిండియాతో పోటీపడిన పాక్.. భారత్ 0/6.. పాక్ 9/6
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా తమ చివరి ఆరు వికెట్లు ఒకే స్కోర్ వద్ద (153) కోల్పోయిన ఘటన మరువక ముందే.. దాయాది పాకిస్తాన్ దాదాపుగా ఇలాంటి సీన్నే మరోసారి రిపీట్ చేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో పాక్ తొమ్మిది పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి, ఏ విషయంలోనైనా వారు భారత్నే ఫాలో అవుతారనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్ల పుణ్యమా అని తొలి ఇన్నింగ్స్లో 313 పరుగులు చేసింది. ఆరో నంబర్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ (88), ఏడో నంబర్ ఆటగాడు అఘా సల్మాన్ (53), తొమ్మిదో నంబర్ ప్లేయర్ ఆమిర్ జమాల్ (82) అర్ధసెంచరీలు చేసి పాక్ను ఆదుకున్నారు. అనంతరం ఆమిర్ జమాల్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో (6/69) తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ను 299 పరుగులకే పరిమితం చేసి, ప్రస్తుత సిరీస్లో పాక్కు తొలి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. అయితే పాక్ బ్యాటర్లు ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. సెకెండ్ ఇన్నింగ్స్లో 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన పాక్.. ఆతర్వాత తొమ్మిది పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి మ్యాచ్పై పట్టు కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 67/7గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు కేవలం 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ ఈ మ్యాచ్ను కాపాడుకోవడం చాలా కష్టం. సెకెండ్ ఇన్నింగ్స్లో హాజిల్వుడ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో (5-2-9-4) పాక్ను కష్టాల ఊబిలోకి నెట్టాడు. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లను గెలిచిన ఆసీస్ ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పాక్ ఈ మ్యాచ్ కూడా ఓడితే ఆసీస్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. -
ఆసీస్తో మూడో టెస్టు.. 68 పరుగులకే 7 వికెట్లు! పీకల్లోతు కష్టాల్లో పాక్
సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్.. పాకిస్తాన్కు చుక్కలు చూపించాడు. హాజిల్వుడ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి పాక్ను కోలుకోలేని దెబ్బతీశాడు 14 పరుగుల అధిక్యంతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన పాకిస్తాన్.. కేవలం 68 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ రిజ్వాన్(6), అమీర్ జమాల్(0) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ 4 వికెట్లు పడగొట్టగా.. హెడ్, లయోన్, స్టార్క్ తలా వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో లభించిన అధిక్యంతో కలుపుకుని 82 పరుగుల ముందుంజలో పాక్ ఉంది. అంతకుముందు 116/2 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 299 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో లబుషేన్(60) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. లబుషేన్తో పాటు మిచెల్ మార్ష్(54), ఖావాజా(47) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో అమీర్ జమీల్ 6 వికెట్లతో సత్తాచాటాడు. కాగా పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 313 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: Aus Vs Pak: జారిపడ్డ పాక్ ఫీల్డర్!.. 5 పరుగుల పెనాల్టీ లేదెందుకు? వీడియో -
క్యాప్తో బంతిని ఆపాడు!?.. పాక్కు 5 పరుగుల పెనాల్టీ లేదెందుకు?
Australia vs Pakistan, 3rd Test- Day 3: అరంగేట్ర టెస్టుతోనే పాకిస్తాన్ యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ పేరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే, అద్భుత బ్యాటింగ్తో అతడు ట్రెండింగ్లోకి వచ్చాడనుకుంటే పొరపాటేనండోయ్! మరి హాట్టాపిక్లా మారడానికి అంత ‘గొప్ప’గా ఈ యంగ్ క్రికెటర్ ఏం చేశాడు?! ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల సిరీస్ను 0-2తో కోల్పోయిన పాకిస్తాన్ నామమాత్రపు ఆఖరి టెస్టులో సయీమ్ ఆయుబ్తో అరంగేట్రం చేయించింది. సిడ్నీ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్లో అతడు డకౌట్గా వెనుదిరిగి చేదు అనుభవం మూటగట్టుకున్నాడు. అప్పుడు ఈజీ క్యాచ్ వదిలేశాడు అదే విధంగా.. ఫీల్డింగ్ తప్పిదాలతోనూ మూల్యం చెల్లించుకున్నాడు. రెండో రోజు ఆట సందర్భంగా ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్ను వదిలేసి సొంతజట్టు అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇక మూడో రోజు ఆట సందర్భంగా మరోసారి బ్యాటింగ్ చేసే అవకాశం రాగా. కేవలం 33 పరుగులకే పరిమితమయ్యాడు 21 ఏళ్ల ఈ లెఫ్టాండర్ ఓపెనర్. ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇంకా నయం.. గాయపడలేదు ఈ పరిణామాల క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సయీమ్ ఆయుబ్.. తాజాగా మైదానంలో మరోసారి చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. సిడ్నీ అవుట్ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా ఫీల్డింగ్ చేసే క్రమంలో జర్రున జారి పడ్డాడు ఆయుబ్. అయితే, అదృష్టవశాత్తూ అతడికి ఎటువంటి గాయం కాలేదు. దీంతో పాక్ శిబిరం ఊపిరి పీల్చుకుంది. క్యాప్తో బంతిని ఆపాడు? అయినా పెనాల్టీ లేదెందుకు? శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో... నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. ఫీల్డింగ్ చేస్తున్నపుడు.. స్టీవ్ స్మిత్ బాదిన బంతిని ఆపే క్రమంలో జారిపడ్డ ఆయుబ్ క్యాప్ బాల్ను బౌండరీకి వెళ్లకుండా అడ్డుపడింది. దీంతో నిబంధనల ప్రకారం.. బ్యాటింగ్ చేస్తున్న జట్టు అంటే ఆస్ట్రేలియాకు పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు రావాల్సిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే, ఈ విషయంపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ‘‘ఎవరైతే పెనాల్టీ పరుగుల గురించి అడుగుతున్నారో వారి కోసం ఈ జవాబు: క్యాప్ కారణంగా బంతి బౌండరీ వెళ్లకుండా ఆగిపోయినప్పటికీ.. ఇది యాక్సిడెంటల్గా జరిగిన పరిణామం. ఫీల్డర్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అందుకే బ్యాటింగ్ జట్టుకు పెనాల్డీ పరుగులు రాలేదు’’ అని ప్రకటన విడుదల చేసింది. ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. చదవండి: T20 WC: అగార్కర్ ఒప్పించేశాడు.. కోహ్లి, రోహిత్ రీఎంట్రీ!? For those asking: It's not a five-run penalty for hitting the cap as the contact between ball and hat was accidental, and nor was the cap deliberately left on the field, as helmets tend to be #AUSvPAK https://t.co/BFcgfoKnnT — cricket.com.au (@cricketcomau) January 5, 2024 -
Aus Vs Pak: ఈజీ క్యాచ్ వదిలేశాడు.. తలపట్టుకున్న బాబర్! వీడియో
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో పాకిస్తాన్ ఫీల్డింగ్ తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్లలో సులువైన క్యాచ్లు వదిలేసి పాక్ భారీ మూల్యం చెల్లించిన విషయం తెలిసిందే. పెర్త్ టెస్టులో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఇచ్చిన ఈజీ క్యాచ్ను పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ జారవిడిచాడు. అదే విధంగా.. మెల్బోర్న్లో జరిగిన రెండో మ్యాచ్లోనూ డేవిడ్ వార్నర్ క్యాచ్ను వదిలేశాడు. ఇలా కీలక సమయాల్లో ఇద్దరు స్టార్ ఆటగాళ్లను పెవిలియన్కు పంపే ఛాన్స్ మిస్ చేసుకున్న పాకిస్తాన్.. ఆయా మ్యాచ్లలో 360, 79 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా సిరీస్ కోల్పోవడమే గాకుండా కంగారూ గడ్డపై వరుసగా 16 టెస్టుల్లో ఓడి తమ చెత్త రికార్డును మరింత పదిలం చేసుకుంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన షాన్ మసూద్ బృందం తొలుత బ్యాటింగ్ చేసి.. 313 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో మొదటిరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో 6/0తో రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్ను ఆరంభంలోనే దెబ్బకొట్టే ఛాన్స్ పాకిస్తాన్కు వచ్చింది. గురువారం నాటి ఆటలో పద్నాలుగో ఓవర్ రెండో బంతికి ఆమిర్ జమాల్ బౌలింగ్లో వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను సయీమ్ ఆయుబ్ మిస్ చేశాడు. వార్నర్ బంతిని గాల్లోకి లేపగా ఫస్ట్స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న ఆయుబ్.. బాల్ను రెండు చేతులతో ఒడిసిపట్టినట్టే పట్టి జారవిడిచేశాడు. దీంతో పక్కనే ఉన్న బాబర్ ఆజం తీవ్ర అసహనానికి గురయ్యాడు. సులువైన క్యాచ్ వదిలేయడంతో లైఫ్ పొందిన వార్నర్ మరోసారి ప్రమాదకారిగా మారుతాడేమోనన్న భయంతో తలపట్టుకుని కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో వార్నర్ క్యాచ్ మిస్ చేసిన పాక్ అరంగేట్ర బ్యాటర్ సయీమ్ ఆయుబ్పై సొంత జట్టు అభిమానులే ఫైర్ అవుతున్నారు. బ్యాటర్గా విఫలమయ్యావు.. ఫీల్డింగ్ చేయడం కూడా రాదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా సిడ్నీ మ్యాచ్తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆయుబ్.. తొలి ఇన్నింగ్స్లో డకౌట్గా వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. ఆయుబ్ క్యాచ్ చేసే సమయానికి వార్నర్ 20 పరుగులతో ఆడుతున్నాడు. అయితే, 24.3వ ఓవర్ వద్ద ఆగా సల్మాన్ బౌలింగ్లో బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి వార్నర్(34) వెనుదిరిగాడు. చదవండి: Ind Vs SA 2nd Test: రెండో టెస్టులో విజయం భారత్దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం It's happened again! 😲 David Warner gets a life courtesy of the debutant Saim Ayub #AUSvPAK pic.twitter.com/VAr7bBis6L — cricket.com.au (@cricketcomau) January 4, 2024 -
వర్షం కారణంగా అర్ధంతరంగా ముగిసిన రెండో రోజు ఆట
Australia vs Pakistan, 3rd Test Day 2: ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా రెండో రోజు కేవలం 46 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆసీస్ పేసర్ల దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లు షఫీక్ (0), అయూబ్ (0) డకౌట్ కాగా, కెప్టెన్ షాన్ మసూద్ (35; 3 ఫోర్లు), బాబర్ ఆజమ్ (26; 4 ఫోర్లు) కొద్దిగా పోరాడారు. ఒక దశలో స్కోరు 96/5కి చేరింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్న వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (88), ఆగా సల్మాన్ (53) సల్మాన్ ఆరో వికెట్కు 94 పరుగులు జోడించారు. మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో పాక్ ఇక సులువుగానే తలవంచుతుందని ఆసీస్ భావించింది. కానీ పేస్ ఆల్రౌండర్ ఆమిర్ జమాల్ (97 బంతుల్లో 82; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) బ్యాటింగ్లో వీరోచిత పోరాటం చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పాకిస్తాన్ మెరుగైన స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 77.1 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు అత్యధికంగా ఐదు వికెట్లు దక్కగా.. స్టార్క్ రెండు, మిచెల్ మార్ష్, నాథన్ లియాన్ ఒక్కో వికెట్ తీశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ఆట నిలిచే సమయానికి 6/0(2) స్కోరు చేసింది. ఈ క్రమంలో గురువారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్ 24.3 ఓవర్ వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్(34) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అయితే, అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. కానీ అర్ధ శతకానికి మూడు పరుగుల దూరంలో ఉన్న ఖవాజా(47)ను ఆమిర్ జమాల్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. స్టీవ్ స్మిత్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో 47వ ఓవర్ ముగిసే సరికి మొదలైన వర్షం తెరిపినివ్వలేదు. దీంతో అక్కడితో ఆటను ముగించేశారు. అప్పటికి లబుషేన్ 23, స్టీవ్ స్మిత్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఆగా సల్మాన్, ఆమిర్ జమాల్కు చెరో వికెట్ దక్కింది. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్తో మూడు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. ఇక సిడ్నీ వేదికగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న నామమాత్రపు మూడో మ్యాచ్ డేవిడ్ వార్నర్ కెరీర్లో చివరి టెస్టు. చదవండి: Ind Vs SA: రెండో టెస్టులో విజయం భారత్దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం -
ఆసీస్తో మూడో టెస్ట్.. పాక్ లోయర్ ఆర్డర్ అద్భుత పోరాటం
సిడ్నీ వేదికగా ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్ట్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 313 పరుగులకు ఆలౌటైంది. 96 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దశ నుంచి పాక్ అద్భుతంగా తేరుకుంది. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు మొహమ్మద్ రిజ్వాన్ (88), అఘా సల్మాన్ (53), ఆమిర్ జమాల్ (82) వీరోచితంగా పోరాడి పాక్ పరువు కాపాడారు. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, సైమ్ అయూబ్ డకౌట్లు కాగా.. షాన్ మసూద్ (35), బాబర్ ఆజమ్ (26) కాసేపు ఆసీస్ బౌలర్లను నిలువరించారు. ఆతర్వాత స్వల్ప వ్యవధిలో వీరిద్దరితో పాటు సౌద్ షకీల్ (5) ఔట్ కావడంతో పాక్ కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వాన్.. అఘా సల్మాన్, ఆమిర్ జమాల్ సహకారంతో పాక్కు ఫైటింగ్ టోటల్ను అందించాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఆమిర్ జమాల్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ మరోసారి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో (5/61) చెలరేగి పాక్ వెన్నువిరచగా.. స్టార్క్ (2/75), హాజిల్వుడ్ (1/65), లయోన్ (1/74), మార్ష్ (1/27) మిగతా పనిని కానిచ్చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ 6, ఉస్మాన్ ఖ్వాజా 0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. -
Aus Vs Pak: ఐదు వికెట్లతో చెలరేగిన కమిన్స్.. పాక్ ఆలౌట్
Australia vs Pakistan, 3rd Test Day 1 Report: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తొలి రోజు పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆతిథ్య జట్టు పేసర్ల ధాటికి పాక్ టాపార్డర్ కుప్పకూలినా.. మహ్మద్ రిజ్వాన్, ఆగా సల్మాన్, ఆమెర్ జమాల్ అర్ధ శతకాలతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరి ముగ్గురి అద్భుత ప్రదర్శన కారణంగా పాకిస్తాన్ 300 పరుగుల మార్కును అందుకోగలిగింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పాక్ ఇప్పటికే మూడు మ్యాచ్ల సిరీస్ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య నామమాత్రపు టెస్టు సిడ్నీ వేదికగా బుధవారం ఆరంభమైంది. టాస్ గెలిచిన పర్యాటక పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆదిలోనే ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ను మిచెల్ స్టార్క్.. సయీమ్ ఆయుబ్ను జోష్ హాజిల్వుడ్ డకౌట్ చేసి పెవిలియన్కు పంపారు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పాక్ రెండు వికెట్లు కోల్పోగా.. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్(35).. బాబర్ ఆజంతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బాబర్ను 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఈ జోడీని విడదీశాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సౌద్ షకీల్ను కూడా కమిన్సే అవుట్ చేశాడు. ఈ క్రమంలో 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 88 పరుగులతో రాణించాడు. అతడి తర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన ఆగా సల్మాన్ మరో ఎండ్ నుంచి సహకారం అందిస్తూ 53 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే వీరిద్దరు అవుట్ కాగానే పాక్ సులువుగానే తలవంచుతుందని భావించిన కమిన్స్ బృందానికి ఆల్రౌండర్ ఆమెర్ జమాల్ షాకిచ్చాడు. తొమ్మిద స్థానంలో బరిలోకి దిగిన అతడు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతూ 97 బంతుల్లో 82 పరుగులు రాబట్టాడు. అయితే, నాథన్ లియోన్ అద్బుత బంతితో అతడిని బోల్తా కొట్టించడంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. తొలి రోజు ఆటలో భాగంగా 77.1 ఓవర్లలో 313 పరుగుల వద్ద పాక్ జట్టు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్ రెండు, హాజిల్వుడ్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా బుధవారం నాటి ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు పాకిస్తాన్ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వడం మొదటి రోజు ఆటలో హైలైట్గా నిలిచింది. ఇక ఆసీస్ పాక్ కంటే 307 పరుగులు వెనుకబడి ఉంది. వార్నర్ ఆరు, ఉస్మాన్ ఖవాజా సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. -
మహ్మద్ హఫీజ్ను వదలట్లేదు.. మొన్న అలా.. ఇప్పుడిలా సెటైర్!
Australia vs Pakistan, 3rd Test: పాకిస్తాన్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ను ఐస్లాండ్ క్రికెట్ మరోసారి ట్రోల్ చేసింది. ఆస్ట్రేలియా జట్టు మాత్రమే కాదు.. ఆస్ట్రేలియన్ ఎయిర్లైన్స్ కూడా హఫీజ్ను ఇబ్బంది పెడుతున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లిన షాన్ మసూద్ బృందం.. తొలి రెండింటిలో ఓడిపోయింది. పెర్త్లో ఏకంగా 360 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్.. మెల్బోర్న్ టెస్టులో పోరాడగలిగింది. అయితే, ఈ మ్యాచ్లో మహ్మద్ రిజ్వాన్ అవుటైన తీరుపై పాక్ బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రిజ్వాన్ అవుటైన తీరుపై రచ్చ ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో బంతి రిజ్వాన్ రిస్ట్బ్యాండ్ను తాకినట్లుగా కనిపించడంతో అతడు అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే, కాన్ఫిడెంట్గా ఉన్న కమిన్స్ రివ్యూకు వెళ్లగా థర్డ్ అంపైర్ రిజ్వాన్ అవుటైనట్లు ప్రకటించాడు. దీంతో ఆసీస్ శిబిరంలో సంబరాలు మొదలుకాగా.. పాకిస్తాన్ కీలక సమయంలో కీలక వికెట్ కోల్పోయి 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఈ విషయంపై స్పందిస్తూ.. సాంకేతిక లోపాలు, అంపైర్ల తప్పిదాల వల్లే తాము ఓడిపోయామంటూ పాక్ మాజీ క్రికెటర్, జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానికి మెల్బోర్న్లో తాము ఆస్ట్రేలియా కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చామంటూ ప్రత్యర్థి జట్టు ఆట తీరును విమర్శించాడు. అప్పుడు ఆస్ట్రేలియా జట్టు.. ఇప్పుడు ఆసీస్ ఎయిర్లైన్స్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐస్లాండ్ క్రికెట్ హఫీజ్పై సెటైరికల్ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ అత్యంత ప్రతిభావంతమైన జట్టు అయినందుకే.. ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా 16 టెస్టులు ఓడిపోయిందా అని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేసింది. తాజాగా సిడ్నీ టెస్టు కోసం.. మహ్మద్ హఫీజ్ తాను ఎక్కాల్సిన విమానం మిస్ కావడంతో మరోసారి ట్రోల్ చేసింది. ‘‘అయ్యో అందరూ ప్రతిభావంతులే ఉన్న జట్టు అది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా ఎయిర్లైన్స్ కూడా అతడిని వదిలేసి వెళ్లిందా?’’ అని సెటైర్ వేసింది. సిరీస్ సమర్పయామి.. ఆఖరి టెస్టులో ఆఫ్రిది లేకుండానే కాగా ఇప్పటికే 2-0తో టెస్టు సిరీస్ను ఆతిథ్య ఆస్ట్రేలియాకు సమర్పించుకున్న పాకిస్తాన్.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగనున్న మూడో మ్యాచ్కు సన్నద్ధమవుతోంది. బుధవారం నుంచి ఆరంభం కానున్న ఈ టెస్టుకు ఎంపిక చేసిన పాక్ జట్టులో షాహిన్ ఆఫ్రిదికి చోటు దక్కలేదు. పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో అతడికి విశ్రాంతినిచ్చిన పీసీబీ.. సయీమ్ ఆయుబ్తో అరంగేట్రం చేయించేందుకు సిద్ధమైంది. ఇక మ్యాచ్ కోసం మెల్బోర్న్ నుంచి సిడ్నీకి విమానంలో వెళ్లాల్సి ఉండగా.. మహ్మద్ హఫీజ్ ఎయిర్పోర్టుకు ఆలస్యంగా రావడంతో ఫ్లైట్ మిస్సయ్యాడు. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ All that talent, and now even the Aussie airlines are out to get him! https://t.co/gtF1rXqOit — Iceland Cricket (@icelandcricket) January 1, 2024 -
తన చివరి టెస్ట్కు ముందు అతి మూల్యమైన వస్తువును పోగొట్టుకున్న వార్నర్
తన కెరీర్లో చివరి టెస్ట్ మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అతి మూల్యమైన వస్తువును పోగొట్టుకున్నాడు. వార్నర్ తన కెరీర్లో మెజార్టీ శాతం ధరించిన బ్యాగీ గ్రీన్ (క్యాప్) కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఆస్ట్రేలియన్గా తనకు బ్యాగీ గ్రీన్ అతి మూల్యమైన వస్తువని, ఎవరైనా దాన్ని తీసి ఉంటే తిరిగి ఇచ్చేయాలని సోషల్మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు. పాకిస్తాన్తో మూడో టెస్ట్కు ముందు మెల్బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణిస్తున్న సమయంలో తన బ్యాగీ గ్రీన్ మిస్ అయినట్లు అనుమానిస్తున్నాడు. ఈ విషయమై అతను ఎయిర్పోర్ట్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల్లో వార్నర్ బ్యాగీ గ్రీన్ దొంగిలించబడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఎయిర్పోర్ట్ అధికారులు వివరణ ఇచ్చారు. తనకు ఎంతో ప్రత్యేకమైన క్యాప్ కనపడకపోవడంతో వార్నర్ తెగ బాధపడిపోతున్నాడు. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) సోషల్మీడియా వేదికగా తన బాధను పంచుకున్నాడు. నా కెరీర్లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడే ముందు బ్యాగీ గ్రీన్ను మిస్ అయ్యాను. దయచేసి ఎవరికైనా అది దొరికి ఉంటే తిరిగి ఇచ్చేయండని విజ్ఞప్తి చేశాడు. ఇందుకు ప్రతిగా ఎదైనా ఇచ్చేందుకు కూడా తాను సిద్దమేనని అభ్యర్ధించాడు. క్యాప్ను తిరిగి ఇచ్చే వారిపై ఎలాంటి కంప్లైంట్ కూడా ఇవ్వనని హామీ ఇచ్చాడు. బ్యాగీ గ్రీన్ దొరికిన వారు తనను సోషల్మీడియా ద్వారా సంప్రదించవచ్చని లేదా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధులతోనైనా మాట్లాడవచ్చని మెసేజ్ పాస్ చేశాడు. కాగా, వార్నర్ తన 111 మ్యాచ్ల టెస్ట్ కెరీర్లో ఎక్కువ శాతం మ్యాచ్లు ఇప్పుడు పోగొట్టుకున్న బ్యాగీ గ్రీన్తోనే ఆడాడట. ఈ క్యాప్ వార్నర్కు చాలా కలిసొచ్చిందిగా చెబుతారు. మెల్బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణిస్తున్న సమయంలో తన రెండు బ్యాగీ గ్రీన్లతో కూడిన లగేజ్ చోరీకి గురైందని వార్నర్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ కూడా స్పందించడం విశేషం. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ విషయమై ప్రత్యేక చొరవ తీసుకుని, వార్నర్ పోగొట్టుకున్న బ్యాగీ గ్రీన్ను వెతికపెట్టాలని మసూద్ కోరాడు. ఇందుకోసం దేశవ్యాప్తంగా శోధన జరగాలని పిలుపునిచ్చాడు. అవసరమైతే డిటెక్టివ్ల సాయం కూడా తీసుకోవాలని సూచించాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్కు వార్నర్ గొప్ప ప్రతినిధి అని, అలాంటి వ్యక్తికి చెందిన అతి మూల్యమైన వస్తువు పోతే ప్రభుత్వం స్పందించాల్సిందేనని డిమాండ్ చేశాడు. -
ఆసీస్తో మూడో టెస్టు: పాక్ తుది జట్టు ప్రకటన.. షాహిన్కు నో ఛాన్స్
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టులో తలపడేందుకు పాకిస్తాన్ సిద్దమైంది. ఇప్పటికే సిరీస్ను కోల్పోయిన పాకిస్తాన్.. కనీసం ఈ మ్యాచ్లోనైనా గెలిచి వైట్వాష్ నుంచి తప్పించుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు తమ తుది జట్టును పాకిస్తాన్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఈ మ్యాచ్కు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది దూరమయ్యాడు. గత కొంత కాలంగా నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న అఫ్రిదికి మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. మరోవైపు తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్పై వేటుపడింది. అతడి స్ధానంలో యువ ఓపెనర్ సైమ్ అయూబ్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. అదే విధంగా మరో యువ పేసర్ సాజిద్ ఖాన్కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ టెస్టు సిరీస్ అనంతరం 5 టీ20ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్లో పాక్ జట్టును అఫ్రిది ముందుండి నడిపించనున్నాడు. ఆసీస్తో మూడో టెస్టుకు పాక్ జట్టు: సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ అఘా, సాజిద్ ఖాన్, హసన్ అలీ, మీర్ హమ్జా, అమీర్ జమాల్. చదవండి: Petra Kvitova: అభిమానులకు శుభవార్త చెప్పిన టెన్నిస్ స్టార్.. ఆటకు దూరం -
నేను ఎదుర్కొన్న అత్యుత్తమ బ్యాటర్లు వీరే: ఆసీస్ స్టార్ స్పిన్నర్
గత కొన్నేళ్లుగా టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్. ఆసీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో స్పిన్ బౌలర్గా చరిత్రకెక్కిన అతడు.. మరో నాలుగేళ్ల పాటు కెరీర్ కొనసాగించాలని భావిస్తున్నాడు. సొంతగడ్డపై పాకిస్తాన్తో టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్లో చేరిన ఈ ఆఫ్ స్పిన్నర్.. ఈ ఘనత సాధించిన ఓవరాల్ బౌలర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా ఈ మైలురాయి అందుకున్న స్పిన్నర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సుదీర్ఘ కెరీర్లో ఎంతో మంది బ్యాటర్లను ఎదుర్కొన్న నాథన్ లియోన్.. ముగ్గురు మాత్రం తనకు కఠిన సవాల్ విసిరారని పేర్కొన్నాడు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సహా రికార్డుల వీరుడు విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ తాను ఫేస్ చేసిన బౌలర్లలో అత్యుత్తమ బ్యాటర్లు అని తెలిపాడు. కాగా కోహ్లి- లియోన్ ముఖాముఖి పోరులో రన్మెషీన్దే పైచేయి కావడం విశేషం. టెస్టుల్లో ఇప్పటి వరకు కోహ్లి లియోన్ బౌలింగ్లో కేవలం ఏడుసార్లు అవుట్ కాగా.. 75కు పైగా సగటుతో పరుగులు సాధించాడు. అదే విధంగా వన్డేల్లో లియోన్ బౌలింగ్లో 96కు పైగా స్ట్రైక్రేటుతో 100 పరుగులు సాధించిన కోహ్లి.. ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. మరోవైపు.. టెస్టుల్లో లియోన్పై డివిలియర్స్ది కూడా పైచేయే! అతడి బౌలింగ్లో 171 సగటుతో 342 పరుగులు సాధించిన ఏబీడీ.. కేవలం రెండుసార్లు వికెట్ సమర్పించుకున్నాడు. అయితే, టెండుల్కర్కు మాత్రం నాథన్ లియోన్ బౌలింగ్లో మెరుగైన రికార్డు లేదు. టెస్టుల్లో ఈ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్లో కేవలం సగటు 29 కలిగి ఉన్న సచిన్ నాలుగుసార్లు అవుటయ్యాడు. కాగా నాథన్ లియోన్ తదుపరి పాకిస్తాన్తో మూడో టెస్టు సందర్భంగా మైదానంలో దిగనున్నాడు. సిడ్నీ వేదికగా బుధవారం నుంచి ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నాథన్ లియోన్.. తాను ఎదుర్కొన్న గొప్ప బ్యాటర్ల జాబితాలో ముందుగా విరాట్ కోహ్లి పేరు చెప్పాడు. సచిన్ టెండుల్కర్, ఏబీ డివిలియర్స్లను అవుట్ చేసేందుకు కూడా తానెంతో కష్టపడాల్సి వచ్చేదని ఈ సందర్భంగా వెల్లడించాడు. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ -
Aus Vs Pak: వార్నర్ ఫేర్వెల్ టెస్టు.. ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన
Australia vs Pakistan, 3rd Test: సొంతగడ్డపై పాకిస్తాన్తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్లలో ఆడిన జట్టుతోనే ఆఖరి టెస్టులో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ మంగళవారం ధ్రువీకరించాడు. స్వదేశంలో పాకిస్తాన్పై టెస్టుల్లో రెండు దశాబ్దాలకు పైగా ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ ఆసీస్ మరోసారి సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే. పెర్త్ టెస్టులో పర్యాటక పాక్ను 360 పరుగుల తేడాతో చిత్తు చేసిన కంగారూ జట్టు.. బాక్సింగ్ డే టెస్టులోనూ విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. వార్నర్ ఫేర్వెల్ టెస్టు ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టెస్టు జరుగనుంది. ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో బుధవారం (జనవరి 3) నుంచి ఐదు రోజుల మ్యాచ్ మొదలు కానుంది. ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ సతీమణి జ్ఞాపకార్థం పింక్ టెస్టుగా నిర్వహించనున్న ఈ మ్యాచ్ సందర్భంగా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడనున్నాడు. తన రెగ్యులర్ జోడీ ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్ తమ స్థానాలు నిలబెట్టుకోగా.. నెట్స్లో శ్రమిస్తున్న ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నాడు. మరో ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ సూపర్ ఫామ్లో ఉన్న కారణంగా గ్రీన్ను పక్కనపెట్టక తప్పలేదు. 👀 #AUSvPAK https://t.co/YcZvY1CYlM — cricket.com.au (@cricketcomau) January 1, 2024 ‘పింక్’ టెస్టులో గెలుపు ఎవరిది? ఇక బౌలింగ్ దళంలో పేస్ త్రయం ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్తో పాటు స్పిన్నర్ నాథన్ లియోన్ ఉండగా.. అలెక్స్ క్యారీ వికెట్ కీపర్గా కొనసాగనున్నాడు. కాగా ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్బౌలర్ గ్లెన్ మెగ్రాత్ భార్య జేన్ మెగ్రాత్ రొమ్ము క్యాన్సర్తో మరణించింది. ఈ నేపథ్యంలో.. క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు వీలుగా.. సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఆమె జ్ఞాపకార్థం మెగ్రాత్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది ఆసీస్ ఆడే టెస్టుల్లో ఒక మ్యాచ్ను పింక్ టెస్టుగా నిర్వహిస్తూ ఫండ్రైజింగ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. పాకిస్తాన్తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియోన్, జోష్ హాజిల్వుడ్. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ -
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే.. చాలా డేంజరస్: డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జనవరి 3 నుంచి పాకిస్తాన్తో జరగనున్న మూడో టెస్టు అనంతరం సంప్రదాయక్రికెట్కు డేవిడ్ భాయ్ విడ్కోలు పలకనున్నాడు. టెస్టులతో పాటు వన్డేలకు వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్కు తన టెస్టు కెరీర్లో ఎదు అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదలుగా వార్నర్ ఏమి ఆలోచించకుండా దక్షిణాఫ్రికా లెజెండ్ డేల్ స్టేయిన్ పేరును చెప్పుకొచ్చాడు. 'నా టెస్టు కెరీర్లో నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ డేల్ స్టేయిన్. 2016-2017లో గబ్బా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు ఇప్పటికి నాకు గుర్తుంది. ఈ మ్యాచ్లో ఫస్ట్ సెషన్లో డేల్ స్టేయిన్ నిప్పలు చేరిగాడు. బౌన్సర్లతో నన్ను షాన్ మార్ష్ను భయపెట్టాడు. 45 నిమిషాల సెషన్ అయితే మాకు చుక్కలు చూపించింది. షాన్ నా దగ్గరకు వచ్చి అతడి బౌలింగ్ను ఎలా ఎదుర్కొవాలో నాకు అర్ధ కావడం లేదని చెప్పాడు. కనీసం పుల్ షాట్ ఆడాదామన్న కూడా అవకాశం లేదు. చాలా ఓవర్ల పాటు కనీసం బంతిని కూడా టచ్ చేయలేకపోయాను. ఓ బంతి ఏకంగా నా భుజానికి వచ్చి తాకింది. నొప్పితో విల్లాలాడాను. స్టేయిన్ ఎడమచేతి వాటం బ్యాటర్లకు అద్బుతంగా బౌలింగ్ చేస్తాడు. అతడు బౌలింగ్ చేస్తే ప్రతీ బ్యాటర్కు కొంచెం భయం కచ్చితంగా ఉంటుందని' వార్నర్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్ క్రికెట్ చరిత్రలో స్పీడ్గన్ స్టేయిన్ తన పేరును సువర్ణఅక్షరాలతో లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికా తరపున టెస్టులలో 439 వికెట్లు, వన్డేలలో 196 వికెట్లు, టీ20లలో 64 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ -
Aus Vs Pak: నా రికార్డు బద్దలు కొట్టే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజం
Australia vs Pakistan, 3rd Test: ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఆట తీరుపై బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెగ్రాత్ ప్రశంసలు కురిపించాడు. ఆసీస్ తరఫున తాను నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టగల సత్తా లియోన్కు ఉందన్నాడు. కాగా పాకిస్తాన్తో సొంతగడ్డపై టెస్టు సిరీస్ను 2-0తో సొంతం చేసుకున్న కంగారూ జట్టు.. నామమాత్రపు ఆఖరి మ్యాచ్కు సిద్ధమైంది. ఆమె జ్ఞాపకార్థం ‘పింక్’ టెస్టు నిర్వహణ ఇరుజట్ల మధ్య బుధవారం (జనవరి 3) నుంచి ‘పింక్ టెస్టు’ ఆరంభం కానుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఇందుకు వేదిక. కాగా బ్రెస్ట్ క్యాన్సర్తో మరణించిన గ్లెన్ మెగ్రాత్ సతీమణి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది పింక్ టెస్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సిడ్నీలో తాజాగా జరుగనున్న మ్యాచ్ 16వది. ఈ టెస్టు సందర్భంగా మెగ్రాత్ ఫౌండేషన్ విరాళాల సేకరణ చేపట్టనుంది. ఈ సందర్భంగా గ్లెన్ మెగ్రాత్ ప్రసంగిస్తూ.. నాథన్ లియోన్ బౌలింగ్ నైపుణ్యాలను కొనియాడాడు. ‘‘ప్రతి రికార్డును ఎవరో ఒకరు బ్రేక్ చేస్తారు. ఒకవేళ లియోన్ నన్ను దాటేస్తే అంతకంటే సంతోషం ఉండదు. అతడు అసాధారణ బౌలర్. అలా అయితే అతడికి తిరుగే ఉండదు లియోన్కు ఆల్ ది బెస్ట్. ఒకవేళ నాతో పాటు షానో(షేన్ వార్న్) రికార్డును కూడా అధిగమిస్తే అతిడికి తిరుగే ఉండదు. లియోన్ బౌలింగ్ నైపుణ్యాలు అద్భుతం. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం అతడికి అలవాటు’’ అని మెగ్రాత్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్గా గ్లెన్ మెగ్రాత్ ఘనత సాధించాడు. నేటికీ అతడి రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. ఆసీస్ తరఫున 124 టెస్టులు ఆడిన రైటార్మ్ పేసర్ మెగ్రాత్ 563 వికెట్లు తీశాడు. 500 వికెట్ల క్లబ్లో నాథన్ లియోన్ మరోవైపు.. ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఇటీవలే 500 వికెట్ల క్లబ్లో చేరాడు. పాకిస్తాన్తో పెర్త్ టెస్టు సందర్భంగా ఈ మైలురాయిని చేరుకున్నాడు. తాజా పింక్ టెస్టుకు ముందు అతడి ఖాతాలో మొత్తంగా 505 వికెట్లు ఉన్నాయి. సుమారు మరో నాలుగేళ్ల పాటు టెస్టు క్రికెట్ ఆడే సత్తా ఉన్న లియోన్ ఇంకో 59 వికెట్లు తీస్తే .. ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఓవరాల్ బౌలర్ల జాబితాలో మెగ్రాత్ను అధిగమిస్తాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్ దిగ్గజ దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ టెస్టుల్లో 708 వికెట్లు తీసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. చదవండి: IPL 2024: హార్దిక్ పాండ్యా దూరం! ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బుమ్రా? -
తప్పిదారి షాహిన్ కెప్టెన్ అయ్యాడు: అల్లుడిపై ఆఫ్రిది విమర్శలు!
పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ ఎంపిక గురించి ఆ దేశ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదో తప్పిదారి షాహిన్ ఆఫ్రిది సారథి అయ్యాడని సరదాగా వ్యాఖ్యానించాడు. అతడికి బదులు మహ్మద్ రిజ్వాన్కు పగ్గాలు అప్పజెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీలో పేలవ ప్రదర్శన నేపథ్యంలో బాబర్ ఆజం.. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో షాన్ మసూద్ను కెప్టెన్ చేసిన పాక్ క్రికెట్ బోర్డు.. టీ20 సారథ్య బాధ్యతలను పేసర్ షాహిన్ ఆఫ్రిదికి అప్పగించింది. ఈ నేపథ్యంలో మసూద్ నాయకత్వంలో టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన పాక్ జట్టు.. తదుపరి షాహిన్ నేతృత్వంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న షాహిద్ ఆఫ్రిది ఈ విషయాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆటగాడిగా రిజ్వాన్ను నేను ఆరాధిస్తాను. కఠిన శ్రమ, ఆట పట్ల నిబద్ధత.. అతడిని అత్యుత్తమ క్రికెటర్గా నిలిపాయి. కేవలం ఆట మీద మాత్రమే దృష్టి సారించి ఎక్కడ ఎంత వరకు నైపుణ్యాలను వాడుకోవాలో అతడికి బాగా తెలుసు. తనొక గొప్ప యోధుడు’’ అని మహ్మద్ రిజ్వాన్ను ప్రశంసించాడు. అదే విధంగా.. ‘‘రిజ్వాన్ను పాక్ టీ20 కెప్టెన్గా చూడాలనుకున్నాను. కానీ తప్పిదారి షాహిన్ ఆఫ్రిది సారథిగా ఎంపికయ్యాడు’’ అని షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు. ఆ సమయంలో హ్యారిస్ రవూఫ్, సర్ఫరాజ్ అహ్మద్లతో పాటు అక్కడే ఉన్న షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ నవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా షాహిద్ ఆఫ్రిదికి షాహిన్ ఆఫ్రిది సొంత అల్లుడన్న సంగతి తెలిసిందే. షాహిద్ కుమార్తె అన్షాను అతడు వివాహమాడాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులు ఓడిన పాకిస్తాన్.. జనవరి 3 నుంచి నామమాత్రపు మూడో టెస్టు ఆడనుంది. చదవండి: సౌతాఫ్రికా ఒక్కటే కాదు పాక్ కూడా అలాగే.. ఐసీసీ, బీసీసీఐ జోక్యం చేసుకోవాలి: స్టీవ్ వా Shahid Afridi praised Muhammad Rizwan and said that Rizwan should have been captain of T20 but Shaheen became it by mistake.#Rizwan #PakistanCricket pic.twitter.com/TSECe93ZPM — Ahtasham Riaz 🇵🇰 (@AhtashamRiaz_) December 30, 2023 -
కొత్త సంవత్సరం వేళ.. డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే తన కెరీర్లో చివరి టెస్టు ఆడేందుకు సిద్దమైన వార్నర్.. తాజాగా వన్డే క్రికెట్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం తన నిర్ణయాన్ని డేవిడ్ భాయ్ వెల్లడించాడు. అయితే జట్టుకు తన అవసరం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తే పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆడేందుకు అందుబాటులో ఉంటానని తెలిపాడు. "టెస్టులతో పాటు వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. భారత్పై వన్డే ప్రపంచకప్ గెలిచిన ఈ తరుణమే ఆటకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నాను. ఇది నా కెరీర్లో సాధించిన భారీ విజయం. టెస్టు, వన్డే ఫార్మాట్ల నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంఛైజీ లీగ్లలో ఆడేందుకు ఎక్కువ సమయం లభిస్తోంది. నేను తీసుకున్న ఈ నిర్ణయం కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తోంది. అయితే త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉందన్న విషయం నాకు తెలుసు. గత రెండేళ్లలో నేను మంచి క్రికెట్ ఆడుతున్నాను. రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ నేను ఫిట్నెస్గా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టుకు అవసరమైతే కచ్చితంగా నేను అందుబాటులో ఉంటానని సిడ్నీ గ్రౌండ్లో విలేకరుల సమావేశంలో వార్నర్ పేర్కొన్నాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023ను ఆస్ట్రేలియా సొంతం చేసుకోవడంలో డేవిడ్ వార్నర్ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 528 పరుగులు చేసిన డేవిడ్ భాయ్.. ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్గా తన వన్డే కెరీర్లో 161 మ్యాచ్లు ఆడిన వార్నర్.. 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలతో 6932 పరుగులు చేశాడు. వన్డేల్లో ఆసీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా వార్నర్ కొనసాగుతున్నాడు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- ఆగని టీడీపీ అరాచకాలు
- చీరాలలో టీడీపీ, కాంగ్రెస్ బరితెగింపు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
- పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
- వెచ్చని హృదయ రాగ సందేశం
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
- ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
Advertisement