తమిళనాడులో ఎన్నికలు.. తొలి ఓటు వేసింది ఆ స్టార్‌ హీరోనే | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఎన్నికలు.. తొలి ఓటు వేసింది ఆ స్టార్‌ హీరోనే

Published Fri, Apr 19 2024 10:14 AM

kollywood Actors Vote In Lok Sabha Election 2024 - Sakshi

లోక్‌సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 39 స్థానాలకూ నేడు (ఏప్రిల్‌ 19) తొలి దశలోనే ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఎంతో ఉత్కంఠతో కూడిన ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే,బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. అయితే తమిళనాడు లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేసేందుకు నటులు రజనీకాంత్, అజిత్ కుమార్, శివకార్తికేయన్ శుక్రవారం తెల్లవారుజామున పోలింగ్ బూత్‌లకు చేరుకున్నారు.

రజనీకాంత్, అజిత్ కుమార్, శివకార్తికేయన్ శుక్రవారం ఉదయం చెన్నైలోని పోలింగ్ బూత్‌లలో ఓటు వేసేందుకు క్యూ లైన్‌లలో నిలబడ్డారు. తమిళ మీడియా చెబుతున్న ప్రకారం ఈ ఎన్నికల్లో మొదటగా ఓటేసిన సినిమా హీరో అజిత్ కుమార్ అని తెలుస్తోంది. ఆయన ఉదయం 6:30 గంటలకే పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాక ముందే ఆయన క్యూ లైన్‌లో పాల్గొన్నారు. చెన్నైలోని తిరువాన్మియూర్‌లో అజిత్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కొన్ని నిమిషాల తర్వాత, రజనీకాంత్, శివకార్తికేయన్‌లు కూడా పోలింగ్ బూత్‌ల వద్ద ఓటు వేయడానికి బారులు తీరిన క్యూ లైన్‌లోనే నిలబడ్డారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మిడియాతో పలు విషయాలను పంచుకున్నారు. ప్రజలు బయటకు వచ్చి తమ పౌర కర్తవ్యాన్ని నిర్వహించాలని రజనీకాంత్‌,అజిత్‌, శివకార్తికేయన్‌ కోరారు. వీరందరి తర్వాత  MNM అధినేత కమల్ హాసన్ చెన్నైలోని కోయంబేడులోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కమల్‌ పార్టీ పోటీ చేయడం లేదు.

Advertisement
Advertisement