చనిపోయిన 12 గంటలకు తిరిగి బతికిన చిన్నారి! | Sakshi
Sakshi News home page

చనిపోయిన 12 గంటలకు తిరిగి బతికిన చిన్నారి!

Published Fri, Dec 1 2023 11:22 AM

Miracle 3 Years Old Girl Wakes up at Funeral - Sakshi

వైద్యులను దేవునితో సమానమని అంటారు. అయితే వారు కూడా మనుషులే అయినందున ఒక్కోసారి పొరపాటు పడుతుండవచ్చు. మెక్సికోలోని శాన్ లూయిస్ పొటోసికి చెందిన వైద్యుని పొరపాటుకు సంబంధించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మూడేళ్ల బాలిక చనిపోయినట్లు ఒక వైద్యుడు నిర్ధారించాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇంతలో ఆ బాలిక మేల్కొంది. మెక్సికోకు చెందిన కైమెలియా రోక్సానా కడుపు నొప్పితో బాధపడుతోంది. కుటుంబసభ్యులు బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స అనంతరం  ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యుడు నిర్థారించాడు. 

ఇది జరిగిన 12 గంటల తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఆ బాలిక సజీవంగానే ఉందని తెలిసింది. కైమెలియా అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు, ఆమె తల్లికి తన కుమార్తె  బతికేవుందని అనిపించింది. దీంతో ఆమె శవపేటికను తెరవమని అక్కడున్నవారిని కోరింది. అయితే వారు అందుకు అంగీకరించలేదు. కాగా కొంతసేపటికి శవపేటికలో నుంచి బాలిక ఏడుపు వినిపించింది. వెంతనే దానిని తెరిచి, బాలికను బయటకు తీశారు. ఈ సంఘటన 2022, ఆగస్టు 17 న జరిగింది. దీంతో ఆ చిన్నారికి మరుజన్మ లభించిందని పలువురు పేర్కొన్నారు. 

అయితే ఆ బాలిక చనిపోయిందని వైద్యులు  ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందనే విషయానికొస్తే.. కడుపు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆ చిన్నారిని సాలినాస్ డి హిల్డాల్గో కమ్యూనిటీ ఆసుపత్రిలో చేర్చినప్పుడు, చికిత్స సమయంలో ఆమె గుండెచప్పుడు ఆగిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలికలో చలనం రాకపోవడంతో చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. 

అయితే ఆ బాలిక తల్లి  ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. తన కూతురు చనిపోలేదని అంటూ గట్టిగా ఏడవసాగింది. అంత్యక్రియల ప్రక్రియ జరుగుతున్నప్పుడు  ఆ బాలక తల్లి తన కుమార్తె శవపేటికలో వణుకుతున్నదని అక్కడున్నవారికి చెప్పింది. అయితే వారెవరూ నమ్మలేదు. ఆ బాలిక శవపేటికలో నుంచి ఏడుస్తూ, తన తల్లిని పిలవసాగింది. దీంతో శవపేటిక తెరవగా లోపల ఉన్న బాలిక సజీవంగా కనిపించింది.
ఇది కూడా చదవండి: ప్రధానితో ముందుగానే వెళ్లిన విమానం.. 31 మంది ప్రయాణికులు విలవిల

 
Advertisement
 
Advertisement