రత్నగిరిపై బయో గ్యాస్‌ప్లాంట్‌ | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై బయో గ్యాస్‌ప్లాంట్‌

Published Sun, Aug 13 2017 11:24 PM

రత్నగిరిపై బయో గ్యాస్‌ప్లాంట్‌ - Sakshi

35.49 లక్షలతో ఏర్పాటుకు చర్యలు
కొండదిగువన గోశాలలో రెండు షెడ్ల నిర్మాణం
దేవస్థానం కళాశాల మైదానంలో వాకింగ్‌ ట్రాక్‌
పాలకమండలి సమావేశంలో తీర్మానాలు
అన్నవరం (ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలోని నిత్యాన్న దాన పథకంలోని ఆహార వ్యర్థాలు, వ్రతాల విభాగంలో వచ్చే వ్యర్థాలను వినియోగిస్తూ రత్నగిరి కొండమీద బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది. పాలక మండలి సమావేశం ఆదివారం దేవస్థానంలోని ప్రకాష్‌సదన్‌లో గల సమావేశ మందిరంలో చైర్మన్‌ ఐవీ రోహిత్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశపు అజెండాలో పొందుపరచిన 41 అంశాలపై సభ్యులు చర్చించి తీర్మానాలు చేశారు.
సమావేశంలో సభ్యులు చిర్ల శేషుకుమారి, కొత్త వేంకటేశ్వరరావు, సత్తి వీరదానరెడ్డి, రొబ్బి విజయశేఖర్, మారెడ్డి శింగారెడ్డి, రావిపాటి సత్యనారాయణ, యనమల రాజేశ్వరరావు, యడ్ల భేతాళుడు, అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, మట్టే సత్యప్రసాద్, సింగిలిదేవి సత్తిరాజు, పర్వత రాజబాబు, ఎక్స్‌ అఫీషియో సభ్యుడు ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, ఇన్‌చార్జి ఈఓ ఈరంకి జగన్నాధరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వివరాలను అధికారులు తెలియజేశారు.
ముఖ్యమైన తీర్మానాలు
దేవస్థానంలోని శ్రీవనదుర్గ, శ్రీకనకదుర్గ ఆలయాలు, తొలిపాంచా, ప్రసాదం కౌంటర్‌ కు రంగులు వేయడానికి తీర్మానించారు.
దేవస్థానంలో గత నెలలో ఈ–ప్రోక్యూర్‌మెంట్‌ కం బహిరంగవేలం ద్వారా 14 టీ, కాఫీ మిషన్ల నిర్వహణకు గాను హెచ్చు పాటను ఖరారు చేశారు.
కొండదిగువన గోశాలలో రూ.19.95 లక్షలతో ఏసీ షీటుతో రెండు షెడ్లు నిర్మించేందుకు తీర్మానించారు.
కలెక్టర్‌ ఆదేశాల మేరకు చెందుర్తిలో నిర్మించిన గోశాలలో గోవుల పరరక్షణ, మేత, దాణా సరఫరా అన్నవరంలోని గోశాల ద్వారా చేసేందుకు పాలకమండలి తీర్మానించింది.
రూ.30 లక్షలతో దేవస్థానంలోని ప్రకాష్‌ సదన్‌ సత్రం వెనుక గల పవర్‌ హౌస్‌లో, కొండదిగువన గల పంపా తీరంలో గల పవర్‌హౌస్‌లో  అధునాతన పేనల్‌ బోర్డులు ఏర్పాటు చేయడానికి తీర్మానించారు.
విశాఖ జిల్లాలోని నర్సీపట్నం శివారు బలిఘట్టంలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దత్తత తీసుకోవడానికి కమిషనర్‌ అనుమతి కోసం రాయాలని తీర్మానించారు.
సత్యదేవుని ఆలయం వద్ద గల శయన మందిరం వద్ద రూ.2.75 లక్షలతో వ్యయంతో జియో షీట్‌తో షెడ్డు నిర్మాణం ప్రతిపాదనకు అంగీకరిస్తూ తీర్మానించారు.
 ప్రకాష్‌సదన్‌ వద్ద రూ.7.75 లక్షలతో టాయ్‌లెట్స్‌ మరమ్మతులకు తీర్మానించారు.
శ్రీసత్యదేవ జూనియర్‌ కళాశాల మైదానంలో ఉపాధి హామీ నిధులతో వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణానికి అనుమతి మంజూరు చేస్తూ తీర్మానించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement