ఊరూరా సంబరాలు | Sakshi
Sakshi News home page

ఊరూరా సంబరాలు

Published Fri, Dec 22 2023 5:30 AM

CM YS Jagan birthday celebrations in AP - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: సీఎం జగన్‌ పుట్టిన రోజును పురిష్క­రిం­చుకుని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు గురువారం రా­ష్ట్ర వ్యాప్తంగా ఊరూరా ఘనంగా సేవా కార్య­క్రమాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పేదలు, అనా­థలకు వస్త్రదానం చేశారు. భారీ ఎత్తున అన్నదా­నాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.  వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం పంపిణీ చేశారు.

అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్‌ యునై­టెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, లండన్, తదితర దేశా­ల్లోనూ సీఎం జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ జిల్లా విజ­యవాడ నగరం వరకు దారి­పొడవునా వైఎస్సార్‌­సీపీ నేత పుత్తా ప్రతాప్‌రెడ్డి.. సీఎం జగన్‌ చిత్రాలతో ఏర్పాటు చేసిన జెండాలు, ప్లెక్సీలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

సినీ ప్రముఖులు అక్కినేని నాగా­ర్జున, మహేశ్‌బాబు ఎక్స్‌ (ట్విటర్‌) ద్వారా సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సీఎం మరిన్ని విజయాలు సాధించాలని, నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. వీరికి సీఎం జగన్‌ కూడా ఎక్స్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.  ‘మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నా’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.   

పండుగలా జన్మదిన వేడుకలు  
► చిత్తూరు, తిరుపతి జిల్లాల వ్యాప్తంగా ఓ పెద్ద పండుగలా జరిగింది. తిరుపతిలో టీటీడీ చైర్మెన్‌ భూమన కరుణాకరరెడ్డి ఆ«ధ్వర్యంలో 115 మంది వైఎస్సార్‌సీపీ శ్రేణులు రక్తదానం చేశారు. రుయాలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. చంద్రగిరిలో తుడా చైర్మెన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో 338 మంది రక్తదానం చేశారు. కేసీ పేటలో ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.

శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు ఆధ్వర్యంలో వంద మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, తట్టలో పూలు విక్రయించే వంద మందికి గొడు­గులు, 15 మందికి బంకులు, 50 మంది నాయి బ్రాహ్మణులకు కిట్లు, 100 మందికి జంగమ­దేవర కిట్లు పంపిణీ చేశారు. వడమాలపేట మండలం అప్పళాయ­గుంట నుంచి నగరి వరకు మంత్రి రోజా పార్టీ శ్రేణులతో కలసి మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. పుత్తూరు ఎస్‌ఆర్‌­ఎస్‌ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు శిక్షణ పొంద­డానికి రూ.2.05 లక్షల విలువగల కుట్టుమిషన్లు అందించారు. 
 

► ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఘనంగా వే­డుకలు జరిగాయి. ఎస్‌ఆర్‌ఐటీ కళాశాలలో 430 మంది, తాడిపత్రిలో 100 మంది రక్తదానం చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో చిత్రావతి నది­లో బోట్లపై వైఎస్సార్‌ సీపీ జెండాలు ఎ­గురవేస్తూ సీఎం జగన్‌ చిత్రపటంతో ర్యాలీ నిర్వ­హించారు. హిందూపురంలో ఎంజీఎం పా­ఠ­శాల విద్యార్థులు ‘హ్యాపీ బర్త్‌డే జగన్‌ మామయ్యా’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి రక్తదానం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి, నరస­రావుపేట, మాచర్లలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. మంత్రి అంబటి సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో రక్తదానం చేశారు. నరసరావు­పేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ర­క్తదానం చేశారు. వేమూరు సమీపంలోని ఓ చె­రువు మధ్యలో జగన్‌ అభిమాని కారుమూరు వెం­కటరెడ్డి ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ అంటూ ఏర్పాటు చేసిన అక్షరాల ఆకృతి ఆకట్టుకుంది.
 

► ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. విజయవాడ తూర్పు, పశ్చిమలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. విజయ­వాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియో­జకవర్గంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ­గోదావరి జిల్లాలో వేడుకలు అంబ­రా­న్నం­టాయి. మంత్రులు, ఎంపీ, ఎమ్మె­ల్యేలు, ఎమ్మె­ల్సీ­లు, ప్రజాప్రతినిధులు హాజరై జగన్‌ పుట్టిన రోజును ఘనంగా జరుపు­కున్నారు.   

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్‌ పుట్టిన రోజు సంబరాలు
సీఎం జగన్‌ పుట్టిన రోజు వేడుకలు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కన్నులపండుగగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల కరతళధ్వానాలు, జై జగన్‌ నినాదాల మధ్య పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్‌ను కట్‌ చేశారు. అంతకుముందు మహానేత వైఎ­స్సార్‌ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. మత గురువులు సర్వమత ప్రార్థనలు జరిపి సీఎం జగన్‌ను ఆశీర్వదించారు.

పేదలకు దుస్తులు, కుట్టు­మిషన్లు, దివ్యాంగులకు ట్రైసైకిల్స్‌ అందజే­శారు. పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ లేళ్ల అప్పిరెడి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే తిప్పేస్వామి, తెలుగు అకాడమి చైర్‌ పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి, పార్టీ నేతలు జూపూడి ప్రభాకరరావు, పుత్తా ప్రతాప్‌రెడ్డి, చల్లా మధు, ఎన్‌. పద్మజ, నారా­యణమూర్తి, రవిచంద్రారెడ్డి, కాకుమాను రాజశేఖర్, ఎన్‌ఆర్‌ఐ పండుగాయల రత్నాకర్, కనకరావు మాదిగ, మనోహర్‌రెడ్డి, పానుగంటి చైతన్య, బందెల కిరణ్, నాగదేవి రవికుమార్, పాల్గొన్నారు.  

తెలంగాణలోనూ సంబరాలు.. 
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలను తెలంగాణాలోనూ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. కూకట్‌పల్లి, బాలాజీనగర్, కేపీహెచ్‌బీ, మూసా­పేట, మోతీనగర్, బాలానగర్, ఫతేనగర్‌ తదితర ప్రాంతాల్లో కేక్‌లు కట్‌ చేశారు. కేపీహెచ్‌బీకాలనీలోని రమ్యా గ్రౌండ్స్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రమ్యా గ్రౌండ్స్‌లో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఐటి విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాక్షి ఫైనాన్షియల్‌ డైరెక్టర్‌ వై.వి.ఈశ్వర్‌ ప్రసాద్‌ రెడ్డి, సినీ నటుడు కృష్ణుడు, తదితరులు పాల్గొన్నారు. భరత్‌నగర్‌ కాలనీ పోచమ్మ గ్రౌండ్‌లో అభిమానులు కేక్‌ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు.

వెయ్యి ఇళ్లల్లో గృహప్రవేశం
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పార్టీ కార్యాల­యాల్లో పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. అన్న, రక్తదాన, దుప్పట్లు, దుస్తుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. నందికొట్కూరు పట్టణానికి చెందిన కళాకారుడు దేశెట్టి శ్రీనివాసులు తన రక్తంతో ముఖ్యమంత్రి చిత్రాన్ని గీశారు. ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో అన్నదాన, రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించారు. కడపలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌ బాబు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు అవయవ­దానానికి హామీ పత్రం ఇచ్చారు.

రామేశ్వరం జగనన్న కాలనీలో 1000 ఇళ్లలో గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించారు. పులివెందుల్లో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి రక్తదానం చేశారు. అ­న్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఘనంగా వేడు­కలు నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్థానిక వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియంలో కేక్‌ కట్‌ చేశారు. మదనపల్లెలో మల్లెల ఫౌండేషన్‌ వ్యవ­స్థాపక అధ్యక్షుడు మల్లెల పవన్‌కుమార్‌ ఆధ్వ­ర్యంలో 5 వేల మంది ఆటో కార్మికులకు యూని­ఫారాలు, మహిళలకు చీరలను పంపిణీ చేశారు.  

రూ.7 కోట్ల విలువైన కానుకలు పంపిణీ
చిత్తూరు అర్బన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్తూరులో ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ ఎం.సి.విజయానందరెడ్డి మహిళలకు భారీగా కానుకలను పంపిణీ చేశారు. దాదాపు రూ.7 కోట్ల విలువ చేసే నూతన వస్త్రాలను అందజేశారు. రూ.1,300 విలువ చేసే కిట్‌లను చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, మేయర్‌ అముద చేతుల మీదుగా 44 వేల మంది మహిళలకు అందచేశారు.

ఈ సందర్భంగా విజయానంద రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ బలమే మహిళలని, వారి ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురేస్తామని, చిత్తూరు నియోజకవర్గ నుంచి తొలి విజయాన్ని అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం గుడిపాల మండలంలో జరిగిన కార్యక్రమంలో 10 వేల మంది మహిళలకు సైతం ఈ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీకాంత్, సహదేవ, ఇందు, కోఆప్షన్‌ సభ్యులు చందు, అను, పలువురు సర్పంచ్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

ఉప్పలపాడులో బజరంగ్‌ సేవా తత్పరత
పెదకాకాని: గుంటూరు జిల్లా ఉప్పలపాడులో బజరంగ్‌ ఫౌండేషన్‌ పౌండేషన్‌ వ్యవస్థాపకుడు అంబటి మురళీకృష్ణ సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. వైద్య శిబిరంలో 1,211 మంది కంటి, గుండె పరీక్షలు చేయించుకు­న్నారు. వీరిలో 35 మందికి వైద్యులు యాంజియోగ్రాం సూచించగా, వారిని శనివారం ప్రత్యేక వాహనంలో విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లనున్నారు. ఏడుగురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, ఇద్దరికి జైపూర్‌ కాళ్లు, వెస్ట్రన్‌ కమోడ్‌లు అందజేశారు.

మురళీకృష్ణ మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పాల­నలో పేదల ఇంటి ముందుకే సంక్షేమ ఫలాలు అందుతు­న్నాయని కొని­యాడారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని బజరంగ్‌ ఫౌండేషన్‌ అంకిత భావంతో ప్రజా సేవను కొనసాగిస్తోందన్నారు. గత సంవత్సర కాలంగా ‘బజరంగ్‌ జగన్నామ సంక్షేమ సంవత్సరం’లో కంటి సమస్యల నివారణకు నేత్రజ్యోతి ద్వారా ఉచిత నేత్ర వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఏడు పనిదినాల్లో కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో పెద్దేటమ్మ తల్లి పీఠం వద్ద కేక్‌ కట్‌ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement
 
Advertisement