వనపర్తి జిల్లాలో..
సిర్సనగండ్లలో మాంగళ్యధారణ ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు
చారకొండ: అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంలో జగదానంద కారకుడు, జగదాభిరాముడు కల్యాణ వేడుక...బుధవారం కనులపండువగా సాగింది. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని.. కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తుల జయజయ ద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తీసుకురాగా.. ఆలయ చైర్మన్ డేరం రామశర్మ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు జిలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. వేలాది భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ.. సిర్సనగండ్ల క్షేత్రం భక్తి పారవశ్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా జైశ్రీరాం నినాదాలు మార్మోగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వీఐపీ తాకిడితో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. కల్యాణోత్సవానికి దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు హాజరైనట్లు దేవస్థాన చైర్మన్, ఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
వనపర్తిటౌన్: జిల్లావ్యాప్తంగా బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ఆలయాల ఎదుట పచ్చటి పందిళ్లు వేసి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు, సన్నాయి, డప్పు వాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా ఆలయాలకు తరలివచ్చారు. జిల్లాకేంద్రంలోని రామాలయం, వేంకటేశ్వర దేవాలయం, రాంనగర్, బండారునగర్లోని రామాలయాలు, పీర్లగుట్టలోని అభయాంజనేయస్వామి, నాగవరంలోని కోదండరామస్వామి, మర్రికుంటలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో కల్యాణ క్రతువు జరిపించారు. రామాలయంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, వేంకటేశ్వరస్వామి ఆలయంలో జిల్లా న్యాయమూర్తులు సునీత, రవికుమార్ పాల్గొన్నారు. ఆలయాల్లో భక్తులకు అన్నదానం చేశారు.
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి..
వీపనగండ్ల: శ్రీరామచంద్రుడి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం మండలంలోని గోవర్ధనగిరి, వల్లాభాపురంలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
గోవర్ధనగిరిలో మంత్రి జూపల్లి కృష్ణారావు
నయనానందంగా సాగిన రాములోరి కల్యాణం
జనసంద్రంగా మారిన సిర్సనగండ్ల క్షేత్రం
మార్మోగిన జైశ్రీరామ్ నినాదాలు