19 ఏళ్ల పోరాటం.. ఈసారైనా ఆమెను ఓడిస్తారా? | Mynampally Rohit Rao Vs Padma Devender Reddy In Medak Constituency Ahead Of Assembly Elections 2023 - Sakshi
Sakshi News home page

మెదక్‌లో మళ్లీ పాత యుద్ధం.. పద్మాదేవేందర్‌రెడ్డి వర్సెస్‌ మైనంపల్లి

Published Mon, Nov 13 2023 12:33 PM

Mynampally Rohit Rao Vs Padma Devender Reddy - Sakshi

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విషయంలో కొన్నిసార్లు ఆసక్తికర విషయాలు సంతరించుకుంటాయి.  తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నాదమ్ముళ్లు పోటీపడి అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తుండడం చూస్తూనే ఉంటాం. కానీ, ఒకే ప్రత్యర్థిపై ఒకే కుటుంబానికి  చెందిన వారు వరుసగా పోటీ చేయడం అరుదుగా జరుగుతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు మెదక్‌ నియోజకవర్గంలో కనిపించింది. ఎమ్మెల్యే పద్మపై మైనంపల్లి కుటుంబీకులు చాలా ఏళ్లుగా పోటీ చేస్తూ రావడం ఆసక్తి సంతరించుకుంది. 
 
మెదక్‌: ప్రస్తుత మెదక్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఉమ్మడి ఏపీలో  2004  అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ జిల్లా రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యరి్థగా పోటీ చేయగా,  ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి ప్రస్తుత మల్కాజిగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సతీమణి మైనంపల్లి వాణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  అనంతరం  తెలంగాణ ఉద్యమ  సమయంలో అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపు మేరకు రామాయంపేట ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో 2008లో జరిగిన రామాయంపేట ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మళ్లీ పద్మాదేవేందర్‌రెడ్డి పోటీ చేయగా,  ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి మైనం పల్లి హన్మంత రావు బరిలో నిలిచి గెలిచారు.  

స్వతంత్ర అభ్యర్థిగా బరిలో.. 
అనంతరం  నియోజకవర్గాల పునర్‌ విభజనలో రామాయంపేట నియోజకవర్గాన్ని రద్దుచేసి చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాలను  మెదక్‌ నియోజకవర్గంలో కలిపారు. ఈ నేపథ్యంలో 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో  టీడీపీ, టీఆర్‌ఎస్‌ పొత్తులో భాగంగా  మెదక్‌ టికెట్‌ను మైనంపల్లి హన్మంతరావుకు కేటాయించడంతో పద్మాదేవేందర్‌రెడ్డి  స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మైనంపల్లి చేతిలో మరోసారి ఓటమి చవి చూశారు.  ఆ తర్వాత   2014, 2018 లో వరుసగా పద్మాదేవేందర్‌రెడ్డి  టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యరి్థగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా మూడోసారి సైతం పద్మారెడ్డికి బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది.  

ఈసారి పద్మపై రోహిత్‌.. 
గతంలో మైనంపల్లి హన్మంతరావు, వాణి దంపతులు పద్మాదేవేందర్‌రెడ్డిపై పోటీ పడగా, ప్రస్తుతం వారి కుమారుడు రోహిత్‌రావు కాంగ్రెస్‌ అభ్యరి్థగా పద్మకు పోటీగా బరిలో నిలిచారు. నాడు తల్లీదండ్రులు, నేడు కొడుకు పోటీపడుతుండడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.  19 ఏళ్లుగా రాజకీయ వైరం వీరి మధ్యలోనే జరుగుతుండడం విశేషం.  

Advertisement
Advertisement