-
Income tax: నెల రోజుల్లో 6 లక్షల ఐటీ రిటర్న్స్
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ స్వీకరణ ప్రారంభమైన నెల రోజుల్లో దాదాపు 6 లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిని ఆదాయపన్ను శాఖ అంతే వేగంగా ప్రాసెస్ చేయడం విశేషం. వెరిఫై చేసిన రిటర్న్స్లో దాదాపు మూడింట రెండు వంతులు ఇప్పటికే ప్రాసెస్ అయినట్లు బిజినెస్ లైన్ నివేదించింది.2024-25 అసెస్మెంట్ ఇయర్ (FY25) మొదటి నెలలో ఏప్రిల్ 29 నాటికి 5.92 లక్షలకు పైగా రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిలో 5.38 లక్షలకు పైగా వెరిఫై కాగా 3.67 లక్షల వెరిఫైడ్ రిటర్న్స్ను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున అంటే ఏప్రిల్ 1న ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ను ప్రారంభించింది.ముందస్తుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు త్వరగా రీఫండ్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పెనాల్టీ లేకుండా రిటర్న్స్ను రివైజ్ చేయడానికి లేదా సరిచేయడానికి తగినంత సమయం లభిస్తుంది. అయితే, ఉద్యోగులు మాత్రం కొంత సమయం వేచి ఉంటే మంచిదని సూచిస్తున్నారు. కా 2024-25 అసెస్మెంట్ ఇయర్కు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. -
పన్నుదారులకు అందుబాటులో ఐటీఆర్ ఫారాలు
ఇ-ఫైలింగ్ పోర్టల్లో 2024, ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్ (ఆదాయపు పన్ను రిటర్న్లు) 1, 2, 4, 6 ఫారాలు అందుబాటులో ఉన్నాయని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే సుమారు 23,000 రిటర్న్లు దాఖలయ్యాయని తెలిపింది. 2024-25 మదింపు సంవత్సరానికి (2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి) ఐటీఆర్ దాఖలు అవకాశాన్ని 2024 ఏప్రిల్ 1 నుంచే పన్ను చెల్లింపుదార్లకు అందుబాటులోకి తెచ్చామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ఎక్కువ మంది పన్ను చెల్లింపుదార్లు వాడే ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-4 ఫారాలు 2024 ఏప్రిల్ 1 నుంచే ఇ-ఫైలింగ్ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పింది. కంపెనీలు కూడా ఐటీఆర్-6 ద్వారా ఏప్రిల్ 1 నుంచే రిటర్న్లు దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది. ఇదీ చదవండి: ఐటీ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం పన్ను చెల్లింపుదార్లకు ఆర్థిక సంవత్సరం తొలి రోజు నుంచే ఐటీ రిటర్న్ల దాఖలుకు ఐటీ విభాగం అవకాశం కల్పించడం ఇటీవలి కొన్నేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నిబంధనల సరళీకరణ, పన్ను చెల్లింపు సేవల సులభతరం దిశగా ఇది ఓ కీలక అడుగుగా చెప్పొచ్చు. ఐటీఆర్ ఫారం 1 (సహజ్), ఐటీఆర్ ఫారం 4 (సుగమ్)లను చిన్న, మధ్య తరహా పన్ను చెల్లింపుదార్లు వాడుతారు. ఐటీఆర్-2 ఫారంను నివాస స్థిరాస్తుల నుంచి ఆదాయాలు ఆర్జించే వాళ్లు దాఖలు చేస్తారు. -
ఐటీ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ఏప్రిల్ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఆ సమాచారంపై చాలామందికి సరైన అవగాహనలేక తప్పుదారి పట్టిస్తుంటారు. తాజాగా ఆదాయ పన్ను కొత్త విధానానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ప్రచారమవుతోంది. అందరూ తప్పకుండా కొత్త పన్ను స్లాబ్లనే పాటించాలని పోస్టులు పెడుతున్నారు. ఈ అంశం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. దాంతో కొత్త పన్ను విధానంలో తలెత్తిన అనుమానాలపై క్లారిటీ ఇస్తూ మంత్రిత్వశాఖ తన ‘ఎక్స్’ ఖాతాలో కొన్ని కీలకాంశాలను పేర్కొంది. ఆర్థికశాఖ వివరాల ప్రకారం..పన్ను విధానంలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మారేదీ ఏదీ లేదు. పాత పన్ను విధానం స్థానంలో సెక్షన్ 115BAC(1A) కింద కొత్త పన్ను విధానాన్ని గతంలోనే ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలు, సంస్థలు కాకుండా వ్యక్తులందరికీ కొత్త పన్ను విధానం డీఫాల్ట్గా వర్తిస్తుంది. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నాయి. అయితే పాత పన్ను విధానంలో కల్పిస్తున్న మినహాయింపులు, డిడక్షన్స్ (స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, ఫ్యామిలీ పెన్షన్ రూ.15,000 మినహా) కొత్త విధానంలో లేవు. ఇదీ చదవండి: పెరిగిన టోల్ ధర.. ఏమిటీ టోల్ ట్యాక్స్? ఎందుకు చెల్లించాలి? కొత్త పన్ను విధానం ఇక నుంచి డీఫాల్ట్గా వర్తించనుంది. అయితే పన్ను కట్టేవారు కొత్తది లేదా పాతదాంట్లో ఏది లాభదాయకంగా ఉంటే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 2024-25 ఆర్థిక సంత్సరానికి సంబంధించి రిటర్నులు ఫైల్ చేసే వరకు కొత్త పన్ను విధానం నుంచి వైదొలగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి వ్యాపార ఆదాయం లేని అర్హులైన వ్యక్తులు ప్రతి ఆర్థిక సంవత్సరానికి తమకు నచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారు ఒక ఆర్థిక ఏడాదిలో కొత్త పన్ను విధానం, మరొక ఏడాదిలో పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. It has come to notice that misleading information related to new tax regime is being spread on some social media platforms. It is therefore clarified that: 👉 There is no new change which is coming in from 01.04.2024. 👉 The new tax regime under section 115BAC(1A) was… pic.twitter.com/DtKGkK0D5H — Ministry of Finance (@FinMinIndia) March 31, 2024 -
ఆదాయంలో దూసుకుపోతున్న ఏపీ
-
భారీగా పెరిగిన ట్యాక్స్ పేయర్లు! రికార్డు స్థాయిలో ఐటీఆర్లు
దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు భారీగా పెరిగారు. అసెస్మెంట్ ఇయర్ 2023-24 కు సంబంధించి 2023 డిసెంబరు 31 నాటికి రికార్డు స్థాయిలో 8.18 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 7.51 కోట్ల ఐటీఆర్లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ డేటాను ఉటంకిస్తూ పేర్కొంది. అసెస్మెంట్ ఇయర్ 2022-23 కి దాఖలు చేసిన మొత్తం ఐటీఆర్ల కంటే ఇది 9 శాతం ఎక్కువని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అసెస్మెంట్ ఇయర్ అనేది గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయాన్ని, ఖజానాకు వచ్చిన ఆదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇదీ చదవండి: ఇంకా ఉన్నాయా..? రూ.2000 నోట్లపై ఆర్బీఐ ప్రకటన ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం.. ఇక ఇదే కాలంలో దాఖలు చేసిన మొత్తం ఆడిట్ రిపోర్టులు, ఇతర ఫారాల సంఖ్య 1.6 కోట్లుగా ఉంది, గత సంవత్సరం ఇదే కాలంలో 1.43 కోట్ల ఆడిట్ నివేదికలు, ఫారాలు దాఖలయ్యాయి. -
2022–23లో ఐటీఆర్ ఫైలింగ్ @ 7.40 కోట్లు: కేంద్రం
ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చతుర్వేది లోక్సభలో ఒక కీలక ప్రకటన చేస్తూ, మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.40 కోట్ల మంది ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేశారని, ఇందులో 5.16 కోట్ల మంది ‘జీ ట్యాక్స్ లయబిలిటీ’లో ఉన్నారని పేర్కొన్నారు. గడచిన ఐదేళ్లలో ఐటీఆర్లు ఫైల్ చేస్తున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపారు. 2018–19లో వీరి సంఖ్య 6.28 కోట్లయితే, 2019–20లో 6.47 కోట్లకు చేరిందన్నారు. 2020–21లో ఈ సంఖ్య 6.72 కోట్లకు చేరితే 2021–22లో ఇది 6.94 కోట్లకు పెరిగిందన్నారు. 2022–23లో 7.40 కోట్లకు రిటర్నులు ఫైల్ చేసిన వారి సంఖ్య పెరిగినట్లు వివరించారు. ‘జీరో ట్యాక్స్’ వ్యక్తుల సంఖ్య 2.90 కోట్ల నుంచి 5.16 కోట్లకు అప్ ఇక జీరో ట్యాక్స్ లయబిలిటీలో ఉన్న వారి సంఖ్య 2019–20లో 2.90 కోట్ల మంది ఉంటే, 2022–23లో ఈ సంఖ్య 5.16 కోట్లకు ఎగసినట్లు పేర్కొన్నారు. ‘ప్రత్యక్ష పన్ను వసూళ్లు– దాఖలైన ఆదాయపు పన్ను రిటర్న్ల సంఖ్యలో దామాషా పెరుగుదల ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. సంబంధిత మదింపు సంవత్సరానికి వర్తించే పన్ను రేటు, చట్టం ప్రకారం అనుమతించదగిన తగ్గింపులు/ మినహాయింపులు, ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు ఆర్థిక వృద్ధి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది’’ అని మంత్రి పేర్కొన్నారు. కాగా, 2017–18లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.11.38 లక్షల కోట్లయితే, 2022–23లో ఈ పరిమాణం 16.63 లక్షల కోట్లకు ఎగసిందని ఆయన తెలిపారు. -
ఆదాయపు పన్ను శాఖ పనితీరుపై స్పందించిన నటుడు మాధవన్
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుచేసిన మూడు వారాల్లోనే తనకు నగదు రీఫండ్ అయిందని నటుడు మాధవన్ అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో ఆదాయపు పన్ను శాఖ పనితీరును ప్రశంసించారు. మాధవన్కు చెందిన ల్యూకోస్ ఫిల్మ్స్ కంపెనీ ఇటీవల ఆదాయపు పన్ను రిటర్న్న్ దాఖలు చేసింది. ఎలాంటి చిక్కులు లేకుండా మూడు వారాల్లోనే ఆదాయపు పన్ను శాఖ నుంచి రీఫండ్ పొందడంతో ఆయన స్పందించారు. అక్టోబర్ 31 వరకు రికార్డు స్థాయిలో 7.85 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన మొత్తం 7.78 కోట్ల ఐటీఆర్లతో పోలిస్తే ఇదే ఆల్ టైమ్ హై అని ఐటీ శాఖ చెప్పింది. The income tax refund for our company was received within 3 weeks after filing of return for AY 2023-24. The speed and promptness is simply unheard of ..The efficiency and transparency of the income tax department is unbelievable. Totally impressed and flabbergasted .… — Ranganathan Madhavan (@ActorMadhavan) November 13, 2023 -
ఆదాయపన్ను రిటర్నుల్లో గణనీయ పెరుగుదల
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే వారి సంఖ్య ఎనిమిదేళ్ల కాలంలో 90 శాతం పెరిగిందని, 2021–22 అసెస్మెంట్ సంవత్సరంలో (2020–21 ఆర్థిక సంవత్సరానికి) 6.37 కోట్ల ఐటీఆర్లు దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది. వ్యక్తులు జారీ చేసే రిటర్నులు 2013– 14 అసెస్మెంట్ సంవత్సరానికి 3.36 కోట్లుగా ఉంటే, అది 2021–22 నాటికి 6.37 కోట్లకు చేరినట్టు వెల్లడించింది. 2023–24 అసెస్మెంట్ సంవత్సరం (2022–23 ఆర్థిక సంవత్సరం)లోనూ 7.41 కోట్ల ఐటీఆర్లు దాఖలైనట్టు తెలిపింది. ఇందులో మొదటిసారి ఐటీఆర్లు దాఖలు చేసిన వారు 53 లక్షల మంది ఉన్నట్టు పేర్కొంది. ముఖ్యంగా రూ.5–10 లక్షల ఆదాయం వర్గం వారి రిటర్నులు.. 2013–14 అసెస్మెంట్ సంవత్సరం నుంచి 2021–22 అసెస్మెంట్ సంవత్సరానికి 295 శాతం పెరిగాయి. రూ.10–25 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారి రిటర్నులు 291 శాతం పెరిగాయి. ఈ వివరాలను ఆదాయపన్ను శాఖ అత్యున్నత నిర్ణయ విభాగం సీబీడీటీ ప్రకటించింది. రూ.5 లక్షల్లోపు ఆదాయం కలిగి రిటర్నులు వేసే వారి సంఖ్య 2.62 కోట్ల నుంచి 3.47 కోట్లకు పెరిగింది. స్థూల ఆదాయం పరంగా టాప్ 1 శాతం పరిధిలోని పన్ను రిటర్నులు వేసే వారు 15.9 శాతం నుంచి 14.6 శాతానికి తగ్గారు. దిగువ నుంచి 25 శాతం ఆదాయం కలిగిన వారి రిటర్నులు 8.3 శాతం నుంచి 8.4 శాతానికి పెరిగాయి. ఇక మధ్యస్థ ఆదాయం కలిగిన 74 శాతం గ్రూప్ పరిధిలోని పన్ను చెల్లింపుదారుల రిటర్నులు 75.8 శాతం నుంచి 77 శాతానికి పెరిగాయి. మధ్య తరగతి వాసుల రిటర్నులు ప్రధానంగా పెరిగినట్టు తెలుస్తోంది. -
ఆదాయపుపన్ను శాఖ సంచలన నిర్ణయం..అపర కుబేరులకు ఝలక్
ఆదాయపుపన్ను కట్టనివారిపై సంబంధిత శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని పన్ను ఎగవేతదారుల ఆట కట్టిస్తోంది. ‘360డిగ్రీ ప్రొఫైలింగ్’ ద్వారా అపరకుబేరులు కట్టే పన్ను ఎగవేతను అరికట్టేలా చర్యలు తీసుకుంటుంది. గడిచిన బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయంపై అత్యధిక పన్ను రేటును 42.74 నుంచి 39 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అయినప్పటికీ అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల(హై నెట్వర్త్ ఇండివిడ్యూవల్స్) పన్ను ఎగవేతను అరికట్టలేకపోవడంపై ఆదాయపు పన్ను శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా తక్కువ మొత్తంలో ట్యాక్స్ చెల్లిస్తూ ఎగవేతకు పాల్పడుతున్న కోటీశ్వరులపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. రూ.1కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్న లేదా అందుకు అవకాశం ఉన్న వ్యక్తులను '360-డిగ్రీల ప్రొఫైలింగ్' చేయనున్నట్లు ఐటీ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆయా వ్యక్తుల పెట్టుబడి ప్రొఫైల్, ఖర్చులు, అసెస్మెంట్ కోసం ఆదాయ వనరులను ట్రాక్ చేస్తోందని వెల్లడించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 61 వేల మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్ల్లో రూ.ఒక కోటి కంటే ఎక్కువ ట్యాక్సబుల్ ఆదాయాన్ని చూపించారు. అయితే ఈ ఆదాయం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. ఐటీ స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత తమ ఆదాయాన్ని తక్కువగా నివేదించిన వారికి నోటీసులు పంపనున్నట్లు సమాచారం. -
Income Tax: బకాయిలుంటే ట్యాక్స్ రీఫండ్లో కటింగ్!
ఆదాయపు పన్ను బకాయిలను వసూలు చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ (Income Tax Department) సరికొత్త ప్రణాళిక రచించింది. బకాయిలున్న పన్ను చెల్లింపుదారులు తమకు రావాల్సిన ట్యాక్స్ రీఫండ్ (Tax refund) తో బకాయిలను సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని ఆదాయపు పన్ను శాఖ కల్పించింది. ఆదాయపు పన్ను రిటర్న్ల (ITR) ప్రాసెసింగ్ను వేగవంతంగా పూర్తి చేసేందుకు, రీఫండ్ల జారీని త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఐటీ శాఖ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. (New Rules: అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త మార్పులు, నిబంధనలు ఇవే..) పన్ను బకాయిలు కూడా అధిక మొత్తంలో ఉన్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పెండింగ్లో ఉన్న బకాయిలను సర్దుబాటు చేసి ట్యాక్స్ రీఫండ్లను సకాలంలో జారీ చేయడానికి సహకరించాలని కోరింది. బకాయిల సర్దుబాటుపై తమ సమ్మతిని తెలియజేయడానికి ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 245(1) ట్యాక్స్ పేయర్లకు అవకాశం కల్పిస్తుంది. దీని ప్రకారం.. బకాయిల సర్దుబాటుపై తమ అంగీకరిస్తున్నారో.. లేదో అని తెలియజేయాల్సి ఉంటుంది. (RBI Rules: వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు) 2023-24 అసెస్మెంట్ ఇయర్ కోసం 7.09 కోట్ల రిటర్న్లు దాఖలుకాగా 6.96 కోట్ల ఐటీఆర్లను ఆదాయపు పన్ను శాఖ వెరిఫై చేసింది. ఇక ఇప్పటివరకు వీటిలో 2.75 కోట్ల రిటర్న్స్కు ట్యాక్స్ రీఫండ్ను చెల్లించగా 6.46 కోట్ల రిటర్న్లను ప్రాసెస్ చేసినట్లు ఐటీ శాఖ పేర్కొంది. -
టాక్స్ రిఫండ్స్: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త!
Income tax refund: ఆదాయపు పన్ను రిటర్న్లు (ITRలు) దాఖలు చేసిన తర్వాత టాక్స్ రిఫండ్స్ విషయంలో ఆదాయపన్ను కీలక నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించిన యావరేజ్ ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించాలని ఆదాయపు పన్ను శాఖ యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 16 రోజుల నుంచి 10 రోజులకు తగ్గింపుపై పన్ను శాఖ ఆలోచిస్తోంది. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొత్త టైమ్లైన్ను అమలు చేయాలని భావిస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి పెనాల్టీ లేకుండా ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువుజూలై 31, 2023తో ముగిసిన సంగతి తెలిసిందే. తాజా లెక్కల ప్రకారం చాలామంది ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసిన పన్ను చెల్లింపుదారులు టాక్స్ రిఫండ్స్ దాదాపు అందుకున్నారు. అయితే మరికొంతమంది మాత్రం టాక్స్ రిఫండ్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.వార్షిక ITRను ఫైల్ చేసేటప్పుడు అసెస్సీ ఉపయోగించే ఎంపికపై ఆధారపడి, రీఫండ్ ఎలక్ట్రానిక్ మోడ్ అంటే ఖాతాకు నేరుగా క్రెడిట్ లేదా రీఫండ్ చెక్ ద్వారా గానీ చెల్లిస్తారు. ఈ రీఫండ్ ప్రాసెస్ను సంబంధిత పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. రీఫండ్ ఆలస్యం అయితే ఏమి చేయాలి? ప్రతిస్పందన కోరుతూ ఆదాయపు పన్ను శాఖ నుండి ఏదైనా కమ్యూనికేషన్ వచ్చిందా లేదా అని ఈమెయిల్లో చెక్ చేసుకోవాలి ఒక వేళా అలాంటి ఇమెయిల్ ఎదైనా వస్తే వీలైనంత త్వరగా ప్రతిస్పందించడం చాలా ముఖ్యం. ఒకవేళ ITR స్టేటస్ రీఫండ్ గడువు ముగిసినట్లు చూపితే, 90 రోజుల చెల్లుబాటు వ్యవధిలోపు చెల్లింపు కోసం వాపసు సమర్పించబడలేదని అర్థం.ఈ సందర్బంగా టాక్స్పేయర్ రీఫండ్ రీ-ఇష్యూ రిక్వెస్ట్ పంపవచ్చు. రీఫండ్ స్టేటస్పై చాలా క్వెరీలువస్తున్నాయని, ఇ-ఫైలింగ్ తర్వాత తిరిగి చెల్లించాల్సిన పన్ను చెల్లింపుదారులకు చెల్లింపును వేగవంతం లోకి ఇది మంచి చర్య అని క్లియర్ ఫౌండర్సీఈవో అర్చిత్ గుప్తా అన్నారు. ఈఏడాది పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు సకాలంలో దాఖలు చేశారని (31 జూలై 2023 వరకు 6.77 కోట్ల ఐటీఆర్లు) అందువల్ల వాపసులను త్వరగా ప్రాసెస్ చేస్తారనే అంచనా ఉందన్నారు. -
కోటీశ్వరులు పెరిగారు.. లక్షాధికారులు తగ్గారు!
I-T returns filed for income above Rs 1 crore: దేశంలో కోటీశ్వరుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ డేటా ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఆర్జించినట్లు 2.69 లక్షల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ఇది కోవిడ్ మహమ్మారి సంక్షోభం 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 49.4 శాతం పెరిగింది. మరోవైపు అదే కాలానికి రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ కేవలం 1.4 శాతం మాత్రమే పెరిగాయి. ఆర్థిక సంవత్సరాల వారీగా చూస్తే.. రూ.కోటి పైగా ఆదాయానికి దాఖలైన ట్యాక్స్ రిటర్న్స్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2.69 లక్షలు, 2021-22 ఏడాదికి 1.93 లక్షలు, 2018-19 ఆర్థిక సంవత్సరానికి 1.80 లక్షలు ఉన్నాయి. అల్పాదాయ వర్గాలపై కోవిడ్ దెబ్బ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ట్యాక్స్ ఫైలర్లు దాఖలు చేసిన ఐటీ రిటర్న్ల సంఖ్య 2019-20తో పోల్చితే 41.5 శాతం పెరిగింది. కానీ రూ. 5 లక్షలు, ఆలోపు ఆదాయ విభాగంలో కేవలం 0.6 శాతం పెరిగింది. కోవిడ్ మహమ్మారి సంక్షోభం దెబ్బ వివిధ ఆదాయ వర్గాలపై ఎలా ఉందో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల వరకు ఆదాయ వర్గం మినహా, ఇతర అన్ని ఆదాయ వర్గాల ట్యాక్స్ రిటర్న్స్ సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల వరకు ఆదాయానికి దాఖలు చేసిన ఐటీ రిటర్న్లు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 4.94 కోట్ల నుంచి 5.68 కోట్లకు పెరిగాయి. అయితే, ఇతర ఆదాయ వర్గాల రిటర్న్లలో తగ్గుదల కనిపించింది. రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయానికి దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ల సంఖ్య క్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న 1.90 లక్షల నుంచి 1.46 లక్షలకు పడిపోయింది. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఆదాయానికి ఐటీఆర్ల సంఖ్య 2.83 లక్షల నుంచి 2.25 లక్షలకు తగ్గాయి. రూ. 5 లక్షల-10 లక్షల మధ్య ఆదాయానికి ఫైల్ చేసిన ట్యాక్స్ రిటర్న్స్ 1.05 కోట్ల నుంచి 99.36 లక్షలకు తగ్గాయి. -
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదా ?..అయితే మీకు జరిమానా
-
పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్
ఆధార్ కార్డ్తో లింక్ చేయని కారణంగా పనిచేయకుండా పోయిన (ఇనాపరేటివ్) పాన్ కార్డులు, ఇతర కారణాలతో ఇన్యాక్టివ్గా మారిన పాన్ కార్డులు రెండూ ఒకటి కావు. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైలింగ్ సందర్భంగా ఇనాపరేటివ్, ఇనాక్టివ్ పాన్ కార్డుల మధ్య తేడా తెలియక తికమక పడుతున్న ప్రజలకు ఆదాయపు పన్ను శాఖ క్లారిఫికేషన్ ఇచ్చింది. ‘పనిచేయని (ఇనాపరేటివ్) పాన్ కార్డు, ఇన్యాక్టివ్ పాన్ కార్డు రెండూ వేరు వేరు. పాన్ కార్డు పనిచేయక పోయినా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయవచ్చు’ అని ఐటీ శాఖ ట్విటర్లో పోస్టు ద్వారా తెలియజేసింది. అయితే పనిచేయని పాన్లకు పెండింగ్లో ఉన్న రీఫండ్లు, వాటి మీద వడ్డీలు చెల్లింపులు సాధ్యం కావని స్పష్టం చేసింది. ఇదీ చదవండి ➤ Inoperative PAN: పాన్ కార్డ్ పనిచేయడం లేదా..? అయితే ఈ లావాదేవీలు చేయలేరు! అలాగే ఇనాపరేటివ్ పాన్ ఉన్నవారికి టీడీస్ (ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్), టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్) లను అధిక రేటుతో విధించనున్నట్లు పేర్కొంది. కాగా ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ లింక్ చేయడానికి గడువు జూన్ 30తో ముగిసింది. ఎన్ఆర్ఐ పాన్లపై స్పష్టత ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు తమ పాన్ ఇన్ఆపరేటివ్గా (పనిచేయకపోతే) మారిపోతే, నివాస ధ్రువీకరణ పత్రాలతో అసెసింగ్ అధికారులను సంప్రదించాలని ఆదాయపన్ను శాఖ సూచించింది. తమ పాన్లు పనిచేయకుండా పోవడం పట్ల కొందరు ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుల (ఓసీఐలు) నుంచి ఆందోళన వ్యక్తమైనట్టు తెలిపింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఐటీఆర్ దాఖలు చేసిన వారి స్టేటస్ వివరాలను తామే జురిస్డిక్షనల్ అసెసింగ్ ఆఫీసర్లకు పంపించినట్టు స్పష్టం చేసింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో రిటర్నులు దాఖలు చేయని లేదా తమ నివాస హోదాను అప్డేట్ చేయని వారి పాన్లు పనిచేయకుండా పోయినట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది. Dear Taxpayers, Concerns have been raised by certain NRIs/ OCIs regarding their PANs becoming inoperative, although they are exempted from linking their PAN with Aadhaar. Further, PAN holders, whose PANs have been rendered inoperative due to non-linking of PAN with Aadhaar,… — Income Tax India (@IncomeTaxIndia) July 18, 2023 -
ఐటీఆర్ గడువు పొడిగింపు పరిశీలనలో లేదు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులు వీలైనంత ముందుగా పన్ను రిటర్నులను (ఐటీఆర్లు) దాఖలు చేసుకోవాలని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంయజ్ మల్హోత్రా సూచించారు. జూలై 31గా ఉన్న ఐటీఆర్ల దాఖలు గడువు పొడిగింపును ప్రభుత్వం పరిశీలించడం లేదని స్పష్టం చేశారు. గతేడాది కంటే ఎక్కువ మంది రిటర్నులు దాఖలు చేస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. గతేడాది జూలై 31 నాటికి 5.83 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. ‘‘పన్ను రిటర్నులను దాఖలు చేసే వారికి మేము ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే గతేడాది కంటే చాలా వేగంగా రిటర్నులు దాఖలు అవుతున్నాయి. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, గడువు పొడిగింపుపై ఆశలు పెట్టుకోకుండా రిటర్నులు దాఖలు చేసుకోవాలన్నది మా సూచన. జూలై 31కి ఇంకా ఎన్నో రోజులు లేనందున వెంటనే రిటర్నులు దాఖలు చేసుకోవాలి’’అని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. పన్ను వసూళ్ల లక్ష్యంపై మాట్లాడుతూ.. 10.5 శాతం వృద్ధి రేటు స్థాయిలోనే ఆదాయం ఉంటుందన్నారు. జీఎస్టీ పరంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 12 శాతం ఆదాయం వృద్ధి చెందినట్టు చెప్పారు. 2023–24 బడ్జెట్ ఆధారంగా చూస్తే స్థూలంగా రూ.33.61 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో రూ.18.23 లక్షల కోట్లను కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపన్ను రూపంలో వసూలు చేయాలన్నది లక్ష్యం. గతేడాదితో పోలిస్తే 10.5 శాతం ఎక్కువ. -
పన్ను రీఫండ్ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే..
Income tax return filing, maximise tax refund: ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలుకు గడువు సమీపిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2023-24) ఐటీఆర్ ఫైల్ చేయడానికి జూలై 31తో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గుడువు తేదీని గుర్తు చేస్తూ ఆదాయపు పన్ను శాఖ తాజాగా ట్వీట్ చేసింది. తమ ఆదాయాలకు తగిన దాని కంటే ఎక్కువగా పన్నులు చెల్లించిన ట్యాక్స్ పేయర్లు రీఫండ్ పొందవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో రీఫండ్ మొత్తాన్ని లెక్కించి ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత రీఫండ్ మొత్తం సంబంధిత ట్యాక్స్ పేయర్ల అకౌంట్లలో జమవుతుంది. ఫారమ్ 16లో చూపిన దానికంటే ఎక్కువగా పన్ను ఆదా చేసుకునే అవకాశం లేదనే అపోహ చాలా మందిలో ఉందని నిపుణులు చెబుతున్నారు. పన్ను ఆదాకు ఫారమ్ 16 ఒక్కటే మార్గం కాదు. రిటర్న్లను దాఖలు చేయడానికి ముందు 26AS, వార్షిక సమాచార ప్రకటన (AIS), పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం (TIS)తో ఆదాయ వివరాలను చెక్ చేయండి. 26ASలో టీడీఎస్ ప్రతిబింబిస్తే టీడీఎస్ని క్లెయిమ్ చేయవచ్చు లేదా చెల్లించాల్సిన పన్ను మొత్తానికి సర్దుబాటు చేసుకోవచ్చు. ఇదీ చదవండి ➤ ఐటీఆర్ ఫైలింగ్లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్ ఐటీఆర్ దాఖలు సమయంలో ఈ కింది ఐదు సూత్రలను పన్ను రీఫండ్ను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. సకాలంలో ఐటీఆర్ ఫైలింగ్ పెనాల్టీల నుంచి తప్పించుకోవడానికి మీ రిటర్న్లను సకాలంలో ఫైల్ చేయడం చాలా ముఖ్యం. ఇది గరిష్ట రీఫండ్ పొందడానికి సులభమైన మార్గాలలో ఒకటి. ఐటీ చట్టంలోని సెక్షన్ 139(1) కింద నిర్దేశించిన తేదీలోగా పన్ను చెల్లింపుదారు రిటర్న్ ఫారమ్ను సమర్పించాలి. ఐటీఆర్ ఫైల్ చేయడం ఆలస్యమైతే జరిమానా చెల్లించవలసి ఉంటుంది. సరైన పన్ను విధానం ఎంపిక మీ నచ్చిన, మీ అవసరాలకు సరిపోయే పన్ను విధానాన్ని ఎంచుకుని ఐటీఆర్ ఫైల్ చేయండి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఇన్సూరెన్స్ పాలసీ లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్లు (ELSS), హోమ్ లోన్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్పై వడ్డీ వంటి దీర్ఘకాలిక పెట్టుబడులు లేనివారికి కొత్త పన్ను విధానం సరిపోతుంది. తగ్గింపులు, మినహాయింపులకు బదులుగా ఇందులో తక్కువ పన్ను రేట్లు ఉంటాయి. ఈ-రిటర్న్ ధ్రువీకరణ ఐటీఆర్ ఫైల్ చేసిన 30 రోజులలోపు పన్ను రిటర్న్ని ధ్రువీకరించాలి. రిటర్న్ ధృవీకరించని పక్షంలో దాన్ని చెల్లనిదిగా పరిగణిస్తారు. చివరి తేదీ దాటినట్లయితే మళ్లీ ఐటీఆర్ సమర్పించాలి. ఆధార్తో లింక్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ అకౌంట్, ఏటీఎం ద్వారా ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ కోడ్ వంటి మార్గాల్లో ఈ-రిటర్న్ ధ్రువీకరణ పూర్తి చేయవచ్చు. తగ్గింపులు, మినహాయింపుల క్లెయిమ్ క్లెయిమ్ చేయగల తగ్గింపులు, మినహాయింపులను గుర్తించాలి. ఇవి మొత్తం పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. ట్యాక్స్ రీఫండ్ను పెంచుతుంది. పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, నేషనల్ పెన్షన్ స్కీమ్, లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, గృహ రుణంపై వడ్డీ వంటి వాటితో ప్రామాణిక తగ్గింపులు పొందవచ్చు. ఫారమ్ 16లో ప్రతిబింబించే తగ్గింపులను మాత్రమే లెక్కించకూడదు. అందులో ప్రతిబింబించని అనేక పన్ను పొదుపు ఖర్చులను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు పిల్లల పాఠశాల ట్యూషన్ ఫీజు. ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు పన్ను ఆదా ఖర్చులు, పెట్టుబడులను పునఃపరిశీలించడం మంచిది. బ్యాంక్ ఖాతా ధ్రువీకరణ మీ బ్యాంక్ ఖాతాను ప్రామాణీకరించడంతోపాటు ఆదాయపు పన్ను రిటర్న్ పోర్టల్లో సరిగ్గా ధ్రువీకరించినట్లుగా నిర్ధారించుకోండి. ఈ-ఫైలింగ్ పోర్టల్లో ధ్రువీకరించిన ఖాతాలకు మాత్రమే ఐటీ అధికారులు క్రెడిట్ రీఫండ్లు చేస్తారు. కాబట్టి ధ్రువీకరణ ప్రక్రియ చాలా ముఖ్యం. రిటర్న్లు దాఖలు చేసే ముందే మీ అకౌంట్ ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. Do finish this important task and unwind this weekend. The due date to file your #ITR for AY 2023-24 is 31st July, 2023.#FileNow and spend your weekend without any worry. Pl visit https://t.co/GYvO3mStKf#ITD pic.twitter.com/ngLwU8Hzbi — Income Tax India (@IncomeTaxIndia) July 15, 2023 -
IT Returns: అందుబాటులోకి ఐటీఆర్-ఫారమ్లు.. గడువు తేదీ గుర్తుందిగా!
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఈ ఫైలింగ్ పోర్టల్పై ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు (ఐటీఆర్) 1, 4 లను ఆదాయపు పన్ను శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తులు, చిన్న వ్యాపారులు, వృత్తి నిపుణులు వీటిని దాఖలు చేస్తుంటారు. ఇతర ఐటీఆర్ పత్రాలను సైతం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ల దాఖలు గడువు జూలై 31గా ఉంది. ఐటీఆర్ 1ను వ్యక్తులు, వేతన జీవులు, వృద్ధులు దాఖలు చేస్తుంటారు. ఐటీఆర్4ను వ్యాపారులు, వృత్తి నిపుణులు దాఖలు చేస్తుంటారు. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్) ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో ఐటీఆర్ ఫారమ్లతోపాటు ఫారమ్-16 జీతం వివరాలు, పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ ఆదాయాలకు సంబంధించిన సమాచారంతో కూడిన ఎక్సెల్ యుటిలిటీ షీట్ వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని అవసరమైన సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత తిరిగి ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! -
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోండి
-
ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు ముఖ్య గమనిక!
మీ అందరికీ ముందుగా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ’శోభకృత్’ సంవత్సరంలో మీరింగా శోభాయమానంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ మధ్యే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక ప్రకటన జారీ చేసింది. గతంలో తెచ్చిన మార్పుల ప్రకారం మీరు రిటర్నుని అప్డేట్ చేసుకోవచ్చు. ఈ రిటర్ను పేరు ఐటీఆర్యూ ఒకప్పుడు రివైజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అది లేదు. దానికి బదులుగా వచ్చింది. ఇంద్రుడిని సహస్రాక్షుడు అని కూడా అంటారు. అంటే వేయి కన్నులవాడు అని అర్థం. ప్రస్తుతం డిపార్టుమెంటు వారు కూడా అదే అవతారం ఎత్తారు. వారి దగ్గరున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా అసెసీల గురించి ఎంతో ఎక్కువ సమాచారాన్ని సేకరించారు. ఇందులో రెండు రకాలుంటాయి. మనం అసలు రిపోర్ట్ చేయనివి ఒకటైతే.. రెండోది.. సగం, తక్కువగా, కొంత మాత్రమే రిపోర్ట్ చేసినవి. గతంలో 26 అ లో సమాచారం ఉండేది. ఇప్పుడు అఐ ద్వారా సరైనది, సమగ్రమైనది, సంపూర్ణంగా ఉండే సమాచారాన్ని సేకరించారు. 2019 ఏప్రిల్ 1 నుంచి మన లావాదేవీలకు సంబంధించిన లావు చిట్టా. ఇది ప్రస్తుతం మీ ఖాతాలో ప్రతిబింబిస్తుంది. మీరు చెక్ చేసుకోండి. గడిచిన చరిత్ర.. కుండలీకరణం. 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను 68,000 మంది ఆర్థిక జాతకం బయటపడింది. వీరందరికీ బొట్టుపెట్టి పిలిచి ‘ఇదిగో మీ జాతకం‘ అని చూపించారు. చిలక్కి చెప్పినట్లు చెప్పారు. కేవలం 35,000 మంది మాత్రమే బదులుగా తమ రిటర్నులను అప్డేట్ చేసుకున్నారు. అంటే గతంలో వేసిన దానికి, అఐ లో సమాచారంతో పోల్చి చూసుకుని తమ రిటర్నులను సవరించుకున్నారు. సవరణ.. అంటే ఆదాయాన్ని పెంచి చూపించి వేశారు. మిత్ర లాభంలో మూడు చేపల కథలో రెండో చేప ’కుశాగ్రబుద్ధి’ లాంటి వాళ్లు, మూడవ చేపలాగా మందబుద్ధులైన మిగతావారికి మరో అవకాశం ఇస్తూ డిపార్టుమెంటు తాజా ప్రకటన చేసింది. వారి మీద కఠిన చర్యలు తీసుకునే ముందు ఇది ఒక హెచ్చరిక. ఈ ప్రచారంలో భాగంగానే పేరు పేరున ‘2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు మీ ఖాతాలో ముఖ్యమైనవి, పెద్దవి అయిన ఆర్థిక వ్యవహారాలు జరిగాయి. ఆ వివరాలను పదిలంగా మా దగ్గర భద్రపరిచాం. వెంటనే చూడండి. పరికించండి. పరీక్షించండి. మా పోర్టల్లో లాగిన్ అవ్వండి. ఇవిగో మీరు నడిపించిన వ్యవహారాలు. అవసరమైతే తగిన అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి‘ అంటూ ఎంతో మందికి వర్తమానం పంపించారు. అలా వచ్చిన వారు వెంటనే లాగిన్ అయి చెక్ చేసుకోండి. అవసరం అయితే వాటిని పరిగణనలోకి తీసుకోండి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి. ఇప్పటికే వాటిని పరిగణించి, తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే.. మిత్రలాభంలో మొదటి చేప ‘దూరదర్శి‘లాగా ఊపిరి పీల్చుకోవచ్చు. -
ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్లను విడుదల చేసిన ఐటీ శాఖ!
మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు కొత్త బడ్జెట్కు సంబంధించిన ఆలోచనలు, సమావేశాలు, సంప్రదింపులు, ప్లానింగ్ విషయాలు .. మొదలైన వాటిని పక్కన పెట్టండి. 2023 ఏప్రిల్ 1 నుంచి వాటి గురించి ఆలోచిద్దాం. ఈలోగా 2023 మార్చి 31లోపల మనం ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన ఆలోచనలు, సమాలోచనలు, ప్లానింగ్ ఆలోచిద్దాం. 2023 మార్చి 31తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరానికి కొంత మందికి గడువు తేదీ 31–07–2023; మరికొందరికి సెప్టెంబర్ నెలాఖరు. అందుకు గాను ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 10న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో మీరు మార్చి నెల తర్వాత డిపార్టుమెంటు వారికి దాఖలు చేయాల్సిన రిటర్నుల గురించి .. ఫారమ్లు, వాటిని దాఖలు చేసినప్పుడు మీకు వచ్చే అక్నాలెడ్జ్మెంట్ గురించి.. నోటిఫై చేశారు. ►ఈ ఫారాలు 01–04–2023 నుండి అమల్లోకి వస్తాయి. ►డిపార్టుమెంట్ వారి భాష ప్రకారం 2023–24 అసెస్మెంట్ సంవత్సరానికి వర్తించేవి అనాలి. ►ఈ ఫారాలు ఏమిటంటే..ఐటీఆర్ 1 సహజ్, ఐటీఆర్ 2, ఐటీఆర్ 4 సుగమ్, ఐటీఆర్ 5,ఐటీఆర్ 6 ►పైన పేర్కొన్న ఫారాలు దాఖలు చేస్తే మీకు వచ్చే ఐటీ అక్నాలెడ్జ్మెంటు ఐటీఆర్విని కూడా నోటిఫై చేశారు. ► అన్ని ఫారాల్లోనూ షెడ్యూళ్లు ఉన్నాయి. ►2022 అక్టోబర్లోనే రూల్స్ విడుదల చేశారు. ►ఉద్యోగస్తులకు సర్క్యులర్ డిసెంబర్లోనే విడుదల చేశారు. ►‘‘డౌన్లోడ్స్’’ కింద ఐటీఆర్ ఆఫ్లైన్ యుటిలిటీ ద్వారా ఆఫ్లైన్ సదుపాయం ఉంది. ►సాంకేతికంగా సులువుగా, త్వరగా వేసేలా తగిన చర్యలు తీసుకున్నారు. ►ప్రస్తుతం ఒకొక్కప్పుడు తప్పులు దొర్లుతున్నాయి. ‘డేటా’ .. అంటే సమాచారమనేది సిస్టంలోకి ప్రీ–ఫిల్ అవడం లేదు. పూర్తి సమాచారం లేదని చూపుతోంది. ►ఎక్సెల్ వెర్షన్లో ‘సబ్మిట్’కి ఎక్కువ వ్యవధి తీసుకుంటోంది. ►షెడ్యూల్స్ నింపేటప్పుడు కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. షెడ్యూల్స్ ఎంపిక చేసేటప్పుడు గందరగోళం, గజిబిజి ఏర్పడుతోంది. స్పష్టత ఉండటం లేదు. ఒక్కొక్కప్పుడు మొరాయిస్తోంది. ► ఇలాంటివి ఉండవని ఆశిద్దాం. ► మీరు స్వయంగా వేసుకుంటే మీ స్వంత అనుభవాన్ని మించిన పాఠం లేదు. ► వృత్తి నిపుణులకి ఇస్తే సమగ్ర సమాచారాన్ని సకాలంలో ఇవ్వండి. -
ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్! ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్ ఫైలింగ్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) నూతన రిటర్నులు (ఐటీఆర్లు) ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి తెలిపింది. దీంతో అసెస్మెంట్ సంవత్సరం మొదటి రోజు నుంచే (2023 ఏప్రిల్ 1) రిటర్నులు దాఖలు చేసుకోవడం వీలవుతుంది. గతేడాదితో పోలిస్తే, ఐటీఆర్లలో పెద్దగా మార్పులు చేయలేదని తెలిపింది. ఆదాయపన్ను చట్టం 1961లో చేసిన సవరణల మేరకు స్వల్ప మార్పులను ప్రవేశపెట్టినట్టు స్పష్టం చేసింది. ఐటీఆర్ 1 నుంచి ఐటీఆర్ 7 వరకు పత్రాలను సీబీడీటీ నోటిఫై చేయడం తెలిసిందే. సాధారణంగా ఏటా మార్చి లేదా ఏప్రిల్లో ఐటీఆర్లను నోటిఫై చేస్తుంటారు. ఈ విడత ముందుగానే ఈ ప్రక్రియను సీబీడీటీ పూర్తి చేసింది. (ఇదీ చదవండి: ఎఫ్డీ కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు పెంపు..) -
Budget 2023-24: కొత్త ఇన్కం టాక్స్పై చిక్కు ప్రశ్నలు, సమాధానాలు
2023-24 బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఇన్కంటాక్స్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ.7 లక్షల వరకు పన్ను లేదన్న ప్రకటన ఎంత వరకు మేలు చేస్తుందన్న దానిపై రకరకాల అంచనాలు వేస్తున్నారు నిపుణులు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినదాని ప్రకారం.. 7లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు, ఆదాయం రూ.7లక్షలు దాటితే మాత్రం 5 శ్లాబుల్లో పన్ను ఉంటుంది. 0-3 లక్షల వరకు నిల్ 3 - 6 లక్షల వరకు 5% పన్ను 6 - 9 లక్షల వరకు 10% పన్ను 9 -12 లక్షల వరకు 15% పన్ను 12- 15 లక్షల వరకు 20% పన్ను రూ.15 లక్షల ఆదాయం దాటితే 30% పన్ను ఇన్కంటాక్స్లో పాత, కొత్త రెండు టారిఫ్/రెజిమే ఆప్షన్లు ఉంటాయా? ప్రస్తుతం ఆదాయపుపన్నులో రెండు ఆప్షన్లు ఉన్నాయి. పాత పద్ధతిలో టాక్స్ అసెస్మెంట్ చేసుకోవచ్చు లేదా కొత్త పద్ధతిని ఎంచుకోవచ్చు. ఎవరికి దేని వల్ల మేలు జరిగితే దాన్ని ఇప్పటివరకు ఎంచుకున్నారు. బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించిన కొత్త శ్లాబు విధానం వల్ల అందరికీ డిఫాల్ట్గా కొత్త విధానం అమల్లోకి వస్తుంది. అయితే కావాలనుకునే వాళ్లు పాత శ్లాబు సిస్టమ్ను కూడా ఎంచుకోవచ్చు. పాత శ్లాబు సిస్టమ్ ఎవరికి మంచిది? కొత్త పద్ధతిలో రూ.7 లక్షల వరకు టాక్స్ మినహాయింపు ఉన్నా.. ఇప్పటికీ కొందరికి పాత పద్ధతి మంచిదంటున్నారు నిపుణులు. సెక్షన్ 80సి కింద లక్షన్నర రుపాయలు ఇన్వెస్ట్ చేసేవారు, NPS కింద 50 వేల రుపాయలు పెట్టుబడి పెట్టిన వారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చుల కింద రూ.25వేలతో బీమా తీసుకున్నవారు, సేవింగ్స్ కింద రూ.4.25 లక్షలు చూపించే వారికి ఇప్పటికీ పాత శ్లాబు సిస్టమే బెటరంటున్నారు. దీని వల్ల రూ.6.75 లక్షల ఆదాయం వరకు ఎలాంటి టాక్స్ కట్టనవసరం లేదంటున్నారు. 7 లక్షలు అన్న పరిమితిని ఎలా చూడవచ్చు? కొత్త శ్లాబు పద్ధతిలో 7 లక్షల పరిమితి ఓ ఛాలెంజింగ్ విషయమే. ఉదాహారణకు మీ ఆదాయం రూ.7లక్షల వరకు ఉంటే మీరు లాభపడ్డట్టే. అయితే మీ ఆదాయం అనుకోకుండా రూ.7లక్షల పది వేలు అయిందనుకోండి. మీరు పన్నుల కింద రూ.26వేలు, దాంతో పాటు సర్ఛార్జీ, సెస్ కట్టాల్సి ఉంటుంది. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే ఏది ఎంచుకోవాలి? ఇప్పటి నుంచి పాత శ్లాబు ఎంచుకుంటే ఏడాదికి 15 లక్షల ఆదాయం పొందుతున్న వారు రూ.82,500 పన్నుగా చెల్లించాలి. కొత్త శ్లాబు ఎంచుకుంటే అదే 15లక్షల ఆదాయానికి రూ.1,50,000 పన్నుగా చెల్లించాల్సి వస్తుంది. దీన్ని బట్టి మధ్యతరగతి వేతన జీవులకు మాత్రమే కొత్త బడ్జెట్లో మేలు జరిగినట్టుగా భావించాలంటున్నారు ఆర్థిక నిపుణులు. -
ట్యాక్స్ చెల్లిస్తున్నారా? పన్ను భారం ఇలా తగ్గించుకోండి!
ఫిబ్రవరి 1న పార్లమెంటులో కొత్త బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఒక పక్క విశ్వవ్యాప్తంగా తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం, మరో పక్క అన్ని రంగాల్లో ధరల పెరుగుదల.. పది రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏవో తాయిలాలు ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తున్న వేతన జీవులు .. ఏవేవో ఊహాగానాలు.. ఏమి అవుతుందో తెలీదు..ఏం వస్తుందో తెలీదు. కానీ, ఏ మార్పూ రాదనుకుని వేతన జీవులు పన్ను భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం మీద దృష్టి సారిస్తే.. అదే ఊరట.. ఉపశమనం.. ఉత్తమం! గవర్నమెంటు ఉద్యోగస్తుల విషయంలో జీతభత్యాలు, అలవెన్సులు, షరతులు, నిబంధనలు, రూల్సు, నియమాలు మారవు. మీ మాట చెల్లదు. కానీ ప్రైవేట్ సంస్థల్లో కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. ఆ వెసులుబాటుతో ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవచ్చు. ►కరువు భత్యం, కరువు భత్య అలవెన్సు .. ఈ రెండింటిని బేసిక్ జీతంలో కలిసిపోయేలా ఒప్పందం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంటద్దె అలవెన్సు, గ్రాట్యుటీ, పెన్షన్ కమ్యుటెడ్ మీద పన్ను భారం తగ్గుతుంది. ►జీతం మీద నిర్ణయించిన కమీషన్ శాతం .. ఫిక్సిడ్గా ఉండాలి. కమీషన్ని జీతంలో భాగంగా పరిగణిస్తారు. ►యజమాని సహకరిస్తే కొన్ని చెల్లింపులను బిల్లులు సబ్మిట్ చేసి తీసుకోండి. అంటే.. రీయింబర్స్మెంటులాగా. ►పెర్క్స్ని తీసుకుని లబ్ధి పొందడం చాలా ఉపయోగం. అలవెన్సులు వద్దు. వాటి మీద పన్ను భారం ఉంటుంది. ►పెర్క్స్ అంటే .. ఇంట్లో టెలిఫోన్, ఇంట్లో కంప్యూటర్, పర్సనల్ ల్యాప్టాప్, కొన్ని చరాస్తులను ఇంట్లో వాడుకోవడం.. ఆఫీసులో పనివేళలో రిఫ్రెష్మెంట్లు.. మొదలైనవి. వీటి మీద పన్ను భారం ఉండదు. ►ఆఫీసు కారు మీ స్వంత పని మీద వాడుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. అలా అని దుర్వినియోగం చేయవద్దు. ►మీ యజమాని మీ తరఫున చెల్లించే పీఎఫ్ చందా 12 శాతం వరకు ఇవ్వొచ్చు. ►80సీ సేవింగ్స్ మీ ఇష్టం.. మీ వీలును బట్టి చేయండి. ►హెచ్ఆర్ఏ మినహాయింపు కావాలంటే ఇల్లు మీ పేరు మీద కాకుండా, ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద క్లెయిమ్ చేయండి. వారు అసలు ట్యాక్స్ బ్రాకెట్లో లేకపోతే మీకు ఎంతో ప్రయోజనం. ►ఎరియర్స్ జీతాలు చేతికి వచ్చినప్పుడే పన్నుభారం లెక్కిస్తారు. ఫిబ్రవరి 1 నాడు బడ్జెట్ వస్తోంది. 01–04–2023 నుంటి శ్లాబులు మారతాయి అని అంటున్నారు. అలా మారడం వల్ల ఉపయోగం ఉంటే ఎరియర్స్ను వచ్చే ఏడాది ఇవ్వమనండి. ►కొన్ని కంపెనీల్లో వారికి మీ సేవలు కావాలి. మీ హోదా.. అంటే మీరు ఉద్యోగా? కన్సల్టెంటా అన్నది ముఖ్యం కాదు. అలాంటప్పుడు కన్సల్టెంటుగా ఉండండి. అప్పుడు 10 శాతం పన్ను డిడక్ట్ చేస్తారు. మీ ఖర్చుల్ని బట్టి మీ నికర ఆదాయాన్ని మీరే లెక్కించుకోవచ్చు. -
ఐటీ రిటర్న్స్ @ 6.85 కోట్లు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్స్ 2021–22 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్) సంబంధించి ఇప్పటి వరకూ 6.85 కోట్లు దాఖలయినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డిసెంబర్ 31 వరకూ తుది గడువు ఉండడంతో రిటర్న్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 2021–22కిగాను ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్లు) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న కార్పొరేట్లు, ఇతరులకు తుది గడువు నవంబర్ 7. గడువు తప్పినట్లయితే, పన్ను చెల్లింపుదారులు జరిమానా చెల్లించడం ద్వారా ఆలస్యంగా కూడా రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. దీనికి చివరి తేదీ డిసెంబర్ 31. 2020–21 అసెస్మెంట్ ఇయర్కు సంబంధించి 2021–22లో ఇప్పటి వరకూ అత్యధికంగా 7.14 కోట్ల రిటర్న్స్ దాఖలయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2019–20 అసెస్ మెంట్ ఇయర్కు సంబంధించి 2020–21లో దాఖలైన) ఈ సంఖ్య 6.97 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ రిఫండ్స్ విలువ (31 శాతం వృద్ధితో రూ. 2లక్షల కోట్లు. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.10.54 లక్షల కోట్లుకాగా, రిఫండ్స పోను మిగిలిన మొత్తం రూ.8.54 లక్షల కోట్లు. వార్షిక బడ్జెట్ అంచనాల్లో ఈ విలువ 61.31 శాతానికి చేరింది. మార్చినాటికి నికర వసూళ్లు లక్ష్యం రూ.14.20 లక్షలకు మించి 30 శాతం మేర పెరగవచ్చని అంచనా. -
అద్దెల ద్వారా ఆదాయం వస్తోందా? ఈ విషయాలు తెలుసుకోకపోతే...!
గతంలో ఎన్నోసార్లు తెలియజేశాం. అడిగాం. ‘మీ ఆదాయాన్ని ఎలాగూ చూపిస్తున్నారు ఆదాయం కింద .. దానితో పాటు అదనంగా వచ్చే ఆదాయాన్ని కూడా చూపిస్తున్నారా?‘ ఈ మధ్య డిపార్ట్మెంట్ వారు సేకరించిన సమాచారం ప్రకారం పైన అడిగిన ప్రశ్నకు ‘నో‘ అని సమాధానం వచ్చింది. వారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది తమకు అదనంగా వచ్చే ఆదాయాన్ని తమ తమ రిటర్నులలో ‘డిక్లేర్‘ చేయడం లేదని తెలిసింది. తేలింది. అలాంటి వారెవరో తెలుసుకోవాలనుందా? ఇంటి మీద అద్దె ఎంతెంతయ్యా? ‘నేను ఎప్పుడూ అద్దెను బ్యాంకులో డిపాజిట్ చేయను. నాకు అక్షరాలా నగదు చేతిలో పడాల్సిందే. రశీదు ఇవ్వను. ఎప్పుడూ వ్యాపారస్తులు .. అటువంటి వారికే ఇస్తాను. ఉద్యోగస్తులకు ఇవ్వను‘ అని సగర్వంగా చెప్తాడు మూడు అంతస్తులున్న ముత్యాల రావు. ‘ఇల్లు, ఫ్లాట్లు నా పేరు మీదే ఉన్నాయి. కాని అద్దె ప్రతి నెలా మా ఆవిడ బ్యాంకు అకౌంటులో జమ చేస్తారు. పాన్ నంబరు మా ఆవిడదే. రశీదు ఇస్తాను. కానీ ఆదాయం మొత్తం రూ. 5 లక్షలు దాటదు‘ అని తానెంతో తెలివిగా ప్లానింగ్ చేసుకుంటున్నానని సంబరపడతాడు నాలుగు ఫ్లాట్లున్న నాగభూషణ రావు గారు. ‘మనం ఎప్పుడూ 50:50నే. సగం బ్యాంకులో జమ.. మిగతా సగం నగదు. నగదు ఇస్తే కానీ రశీదు ఇవ్వను. ఇంటికి రిపేర్లు, పన్నులు, సున్నాలు అన్నింటికీ మనమే చెల్లించాలి కదా. అదెలా రాబట్టాలి?‘ ఇలా ఎదురు ప్రశ్న వేసి బేతాళుడి ప్రశ్నలాగా ఫీల్ అవుతాడు పిచ్చేశ్వర్రావు గారు. ‘వాళ్లిచ్చే 30% రిపేరుకు ఏం సరిపోతుంది. కరోనా తర్వాత రూ. 3 లక్షలు ఖర్చు పెట్టా. అందుకని సగం అద్దె చూపిస్తా‘ .. ఇదీ చాణక్య రావుగారి స్టేట్మెంటు. పేయింగ్ గెస్ట్ హౌస్ ఓనరు పేరాశ రావుగారిది కూడా ఇదే వరస! ఆయన సరసనే చేరారు ఎందరో ఓనర్లు. ‘ఐకమత్యమే మహాబలం‘ అని జ్ఞాపకం చేసుకుంటూ. ‘మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. విల్లా వాడిదే. అక్కడ పన్ను ఎక్కువ. అందుకని రెంటు నా అకౌంటులో వేసుకుంటాను. వాడికి పాన్ లేదు. నేను ఇది ఆదాయంగా చూపించను‘ మితిమీరిన తెలివితేటలున్న మృత్యుంజయ రావు మనసులోని మాట ఇది. ‘నాకు రెండు అగ్రిమెంట్లు. ఒకటి అద్దెది .. సగం. మిగతా సగానికి ఫర్నిచర్, ఏసీ, వాషింగ్ మెషిన్, మంచాల నిమిత్తం అద్దె. ఈ అద్దె చూపించను‘ మందహాసంతో మధుసూదన రావుగారి ముక్తాయింపు. ఇలా అద్దె కింద వచ్చే ఆదాయాన్ని చూపించకుండా ఉండటానికి ఎన్నో అడ్డదార్లు .. ఎగవేతకు ఆలోచనలు. ఇవన్నీ తప్పుడు ఆలోచనలే.. చట్టం ఒప్పుకోదు. పన్ను కట్టడానికి పంగనామాలు .. చట్టానికి తూట్లు .. ఎగవేతకు అగచాట్లు.. దొరికిన తర్వాత తప్పని పాట్లు. ఇకనైనా కట్టిపెట్టాలి ఈ ముచ్చట్లు. నగదు అయినా, బ్యాంకు ద్వారా అయినా మీరు ఓనర్ అయితే మీకు చేతికొచ్చే అద్దె ఏమాత్రం తగ్గించకుండా చూపించండి. ఫ్లాట్ల విషయంలో నెలసరిగా మెయింటెనెన్సును అద్దెకు కలపకుండా, డైరెక్టుగా వెల్ఫేర్ అసోసియేషన్కి ఇప్పించండి. కొంత ఉపశమనం ఉంటుంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement