చంద్రబాబు ట్రాప్‌లో షర్మిల, సునీత | YS Avinash Reddy Comments Over YS Sharmila And Sunitha In Election Campaign Road Show, Details Inside| Sakshi
Sakshi News home page

చంద్రబాబు ట్రాప్‌లో షర్మిల, సునీత

Published Thu, May 9 2024 6:00 AM

YS Avinash Reddy comments over Sharmila and Sunitha

వివేకాను హత్యచేశానన్న వ్యక్తిని ప్రోత్సహిస్తున్నారు

2021 నుంచి మానసికంగా ఇబ్బందిపాల్జేశారు

సభ్యత, సంస్కారంవల్లనేను విమర్శించను 

వైఎస్సార్, వివేకా మరణాల వెనుక కుట్రలు బయటపడతాయి 

ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి 

పులివెందుల/లింగాల: తన అక్కలైన షర్మిల, సునీ­తలు చంద్రబాబు ట్రాప్‌లోపడి తమపై తీవ్ర విమ­ర్శలు చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి చెప్పారు. 2021 నుంచి వారిద్దరూ తనను మానసికంగా ఎంతో ఇబ్బందిపాల్జేశారన్నారు. చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, ఎల్లో మీడియా ఏ స్క్రిప్ట్‌ ఇస్తే అది చదివి ఇష్టమొచ్చినట్లు నన్ను, జగనన్నను తిడుతున్నారని.. అయినా, వారిపట్ల తనకెలాంటి కోపంలేదని చెప్పారు. 

వైఎస్‌ వివేకాను హత్యచేశానన్న వ్యక్తిని వారు ప్రోత్సహిస్తున్నారని, అతడు పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నా.. అతడిని ఓడించాలని ఒక్కమాట కూడా అనడంలేదన్నారు. హంతకుడు అప్రూవర్‌గా మారడంతో అతడినే సోదరుడిగా భావిస్తున్నారన్నారు. వైఎస్సార్‌ జిల్లా లింగాల మండల కేంద్రంలో అవినాశ్‌రెడ్డి రోడ్‌ షో, బస్టాండులో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

సభ్యతతో ప్రతి విమర్శలు చేయడంలేదు..
వారిద్దరూ తనను ఎన్ని విమర్శలు చేసినా అదే రీతిలో తాను చేయగలను. కానీ, సభ్యత, సంస్కారాలవల్ల చేయడంలేదు. మా నాన్నను తప్పుడు ఆరోపణలతో 385 రోజులు జైల్లో పెట్టారు. ఎవరికీ ద్రోహం చేయలేదు, మనకెందుకీ శిక్ష అని అంటూ ఆయన బాధపడ్డారు. దేవుడి దయ, మీ ఆశీస్సులు ఉన్నంతవరకు మేం ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటాం. ఇక దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ వివేకానందరెడ్డిల మరణాలకు కారణం ఎవరు? ఎక్కడ కుట్ర జరిగింది? ఎవరికి మేలు చేసేందుకు ఇలాంటివి చేశారన్న నిజాలను ఎన్నివేల అడుగుల లోతున దాచిపెట్టి ఉన్నా బయటికి వస్తాయి. 

వారికి కడప కోర్టు జరిమానా..
వైఎస్సార్‌సీపీ ఓట్లను చీల్చి టీడీపీకి లబ్ధిచేకూర్చాలని చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీకి టార్గెట్‌ ఇచ్చారు. ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్‌ జగన్‌­మోహన్‌­రెడ్డిని, వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని ఏమీచేయ­లేరు. ఇక కొద్ది గంటలముందే కడప కోర్టు వీరుచేసే దుష్ప్రచారాలకు జరిమానా విధించింది. కేసు ట్రయిల్‌కు రాకముందే మీరెలా మాట్లాడతారని షర్మిలక్కకు, సునీతక్కకు, వారి సోదరుడు బీటెక్‌ రవికి రూ.10 వేలు జరిమానా విధించింది.

న్యాయస్థానాలు కూడా వీరు చేసేది తప్పని చెబుతున్నాయి. వీరి టార్గెట్‌ కేవలం వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే. నా నిజాయితీని నూరు శాతం నిరూపించుకుంటా. ఇక ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓట్లువేసి, వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, ఎంపీ అభ్యర్థినైన నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మా కష్టకాలంలో మీరు చూపిన ప్రేమ నేను జీవితాంతం మర్చిపోలేను. 

Advertisement
Advertisement