ఐటీ రిటర్న్స్‌ @ 6.85 కోట్లు | Sakshi
Sakshi News home page

ఐటీ రిటర్న్స్‌ @ 6.85 కోట్లు

Published Thu, Nov 17 2022 5:51 AM

Over 6. 85 crore IT returns filed for FY22 - Sakshi

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్స్‌ 2021–22 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్‌ ఇయర్‌) సంబంధించి ఇప్పటి వరకూ 6.85 కోట్లు దాఖలయినట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. డిసెంబర్‌ 31 వరకూ తుది గడువు ఉండడంతో రిటర్న్స్‌ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 2021–22కిగాను ఆదాయపు పన్ను రిటర్న్స్‌ (ఐటీఆర్‌లు) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఖాతాలను ఆడిట్‌ చేయాల్సిన అవసరం ఉన్న  కార్పొరేట్‌లు, ఇతరులకు తుది గడువు నవంబర్‌ 7.  గడువు తప్పినట్లయితే, పన్ను చెల్లింపుదారులు జరిమానా చెల్లించడం ద్వారా ఆలస్యంగా కూడా రిటర్న్స్‌ దాఖలు చేయవచ్చు.

దీనికి చివరి తేదీ డిసెంబర్‌ 31. 2020–21 అసెస్‌మెంట్‌ ఇయర్‌కు సంబంధించి 2021–22లో ఇప్పటి వరకూ అత్యధికంగా 7.14 కోట్ల రిటర్న్స్‌ దాఖలయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2019–20 అసెస్‌ మెంట్‌ ఇయర్‌కు సంబంధించి 2020–21లో దాఖలైన)  ఈ సంఖ్య 6.97 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ రిఫండ్స్‌ విలువ (31 శాతం వృద్ధితో రూ. 2లక్షల కోట్లు.  స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.10.54 లక్షల కోట్లుకాగా, రిఫండ్‌స పోను మిగిలిన మొత్తం రూ.8.54 లక్షల కోట్లు. వార్షిక బడ్జెట్‌ అంచనాల్లో ఈ విలువ 61.31 శాతానికి చేరింది. మార్చినాటికి నికర వసూళ్లు లక్ష్యం రూ.14.20 లక్షలకు మించి 30 శాతం మేర పెరగవచ్చని అంచనా.  

Advertisement
 
Advertisement
 
Advertisement