ఇచ్చోడ: ఆదివాసీల సమస్యలను తమ మేనిఫెస్టోలో పొందుపర్చిన పార్టీలకే తమ మద్దతు ఉంటుందని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో తుడుందెబ్బ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టబద్ధతలేని లంబాడీల ఎస్టీ హోదా రద్దు చేయాలని, భూ బదాలాయింపు చట్టం 1/70, పెసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, పోడు భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని, ఐటీడీఏ ద్వారా మెగా ఏజెన్సీ డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29న ఇచ్చోడ, 30న జైనూర్, మే 1న ఇంద్రవెల్లి, 2న ఆసిఫాబాద్, 3న ఖానాపూర్, 5న ఆదిలాబాద్, 6న నిర్మల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర సహాయ కార్యదర్శి పుర్క బాపూరావు, జిల్లా అధ్యక్షుడు నైతం రమేశ్, జిల్లా కార్యనిర్వహణ అధ్యక్షుడు సోయం రాందాస్, జిల్లా కార్యదర్శి గేడం భరత్, జిల్లా ఉపాధ్యక్షుడు కోట్నాక్ బారిక్రావు, తదితరులు పాల్గొన్నారు.