ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సు | Sakshi
Sakshi News home page

ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సు

Published Sun, Apr 28 2024 6:08 AM

JC Diwakar List of Irregularities: Andhra Pradesh

చెప్పలేనన్ని నేరాలు.. విప్పలేనన్ని కేసులు..! 

అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం విస్తరణ  

గ్రానైట్‌ మాఫియా, నిబంధనలకు పాతరతో ట్రావెల్స్‌ నిర్వహణ  

పదుల సంఖ్యలో గాలిలో కలిసిన ప్రాణాలు..? 

బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక శక్తులకు ఊతం 

పరిశ్రమలపై ఆధిపత్యం, అక్రమ వసూళ్లు 

వృత్తి: ట్రాన్స్‌పోర్టు బిజినెస్‌
ప్రవృత్తి: హత్యా రాజకీయాలు.. నేరాలు.. ఘోరాలు
పదవి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలక దేశం నేతఅరాచకాలు,
కేసులు: చెప్పలేనన్ని

అతనో నియంత.. అతనికెదురెళ్తే టిప్పర్‌ లారీకి ఎదురెళ్లినట్లే.. తన దురన్యాయాలను ఎవరైనా ప్రశ్నిస్తే ఆ రోజుతో వారికి భూమ్మీద నూకలు చెల్లినట్లే.. ఊళ్లలో ఫ్యాక్షన్‌ మంటలను ఎగదోసి, వాటితో చలికాచుకునే దుర్మార్గ రాజకీయం తన సొంతం.. అదే తన హాబీ కూడా.. రౌడీషీట్‌ తెరిపించుకున్న ఘనత ఆయన సొంతం. ఆయన తనయుడూ తక్కువేమీ తినలేదు. ప్రస్తుతం ఇతను ‘దేశం’ తరఫున పోటీ చేస్తున్నారు.  

సాక్షి, టాస్‌్కఫోర్స్‌ :  ట్రావెల్స్‌ ద్వారా కండిషన్‌ లేని బస్సులను నడిపి ఆ ‘దేశం’ నేత ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడారు. 2013 అక్టోబరు 30వ తేదీన మహబూబ్‌నగర్‌ సమీపంలో  పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 45 మంది అగ్నికి  ఆహుతైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆ సీనియర్‌ నేత భార్యను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ లీజు అగ్రిమెంట్లు సృష్టించారని ఆ నేతపై సీఐడీ అభియోగాలను మోపింది.

2017లో విజయవాడ వద్ద ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. కాంట్రాక్ట్‌ క్యారేజ్‌ పేరుతో పర్మిట్లు తీసుకుని స్టేట్‌ క్యారేజ్‌గా బస్సులు నడపడంపై అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. తప్పు చేసింది కాకుండా తన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ నేత హైదరాబాద్‌  ఆర్టీఓ కార్యాలయాన్ని తన అనుచరులతో కలిసి ముట్టడించే ప్రయత్నం చేశారు.   

అక్రమాలకు పరాకాష్టగా బీఎస్‌ 3 వాహనాలు  
ఆ నేత అక్రమాలకు పరాకాష్టగా బీఎస్‌–3 వాహనాల కుంభకోణం నిలిచింది. ఓ ప్రముఖ సంస్థ వద్ద స్క్రాప్‌ ద్వారా కొనుగోలు చేసిన 154 బీఎస్‌–3 లారీలను బీఎస్‌–4  వాహనాలుగా నకిలీ ఎన్‌ఓసీ, ఇన్సూరెన్స్‌తో నాగాలాండ్‌లో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లలో లబ్ధి పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలపై సీబీఐ,ఈడీ దాడులు చేశాయి. 2020లో ఆ నేతతో పాటు ఆయన కుమారుడు,  అనుచరుడు,  మరికొందరిపై వివిధ పోలీసు స్టేషన్లలో 24 కేసులు నమోదయ్యాయి. బస్సులను సీజ్‌ చేయడంతోపాటు ఈ నేత, బినామీల పేరుపై ఉన్న రూ.22 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసి, పలు రికార్డులు స్వా«దీనం చేసుకోవడంతోపాటు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసింది. 

ప్రభుత్వ నిధులూ స్వాహా...?
తాడిపత్రి ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వ నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. 2015æలో యాడికి మండలంలో గ్రామీణ సడక్‌ యోజన కింద రూ.2.40 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులను కమీషన్ల కక్కుర్తితో నాసిరకంగా పూర్తి చేయించారు. రాయలచెరువులో నీరు–చెట్టు కింద పూడికతీత పనుల్లో రూ.2.5 కోట్లు దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

పెద్దవడుగూరు మండలంలో 2015లో  రూ.6.45 కోట్లతో నీరు–చెట్టు కింద చేపట్టిన పనుల్లో ఎక్కువ శాతం  చేయకుండానే పూర్తయినట్లు రికార్డుల్లో చూపించి నిధులు బొక్కేశారు.  పెద్దవడుగూరు మండలంలోని పెద్ద వంక వద్ద జంగిల్‌ క్లియరెన్స్‌ పేరుతో దాదాపు రూ.8 లక్షలు కాజేశారు. చిన్నవడుగూరులో కుంట, కాలువల్లో ముళ్ల పొదల తొలగింపునకు దాదాపు రూ.18 లక్షలు, పెద్దవంకలో రూ.7 లక్షలను పనులు చేయకుండానే పక్కదారి పట్టించారు.  

కేసుల వివరాల
► ఇప్పటికే రౌడీ షీట్‌ నమోదై ఉంది.   
► 1996లో జరిగిన టౌన్‌బ్యాంకు ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో టీడీపీకి చెందిన లక్ష్మీనారాయణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆయన నిందితునిగా ఉన్నారు. 
► మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత  వివిధ పోలీస్‌ స్టేషన్లలో మొత్తం 70కి పైగా కేసులు ఉన్నాయి. 1996 నుంచి 2024 వరకు తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్‌లో 57 కేసులు, తాడిపత్రి అప్‌గ్రేడ్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌లో 5, పెద్దపప్పూరు పోలీసు స్టేషన్‌లో 6, యాడికిలో ఒక కేసు నమోదయ్యాయి.  

► 2020లో నకిలీ ఇన్సూరెన్స్‌ కుంభకోణంలో తాడిపత్రి పట్ట ణ, అప్‌గ్రేడ్‌ రూరల్‌ పోలీసు స్టేషన్లలో 28 చీటింగ్‌ కేసుల నమోదు. బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌ 4 వాహనాలుగా మార్చి నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించడంతో ఆయనపై పోలీసులు ఒకేసారి 28 కేసులు నమోదు చేశారు.  
(1). ఎఫ్‌ఐఆర్‌  నెం. 28/2020. ఐపీసీ 420, 467, 468, 471, 472, 120(బి), 201 రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్లు.  
 (2) ఎఫ్‌ఐఆర్‌ : 85/2020. ఐపీసీ 420, 467, 468, 471, 120–బి రెడ్‌విత్‌ 34 ఐపీసీ, 179, 182, 190 ఎం.వి.యాక్టు) మరో 27 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.  

► 2023లో పెద్దపప్పూరులోని ఇసుక రీచ్‌లో అక్రమాలు జరుగుతున్నాయంటూ అనుచరులతో కలిసి వెళ్లిన ఆయన అక్కడున్న టిప్పర్‌ డ్రైవర్‌ వీరాంజనేయులుని కులం పేరుతో దూషించిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. 
► 1996 నుంచి 1999 వరకు జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో ఆయన నిందితునిగా ఉన్నాడు. పీడీ యాక్ట్‌ ద్వారా పోలీసులు  కేసు నమోదు చేసి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాడిపత్రి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 2014లో ఎఫ్‌ఐఆర్‌ నెం. 142/14, సెక్షన్‌ 151 సీఆర్‌పీసీ కింద పీడీ యాక్టు నమోదైంది.  

 అసెంబ్లీ పోటీలో ఉన్న తనయుడిపై కేసులు :  
► ఆయన తనయుడిపై 30 కేసులు నమోదయ్యాయి. నకిలీ పత్రాలను సృష్టించి వాహనాలను విక్రయాలు జరిపిన నేరంపై 2022లో ఐపీసీ 420, 467,468,471,120బి రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో తండ్రీకొడుకులు   కడప సెంట్రల్‌ జైలులో 50 రోజులు జ్యూడిíÙయల్‌ రిమాండ్‌లో ఉన్నారు.  
 ► బీఎస్‌–3 వాహనాల కుంభకోణంలో బైయిల్‌పై వస్తూ తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద సీఐ దేవేంద్ర కుమార్‌పై అనుచితంగా ప్రవర్తించినందుకు తండ్రితోపాటు తనయుడిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదైంది. మనీ ల్యాండరింగ్‌పై తాడిపత్రిలోని నివాసంలో  ఈడీ అధికారులు దాడులు జరిపి ఆయన తనయుడిపై  రెండు కేసులు నమోదు చేశారు. ఇంకా వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేసిన పలు కేసుల్లో తనయుడిపై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులూ నమోదయ్యాయి. 

డబ్బు కోసం దేనికైనా సై 
► తాడిపత్రి మండలం హుస్సేన్‌పురం వద్ద  రెండు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన గెర్దావ్‌ స్టీల్‌ ప్లాంట్‌పై కన్నేసిన ఆ నేత కంపెనీ యజమానులను బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సొంతంగా ట్రాన్స్‌పోర్టును ఏర్పాటు చేసి, స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులకు తన లారీలనే వినియోగించుకునేలా వారిపై ఒత్తిడి చేశారు. సరుకు రవాణాకు సంబంధించి ట్రాన్స్‌పోర్టు వే బిల్లులు కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్‌ ద్వారా చేయించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. బినామీ లెక్కలతో రూ.300 కోట్లకు పైగా అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలున్నాయి. 

► స్టీల్‌ ప్లాంట్‌లో డ్రైస్లాగ్‌ ద్వారా నెలకు దాదాపు రూ.15 కోట్ల చొప్పున ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో రూ.900 కోట్లు ఆర్జించారని సమాచారం.   
► గుత్తి నుంచి తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద ఉన్న వైఎస్సార్‌ జిల్లా సరిహద్దు వరకూ 63 కి.మీ. హైవే పనులకు రూ.275 కోట్ల అంచనా వ్యయంతో  నేషనల్‌ హైవే అధికారులు ఆహా్వనించిన టెండర్లను నాటి టీడీపీ ఎంపీకి చెందిన కన్‌స్ట్రక్షన్‌ కంపెనీతో పాటు మరో విదేశీ కంపెనీ 13 శాతం తక్కువకు కోట్‌ చేసి దక్కించుకున్నాయి. విదేశీ కంపెనీకి మన దేశంలో అనుమతుల్లేవంటూ అధికారులను బెదిరించి ఆ టెండర్‌ను రద్దు చేయించారు. అనంతరం ఎంపీకి చెందిన కంపెనీతోపాటు మరో కంపెనీతో కలసి 4.9 శాతం ఎక్కువకు టెండర్‌ కోట్‌ చేయించి దక్కించుకున్నారు.  ఈ అక్రమాలతో రూ.50 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు.    

► మున్సిపాలిటీ ఆ«దీనంలోని కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తును తన ముఖ్య అనుచరుడు ఏడాదికి రూ.7.36 లక్షలు అద్దె చెల్లించేలా ఆ నేత లీజుకు ఇచ్చి, గుడ్‌విల్‌ రూపంలోనే దాదాపు రూ.2.66 కోట్లు పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. 
► ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న కాంప్లెక్స్‌లో 6, 67, 68, 72 రూములను తక్కువ మొత్తంతో అద్దెకు తీసుకుని సబ్‌ లీజులకు ఇచ్చి పెద్ద మొత్తంలో వెనకేసుకున్నట్లు సమాచారం. 

► పెద్దపప్పూరు మండలం జూటూరు భూముల్లో ఆయన అనుచరులు రూ. కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పెన్నా, చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాలోనే వారి అనుచరులు రూ.40 కోట్లకు పైగా కూడబెట్టారు.  
► తమ కుటుంబ సిమెంట్‌ ఫ్యాక్టరీకి సంబంధించి యాడికి మండలం కోనుప్పలపాడు సమీపంలోని గనుల్లో లైమ్‌స్టోన్‌ వెలికి తీసే క్రమంలో చారిత్రక గుహలు వెలుగు చూడకుండా తొక్కిపెట్టారు.  
►మట్కా డాన్‌గా పేరున్న ఓ వ్యక్తికి ఈ నేత పూర్తి అండదండలు ఉండేవి. అప్పట్లో కడప విజిలెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న సీఐ, తన సిబ్బందితో కలసి మట్కా డాన్‌ ఇంట్లో తనిఖీలు నిర్వహించినప్పుడు తన అనుచరులను ఉసిగొల్పి  పోలీసులపై దాడులు చేయించి, పోలీసు వాహనాలకు నిప్పంటించారు.   

Advertisement
Advertisement