ప్రపంచంలోనే తొలిసారిగా కంటిమార్పిడి | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే తొలిసారిగా కంటిమార్పిడి

Published Sat, Nov 11 2023 5:32 AM

World first full eye transplant performed by New York surgeons - Sakshi

న్యూయార్క్‌: ప్రపంచంలోనే తొలిసారిగా కంటి మార్పిడి శస్త్రచికిత్స అమెరికాలో జరిగింది. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగాన్‌ వైద్య సంస్థకు చెందిన వైద్యులు ఈ ఘనత సాధించారు. కరెంట్‌ షాక్‌ ప్రమాదంలో ముఖంలో ఎడమ భాగం పూర్తిగా దెబ్బ తిన్న ఆరోన్‌ జేమ్స్‌ అనే మాజీ సైనికుడు కంటి మారి్పడి చేయించుకున్న తొలి వ్యక్తిగా రికార్డులకెక్కాడు. ఇందుకోసం వైద్యులు ఏకంగా 21 గంటల పాటు శస్త్రచికిత్స చేశారు.

ఇప్పటిదాకా కరోనాను మార్చిన ఉదంతాలున్నాయి గానీ ఇలా పూర్తిగా కంటినే కొత్తగా అమర్చడం మాత్రం ఇదే తొలిసారి. ‘‘మే 21న ఈ ఆపరేషన్‌ నిర్వహించాం. రోగికి మొత్తం ముఖం ఎడమ భాగమంతటితో పాటు ఎడమ కంటిని కూడా పూర్తిగా కొత్తగా అమర్చాం. మొత్తం ప్రక్రియలో ఏకంగా 140 మంది వైద్య నిపుణుల సేవలు తీసుకున్నాం. అతనికి ఎడమ కంటిలో చూపు రాలేదు. కాకపోతే ఆర్నెల్ల తర్వాత కూడా ఆ కన్ను పూర్తి ఆరోగ్యంతో ఉండటమే ఓ అద్భుతం.

రెటీనాకు రక్తప్రసారం బాగా జరుగుతోంది. కంటికి రక్తం తీసుకొచ్చే నాళాల పనితీరు సజావుగా ఉంది. ఇది నిజంగా గొప్ప విషయం. చూపు కూడా ఎంతో కొంత వస్తే ఇంకా అద్భుతంగా ఉండేది’’ అని వైద్య బృందం వివరించింది. అయితే, ‘‘ఇది కేవలం కంటిని పూర్తిగా మార్చడం సాధ్యమేనని నిరూపించేందుకు చేసిన సాంకేతిక ఆపరేషన్‌ మాత్రమే. అయితే దాత తాలూకు మూల కణాలను, బోన్‌ మారోను దృష్టి నరంలో చొప్పించాం. కనుక చూపు వచ్చే ఆస్కారాన్నీ కొట్టిపారేయలేం’’ అని చెప్పింది!

Advertisement
Advertisement