టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఉంటారు. ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదల సమయంలో ఒక వేదికపైనే ఆమె కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అందరూ ఆమెను సింపతీ స్టార్, సింపతీ క్వీన్ వంటి బిరుదులు ఇచ్చి భారీగానే ట్రోల్ చేశారు. ఈ సినిమా రిలీజ్కు కొన్నిరోజుల ముందే ఆమె హాస్పిటల్లో చికిత్స కోసం చేరింది. అంత బాధలోనూ ఆమె సినిమాకు డబ్బింగ్ చెప్పింది, ప్రమోషన్స్కు హాజరయ్యింది. ఇక ప్రమోషన్స్లో తన వ్యాధి గురించి, ఆమె పడుతున్న బాధ గురించి చెప్పి కన్నీటిపర్యంతమయ్యింది. దీంతో కొందరు శాకుంతలం సినిమాకు హైప్ క్రియేట్ చేసేందుకు సమంత అలా చేసినట్లు కామెంట్లు చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తనకు సింపతీ క్వీన్ అనే బిరుదు ఇచ్చిన విషయాన్ని అంగీకరించింది. సోషల్ మీడియాలో ఈ విషయం పట్ల జరుగుతున్న ట్రోల్స్కు ఎలాంటి బాధలేదని ఆమె పేర్కొంది. ఈ అంశం గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడిన సమంత.. శాకుంతలం సినిమా విడుదల సమయంలో తన వ్యాధి గురించి బయటపెట్టడం వల్ల చాలామంది సింపతీ కోసం అలా చేశానని అనుకున్నారని వెల్లడించింది. అది వాస్తవం కాదని పేర్కొంది. యశోద, శాకుంతలం వంటి సినిమాలకు తానే ప్రధాన బలం కావడంతో ఆ చిత్రాలకు కచ్చితంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొంది. అలాంటి సమయంలో ప్రమోట్ చేయకపోతే సినిమా చచ్చిపోతుందనే ఆ వేడుకలో పాల్గొన్నానని అన్నారు.
శాకుంతలం సినిమా వేదికపై కొంత సమయం పాటు సంతోషంగా కనిపించడంతో బాగానే ఉన్నానని అందరూ భావించారని సమంత చెప్పింది. కానీ ఆరోగ్యం బాగాలేదని మీడియా ముందుకు నీరసంగా రాలేను కదా.. అందుకే అలా కనిపించానని సమంత క్లారిటీ ఇచ్చింది. కానీ దానిని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే సింపతీ వంటి కామెంట్లు వచ్చాయని ఆమె తెలిపింది. అప్పటికే తన ఆరోగ్య స్థితిపై చాలా పుకార్లు, కథనాలు వచ్చాయని దీంతో అందరికీ తెలియాలని వివరణ ఇచ్చానని తెలిపింది.
ఆరోగ్యం బాగాలేకున్నా కూడా ఆ వేదకపై చాలా యాక్టివ్గా కనిపించాను. కానీ ప్రేక్షకులను చూసిన తర్వాత కాస్త ఎమోషనల్ అయ్యానని తెలిపింది. అనారోగ్యంతో తను పడిన ఇబ్బందులు కొంతమందికి అర్థంకాక ట్రోల్ చేశారని.. ఆ సమయంలో మాత్రం కాస్త ఎక్కువగానే ఒత్తిడికి గురయ్యానని సమంత చెప్పుకొచ్చింది. కానీ తర్వాత అవన్నీ కూడా మరిచిపోయానని పేర్కొంది. మయొసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్న సమంత మళ్లీ త్వరలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది.