-
సీఎం సిద్ధరామయ్య, మంత్రులకు బాంబు బెదిరింపులు
ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు, ప్రముఖులను టార్గెట్ చేసుకొని కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాంబు బెదిరింపులు నిజమో, అబద్దమో తేల్చేందుకు పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు తలలు పట్టుకుంటున్నాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోసహా పలువురు మంత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం Shahidkhan10786@protonmail.com. అనే ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు మెయిల్ అందుకున్న వారిలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వరతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తమకు 2.5 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 20 కోట్లు) ఇవ్వకపోతే కర్ణాటక వ్యాప్తంగా బస్సులు, రైళ్లు దేవాలయాలు, హోటళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున్న పేలుళ్లు జరుపుతామని హెచ్చరించారు. దీనిపై బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లతో పాటు పోలీసు సిబ్బంది తనిఖీ చేపట్టారు. ‘సినిమా ట్రైలర్పై మీ అభిప్రాయం ఏమిటి? మీరు మాకు 2.5 మిలియన్ డాలర్లు అందించకపోతే, కర్ణాటక అంతటా బస్సులు, రైళ్లు, దేవాలయాలు, హోటళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పేలుళ్లు జరుపుతాము. "మేము మీకు మరో ట్రైలర్ చూపించాలనుకుంటున్నాము. అంబారీ ఉత్సవ్ బస్సులో బాంబును పేల్చబోతున్నాం. అంబారీ ఉత్సవ్ బస్సు పేలుడు తర్వాత, మా డిమాండ్లను సోషల్ మీడియాలో లేవనెత్తుతాము. మీకు పంపిన మెయిల్ స్క్రీన్షాట్లను అప్లోడ్ చేస్తాం. మా నెక్ట్స్ పేలుడు గురించి త్వరలోనే ట్వీట్ చేస్తాం.’ అని మెయిల్లో పేర్కొన్నారు. -
బెంగళూరు ‘రామేశ్వరం కేఫ్’ పేలుడు కేసు.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును ఇక నుంచి కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేలుడు ఘటనపై ఎన్ఐఏ తాజాగా కేసు నమోదు చేసింది. గత శుక్రవారం(మార్చి 1) మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగళూరు నగరంలోని బ్రూక్ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్లో పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో 10 మంది దాకా గాయపడ్డారు. ఈ కేసును ఇప్పటిదాకా బెంగళూరు సిటీ పోలీసుల ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ)పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీబీ కేసు దర్యాప్తు వివరాలన్నింటినీ ఎన్ఐకు బదిలీ చేయనుంది. కాగా, అవసరమైతే పేలుడు కేసు దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటించారు. ఇదీ చదవండి.. బెంగాల్ బీజేపీ చీఫ్కు రోడ్డు ప్రమాదం.. వారిపైనే ఆరోపణలు -
ఢిల్లీ సర్కార్కు షాక్.. మొహల్లా క్లినిక్లపై సీబీఐ దర్యాప్తు
ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఆప్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొహల్లా క్లినిక్లలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై హోం మంత్రిత్వ శాఖ సీబీఐ దర్యాప్తుని ఆదేశించింది. మొహల్లా క్లినిక్ల రోగనిర్ధారణ పరీక్షల్లో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని ఢిల్లి లెఫ్టినెంట్ గవర్నర్ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొహల్లా క్లినిక్లు పేషెంట్లు లేకుండానే నకిలీ రేడియాలజీ, పాథాలజీ పరీక్షలను నిర్వహించాయని ఆరోపణలు వచ్చాయి. క్లినిక్లకు రాని వైద్యులకు హాజరు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. లేని రోగులకు క్లినిక్లలో చికిత్సలు నమోదు చేసినట్లు బయటపడింది. అంతకుముందు ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులకు నాసిరకం మందులు సరఫరా అవుతున్నాయనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. మొహల్లా క్లినిక్ ద్వారా ఢిల్లీలో సామాన్య జనానికి ప్రాథమిక ఆరోగ్యాన్ని అందించడానికి ఆప్ సర్కార్ ఏర్పాటు చేసిన పథకం. కేవలం ఢిల్లీ జనాభాకు మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకు కూడా ఆరోగ్య సేవలు అందిస్తుంది. ఇదీ చదవండి: కేజ్రీవాల్ది క్లీన్ ఇమేజ్.. అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదు: శరద్ పవార్ -
భారత్తో ఒప్పందాలు అప్పుడే..! కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు
శాన్ఫ్రాన్సిస్కో: కెనడా-భారత్ సంబంధాలపై ఆ దేశ ఆర్థిక మంత్రి మేరీ ఎన్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యకేసు దర్యాప్తులో భారత్ సహకరించిన తర్వాతే వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ఉంటాయని తెలిపారు. నిజ్జర్ హత్యకేసులో దర్యాప్తును భారత్ తోసిపుచ్చడం లేదని విదేశాంగ మంత్రి జై శంకర్ గురువారం తెలిపిన విషయం తెలిసిందే. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సమావేశానికి హాజరైన కెనడా ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి మేరీ ఎన్జీ మీడియాతో మాట్లాడుతూ.. "మా దృష్టంతా నిజ్జర్ కేసు దర్యాప్తుపైనే ఉంది. అందుకు భారత్ సహకరించేలా చేయడంపైనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పని పూర్తైన తర్వాతే ఇరుదేశాల మధ్య సంబంధాల గురించి ఆలోచిస్తాం. మా దేశానికి చెందిన వ్యక్తి హత్యలో విదేశీ జోక్యం ఉందని ఆరోపణలు రావడాన్ని సీరియస్గా తీసుకున్నాం.' అని అయన చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదానికి దారి తీసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపిస్తోందని భారత్ దుయ్యబట్టింది. ఈ పరిణామాల తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలతోపాటు వీసాలను కూడా రద్దు చేసుకున్నారు. ఈ కేసులో భారత్ దర్యాప్తుకు సహకరించాలని కెనడా ఒత్తిడి చేస్తోంది. ఇదీ చదవండి: ఖలిస్తానీల ఆగడాలను అడ్డుకోండి -
గూగుల్, యాపిల్పై సీసీఐ విచారణ.. నివేదిక రాగానే చర్యలు!
న్యూఢిల్లీ: అన్యాయమైన వ్యాపార విధానాలు అవలంభిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో గూగుల్, యాపిల్పై విచారణ జరుపుతున్నట్టు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్పర్సన్ రవ్నీత్ కౌర్ తెలిపారు. స్మా ర్ట్ టెలివిజన్, అలాగే వార్తల కంటెంట్ విభాగంలో దాని ఆధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేసిందని, అలాగే యాప్ స్టోర్కు సంబంధించి వ్యతిరేక పోటీ పద్ధతులను యాపిల్ అవలంభిస్తోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో విచారణకు సీసీఐ ఆదేశించింది. సీసీఐ ఇన్వెస్టిగేషన్ విభాగమైన డైరెక్టర్ జనరల్ నుంచి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని కౌర్ తెలిపారు. కంపెనీల పోటీ వ్యతిరేక పద్ధతులకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాలు లభించిన సందర్భంలో పూర్తిస్థాయి విచారణను సీసీఐ డైరెక్టర్ జనరల్కు అప్పగిస్తుంది. ఇంతకుముందు ఆండ్రాయిడ్ సిస్టమ్, ప్లేస్టోర్కు సంబంధించిన కేసులలోనూ గూగుల్కి వ్యతిరేకంగా సీసీఐ ఆదేశాలు జారీ చేసింది. -
అదానీ-హిండెన్బర్గ్ కేసు : కీలక పరిణామం
అదానీ గ్రూపు, హిండెన్బర్గ్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ బిలియనీర్ గౌతం అదానీ నేతృత్వంలోని కంపెనీలపై చేసిన ఆరోపణలపై విచారణను ముగించేందుకు గడువును 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టేటస్ రిపోర్టును సమర్పించేందుకు గడువును పొడిగించాలని కూడా సెబీ కోరింది. ఈ ఏడాది మేలో, ఈ అంశంపై అప్డేట్ చేసిన స్టేటస్ రిపోర్ట్ను సమర్పించేందుకు ఆగస్టు 14 వరకు సెబీకి సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. సెబీ 15 రోజుల పొడిగింపును ఎందుకు కోరింది? అదానీ గ్రూప్పై యుఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలకు సంబంధించి తాను దర్యాప్తు చేస్తున్న 24 లావాదేవీలలో 17 విచారణను పూర్తి చేసినట్లు సెబి తెలిపింది. మిగిలిన అంశాలపై విచారణ త్వరలోనే పూర్తి చేయనుంది. అయితే తదుపరి చర్యలను ప్లాన్ చేయడానికి ఇతర నియంత్రణ సంస్థలు , విదేశీ అధికార పరిధి నుండి మరింత సమాచారం కోరినట్లు సెబీ సుప్రీంకు తెలియజేసింది. విదేశీ లావాదేవీల ప్రమేయం కారణంగా కేసుకు సంబంధించిన కొన్ని అంశాలను పరిశోధించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూపుపై హిండెన్బర్గ్ ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూపు తీరని సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు కమిటీ ఏర్పాటు సంగతి తెలిసిందే. హిండెన్బర్గ్ ఆరోపణల మేరకు నిబంధనలకు వ్యతిరేకంగా అదానీ గ్రూప్ తన గ్రూప్ కంపెనీల షేర్ల ధరలను తారుమారు చేసిందా? సంబంధిత-పార్టీ లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైందా? అనే విషయాలపై సెబీ విచారణ చేపట్టింది. మరోవైపు అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ అదానీ పోర్ట్స్ కంపెనీ చట్టబద్ధమైన ఆడిటర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ షాక్తో సోమవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. కాగా తమ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో చేసిన తప్పుడు ఆరోపణలని హిండెన్బర్గ్ వాదనను గౌత అదానీ గట్టిగా తోసిపుచ్చారు. కేవలం తమ స్టాక్ ధరలను తగ్గించడం ద్వారా లాభాలను సంపాదించడం లక్ష్యంగా పెట్టుకుని, కుట్రపూరితంగానేకంపెనీ ఫాలో-ఆన్-పబ్లిక్ ఆఫర్ ముందు ఈ తప్పుడు నివేదికను వెల్లడించారని 2023 వార్షిక సాధారణ సమావేశంలో స్పష్టం చేశారు. -
లంచం ఇవ్వాలని మంత్రి ఒత్తిడి.. లేఖపై రాజకీయ దుమారం..!
బెంగళూరు: కర్ణాటకాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తమను నెలనెలా లంచం సమర్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి ఒత్తిడి చేస్తున్నారని సంబంధిత శాఖ డైరెక్టర్లు రాసిన లేఖ ఒకటి బయటపడింది. అది నకిలీదని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రిపై దర్యాప్తు చేయడానికి సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు సీఎం సిద్ధరామయ్య. రాష్ట్ర వ్యవసాయ మంత్రి చలువరాయ స్వామి నెలకు రూ.8 లక్షల వరకు లంచం సమర్పించాలని ఆ శాఖకు చెందిన డైరెక్టర్లను ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర గవర్నర్కు బాధిత డైరెక్టర్లు ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖ ఒకటి బయటపడింది. ఇలా ఒత్తిడి చేస్తే తాము కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందంటూ బాధితులు గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు సిద్ధరామయ్య ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవినీతికి మారుపేరుగా ప్రభుత్వం మారిపోయిందని బీజేపీ ఆరోపించింది. దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. ఇది ప్రతిపక్షాల కుట్రగా పేర్కొన్నారు. ఆ లేఖ నకిలీదని గుర్తించినట్లు చెప్పారు. తన ప్రభుత్వంపై బురదజల్లడానికి బీజేపీ, జేడీఎస్లు ఆడిన నాటకని అన్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: లోక్ సభలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన మహా ఎంపీ.. -
సీబీఐ చేతికి.. మణిపూర్ మహిళలను ఊరేగించిన కేసు..!
ఢిల్లీ: మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీపీఐ)కి అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారని చెప్పారు. గత మూడు నెలలపాటు మణిపూర్లో జరిగిన హింసాకాండకు సంబంధించిన పలు కేసులను రాష్ట్రం వెలుపల కూడా విచారణ జరపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మణిపూర్లో రెండు జాతుల మధ్య అల్లర్లు హింసాత్మకంగా మారాయి. గత మూడు నెలలుగా అల్లర్లలో అమానవీయ ఘటనలు ఎన్నో జరిగాయి. మహిళలపై అత్యాచారాలు, లూఠీలు, దొంగతనాలు, సహా దారిదోపిడీల వరకు అనేక కేసులు పలు పోలీసు స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అల్లర్లలో ఆందోళనకారులు దేశమంతా తలదించుకునే సంఘటన మే 3న జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకొచ్చింది. ఇద్దరు మహిళలను అల్లరిమూకలు నగ్నంగా ఊరేగించారు. అనంతరం వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. అటు రాజకీయంగా కూడా దుమారాన్ని రేపింది. ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిందించాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే మణిపూర్ ఈ దుస్థితికి చేరిందని ఆరోపించాయి. పార్లమెంట్ సమావేశాల్లోనూ ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించాలని పట్టుబడుతున్నాయి. గత వారం రోజులుగా ఈ అంశంపైనే పార్లమెంట్ సమావేశాలు ప్రతిపక్షాల ఆందోళనలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇదీ చదవండి: కెమెరా సాక్షిగా మణిపూర్లో జవాన్ వికృత చేష్టలు.. మహిళను బయటకు లాగి.. -
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనపై రైల్వే బోర్డు సీబీఐ సిఫార్సు చేసిందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒడిశా ఘటన మానవ తప్పిదమా? లేక మరేదైనా అన్న కోణంలో జరిగిందా అనే దానిపై సీబీఐ విచారించనుంది. అయితే సిగ్నల్ మారడం వెనక కుట్ర అందని అధికారులు అనుమానిస్తున్నారు. కోరమాండల్ను కావాలనే లూప్లైన్లోకి మార్చారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో బహనాగ స్టేషన్ మేనేజర్ను కూడా అధికారులు విచారించారు. బహనాగ స్టేషన్ మాస్టర్ రూమ్, సిగ్నలింగ్ రూమ్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలో ఎవరో మార్పులు చేశారని రైల్వే మంత్రి ఇంతకుముందే పేర్కొన్నారు. ఎలక్టానిక్ సిగ్నల్ పాయింట్లో మార్పులు జరిగాయని, వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో 275 మంది మృత్యువాతపడ్డారు. rj ఈ ప్రమాదం అనంతరం బాలాసోర్లోని రెండు రైల్వే లైన్లు ఆదివారం రాత్రి 8 గంటలకు పునరుద్ధరించనున్నట్టు రైల్వే బోర్డు తెలిపిందని మంత్రి వెల్లడించారు. చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: వారి బాధ్యత మాదే.. అదానీ కీలక ప్రకటన -
Wrestlers Protest: విచారణ ముగిసే వరకు వేచి ఉండండి!
నెలల తరబడి రెజ్లర్లంతా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసనలు చేయడమే గాక తమ పతకాలను గంగా నదిలో విసిరేస్తామని హెచ్చరించారు కూడా. ఐనా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై నోరు మెదపలేదు. అలాంటిది తొలిసారిగా ఆ విషయమైన సాక్షాత్తు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడటం విశేషం. రెజ్లర్లు రోజుకో డిమాండ్తో వస్తున్నారని ఆరోపణలు చేశారు. క్రీడను, క్రీడాకారులను బాధించే ఎటువంటి చర్య తీసుకోవద్దని పునరుద్ఘాటించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ..రెజ్లర్ల నిరసన చేసిన ప్రాంతానికి రాజకీయ నాయకులంతా పెద్ద ఎత్తున తరలివచ్చారని మండిపడ్డారు. అయినా ఇది రాజకీయాలు చేయడానికి వేదిక కాదని రెజ్లర్లే చెప్పారు కానీ వారంతా వచ్చారు. ఐనా తాను దీని గురించి పెద్దగా వ్యాఖ్యానించనన్నారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ముగిసే వరకు వేచి ఉండమని మాత్రమే అథ్లెట్లను కోరుతున్నా. ఢిల్లీ పోలీసులు సుప్రీం కోర్టుకు తెలియజేసేలా ఎఫ్ఆర్ దాఖలు చేశారు దర్యాప్తు వరకు పూర్తి అయ్యింది. దయచేసి క్రీడకు, ఆటగాళ్లకు హాని కలిగించే ఏ చర్య తీసుకోవద్దని విజ్ఞప్తిచేశారు. అలాగే ఈ సమస్యపై విచారకు కమిటీ వేయాలన్న రెజ్లర్ల డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించింది. వారు నిరసన వ్యక్తం చేస్తున్న ఫెడరేషన్ చీఫ్ని కూడా తొలగించారు. అంతేగాదు క్రీడాకారుల శిక్షణ, క్రీడా మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించింది. ఇప్పుడు కూడా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు పనిచేస్తోంది అని అనురాగ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ టైంలో నిరసనకు యత్నించిన రెజ్లర్లపై పోలీసుల చర్యకు సంబంధించిన దృశ్యాలు యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేశాయి. ఆ తదనందర ఈ అంశంపై మొట్టమొదటిసారగా ప్రభుత్వం వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా ఉండగా, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే ఎలాంటి శిక్షను స్వీకరించడానికైనా సిద్ధమేనని అన్నారు. ఒక్క ఆరోపణ రుజువైనా ఉరి వేసుకుంటానని చెప్పారు. రెజ్లర్లను ఉద్దేశిస్తూ.. మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకి సమర్పించండి అని సవాలు కూడా విసిరారు సదరు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్. (చదవండి: కొందరు నేతలు ఆ వ్యాధితో బాధపడుతున్నారు.. ప్రధాని మోదీ కూడా!: రాహుల్) -
TSPSC కేసులో ED దూకుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు ప్రదర్శిస్తోంది. మనీల్యాండరింగ్ అభియోగాలతోపై ఈడీ, పేపర్ లీక్ కేసులోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న సిట్కు.. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఇదివరకే లేఖ రాసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. జైల్లో ఉన్న నిందితులను విచారించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు, అందుకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయాలంటూ కోర్టుకు సైతం విజ్ఞప్తి చేసింది దర్యాప్తు సంస్థ. ఈ మేరకు మార్చి 23వ తేదీన సిట్ దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ ఏసీపీకు ఈడీ ఓ లేఖ రాసింది. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ తమకు ఇవ్వాలని కోరిన ఈడీ.. మీడియా కథనాలు, పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం తదిరత వివరాల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. అంతేకాదు.. పీఎంఎల్ ఏ సెక్షన్ 50 కింద నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ స్టేట్మెంట్స్ను రికార్డ్ చేయనుంది ఈడీ. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న నిందితులు ప్రవీణ్, రాజశేఖర్లను నలుగురు అధికారులతో కూడిన బృందం విచారించనుందని ఈడీ కోర్టుకు తెలిపింది. పీఎంఎల్ యాక్ట్ సెక్షన్ 48, 49 కింద ఈడీకి విచారించే అర్హత ఉందని తెలిపింది. విచారణ సందర్భంగా జైల్లో లాప్ టాప్, ప్రింటర్ ,ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించాలని కోరుతూ కోర్టులో ఈడీ ఓ పిటిషన్ దాఖలు చేసింది. జైల్ లో విచారణ సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని చంచల్గూడా సూపరిడెంట్కు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును ఈడీ కోరింది. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు.. కీలక ఘట్టానికి సిట్ విచారణ..
సాక్షి, హైదరాబాద్: టీఎస్సీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఇందులో కీలక ఘట్టమైన క్రాస్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఈ కేసులో అరెస్టు అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను సరిపోల్చి చూడటం ద్వారా అడ్డదారిలో లబి్ధపొందిన అభ్యర్థులు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనేది తేల్చనుంది. మరోపక్క మంగళవారం హైకోర్టుకు సమర్పించేందుకు సమగ్ర స్టేటస్ రిపోర్టు సిద్ధం చేస్తోంది. ఇందులో ఇప్పటివరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు, తీసుకున్న చర్యలను వివరించనుంది. కమిషన్ నిర్వహించే ఆరు రకాలైన పరీక్షలకు సంబంధించిన 15 క్వశ్చన్ పేపర్లు లీకైనట్లు ఇప్పటికే సిట్ నిర్ధారించింది. వీటిలో గ్రూప్–1 ప్రిలిమ్స్ సహా నాలుగు పరీక్షలను కమిషన్ రద్దు చేయగా మూడింటిని వాయిదా వేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న కమిషన్ కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన పి.ప్రవీణ్కుమార్, టీఎస్పీఎస్సీ మాజీ నెట్వర్క్ అడ్మిన్ ఎ.రాజశేఖర్రెడ్డి సహా మొత్తం 17 మంది నిందితులను సిట్ అరెస్టు చేసింది. వీరిలో డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్ ఖరీదు చేసిన ఖమ్మం జంట మినహా మిగిలిన 15 మందినీ సిట్ అధికారులు న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ప్రవీణ్, రాజశేఖర్ సహా నలుగురి విషయంలో అదనపు కస్టడీ ప్రక్రియా జరిగింది. కాగా ఈ కేసు దర్యాప్తులో వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు బృందాలుగా మారి నిందితులను విచారించారు. దాదాపు 37 ప్రశ్నలతో కూడిన క్వశ్చనీర్ ఆధారంగా ముందుకు వెళ్లారు. తొలుత నిందితులను విడివిడిగా, ఆపై ఒకరిద్దరిని కలిపి ఇలా వేర్వేరు పంథాల్లో విచారించిన అధికారులు ప్రతి ఒక్కరి నుంచి ప్రతి సందర్భంలోనూ వాంగ్మూలాలు నమోదు చేశారు. వీటన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేయడం కోసం ఓ ప్రత్యేక క్రాస్ వెరిఫికేషన్ బృందం సిట్లో ఏర్పాటైంది. వాంగ్మూలాల్లో తేడాలు తేల్చేందుకే.. వాంగ్మూలాల మధ్య ఎక్కడైనా తేడాలు ఉన్నాయా? ఒకే వ్యక్తి చెప్పిన, వేర్వేరు నిందితులు ఒకే అంశంపై ఇచి్చన సమాచారంలో అనుమానాస్పద అంశాలు ఉన్నాయా? అనేది ఈ ప్రక్రియ ద్వారా గుర్తించనున్నారు. అలాగే నిందితుల కాల్ డిటెయిల్స్, వాట్సాప్ చాటింగ్స్లతో పాటు బ్యాంకు లావాదేవీలు, యూపీఐ విధానంలో జరిగిన నగదు బదిలీలు, ఆయా సమయాల్లో వీరి లొకేషన్స్ ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ క్రాస్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా దర్యాప్తులో మిస్సైన లింకులతో పాటు అడ్డదారిలో లబి్ధపొందిన అభ్యర్థులను గుర్తించాలని సిట్ నిర్ణయించింది. ఖమ్మం జంటను కస్టడీలోకి తీసుకుని విచారించడం మినహా మిగతా దర్యాప్తు దాదాపు పూర్తయింది. తదుపరి న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను బట్టి సిట్ అధికారులు ముందుకు వెళ్లనున్నారు. చదవండి: అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ -
రూబీ లాడ్జి ప్రమాదం: అంత ఘోరం ఎలా జరిగింది?
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది మంది టూరిస్టుల ప్రాణాలు బలిగొన్న సికింద్రాబాద్ రూబీ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు ఉన్నతాధికారులు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది మరణించగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.పెను విషాదం నింపిన ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. రూబీ లాడ్జి ఘటనపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. లాడ్జి ఓనర్ రంజితసింగ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లాడ్జిలో దిగనవాళ్లు.. కాలిన గాయాలతో పాటు ఊపిరాడక మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. గాంధీతో పాటు మరో రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల ఫోన్ నెంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు పోలీసులు. ఆర్డీవో ఆద్వర్యంలో గాంధీ ఆస్పత్రిలో మృతదేహాలకు పంచనామా నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం? ఇక ప్రమాద సమయంలో కాంప్లెక్స్లో 30 మందితో పాటు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్లు తేలింది. అయితే ప్రమాదానికి ఈ-బైక్ బ్యాటరీ పేలుడే కారణమా? లేదంటే విద్యుత్ షాట్ సర్క్యూటే కారణమా? అనే విషయాలపై ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులు ఆరాలు తీస్తున్నారు. సెల్లార్ లో నిబంధనలకు విరుద్ధంగా ఎలక్ట్రిక్ బైక్ సెంటర్ ఉండడం, అలాగే.. లాడ్జి వున్న చోట.. ఎలక్ట్రిక్ బైక్స్ నిర్వాహణకు ఎలా అనుమతి ఇచ్చారని కిందిస్థాయి అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే ఘటనా స్థలంలో క్లూస్ టీం క్లూస్ సేకరించాయి. మరోవైపు కాంప్లెక్స్లో అగ్నిమాపక శాఖ నిబంధనలు(ఫైర్ సేఫ్టీ రూల్స్) ఏ మాత్రం లేవని గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో తప్పించుకునేందుకు దారులు లేవని, బిల్డింగ్ మొత్తానికి ఒకే దారి ఉండడం వల్లే ఘోరం జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మెట్ల మార్గం గుండా కిందకు రాలేక.. దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. సాయంత్రకల్లా ప్రమాదంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: రూబీ లాడ్జి ప్రమాదంపై ఫైర్ అధికారి ఏమన్నారంటే.. -
72 గంటల్లో మూడు హత్యలు.. భయాందోళనలో ప్రజలు.. సీరియల్ కిల్లర్ పనేనా?
భోపాల్: గడిచిన 72 గంటల్లో వేరు వేరు ఘటనల్లో ముగ్గురు సెక్యూరిటీ గార్డులు హత్యకు గురయ్యారు. ఈ దారుణాలు మధ్య ప్రదేశ్ రాష్ట్రం సాగర్ ప్రాంతంలో వెలుగు చూశాయి. దీంతో నగరంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే మూడింటిలో రెండు ఒకే వ్యక్తి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చంపిన విధానం చూస్తుంటే హంతకుడు సీరియల్ కిల్లర్గా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. విచారణ పూర్తి అవ్వకముందే ఎలాంటి స్పష్టతకు రాలేమన్నారు. అంతేగాక పోలీసులు అనుమానిత హంతకుడికి సంబంధించిన స్కెచ్ను విడుదల చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కళ్యాణ్ లోధి(50) అనే వ్యక్తిని ఆగస్టు 28 అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చేతిలో హత్యకు గురయ్యాడు. తలను సుత్తితో పగులగొట్టి అతి కిరాతకంగా చంపేశారు. చదవండి: కలిచివేసే ఘటన: వైద్యుడి కోసం పడిగాపులు...చివరికి తల్లి ఒడిలోనే ఆ చిన్నారి... నిందితుడి స్కెచ్ ఆగస్టు 29 అర్థరాత్రి రాత్రి.. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్నరో సెక్యూరిటీ గార్డు శంభు నారాయణ్ దూబే (60)ను కూడా రాయితో తల పగులకొట్టి హత్య చేశారు. ఇక మూడో ఘటనలో, ఆగస్టు 30 రాత్రి సాగర్లోని మోతీ నగర్ ప్రాంతంలో ఒక ఇంటికి కాపలాగా ఉన్న వాచ్మెన్ మంగళ్ అహిర్వార్ను కర్రతో దాడి చేసి చంపినట్లు అధికారులు గుర్తించారు. కాగా ముందు రెండు హత్యలు ఒకే తరహాలో ఉన్నాయని, క్రైమ్ జరిగిన క్రమాన్ని చూస్తే ఒకే వ్యక్తి హత్య చేసినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. కానీ నిందితులు ఒకరి కంటే ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ కుష్వాహా తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా హంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. హంతకుడు సైకో లేదా సీరియల్ కిల్లర్ అయ్యి ఉండొచ్చిన పేర్కొన్నారు. చదవండి: భార్య పుట్టింటికి వెళ్లిందని... ట్రాన్స్ జెండర్ని ఇంటికి రప్పించి... -
కేంద్ర మంత్రిని గుర్తుపట్టని అధికారి.. ఉద్యోగానికి ఎసరు?
లక్నో: పైఅధికారులు ఫోన్ చేస్తేనే ఎంతో హడావిడి చేస్తారు అధికారులు. అలాంటిది కేంద్ర మంత్రి ఫోన్ అంటే మరి ఎలా ఉంటుంది? కానీ, ఫోన్ చేసిన కేంద్రమంత్రి గొంతును గుర్తుపట్టకపోవడం వల్ల ఓ అధికారి ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి, ఉత్తర్ప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గ ఎంపీ స్మృతి ఇరానీ ఫోన్ చేయగా ఓ శాఖలో పని చేస్తున్న క్లర్క్ గుర్తించకపోవటంతో ఆయనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఏం జరిగింది? అమేథీ లోక్సభ నియోజకవర్గంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగస్టు 27న పర్యటించారు. అదే సమయంలో ముసఫిర్ఖానా తహసిల్లోని పూరే పహల్వాన్ గ్రామానికి చెందిన కరుణేశ్(27) అనే వ్యక్తి తన తల్లికి పెన్షన్ మంజూరు కాలేదనే విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్థానిక కార్యాలయంలో క్లర్క్ దీపక్ కారణమని పేర్కొన్నారు. పెన్షన్ దరఖాస్తును ఇంకా అతడు ధ్రువీకరించలేదని తన గోడు వెల్లబోసుకున్నాడు. వెంటనే స్పందించిన స్మృతి ఇరానీ.. ఆ అధికారికి ఫోన్ చేశారు. కానీ, ఆ వ్యక్తి మాత్రం కేంద్ర మంత్రి గొంతును గుర్తు పట్టలేకపోయారు. దీంతో ఆమె పక్కనే ఉన్న జిల్లా ఉన్నతాధికారి ఆ ఫోన్ తీసుకొని క్లర్క్తో మాట్లాడారు. వెంటనే కార్యాలయానికి రావాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై విచారణ జరపాలని జిల్లా అధికారులకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సూచించారు. కరుణేశ్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అధికారులు.. క్లర్క్ నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై ముసఫిర్ఖానా సబ్డివిజినల్ మేజిస్ట్రేట్ విచారణ జరుపుతారని.. నివేదిక ప్రకారం నిర్లక్ష్యం వహించిన అధికారిపై చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మోదీ రోజుకు ఏడు సార్లు నమాజ్ చేసేవారు.. కాంగ్రెస్ మహిళా నేత వ్యాఖ్యలపై దుమారం.. -
ఎంపీ రఘురామపై సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నందున రఘురామపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ కేసు కొట్టేయాలన్న రఘురామ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. రఘురామకృష్ణంరాజు సీఐడీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్లోని దిల్కుష్ గెస్ట్హౌస్లో సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. చదవండి: రూటు మార్చింది.. అనకాపల్లిలో ప్రవేశించిన పెద్దపులి -
చిక్కుల్లో సహారా: సుప్రీంకోర్టులో భారీ షాక్!
న్యూఢిల్లీ: సహారా గ్రూప్, ఆ సంస్థ చీఫ్ సుబ్రతా రాయ్, ఇతర అధికారులకు సుప్రీంకోర్టులో గురువారం తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. సహారా గ్రూపునకు సంబంధించిన తొమ్మిది కంపెనీలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) విచారణను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్, ఇతర అధికారులపై లుక్అవుట్ సర్క్యులర్లతో సహా తదుపరి చర్యలు చేపట్టడానికి కూడా సుప్రీం రూలింగ్ వీలు కల్పిస్తోంది. దర్యాప్తుపై స్టే విధించడం ‘చాలా అసాధారణమైన ఉత్తర్వు‘ అని న్యాయమూర్తులు డీ వై చంద్రచూడ్, బేల ఎం త్రివేదిలతో కూడిన వెకేషన్ బెంచ్ వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలపై ఎస్ఎఫ్ఐఓ గత ఏడాది డిసెంబర్ 13న దాఖలు చేసిన అప్పీల్ను అనుమతించింది. తొమ్మిది కంపెనీలూ ఇవీ... మూడు గ్రూప్ సంస్థలు-సహారా క్యూషాప్ యూనిక్ ప్రొడక్ట్స్ రేంజ్ లిమిటెడ్, క్యూ గోల్డ్ మార్ట్ లిమిటెడ్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వ్యవహారాలపై విచారణకు కేంద్రం 2018 అక్టోబర్ 31న ఆదేశాలు ఇచ్చింది. మరో ఆరు కంపెనీలు– ఆంబీ వ్యాలీ లిమిటెడ్, క్వింగ్ అంబి సిటీ డెవలపర్స్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా ప్రైమ్ సిటీ లిమిటెడ్, సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్లపైనా విచారణకు కేంద్రం 2020 అక్టోబరు 27న ఆదేశాలు ఇచ్చింది. వీటిని ఢిల్లీ హైకోర్టులో సవాలు చూస్తూ సహారా గ్రూప్ కేంద్రం ఉత్తర్వులపై స్టే తెచ్చుకుంది. రెండు నెలల్లో విచారణ పూర్తికి ఆదేశాలు... కాగా, సహారా గ్రూప్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్లకు సంబంధించి ‘మెరిట్స్’ ప్రాతిపదికన తమ తాజా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై దాఖలు చేసిన రిట్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయన్న అంశాన్ని ప్రస్తావించింది. పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్లను త్వరిత గతిన పరిష్కరించాలని పేర్కొంది. వేసవి సెలవులు ముగిసి, కోర్టును తిరిగి తెరిచిన తర్వాత రెండు నెలల్లోపు వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని బెంచ్ ఢిల్లీ హైకోర్టుకు సూచించింది. -
ఎలక్ట్రిక్ స్కూటర్లు తగలబడటానికి కారణాలు ఇవి ..
వేసవి రావడంతోనే దేశవ్యాప్తంలా ఎలక్ట్రిక్ వెహికల్స్ అగ్నిప్రమాదాల్లో జరిగాయి. ఒకటి కాదు రెండు కాదు గత నెలరోజులుగా ఉన్నట్టుండి ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగాయి. ఒకటి రెండు ఘటనల్లో ప్రాణనష్టం కూడా జరిగింది. దీంతో ఈవీ స్కూటర్లలో ప్రమాదాలపై కేంద్రం హై లెవల్ విచారణ కమిటీని నియమించింది. ఇందులో ప్రాథమికంగా వెల్లడైన అంశాలతో రాయిటర్స్ కథనం ప్రచురించింది. ఇవి కారణాలు ఎలక్ట్రిక్ స్కూటర్లలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణాల్లో బ్యాటరీ సెల్స్, మాడ్యుల్స్లో లోపాల కారణంగా జరిగినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదాలు జరిగిన చోట వివిధ కంపెనీలకు చెందిన స్కూటర్ల నుంచి శాంపిల్స్ తీసుకుని ఈ దర్యాప్తు చేపట్టారు. - ఒకినావా ప్రమాదానికి సంబంధించి సెల్స్, బ్యాటరీ మాడ్యుల్స్ కారణంగా తేల్చింది. - తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్యూర్ ఎలక్ట్రిక్ అగ్నిప్రమాదానికి సంబంధించి బ్యాటరీ కేసింగ్లో లోపాలు ఉన్నట్టు గుర్తించారు. - ఇక దేశవ్యాప్తంగా భారీగా అమ్ముడైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్లో లోపాలు ఉన్నట్టుగా తెలిసింది, అయితే దీనిపై ఓలా స్పందిస్తూ.. ఓలా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్లో ఏ సమస్యా లేదని కానీ ఐసోలేటెడ్ థర్మల్ ఇష్యూ కారణంగా ఓలా స్కూటర్లు ఫైర్ యాక్సిడెంట్కి గురైనట్టుగా తెలపింది. తుది నివేదిక ఎలక్ట్రిక్ స్కూటర్లలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై ఏర్పాటైన కమిటీ ప్రస్తుతానికి ప్రాథమిక అంచనాలకే వచ్చిందని. మరిన్ని అంశాలను లోతుగా పరిశీలించిన అనంతరం తుది నివేదిక వెలువడనుంది. దీనికి కనీసం మరో రెండు వారాల సమయం పట్టవచ్చని అంచనా. చదవండి: Electric Scooter: మంటల్లో కాలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్ -
అగ్నికి ఆహుతైన 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. కేంద్రం కన్నెర్ర?
పెట్రోలు ధరల నుంచి అతి పెద్ద ఉపశమనంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలు భావిస్తున్న తరుణంలో ఊహించని ప్రమాదాలు ఇటు ప్రజలను అటు ఈవీ తయారీదారులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మార్చి మధ్య నుంచి దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అకస్మాత్తుగా తగలబడి పోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని నాసిక్లో జితేంద్ర ఈవీ కంపెనీకి చెందిన 20 ఎలక్ట్రిక స్కూటర్లు 2022 ఏప్రిల్ 12న మంటల్లో చిక్కుకుని కాలిపోయాయి. ఫ్యాక్టరీ నుంచి స్కూటర్లను రవాణా చేసేందుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వరుసగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అగ్నికి ఆహుతి అవుతుండటంపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఏ కారణం చేత ఇలా వాహనాలు తగలబడిపోతున్నాయో విచారణ జరపాల్సిందిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరుకు ఆదేశాలు జారీ చేసింది. అంతకంటే ముందే పూనేలో ఓలా స్కూటర్ తగలబడిపోయిన ఘటనపై కేంద్రం స్పందించింది. ఉన్నట్టుండి ఈవీ స్కూటర్లు ఎందుకు మంటల్లో చిక్కుకుంటున్నాయో కనిపెట్టాలంటూ సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్)కు సూచింంచింది. ఈ విచారణ కొనసాగుతుండగానే మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో కేంద్రం విచారణ బాధ్యతలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వంటి ప్రతిష్టాత్మక సంస్థకి అప్పగించింది. ఇండియాలో ఈవీ వెహికల్స్ మార్కెట్ పుంజుకుంటోంది. 2020-21 ఏడాదిలో దేశవ్యాప్తంగా 1,34,821 ఈవీలు అమ్ముడవగా 2021-22 ఏడాదిలో 4,29,417 ఈవీలు అమ్ముడయ్యాయి. ఇలా నాలుగింతలు మార్కెట్ పెరిగిన తరుణంలో ప్రమాదాలు కలవరం కలిగిస్తున్నాయి. నాసిక్లో తాజాగా చోటు చేసుకున్న ఘటన ఈవీ స్కూటర్లకు సంబంధించి అతి పెద్ద ప్రమాదంగా నమోదు అయ్యింది. చదవండి: కాలిపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..కారణం ఏంటంటే? -
లఖింపూర్ ఖేరీ కేసులో కీలక పరిణామం
లఖింపూర్ ఖేరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అశిష్ మిశ్రా బెయిల్ను రద్దు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటూ రిటైర్డ్ జడ్జి కమిటీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని సదరు జడ్జి ప్రతిపాదనపై స్పందించాలంటూ కోరింది సుప్రీం కోర్టు. అంతేకాదు ఈ స్పందన కోసం ఏప్రిల్ 4వ తేదీని గడువుగా విధించింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన రైతు నిరసనల సందర్భంగా.. రైతుల మీదుగా కారు పనిచ్చి వాళ్ల మరణాలకు కారణం అయ్యాడు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రా. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు రాజకీయ విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాల నడుమ అశిశ్ మిశ్రా అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో 2022, ఫిబ్రవరి 10వ తేదీన అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ను సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది బాధిత కుటుంబం. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై వాదనలు వింటోంది. ఈ మేరకు ఇంతకు ముందు(మార్చి 16న) యూపీ ప్రభుత్వంతో పాటు ప్రధాన నిందితుడు అశిశ్ మెహ్రాకు ‘బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలంటూ’ నోటీసులు సైతం జారీ చేసింది. లఖింపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు చేపట్టిన.. హైకోర్టు రిటైర్డ్ జడ్జి రాకేష్ కుమార్ జైన్ ఇప్పటికే నివేదిక సమర్పించారు కూడా. -
బీజేపీ వీరాభిమాని హత్య.. యోగి సర్కార్ సీరియస్
బీజేపీ వీరాభిమాని ఒకరు దారుణ హత్యకు గురికావడం పట్ల సర్కార్ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా ఉంది. బీజేపీకి మద్ధతు ఇవ్వడం.. ఆపై ఎన్నికల విజయోత్సవ సంబురాల్లో పాల్గొనడంతో చుట్టుపక్కల వాళ్లే కోపంతో అతనిపై దాడి చేసి చంపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. పోలీసుల కథనం ప్రకారం.. మార్చి 20న ఆదివారం కుషి నగర్ కథార్ఘరి గ్రామంలో బాబర్ అలి(25) అనే యువకుడిపై స్థానికులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బాబర్ను లక్నోలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ.. వారం తర్వాత బాబర్ కన్నుమూశాడు. అయితే అతని మృతదేహాన్ని పోలీసులు స్వస్థలానికి తీసుకురాగా.. నిందితులను అరెస్ట్ చేస్తేనేగానీ అంత్యక్రియలకు ముందుకెళ్లమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. దీంతో న్యాయం చేస్తామని పోలీసుల హామీతో.. చివరకు బాబర్ అలి అంత్యక్రియలు జరిగాయి. బీజేపీ హార్డ్కోర్ ఫ్యాన్ బాబర్ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ప్రకారం.. ఆ యువకుడు బీజేపీకి వీరాభిమాని. మొన్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేశాడు. అంతేకాదు మార్చి 10వ తేదీన ఫలితాల అనంతరం.. బీజేపీ విజయంపై సంతోషంతో సంబురాల్లో పాల్గొన్నాడు కూడా. అయితే ఈ విషయమై తరచూ.. స్థానికులు అతనికి హెచ్చరికలు కూడా జారీ చేసేవారట. బీజేపీకి మద్దతు ఇచ్చినా, ప్రచారాల్లో పాల్గొన్నా బాగోదని బెదిరించేవారట. ఈ క్రమంలో ఫలితాలు వచ్చిన రోజు స్వీట్లు పంచిన టైంలోనే స్థానికులతో పెద్ద వాగ్వాదం జరిగిందని బాబర్ కుటుంబం చెబుతోంది. ఈ విషయమై తాము కూడా బాబర్ను సున్నితంగా వారించామని కానీ, అతను మాత్రం మొండిగా ముందుకెళ్లాడని బాబర్ తల్లి అంటోంది. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కటాకటాల వెనక్కి పంపి కఠినంగా శిక్షించాలని ఆ కుటుంబం ప్రభుత్వాన్ని కోరుతోంది. స్పందించిన సీఎంవో ఇదిలా ఉండగా.. ఈ ఘటన దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల నష్టపరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు బాబర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సీఎంవో ట్వీట్ ద్వారా వెల్లడించింది. #UPCM श्री @myogiadityanath जी ने कुशीनगर के कठघरही गांव के श्री बाबर जी की लोगों द्वारा पिटाई से हुई मौत पर गहरा शोक व्यक्त किया है। मुख्यमंत्री जी ने शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है। उन्होंने मामले की गहनता से निष्पक्ष जांच हेतु अधिकारियों को निर्देश दिए हैं। — CM Office, GoUP (@CMOfficeUP) March 27, 2022 -
ఆ వివరణ సరిపోదన్న పాక్! ఉమ్మడి విచారణకు డిమాండ్
It is not enough to satisfy Pakistan: క్షిపణి ఘటనపై భారత రణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన ప్రకటనను పాకిస్తాన్ తిరస్కరించింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ మార్చి 9 నాటి సంఘటనలా 'బాధ్యతా రహితమైన వివరణగా పేర్కొన్నాడు. పైగా ఇది 'అత్యంత బాధ్యతారహితమైన చర్య' అని అన్నారు. భారత్ ఆదేశించిన దర్యాప్తును కూడా ఏకపక్షమైన విచారణగా ఆరోపించింది. పాకిస్తాన్ని సంతృప్తి పరచడానికి రాజ్నాథ్ సింగ్ వివరణ సరిపోదని, పైగా తిరస్కరిస్తున్నాం అని చెప్పారు. తాము ఉమ్మడి దర్యాప్తును కోరుతున్నాం అని పునరుద్ఘాటించారు. అంతేకాదు ఈ ఆయుధం వార్హెడ్ను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నందున ఈ సంఘటన ప్రభావం ఒక ప్రాంతానికి పరిమితం కాదన్నారు. ఇది కేవలం ప్రమాదం అని చెబితే సరిపోదు అని తేల్చి చెప్పారు. అయితే భారత్ తన తప్పును అంగీకరించడమే కాక ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తానని కూడా తెలిపింది. పైగా తప్పులుంటే చర్యలు తీసుకుంటానని హామీ కూడా ఇచ్చింది. మరోవైపు అమెరికా కూడా ఈ విషయమై స్పందించింది. పైగా ఈ ఘటన అనుకోని ప్రమాదమని మరేం ఉద్దేశాలు లేవని భావిస్తున్నాం అని చెప్పింది కూడా. కానీ పాక్ మాత్రం ఈ విషయాన్ని పెద్దదిగా చేసి చూడటమే కాక తన అక్కసును వెళ్లగక్కుతోంది. (చదవండి: పాక్లో భారత మిస్సైల్ ప్రమాదం.. రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన) -
గెయిల్ డైరెక్టర్ రంగనాథన్ అరెస్ట్
న్యూఢిల్లీ: లంచాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై గెయిల్ మార్కెటింగ్ వ్యవహారాల డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్గేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. నోయిడాలో ఆయనకు ఉన్న నివాసంలో సోదాలు నిర్వహించి రూ.1.3 కోట్లతో పాటు విలువైన ఆభరణాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 2021లో గెయిల్ డైరెక్టర్ను ఇరువులు మధ్యవర్తులు ఎలా కలిశారు, లంచం ఎలా ఇచ్చారన్న విషయాన్ని సీబీఐ ఎఫ్ఐఆర్ వివరించింది. పెట్రో కెమికల్ ఉత్పత్తులను రాయితీపై అందజేస్తే లంచాలు అందించేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీల యజమానులతో కూడా నిందితులు సమావేశం అయ్యారని ఎఫ్ఐఆర్ తెలిపింది. సీబీఐ జరిపిన దాడుల్లో రంగనాథన్ సహాయకుడు ఎన్ రామకృష్ణన్ నాయర్ నివాసం కూడా ఒకటి. ఈ నివాసం నుంచి రూ.75 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో రంగనాథన్, నాయర్లతోపాటు పవన్ గౌర్, రాజేష్ కుమార్, యునైటెడ్ పాలిమర్ ఇండస్ట్రీస్కు చెందిన సౌరభ్ గుప్తా, బన్సల్ ఏజెన్సీస్కి చెందిన ఆదిత్య బన్సాల్ ఉన్నారు. -
పట్టపగలు ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు?
పాట్నా: త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఓ గ్రామంలో పర్యటించాడు. అక్కడి గ్రామస్తులకు రూ.500 నోట్లు ఇస్తూ వీడియోకు చిక్కాడు. ప్రస్తుతం ఆ వీడియో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. పట్టపగలు నగదు రాజకీయం జరగడంపై అధికార పార్టీ గుర్రుమంది. ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. చదవండి: స్విమ్మింగ్పూల్లో రాసలీలలు.. రెడ్హ్యాండెడ్గా దొరికిన డీఎస్పీ జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్కుమార్ శుక్రవారం ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) యువ నాయకుడు, మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ ఓ గ్రామంలో మహిళలకు డబ్బులు పంచుతూ కనిపించారు. తన కాన్వాయ్లో కూర్చుని అక్కడకు వచ్చిన మహిళలకు బహిరంగంగా రూ.500 నోట్లు ఇస్తున్నాడు. ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు? లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్’ అని పేర్కొంటూ ఆ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోపై అధికారులకు అధికార పార్టీ జేడీయూ ఫిర్యాదు చేసింది. దీంతో గోపాల్గంజ్ జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. బైకుంత్పుర్ సమీపంలో తేజస్వి డబ్బులు పంచాడని ఆరోపణలు రావడంతో స్థానిక పోలీసులు, బీడీఓను విచారించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ డబ్బు పంపిణీ అధికార పార్టీ, ఆర్జేడీ మధ్య వాగ్వాదం మొదలైంది. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి कोई जानता नहीं-पहचानता नहीं कौन है ये राजकुमार जिसने आंचल में रुपया गिराया है घमंड का खुमार इस कुमार पर इतना छाया, अमीरी-गरीबी का फ़र्क़ बताया कोई पीछे से लालू का लाल है बताता भूत के वर्तमान का हाल दिखाता जाओ बबुआ अपनी पहचान बनाओ आर्थिक लुटेरे होने का दाग़ मिटाओ pic.twitter.com/lUgV3Hxl11 — Neeraj kumar (@neerajkumarmlc) September 10, 2021 -
నిమజ్జనంపై నియంత్రణ ఉండాలి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రానున్న వినాయకచవితిని పురస్కరించుకొని గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది. గణేశ్ మండపాల ఏర్పాటు మొదలు నిమజ్జనం వరకు నియంత్రణ చర్యలుండాలని, ఈ మేరకు ఆంక్షలు విధించాలని సూచించింది. మండపాలలో ఏర్పాటు చేసే లౌడ్స్పీకర్లతో శబ్దకాలుష్యం, విగ్రహాల నిమజ్జనం కారణంగా ఏర్పడే జలకాలుష్యంతో ఇతరులు ఇబ్బందిపడతారని, ఒకరి మతవిశ్వాసాల కోసం ఇంకొకరిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదని తేల్చిచెప్పింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, మండపాల దగ్గర, నిమజ్జనం సమయంలో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్లో విగ్రహాల నిమజ్జనం ఎక్కడికక్కడ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. హుస్సేన్సాగర్లో నిమజ్జనంపై గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం లేదంటూ న్యాయవాది ఎం.వేణుమాధవ్ దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి.వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ‘భక్తులను నియంత్రించడం అంత సులభమేమీ కాదని మాకు కూడా తెలుసు, అయినా కోర్టు ఆదేశాలను చూపించి నియంత్రణ చర్యలు చేపట్టాలి’అని సూచించింది. మండపాల ఏర్పాటు మొదలు నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), పీసీబీ, గణేశ్ ఉత్సవ సమితి, పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది. 50 వేల విగ్రహాలు ఎలా సరిపోతాయి ? జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 50 వేల ఉచిత గణేశ్ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్ హైకోర్టుకు నివేదించారు. ఎవరికి వారు ఇంట్లోనే మట్టి వినాయకులను నిమజ్జనం చేసుకోవాలని సూచిస్తున్నామని తెలిపారు. ‘జంటనగరాల జనాభా ఎంత, మీరిచ్చే 50 వేల ఉచిత విగ్రహాలు ఎలా సరిపోతాయి, విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశాం, మన బాధ్యత అయిపోయిందని అనుకుంటే ఎలా’అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో భారీ విగ్రహాలు ఏర్పాటు చేయకుండా, మట్టివిగ్రహాలను ఏర్పాటు చేసేలా చూడాలని, సహజ రంగులనే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. అన్ని విగ్రహాలను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయకుండా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 16 ప్రత్యేక నీటికొలనులను నిర్మించారని, అయినా వాటిని వినియోగించుకోకుండా మెజారిటీ విగ్రహాలు హుస్సేన్సాగర్లోనే నిమజ్జనం చేస్తున్నారని తెలిపారు. పీసీబీ ఏం చేస్తోంది ? ‘హుస్సేన్సాగర్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అనేక సూచనలు చేసింది. వాటి అమలు తీరును పర్యవేక్షించడం మరిచింది. పీసీబీ సూచనలను ఇతర విభాగాల అధికారులు పాటించకపోతే వారిపైనా చర్యలు తీసుకోవచ్చు. అయినా ఎందుకు మౌనంగా ఉంటోంది’’అని పీసీబీ తరఫున హాజరైన న్యాయవాది శివకుమార్ను ధర్మాసనం ప్రశ్నించింది. హుస్సేన్సాగర్ ఒకప్పుడు కాలుష్య రహితంగా ఉండేదని, నిమజ్జనంతో కాలుష్య కాసారంగా మారిందని పేర్కొన్నారు. మండపాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చే సమయంలోనే సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేసేలా నిర్వాహకులకు తెలియజేయాలని సూచించింది. చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం అన్న చోరీ
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ కష్టపడ్డాడు: కేటీఆర్
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
ఎంపీ స్వాతి మలివాల్పై దాడి నిజమే.. స్పందించిన ‘ఆప్’
రొమాంటిక్ కామెడీ చిత్రంగా సంగీత్.. గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
ఢిల్లీతో లక్నో డూర్ ఆర్ డై మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
త్వరలో మస్క్కు ముప్పు.. భారత్ సంతతి సీఈవో సంచలన వ్యాఖ్యలు
తప్పక చదవండి
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement