పాటించాల్సిన జాగ్రత్తలు
● ఉదయం 9 గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే పిల్లలను ఆడుకునేందుకు బయటకు వెళ్లనివ్వాలి.
● వేసవిలో కాటన్ దుస్తులు ధరిస్తే సౌకర్యంగా ఉంటుంది.
● వడదెబ్బకు గురైతే తలనొప్పి, వాంతులు, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అత్యవసరం అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
● ఎండలో తిరిగితే ముక్కు నుంచి రక్తం కారుతుంది.
● వేడి వల్ల చెమట శరీరం నుంచి వెల్లడంతో సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలెవల్స్ తగ్గుతాయి. కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, ఎలక్ట్రోపౌడర్ లేదా ఉప్పు, చక్కర కలిపిన నీటిని బాగా తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
● వేసవిలో నిల్వ పదార్థాలను తినకపోవడమే మంచిది.
● అతిగా వేడి ఉన్న సమయంలో వాకింగ్, వ్యాయామం చేయక పోవడం మంచిది.
● ఏసీలో ఉండి నేరుగా ఎండలోకి వెళ్లడం, ఎండ నుంచి నేరుగా ఏసీలోకి వెళ్లడం చేయవద్దు.
● మాంసాహారం, జంక్ఫుడ్, ఫ్రై చేసిన కూరలు, కూల్డ్రింక్స్కు దూరంగా ఉండాలి. షుగర్, బీపీ ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మంచిర్యాలఅగ్రికల్చర్:జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. నిప్పుల వాన కురిపిస్తున్నాడు. దీంతో జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రోహిణి కార్తెకు ముందే రోళ్లు పగిలేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే వేడి సెగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు వేడిగాలులు తోడవుతుండడంతో జనం పిట్టల్లా రాలుతున్నారు. వారం రోజుల్లో జిల్లాలో ముగ్గురు వడదెబ్బతో మృతి చెందారు. గత నెల 28న జన్నారం మండలం పొనకల్ గ్రామానికి చెందిన మేడిశెట్టి మహేష్, 29న భీమిని మండలం చిన్నగుడిపేటకు చెందిన ఉపాధి కూలీ బాల నాగయ్య, ఈ నెల 1న జిల్లా కేంద్రంలో వృద్ధుడు బదావతి హటియా వడదెబ్బతో మృతి చెందారు.
రెడ్ అలర్ట్
45 డిగ్రీల నుంచి 47 డిగ్రీలకు చేరుకుంటున్న ఉష్ణోగ్రతలతో జిల్లాను రెడ్ జోన్గా ప్రకటించారు. అన్ని మండలాల్లో 45 డిగ్రీలకు చేరుకున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలుల తీవ్రత ప్రమాదకరమని, ఇప్పడున్న పరిస్థితుల్లో బయటకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వారం రోజుల్లో ముగ్గురు మృతి చెందగా మరో 30 మంది వరకు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరారు.
ప్రయాణాలు చేసేటప్పుడు...
● వాహనాలపై వెళ్లాల్సి వస్తే తల, ముక్కు, చెవులకు నిండుగా ఉండేలా కాటన్ టవల్ లేదా కర్చీఫ్ కట్టుకోవాలి. కళ్లకు చలువ అద్దాలు పెట్టుకోవాలి. గొడుగు, టోపి వెంట తీసుకెళ్తే మేలు.
● ఎండకు తిరిగి వచ్చిన వెంటనే బాగా చల్లని నీరు ఒకేసారి తాగవద్దు.
● త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
● తక్కువ మోతాదులో ఎక్కువసార్లు నీటిని తాగాలి.
● వడదెబ్బకు గురైన వారిని చల్లని లేదా నీడ ప్రదేశానికి తీసుకెళ్లాలి.
● నుదుటిపై తడిగుడ్డ వేసి తుడుస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించాలి.
● గాలి ఎక్కువగా తగిలేలా చూడాలి.
● నీరు ఎక్కువగా తాగించాలి.
● ముఖ్యంగా చికెన్, మటన్, బిర్యానీ, ఆయిల్ ఫుడ్, మసాల, ఫ్రై వంటివి తీసుకోరాదు.
వడదెబ్బ తగిలే ముందు...
● వడదెబ్బ తగిలే ముందు వ్యక్తి శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గమనిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోగలుగుతాం. అందులో ముఖ్యమైనవి.
● అధికంగా చెమటపట్టి కాళ్లు, చేతులు వణుకుతాయి.
● కళ్లు మసకబారడం, కండరాళ్లు నొప్పి రావడం జరుగుతుంది.
పారిశ్రామిక జిల్లాపై భానుడి నిప్పుల వాన
47 డిగ్రీలకు వరకు ఉష్ణోగ్రతల నమోదు
రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
ఎండకు తోడు వడగాలులు
వారంలో వడదెబ్బతో ముగ్గురు మృతి
జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు
లక్షణాలు..
మనిషిలో నీటి శాతం, శరీరంలోని లవణాల సంఖ్య తగ్గిపోయి గుండె, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.
ప్రధానంగా 60 ఏళ్లు దాటిన వారు దీని బారిన పడుతారు.
తీవ్రమైన తలనొప్పి, కడుపునొప్పి ఉంటుంది.
చర్మం పొడిబారడంతో నీరసంగా ఉంటుంది. పసుపు పచ్చరంగులో చిక్కటి మూత్రం రావడంతో పాటు మంటగా అనిపించడం
సొమ్మసిల్లి పడిపోతారు. మాటలు తడబడుతాయి.