నందికొట్కూరు: ప్రభుత్వ కళాశాలల్లో మెరుౖగైన విద్య అందుతుందని రాయలసీమ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్ కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన గ్రంథాలయ భవనం, సమావేశం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయం మహోన్నత సమాజ నిర్మాణానికి పునాదులన్నారు. విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకుని మేధస్సును పెంపొందించుకోవాలన్నారు. రుసా నిధులతో నూతన భవనాలను నిర్మించడం జరిగిందని స్పష్టం చేశారు. అనంతరం ప్రొఫెసర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. సునీత, అధ్యాపకులు డాక్టర్ ఎం. అన్వర్ హుసేన్, గ్రంథాలయ అధికారి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒక్కటైన 21 జంటలు
కౌతాళం: మదిరె గ్రామంలోని ఉటగనూరు తాత మఠంలో గురువారం 21 జంటలు ఒక్కటయ్యాయి. మఠం ధర్మకర్త పంపారెడ్డి తాత, గ్రామస్తుల ఆధ్వర్యంలో సామూహిక వివాహలను నిర్వహించారు. ఈ సందర్భంగా పంపారెడ్డి తాత మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా దాతల సహకారంతో సామూహిక వివాహాలను జరిపించామన్నారు. నూతన వధువరులను వివిధ పార్టీల నేతలు అంక్షితలతో ఆశీర్వదించారు. ఈ జంటలకు దాతలు ఉచితంగా మంగళ సూత్రాలు, కాలిమెట్లను అందించారు.
నగదు స్వాధీనం
శిరివెళ్ల: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై గురువారం శిరివెళ్ల మెట్ట వద్ద వాహనాల తనిఖీలో పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. గోవిందపల్లె నుంచి బైక్పై వస్తున్న వెంకటాపురానికి చెందిన రైతు వెలుగొండయ్య వద్ద రూ. 1.70 లక్షలు గుర్తించి స్వాధీనం చేసుకున్నా మని ఎస్ఐ సురేష్ తెలిపారు. నగదు ఎక్కడిది అన్న కోణంలో విచారణ చేస్తున్నామన్నారు.
కందులు రూ.11,309
కర్నూలు(అగ్రికల్చర్): కందుల ధర జోరుమీద ఉంది. రోజురోజుకు ధర పురోగమనంలో ఉండటం రైతులకు ఆనందాన్ని కలిగిస్తోంది. గురువారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 27 మంది రైతులు 116 క్వింటాళ్ల కందులు తీసుకొచ్చారు. కందుల కొనుగోలుకు వ్యాపారులు పోటీ పడ్డారు. కనిష్ట ధర రూ.2,056, గరిష్ట ధర రూ.11,309 లభించింది. కందుల సగటు ధర కూడా రూ.11,309 నమోదైంది. దాదాపు అన్ని లాట్లకు ధర రూ.11 వేలపైనే లభించడం విశేషం.
1/1
నూతన భవనాలను ప్రారంభిస్తున్న ఆర్యూ ఉపకులపతి, ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్ కుమార్