దళితులపై పెత్తందారీ తోడేలు దొంగ ప్రేమ  | Sakshi
Sakshi News home page

దళితులపై పెత్తందారీ తోడేలు దొంగ ప్రేమ 

Published Fri, Apr 19 2024 5:42 AM

Ramoji throwing insults at CM Jagan - Sakshi

దళితుల భూములు లాక్కుని ఫిలిం సిటీ నిర్మించింది రామోజీయే 

ఇప్పుడు వాళ్లపై ప్రేమ ఉన్నట్లు నాటకాలు 

చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు, అవమానాలు.. సీఎంగా ఉండగా దళితులను హేళన చేసిన చంద్రబాబు  

దళితులకు రాజకీయాలెందుకురా అంటూ తూలనాడిన చింతమనేని ప్రభాకర్‌ 

వారి దగ్గర కంపు కొడుతుందంటూ ఈసడించుకున్న అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి 

ఇలా ఆదిమ సమాజపు భావజాలంతో దళితులను అవమానిస్తున్న బాబు బ్యాచ్‌ 

అయినా చంద్రబాబు బ్యాచ్‌కే మద్దతు పలికిన రామోజీరావు 

దళితులను అక్కున చేర్చుకుని, వారి ఉన్నతికి పలు పథకాలు, పదవులు ఇస్తున్న సీఎం జగన్‌ 

నేడు గౌరవంతో తలెత్తుకొని బతుకుతున్న దళితులు.. అయినా సీఎం జగన్‌పై అభాండాలు వేస్తున్న రామోజీ 

రామోజీరావు:  వేలాది దళిత కుటుంబాలను రోడ్డు మీదకు లాగి వారి ఆశలను చిదిమేసి హైదరాబాద్‌లో ఫిలిం సిటీని నిర్మించిన పెత్తందారీ కర్కోట­కుడు. ఫిలిం సిటీ కోసం దళితుల నుంచి వందలాది ఎకరాల అసైన్డ్, భూదాన్‌ భూములను నిర్ధాక్షిణ్యంగా లాక్కున్న కబ్జాకోరు. గ్రామాలకు వెళ్లే రోడ్లను ఫిలిం సిటీలో కలిపేసుకుని గోడ గట్టి, ఆ గ్రామాల ప్రజలను నానా తిప్పలు పెట్టి, వారి ఉసురు తీసిన రక్త పిపాసి. వేలాది దళిత కుటుంబాలను నిర్దాక్షిణ్యంగా చిదిమేసి రాజసౌధాలను నిర్మించుకుని రాజులా చలామణి అవుతున్న ఆధునిక నరకాసురుడు. ఇప్పుడు వారిపై తనకు అమిత ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న తోడేలు. 

చంద్రబాబు: రాష్ట్రంలో పచ్చ ముఠాకు నాయకుడు. దళితులంటే అస్సలు పడని ఓ పెత్తందారు. ఆయన హయాంలో దళితులపై లెక్కలేనని దాడులు, అవమానాలు. ముఖ్యమంత్రిగా ఉండగానే ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ వ్యాఖ్యానించిన దళిత ద్వేషి.

ఈయనే కాదు.. ఈయన వెంట ఉన్న నేతలదీ అదే తీరు. దళితులకు రాజకీయాలెందుకురా అంటూ హుంకరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌. దళితుల దగ్గర కంపు కొడుతుందంటూ ఈసడించుకున్న ఆదినారాయణ రెడ్డి. వీళ్లే కాదు.. టీడీపీలో అనేక మంది నేతలది ఇదే తీరు. వీళ్లంతా రామోజీ నమ్మిన బంటు చంద్రబాబు బ్యాచ్‌. అందుకే దళితులపై వీళ్లెంతగా వీరంగం వేసిన రామోజీకి కనిపించదు, వినిపించదు.

సీఎం వైఎస్‌ జగన్‌: నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ దళితులను కుటుంబ సభ్యుల్లా అక్కున చేర్చుకున్న నాయకుడు. వారిని రాజకీయంగా, అన్ని రంగాల్లో ఉన్నత స్థితి కల్పిస్తూ, వారి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి, ఎవరినీ పైసా అడగాల్సిన పని లేకుండా ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రి.

వారిని సాధికారత వైపు నడిపించి, సమాజంలో గౌరవం కల్పించి, తలెత్తుకొని తిరిగేలా చేసిన నేత. దళితులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తారు కాబట్టే ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితాను ఇటీవల ఆ వర్గానికి చెందిన నేత నందిగం సురేష్  తో విడుదల చేయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే దళితుల మనసు గెల్చుకున్న దళిత బంధువు. – సాక్షి, అమరావతి

రామోజీ కపట నాటకం 
తానే స్వయంగా దళితుల భూములు లాక్కొని, వారి కంటి నుంచి రక్తం కారేలా ఏడిపించిన రామోజీ.. ఇప్పుడు దళితులపై ప్రేమ అంటూ కపట నాటకమాడుతున్నారు. జగన్‌ చేతుల నిండా దళితుల నెత్తురు అంటిందంటూ ఈనాడులో రక్తపు రాతలు రాసి అక్కసును బయటపెట్టుకున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో దళితులకు దక్కిన గౌరవం ఏ పాటిదో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇది తమ ప్రభుత్వమని ప్రతి దళితుడూ చెప్పు­కునే రాష్ట్రంలో అనుకోకుండా జరిగిన ఒకట్రెండు ఘటనలను బూచిగా చూపి దళితుల నెత్తురు జగన్‌ చేతులకు అంటిందని నిస్సిగ్గుగా రాయడం ఆకాశంపై ఉమ్మి వేయడం లాంటి ప్రయత్నమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

దళితులంటే అంటరాని వారనే ఆదిమ సమాజపు భావజాలంతో వారిని అడుగడుగునా అవమాని­స్తున్న చంద్రబాబు బ్యాచ్‌­కు మద్దతు పలికిన రామోజీరావు.. దళితులకు అన్ని విధాలుగా అండదండలందిస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌పై బురద జల్లేలా రాసిన రాతలను అసలు ఎవరైనా నమ్ముతారా? ఈ లాజిక్‌ రామోజీ బుర్రకు అందదు. ఎందుకంటే.. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చాలన్నదే ఆయన ఏకైక అజెండా. అందుకే తప్పుడు రాతలతో ప్రజలను పక్కదోవ పట్టంచాలని ప్రయత్నిస్తున్నారు.

బాబు హయాంలో దారుణ దమనకాండ
చంద్రబాబు హయాంలో దళితులపై దారుణమైన దమనకాండ జరిగినా అసలు ఏమీ జరగనట్లు దొంగ నిద్ర నటించాడు రామోజీ. సాక్షాత్తూ బాబు సీఎంగా ఉన్నప్పుడే వారి పుట్టుకనే అవమానç­³రిచేలా అన్యాయమైన వ్యాఖ్యలు చేసినా కిమ్మనలేదు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని బాబు అన్నప్పుడు దళిత సమాజం మొత్తం భగ్గుమంది.

అప్పుడు రామోజీ వంత పలికింది దళితులకు కాదు.. బాబుకు. బాబు మంత్రివర్గ సభ్యుడు ఆదినారాయణరెడ్డి దళితులను అవహేళన చేసినప్పుడు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నీచంగా తూలనాడినా రామో­జీకి దళితులపై ప్రేమ పుట్టలేదు. 2017 డిసెంబర్‌లో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనా­రాయణమూర్తి అనుచరులు ఓ దళిత మహిళపై దాడి చేసి, ఆమె బట్టలు చింపి పొలం నుంచి ఈడ్చిపడేసినా పట్టించుకునే నాథుడే లేడు. బాబు హయాంలో దళితులు నిత్యం భయంగా బతికే పరి­స్థితులు ఉండేవి.

తమపై దాడులు జరిగితే పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమో­ద­య్యేవి కాదు. కేసు పెట్టడానికి దళితులు పోరాడాల్సివచ్చేది. బాబు హ­యాంలో ఎస్సీలపై నేరాల సంఖ్య పెరిగినట్లు క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కలే చెబుతున్నాయి. జగన్‌ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు తగ్గిపోయాయి. దళితుల భద్రతకు పెద్దపీట వేయడంతోపాటు దళిత మహిళనే హోంమంత్రిగా చేసిన ఘనత వైఎస్‌ జగన్‌ది. అలాంటి జగన్‌ చేతులు దళితుల రక్తం అంటిందంటూ అడ్డగోలు రాతలతో రామోజీ ఆక్రోశం వెనుక బాబును పీఠం ఎక్కించాలన్న తపన ఉందని మేధావులు అంటున్నారు.

దళితుల గురించి చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన దారుణ వ్యాఖ్యలు
 ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? అందరూ సంపన్న వర్గాల్లోనే పుట్టాలని కోరుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాలు ఏలవచ్చనుకుంటారు. కులాలను బట్టి ఓట్లు రావు. వాటితో ఎవడూ గెలవలేడు. మంద కృష్ణ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేకపోయాడు.   - సీఎం హోదాలో 2016 ఫిబ్రవరి 9న చంద్రబాబు 

♦ దళితులు శుభ్రంగా ఉండరు. వారి దగ్గర వాసన వస్తుంది. వాళ్లు సరిగా చదవరు. అయినా ఎస్పీలు అవుతారు. రిజర్వేషన్లు పదేళ్ల కోసం ఇస్తే 70 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. పట్టాలిస్తే వాటిని నిలుపుకోరు.  – 2017లో చంద్రబాబు మంత్రివర్గం సభ్యుడిగా ఉన్నప్పుడు ఆదినారాయణరెడ్డి

రాజకీయంగా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు దళితులు. మీరు వెనుకబడిన వారు. మీరు షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ వారు. రాజకీయాలు మాకుంటాయి. మాకు పదవులు. మీకెందుకురా పిచ్చి ––––––––––––––––   – 2019 ఫిబ్రవరి 20న టీడీపీకి చెందిన అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌

దళితుడిపై దాడి చేసేది టీడీపీ నాయకులే 
రాష్ట్రంలో దాడులు చేసేది టీడీపీ నాయకులే. వారు అధికారంలో ఉన్నా, లేకపోయినా దళితులే లక్ష్యంగా దాడులు చేస్తుంటారు. దళిత నాయకు­డినైన నాపై అంబేడ్కర్‌ జయంతి రోజున టీడీపీ అభ్యర్థి బోనెల విజయచంద్ర తన అనుచరులతో దాడికి దిగారు. మా ఇంటికి వచ్చి తలుపులు పగులగొట్టి వీరంగం సృష్టించారు. ఇవి ఈనాడు రామోజీరావుకు కనిపించవు. దళిత ద్రోహి చంద్రబాబే. ఈ రోజు ఆయనకు మద్దతుగా ఈనాడులో తప్పుడు కథనాలు ఇవ్వడం దారుణం. టీడీపీ పాలనలో దళితులపై జరిగిన దాడులు రాయాలంటే పేపర్లు చాలవు.  – అలజంగి జోగారావు, ఎమ్మెల్యే, పార్వతీపురం 

ఎవరు మేలు చేశారో తెలుసు 
దళితులకు సీఎం జగన్‌ పాలనలోనే మేలు జరిగింది. దళితులను అక్కున చేర్చు­కొని, ఉన్నత స్థితికి చేర్చింది సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమే. ఎన్నికల వేళ ఈనాడు అధినేత రామోజీరావుకు మతి భ్రమించింది. ఎస్సీ సామాజిక వర్గం ఓట్ల కోసం తప్పుడు కథనాలు వండివార్చితే నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. ఓటమి భయంతో నిత్యం కట్టు కథలు అల్లుతున్నారు. గత ఎన్నికల్లోనూ వారిది ఇదే ధోరణి. ప్రజలు ఎప్పుడూ వాస్తవాలనే స్వీకరిస్తారు. ప్రజలంతా బాబు అండ్‌కో ను ఛీ కొడుతుంటే ఎలాగైనా బాబును గద్దెనెక్కించాలని, తద్వారా  కేసుల నుంచి తప్పించుకోవాలని రామోజీ తాపత్రయపడుతున్నారు.  – రేగాన శ్రీనివాసరావు,  టూరిజం కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌

చంద్రబాబే దళితుల ద్రోహి 
దళితులంటే బాబు­కు గిట్టదు. కేవలం ఓట్లు దండుకోవడానికే మాత్రమే బాబు­కు ఎస్సీలు కావాలి. తర్వా­త తన సామాజికవర్గానికి మాత్రమే ప్రాధా­న్యత ఇస్తారు. ఎస్సీలపై ఆయన చేసిన దాడులన్నీ చెప్పుకుంటూ పోతే పుస్తకం రాయొచ్చు. ఎవరైనా ఎస్సీలుగా పుడతారా అని హేళన చేసింది చంద్రబాబే. ఇటీవల ఓ మైనారిటీ సమావేశంలో కూడా ఎస్సీలను చులకన చేసి మాట్లాడారు. క్రైస్తవులంతా ఎస్సీలని, అధికారంలోకి వస్తే వాళ్ల అంతు చూస్తామన్నట్లుగా బెదిరింపు ధోరణిలో వ్యవహరించారు.  ఇటువంటివన్నీ పచ్చ పత్రికలు కప్పిపుచ్చి బాబును వెనకేసు­కుని వస్తు­న్నాయి. దళితులకు సీఎం జగన్‌మాత్రమే మేలు చేస్తున్నారు. – ప్రసాద్,   మాల మహానాడు అధ్యక్షుడు, చిత్తూరు

పచ్చ పత్రిక విషపు రాతలు 
సీఎం జగన్, దళితులపై పచ్చ పత్రిక విషపు రాతలు రాసింది. సీఎం జగన్‌ బస్సు యాత్రకు తండోపతండాలుగా వస్తున్న వారి­లో అధికంగా ఉండేది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలే.  మరి ఈ పచ్చ రాతలు రాసే వాళ్లకు ఇలాంటి నిజమైన యాత్రలు కనిపించవా?. దళితులకు తీవ్ర అన్యాయం చేసింది బాబే. ఆయన దళిత ద్రోహి. గతంలో మాల, మాదిగలను విడదీసి గద్దెనెక్కిన బాబు దళిత జాతిని అవహేళనగా మాట్లా­డుతూ దళిత విద్యార్థులపై కుట్ర పూరిత పాలన కొనసాగించాడు.  గతంలో ఎన్నడూ లేని విధంగా బయటికి కూడా రాని విధంగా చంద్రబాబు  దళిత జాతి అణచివేతకు పెద్ద కుట్ర చేశాడు.  – ఎగ్గుల శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అనంతపురం జిల్లా అధ్యక్షుడు

చంద్రబాబే దళిత ద్రోహి 
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడే దళిత ద్రోహి. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర­వ్యాప్తంగా దళితులపైన దాడుల కేసులు 3400 పైగా నమోదయ్యాయి. నమోదవని ఇంకా చాలా ఉన్నాయి. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు అన్న మాటలు ఇప్పటికీ మేం మర్చిపోలేదు.  చింతమనేని ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తున్నాయి. దళితులపైన టీడీపీ నేతలు,  ఆ ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు  ఎన్నో. లేనిపోని రాతలు రాసి జగనన్న  ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే  సహించేది లేదు.  – మాస్టీల మంజు, ఎస్సీ నేత, ఏఎంసీ మాజీ అధ్యక్షురాలు, కంచిలి 

Advertisement
Advertisement