సూపర్‌హిట్‌ | Sakshi
Sakshi News home page

సూపర్‌హిట్‌

Published Tue, Apr 23 2024 8:40 AM

కశింకోట మండలం చింతలపాలెంలో శనివారం జరిగిన బహిరంగ సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం - Sakshi

జనమే జనం.. పోటెత్తిన అభిమాన ప్రవాహం.. రోడ్లకిరువైపులా జనం బారులు.. మహిళల హారతులు.. పూలవర్షాలతో కనీవినీ ఎరుగని అఖండ స్వాగతం.. ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండు రోజులపాటు సాగిన సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో కనిపించిన దృశ్యాలివి.. సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో బస్సుయాత్ర పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. అడుగడుగునా అశేష జనవాహిని నడుమ సాగిన బస్సుయాత్ర ప్రతిపక్ష పార్టీల గుండెల్లో వణుకు పుట్టించింది. సంక్షేమ రథసారధి.. దగ్గరి నుంచి చూడాలని.. వీలైతే మాట్లాడాలని.. ఒక్క ఫొటో తీసుకోవాలని ప్రజలు ఉత్సాహం చూపించగా.. ఆయనే స్వయంగా బస్సు దిగి ఆప్యాయంగా పలకరించడం.. ‘నేను ఉన్నానంటూ’ భరోసా కల్పించడంతో శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది.

సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి విశాఖలో అడుగుపెట్టింది మొదలు ప్రజలు అదే ప్రేమాభిమానాలు కురిపించారు. జై జగన్‌ అంటూ నినదించారు. పేదల ప్రతినిధికి జేజేలు పలికారు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పడంతే అని నమ్మిన ప్రజలు స్వచ్ఛందంగా జగనన్న చూసేందుకు తరలివచ్చారు. జగనన్న మాటకు.. బాటకు ప్రజలు విలువ ఇస్తున్నారు. ఆయన ఒక్క అడుగు వేస్తే.. లక్షలాది పాదాలు ఆయనను అనుసరించాయి. అందుకే మేమంతా సిద్ధం బస్సుయాత్ర జనజాతర తలపించింది. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

అక్కున చేర్చుకున్న జనం

‘ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. ఇక్కడే ప్రమాణస్వీకారం చేస్తా. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చేస్తూ.. ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తానంటూ ఇటీవల జరిగిన విజన్‌ విశాఖ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.. అందుకే అన్నొస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని విశాఖ జనం విశ్వసించారు’.. మేము సిద్ధం యాత్రలో భాగంగా జనంతో మమేకమయ్యేందుకు విశాఖ చేరుకున్న వైఎస్‌ జగన్‌కు విశేష ఆదరణ లభించింది. 2019 ప్రజాసంకల్ప యాత్రలో ఎలాగైతే జనం అక్కున చేర్చుకున్నారో అంతకు మించిన అభిమానాన్ని ఉమ్మడి విశాఖ ప్రజలు మేమంతా సిద్ధం అంటూ చూపిస్తున్నారు.

సభలో స్పందన భేష్‌

బస్సుయాత్రలో భాగంగా ఈ నెల 20న అనకాపల్లి జిల్లా చింతలపాలెంలో నిర్వహించిన సిద్ధం సభకు వార్‌ వన్‌సైడ్‌ అనే రీతిలో అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా యువత, మహిళలు సీఎం వైఎస్‌ జగన్‌ మాటలకు కేరింతలు కొట్టారు. జగన్‌ వెంట మేమంటూ నినాదాలు చేశారు. ఈ ఎన్నికల్లో కూటమి కుయుక్తులు, చంద్రబాబు చెబుతున్న అబద్ధాల గురించి జగన్‌ చెప్పిన మాటలు ప్రజల్లోకి సూటిగా వెళ్లడంతో టీడీపీ, జనసేన పార్టీల వైఖరిపై ప్రజల్లో ఒక క్లారిటీ తీసుకొచ్చారు.

జనమంతా జేజేలు

అనకాపల్లి, విశాఖ జిల్లాలో బస్సుయాత్రకు వచ్చిన ఆదరణతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం రెట్టింపైంది. ఈసారీ జెండా రెపరెపలాడేలా జనమంతా జేజేలు పలుకుతుండటటంతో.. అటు అభ్యర్థులు, పార్టీ శ్రేణులు దూకుడు పెంచారు. ఇంటింటా ప్రచారాన్ని మరింత ఉత్సాహంగా చేయా లని నిర్ణయించుకున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ విజయ ఢంకా మోగబోతోందన్నది స్పష్టమైంది.

ప్రతిపక్షాల్లో వణుకు

జనమంతా జగన్‌వైపే ఉన్నారన్న స్పష్టత రావడంతో ప్రతిపక్షాల్లో వణుకు మొదలైంది. ప్రజలంతా స్వచ్ఛందంగా జగన్‌ను చూసేందుకు వచ్చిన విషయం తెలుసుకొని టీడీపీ, జనసేన నేతలు కలవరపడుతున్నారు. ఫ్యాన్‌ గాలికి తట్టుకొని నిలబడటం కష్టమేనన్న సంకేతాలు కనిపించడంతో ఏం చేయాలో పాలుపోక ఆపసోపాలు పడుతున్నారు. గెలుపు అవకాశాలు కనుచూపు మేరలో కూడా కనిపించకపోవడంతో ప్రజలను ఎలా ప్రసన్నం చేసుకోవాలన్నదానిపై పునరాలోచనలో పడేలా బస్సుయాత్ర జైత్రయాత్రలా సాగింది. ఉమ్మడి విశాఖలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర కనీవినీ ఎరుగని రీతిలో సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఫ్యాన్‌ స్పీడ్‌ మరింత పెరిగింది. అధినేత పర్యటనతో అనకాపల్లి, విశాఖ జిల్లాలోని అభ్యర్థులు గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నారు.

సీఎం జగన్‌ బస్సుయాత్రతో వైఎస్సార్‌ సీపీలో జోష్‌

మేమంతా సిద్ధం అంటూ నినదించిన ప్రజానీకం

కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహం

కార్యనిర్వాహక రాజధానికి ఓటేస్తామంటూ చాటిచెప్పిన జనం

ప్రతి నియోజకవర్గంలోనూ స్వచ్ఛందంగా కదిలివచ్చిన ప్రజలు

సీఎం వైఎస్‌ జగన్‌ అభివాదం
1/1

సీఎం వైఎస్‌ జగన్‌ అభివాదం

Advertisement
Advertisement