-
అంకుశమై నిలుస్తాం! : కేసీఆర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రజల పక్షాన ఆయుధమై కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతామని.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ప్రజలకు అండగా నిలుస్తామని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచాలన్నా.. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కారి్మకులు, బడుగు, బలహీన వర్గాలకు మేలు జరగాలన్నా.. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చా రు. అప్పుడే ప్రభుత్వం దిగొస్తుందని.. హామీలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చేవెళ్లలో నిర్వహించిన తొలి ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అంబేడ్కర్, జ్యోతిబా పూలే స్ఫూర్తితో పదిహేనేళ్లపాటు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆ మహానుభావులకు బీఆర్ఎస్ సముచిత స్థానం కల్పించింది. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా సచివాలయానికి ఆయన పేరు పెట్టాం. సచివాలయం ముందు ధర్నాకు దిగుతా.. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. ప్రజానీకానికి ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం, గౌరవం ఉండాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు సాధ్యంకాని హామీలిచ్చింది. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కావస్తోంది. కానీ గత ప్రభుత్వం సృష్టించిన వనరులను వాడుకునే నైపుణ్యం వారికి లేకుండా పోయింది. మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయి. మంచినీరు దొరకడం లేదు. సాగునీరు అందడం లేదు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఉపకార వేతనాలు నిలిచిపోయాయి. దళితవాడలు ధనిక వాడలు కావాలనే సదుద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ రూ.12 లక్షల చొప్పున ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. అది ఇవ్వకపోగా.. 1.36 లక్షల మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ను రద్దు చేసింది. కలెక్టర్ల అకౌంట్లలో జమ చేసిన నగదును వాపస్ తీసుకుంది. అర్హులైన దళితులందరికీ వెంటనే దళిత బంధు ఇవ్వాలి. లేదంటే 1.36 లక్షల మంది లబ్ధిదారులతో కలసి సచివాలయం ముందు ధర్నాకు దిగుతా. మార్కెట్లో తులం బంగారం దొరకడం లేదా? మౌనంగా ఉంటే సమస్యలు తీరవు. ఎన్నికల ప్రచారం కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలను దళితబంధుపై నిలదీయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం ఆర్థిక సాయం చేసే కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. కాంగ్రెస్ దానికి అదనంగా తులం బంగారం చొప్పున ఇస్తామని మాయమాటలు చెప్పింది. ఏమైంది? ఆడబిడ్డలకు ఇవ్వడానికి కాంగ్రెస్ సర్కారుకు మార్కెట్లో తులం బంగారం దొరకడంలేదా? కేసీఆర్ వెళ్లగానే కరెంటు పోతుందా? తెలంగాణలో 11 ఏళ్ల క్రితం దారుణ పరిస్థితి ఉండేది. మేం ఏడాదిన్నర వ్యవధిలో బాగుచేశాం. రైతులు, పరిశ్రమలు, గృహాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేశాం. కేసీఆర్ వెళ్లగానే కరెంటు ఎందుకు రావట్లేదు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం కాదా? మిషన్ భగీరథ పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా అభినందించింది. మరి ఎవరి తెలివి తక్కువతనం వల్ల మంచి నీటి కొరత ఏర్పడింది? ప్రభుత్వ వాగ్దానాలు నెరవేరాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి. వరికి బోనస్ ఇవ్వకుంటే ఊరుకోబోం.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 420 వాగ్దానాలు ఇచ్చింది. వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని చెప్పింది. స్కూటీలు ఇవ్వకపోగా.. రాష్ట్రంలో లూటీలు మొదలుపెట్టింది. రియల్ ఎస్టేట్ను దెబ్బతీసింది. అనుమతులు నిలిపివేసింది. ఆ రంగంపై ఆధారపడి బతుకుతున్నవారిని రోడ్డు పాలు చేసింది. ప్రభుత్వం యాసంగి పంటను పూర్తిగా కొనుగోలు చేయాలి. వరికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే.. లేదంటే ఊరుకోబోం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతి ఇదేనా? కేంద్రంలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉంది. ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టడం, మత పిచ్చి పెంచడం తప్ప చేసిందేమీ లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచేసింది. మోదీ, ఈడీ.. ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతి? గుడ్డిగా ఓటేయొద్దు. బీజేపీ సర్కారు దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. తెలంగాణకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరుతూ నేను వంద ఉత్తరాలు రాసిన.. కానీ ఒక్క కాలేజీ ఇవ్వలేదు. ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని మోదీ నా మెడపై కత్తిపెట్టాడు. కానీ నేను మీటర్లు పెట్టలేదు. దాంతో ఏటా రూ.5 వేల కోట్లు కోత కోసిండు. తెలంగాణకు రూ.30 వేల కోట్ల నష్టం వచ్చింది. బీజేపీకి నూకలు తినిపించాలి వికారాబాద్, చేవెళ్లలో ధాన్యం బాగా పండింది. పండిన ధాన్యాన్ని కొనుమంటే.. యాసంగి ధాన్యం నూకలు అయితయి. తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయండి అని కేంద్ర మంత్రి ఒకరు ఉచిత సలహా ఇచ్చిండు. నూకలు తిందామా? బీజేపీకి నూకలు తినిపిద్దామా? తెలంగాణ ఇచ్చినప్పుడు 7 మండలాలను, సీలేరు ప్రాజెక్టును ఆంధ్రాలో కలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రద్దు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ఏ వర్గానికీ మేలు జరగలేదు. మేం పదేళ్లలో చేవెళ్లను పారిశ్రామిక కేంద్రంగా, రియల్ ఎస్టేట్ జోన్గా అభివృద్ధి చేశాం. రంజిత్రెడ్డి ఏమైనా పొద్దుతిరుగుడు పువ్వా? ఎంపీ రంజిత్రెడ్డికి ఏం ఏం తక్కువ చేశాం? ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? రంజిత్రెడ్డి ఏమైనా పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటుంటే అటు తిరుగుతడా? ఆయన పార్టీ ఎందుకు మారాడు.. అధికారం కోసమా? పైరవీల కోసమా. రంజిత్కు పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరినట్టు బీసీ అయిన కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకోవాలి. కాసాని గెలుపు బీసీల అభివృద్ధికి మలుపు..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాం«దీ, కాలె యాదయ్య, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ఎగ్గె మల్లేశం, దయానంద్గుప్తా తదితరులు పాల్గొన్నారు. బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం తెలంగాణలో బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి అంకుశం లాంటి ఆయుధాన్ని బీఆర్ఎస్ చేతికి ఇవ్వాలి. అప్పుడే ప్రభుత్వ మెడలు వంచగలుగుతాం. బీఆర్ఎస్ గెలవాలి.. అంకుశంలా పనిచేయాలి. లేదంటే మోసం చేసిన వాళ్ల చేతిలోనే మళ్లీ మోసపోతాం. బీఆర్ఎస్ పుట్టిందే అణగారిన వర్గాల కోసం. అనేక మందిని కాపాడుకున్నాం. కేసీఆర్ బతికున్నంత కాలం పోరాటం చేస్తూనే ఉంటడు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. సీనియర్ న్యాయవాది సాంబశివరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆధారంగా నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై ఈనెల 15న నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనుంది. కాగా, ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది సురేష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోరారు. ఈ కేసులో పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ప్రముఖ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బును పోలీసు వాహనాల్లో ఎన్నికల కోసం తరలించారని నిందితులే ఒప్పుకున్న విషయాన్ని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తే అసలు నిందితులు బయటికి వస్తారని ఫిర్యాదులో తెలిపారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసులో పోలీసులు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక పాత్ర వహించిన పలువురు పోలీసు ఉన్నతాధికారులను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: కిడ్నాప్ చేసి.. బెదిరించి -
ఎండల తీవ్రత ముదురుతున్నా.. జూన్ వరకు నీటి సమస్య రాదు
సాక్షి, హైదరాబాద్: ఎండల తీవ్రత ముదురుతున్నా.. వచ్చే జూన్ వరకు రాష్ట్రంలో తాగునీటి సమస్య అధికం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో తాగునీటి ఎద్దడి కాస్త అధికంగా ఉన్నట్లు గుర్తించామనీ, అలాగే 67 మున్సిపాలిటీలను సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. తాగునీటి సమస్యపై ప్రతీరోజు ఉన్నతస్థాయిలో సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. తాగునీటి సమస్య పర్యవేక్షణకు ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించిన విషయాన్ని గుర్తు చేసింది. ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందన తాగునీటి సమస్య ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చినా, వార్తలు వచ్చినా వెంటనే అధికార యంత్రాంగం స్పందిస్తోందని ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 143 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఉంటే.. అందులో 130 మునిసిపాలిటీల్లో సాధారణ రోజులతో పోలిస్తే పదిశాతం మేరకు నీటి కొరత ఉన్నా.. ప్రజలకు సరిపడే తాగునీటి సరఫరా జరుగుతోందని వివరించింది. సాధారణ రోజుల్లో ఈ పట్టణాల్లో సగటున 1398.05 ఎల్ఎండీ(మిలియన్స్లీటర్స్ పర్ డే) తాటి సరఫరా జరిగితే ప్రస్తుతం 1371 ఎల్ఎండీల నీటి సరఫరా జరుగుతోందని, 26.31 ఎల్ఎండీల కొరత ఏర్పడిందని స్పష్టం చేసింది. పది మునిసిపాలిటీలతోపాటు, రెండు కార్పొరేషన్లలో అధికంగా నీటి ఎద్దడి ఉన్నట్లు గుర్తించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఖమ్మం, కరీంనగర్లో ప్రత్యామ్నాయ చర్యలు ఖమ్మం, కరీంనగర్లో ఎండలు ముదిరే కొద్ది నీటి ఎద్దడి పెరుగుతుందన్న అంచనాతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. 27 పట్టణాల్లో 135 ఎల్ పీసీడీ(లీటర్స్ పర్ పర్సన్ పర్డే) కంటే ఎక్కువ నీటి సరఫరా జరుగుతుంటే, 48 పట్టణాల్లో 100 నుంచి 135 ఎల్పీసీడీల మధ్య, 67 మునిసిపాలిటీల్లో 100 ఎల్పీసీడీ కంటే తక్కువ సరఫరా జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 23,839 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని, గ్రామాల్లో నీటి ఎద్దడి లేదని భగీరథ అధికారవర్గాలు చెబుతున్నాయి. గ్రామాల్లో వంద ఎల్పీసీడీ నీటి సరఫరా జరుగుతోంది. అందుబాటులో గ్రిడ్, స్టాండ్ బై పంపులు మంచినీటి సమస్య ఎక్కడైనా తలెత్తితే గ్రిడ్ పంప్లతోపాటు, స్టాండ్బై పంపులు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా స్థాయిలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు జిల్లా కలెక్టర్లకు మొత్తం రూ. 100 కోట్లు నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. నాగార్జునసాగర్ నుంచి పాలేరు, ఉదయ సముద్రం రిజర్వాయర్ల నుంచి నల్గొండ, ఖమ్మం పట్టణాలకు నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేట్టింది. మిడ్ మానేర్, లోయర్ మానేరు నుంచి కరీంనగర్ నగరానికి నీటిని అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే కర్ణాటక లోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి కొంత నీటిని విడుదల చేయాలంటూ అక్కడి ప్రభుత్వాన్ని కోరాలని ఇప్పటికే ఇరిగేషన్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. నారాయణపూర్ నుంచి జూరాల రిజర్వాయర్కు వచ్చే నీటితో గద్వాల మిషన్ భగీరథకు తాగునీటి సరఫరా చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు 131 పట్టణాల్లో అందుబాటులో ఉన్న 294 ప్రభుత్వ ట్యాంకర్లతో పాటు 97 ట్యాంకర్లను అద్దెకు తీసుకుని, అత్యవసరమైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నీటి మట్టాలు తగ్గడం వల్లనే ఎద్దడి గడిచిన అక్టోబర్ నుంచి వర్షాలు లేకపోవడం, గోదావరి, కృష్ణా రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గడం వల్ల తాగునీటి సమస్య ఉత్పన్నం అయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తారా?: ఉప ముఖ్యమంత్రి భట్టి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘‘తీవ్రవాదుల గుర్తింపు, దేశ భద్రత కోసం ఏర్పాటు చేసి న చట్టాలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టింది. ఇది ఎంత వరకు కరెక్ట్? ప్రతిపక్షాలు, పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు. భార్యాభర్తలు, వ్యాపారులు, అధికారులు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇంతా చేసి తీరా ఫోన్ ట్యాపింగ్తో మాకేం సంబంధం అని తప్పించుకుంటారా? వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఎవరూ క్షమించరు’’అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘వ్యక్తిగత సమాచారం ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్కు పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. పాలించమని అధికారాన్ని అప్పజెప్పితే ప్రజల ధన, మాన, ప్రాణాలను హరించే విధంగా వ్యవహరిస్తారా? ఇంతకంటే అన్యాయం, ద్రోహం ఇంకేముంది. పదేళ్లు తెలంగాణలో వ్యక్తిగతమైన స్వేచ్ఛ లేకుండా చేశారు. స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించే హక్కును ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తోంది.’’అని ఆయన పేర్కొన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర మహా సభ ఏర్పాట్లను గురువారం పరిశీలించిన అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు ’’రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీఆర్ఎస్ హయాంలో అతాలాకుతలమైంది. ప్రజలపై భారం మోపే విధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. జెన్కోను, ట్రాన్స్కోను సర్వనాశనం చేశారు. ఇప్పుడు వ్యవస్థలన్నింటినీ చక్కబెడుతున్నాం. రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చూస్తున్నాం. చేసిందంతా చేసి ప్రస్తుతం అడ్డగోలుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నారు. మూడు నెలలు ఫాంహౌస్లో పడుకుని.. తీరా ఎన్నికల ముందు బయటికొచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అవాస్తవాలు మాట్లాడే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కూడా పనికిరాదు’’అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుక్కుగూడలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటన ‘దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యం. తుక్కుగూడ జనగర్జన సభ ఈ దేశానికి దిశా నిర్దేశం చేయనుంది. దేశంలోనే ఈ సభ చారిత్రాత్మకం కానుంది. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను తుక్కుగూడ సభనుంచే ఏఐసీసీ నాయకత్వం ప్రకటించనుంది’’అని ఆయన వివరించారు. భట్టి వెంట మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మా రెడ్డి, మహేశ్వరం సీనియర్ నేత దేప భాస్కర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
నేతన్నలపై ఎందుకీ కక్ష?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా కళకళలాడిన చేనేత రంగం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే తిరిగి సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు విమర్శించారు. ప్రభుత్వ కక్షపూరిత వైఖరితో నేత కార్మీకులు ఉపాధి కోల్పోయారన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. కార్మీకుల పొట్టకొట్టొద్దు..!: ‘ఉపాధి కోల్పోయిన నేత కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. రైతాంగ సంక్షోభం తరహాలో నేత కార్మీకుల సంక్షోభం తీవ్ర రూపం దాల్చక ముందే శాశ్వత పరిష్కారం చూపండి. గత ప్రభుత్వంపై కోపంతో నేత కార్మికుల పొట్ట కొట్టకుండా గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు కొనసాగిస్తూనే అదనపు సాయం అందేలా చూడండి. ప్రభుత్వ కక్షపూరిత వైఖరితో కార్మీకులు నేత పనికి దూరం కావడంతోపాటు పవర్ లూమ్స్కు ఆర్డర్లు లేక మూతపడ్డాయి. ఉపాధి కల్పించాలనే డిమాండ్తో కార్మికులు రోజూ దీక్షలు, ధర్నాలతో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. నేత కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తడుక శ్రీనివాస్ అనే నేత కార్మీకుడు ఉరేసుకొని చనిపోవడాన్ని ప్రభుత్వ హత్యగానే కార్మీకులు భావిస్తున్నారు’అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. మా పాలనలో రూ. కోట్ల విలువైన ఆర్డర్లిచ్చాం.. ‘సమైక్య రాష్ట్రంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న నేత కార్మీకులను ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. నేతన్నల వేతనాలు రెట్టింపు చేసి గౌరవప్రదమైన జీవితం గడిపేలా చూడటంతోపాటు చేనేత మిత్ర, నేతన్నకు చేయూత వంటి పథకాలను ప్రారంభించాం. రాజీవ్ విద్యామిషన్, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాల ఆర్డర్లతో నేత కార్మీకులకు చేతి నుంచి పని కల్పించాం. బతుకమ్మ చీరల పథకం ద్వారా కార్మీకులకు చేతి నిండా పని దొరకడంతోపాటు కార్మీకులకు ఉపాధి పెరిగింది. బీఆర్ఎస్ హయాంలో రూ. కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కార్మికుల జీవితాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను భేషజాలకు పోకుండా కొనసాగించడంతో పాటు బతుకమ్మ చీరల ఆర్డర్లకు సంబంధించిప జీవోను విడుదల చేయాలి. ఇది 35 వేల మంది కార్మీకులు, వారి కుటుంబాలకు సంబంధించిన కీలకమైన సమస్య కాబట్టి వెంటనే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. యార్న్ సబ్సిడీ విడుదల, చేనేత మిత్ర కొనసాగింపు, పరిశ్రమకు రావాల్సిన రూ. 270 కోట్ల బకాయిల విడుదల చేయాలి. కార్మీకులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ పెద్దలు కమీషన్లకు కక్కుర్తిపడి తమిళనాడు, సూరత్కు ఆర్డర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది’అని కేటీఆర్ లేఖలో ఆరోపించారు. -
‘పదేళ్ల తర్వాత.. సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభమా?’
హైదరాబాద్, సాక్షి: చేనేత కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష గట్టిందని.. ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోవట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తాజాగా ఓ ఘాటు లేఖ రాశారాయాన. ‘‘నేతన్నలపై కాంగ్రెస్ కు ఎందుకింత కక్ష?. ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా?. కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా??. పదేళ్ల తర్వాత సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి’’ అని లేఖలో కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమను నమ్ముకున్నవాళ్ల బతుకులు ఆగం అయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయని, నేతన్నలకు ఈ ప్రభుత్వం ఆర్డర్లు ఆపేసిందని ఆరోపించారు కేటీఆర్. చేనేత మిత్రా వంటి పథకాల్ని కాంగ్రెస్ సర్కార్ పక్కనపెట్టిందని ప్రస్తావించారాయన. ‘‘గతంలో మాదిరే నేతన్నలకు చేతినిండా అర్డర్లు వేంటనే ఇవ్వాలి. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. ప్రస్తుతం అందుతున్న అన్నీ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలి, అవసరం అయితే మరింత సాయం చేయాలి. కేవలం గత ప్రభుత్వంపై దుగ్దతో నేతన్నల పొట్ట కొట్టడం సరైంది కాదు.. .. రైతన్న మాదిరే, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదు అని లేఖలో కేటీఆర్ హెచ్చరించారు. -
నీటి ఎద్దడి నివారణ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ‘కరీంనగర్ చొప్పదండి మునిసిపాలిటీలో గత కొద్ది రోజులుగా నీటి సమస్య తీవ్రమైంది. పట్టణంలోని కొన్ని వార్డులకు తాగునీటిని అందించలేక మునిసిపల్ అధికారులు సతమతమవుతున్నారు. ఐదు కిలోమీటర్ల దూరంలో గాయత్రి పంప్ హౌజ్ , పక్కనుంచే ఎస్ఆర్ఎస్పీ కాలువలు పోతున్నా ఈ మునిసిపాలిటీకి సరైన నీటి సదుపాయం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే నీరు కూడా రావడం లేదు. ‘జగిత్యాల జిల్లా రాయికల్ మునిసిపాలిటీలోని కొన్ని వార్డుల్లో తాగునీటి సమస్య ఎక్కువైంది. ఎస్ఆర్ఎస్పీ నీరు ఉన్నప్పటికీ మూడు వార్డులకు సరిపడా నీళ్లను మునిసిపాలిటీ వాళ్లు అందించలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వార్డులోనే ఓ బావి తవ్వించి ఆ నీటిని మిషన్భగీరథ కోసం కట్టిన ట్యాంకుల్లోకి పంపించి ఇళ్లకు సరఫరా చేస్తున్నారు’ ‘కరీంనగర్ కార్పొరేషన్లో గతంలో ప్రతిరోజూ ఇంటింటికీ తాగునీటిని అందించగా, తగ్గుతున్న దిగువ మానేరు నీటిమట్టంతో ఇప్పుడు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరపడమే కష్టంగా మారిందని మునిసిపల్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగజ్నగర్ మునిసిపాలిటీలో కరెంటు సమస్య కారణంగా అధికారులు ఇంటింటికీ తాగునీరు అందించలేకపోతున్నారు’ మంగళవారం సీడీఎంఏ కార్యాలయంలో మునిసిపాలిటీల్లో తాగునీటి సమస్యపై జరిగిన అధికారుల సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అంశాల్లో కొన్ని ఇవి. జలాశయాల్లో సరిపడినంతగా నీటి నిల్వలు లేకపోవడం, పెరిగిన సూర్యతాపానికి జలాశయాల్లోని నీరు కూడా క్రమంగా తగ్గుతుందనే భయంతో పాటు భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో రాష్ట్రంలో నీటి సమస్య ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈ నేపథ్యంలో సీడీఎంఏ దివ్య 140 పట్టణాల్లో తాగునీటి ఎద్దడి ఎదురవకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారుల నియామకం రాష్ట్రంలో మునిసిపాలిటీలతో పాటు గ్రామాల్లో నీటి నిర్వహణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం నీటి అవసరాలు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాలను విభజించి, పది మంది ఐఏఎస్ అధికారులను ఇన్చార్జులుగా నియమించారు. రానున్న రెండు నెలల పాటు అధికారులెవరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు వీరే... ఆదిలాబాద్, నిర్మల్ – ప్రశాంత్ జీవన్ పాటిల్ , కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల – కృష్ణ ఆదిత్య , కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లకు – ఆర్ వి కర్ణన్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట – అనిత రామచంద్రన్, నిజామాబాద్, కామారెడ్డి – శరత్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్– మల్కాజ్గిరి – విజయేంద్ర , మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్ – శృతి ఓజా, వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ – గోపి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట – భారతి కొలిగేరి , ఖమ్మం భద్రాద్రి, కొత్తగూడెం– సురేంద్రమోహన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ ప్రజలకు ఇబ్బంది లేదనే అంచనా హైదరాబాద్, శివారు ప్రాంతాలకు అవసరమైన తాగునీటిని కృష్ణా, గోదావరి నదుల నుంచి తరలిస్తున్నారు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, మంజీరా, సింగూరు జలాశయాలతో పాటు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ నుంచి కూడా హైదరాబాద్ వాటర్బోర్డు తీసుకుంటోంది. జలాశయాల నుంచి ప్రతిరోజూ 2,559 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) నీటిని హైదరాబాద్ నగర వాసుల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో జీహెచ్ఎంసీ కోర్సిటీకి (హైదరాబాద్ జిల్లా) 1082.62 ఎంఎల్డీ, శివారు సర్కిల్స్ (50 డివిజన్లు)కు 1,049. 58 ఎంఎల్డీ, ఓఆర్ఆర్ పరిధిలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు 277.21 ఎంఎల్డీ, మిషన్ భగీరథకు 149.47 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. సింగూరు, ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ రిజర్వాయర్లలో అవసరమైన మేర నీరు అందుబాటులో ఉందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది 2,270 ఎంఎల్డీ నీటిని హైదరాబాద్కు సరఫరా చేయగా, ప్రస్తుతం 2,409.53 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. గతేడాది కంటే 139.53 ఎల్ఎండీ అదనంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. ట్యాంకర్ల డిమాండ్ అక్కడే హైదరాబాద్ నగరానికి పశ్చిమాన ఉన్న మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కూకట్పల్లి, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనే ట్యాంకర్ల డిమాండ్ ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 644 ట్యాంకర్లు అందుబాటులో ఉండగా, మంగళవారం 6,593 ట్రిప్పుల్లో నీటి సరఫరా చేశాయి. భూగర్బ జలాలు తగ్గడం వల్లనే ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోందని వాటర్బోర్డు చెబుతోంది. -
సెక్యూరిటీ బాండ్ల వేలం.. మరో రూ.1,000 కోట్లు అప్పు
సాక్షి, హైదరాబాద్: కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్ల తొలి అప్పు చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బహిరంగ మార్కెట్లో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మంగళవారం ఈ మేరకు రుణం తీసుకోనుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.59 వేల కోట్లకు పైగా నిధులను బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా సేకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. కాగా గడిచిన ఆర్థిక సంవత్సరం (2023–24)లో మొత్తం రూ.40వేల కోట్లకు పైగా రుణ సేకరణను లక్ష్యంగా పెట్టుకోగా, ఆ పద్దు దాదాపు రూ.50 వేల కోట్లకు చేరడం గమనార్హం. డిసెంబర్ నుంచి రూ.13 వేల కోట్లకు పైమాటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గత ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పు రూ.13 వేల కోట్లు దాటింది. డిసెంబర్ 7 నుంచి మార్చి 31 వరకు తొమ్మిది దఫాల్లో బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణాలను సమీకరించింది. గత ఏడాది డిసెంబర్ 12న రూ. 500 కోట్లు, డిసెంబర్ 19న రూ.900 కోట్లు, ఈ ఏడాది జనవరి 16న రూ.2,000 కోట్లు, అదే నెల 23న రూ.1,000 కోట్లు, ఫిబ్రవరి ఆరో తేదీన రూ.2,000 కోట్ల రుణాలను తీసుకుంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో చివరి మాసమైన మార్చిలో నాలుగు దఫాల్లో రూ.6,718 కోట్లకు పైగా రుణాలను సమీకరించింది. మార్చి ఐదో తేదీన రూ.2,000 కోట్లు, అదే నెల 12న మరో రూ.2,000 కోట్లు, 19న రూ.1,000 కోట్లు, చివరిగా మార్చి 26న రూ.1,718 కోట్ల అప్పులు తీసుకుంది. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికం (జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో రూ.11,718 కోట్ల రుణం సమకూర్చుకుంది. కాగ్కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాల ప్రకారం గత ఏడాది డిసెంబర్ నాటికి రూ.36,536.01 కోట్ల రుణాలు తీసుకుంది. ఆ తర్వాత తీసుకున్న అప్పులతో కలిపితే ఈ మొత్తం రూ.48 వేల కోట్లకు చేరడం గమనార్హం. ఈ నెలలో మరో రూ.4 వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి త్రైమాసికంలో రూ.16 వేల కోట్ల రుణాలను తీసుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సమీకరించనున్న రుణాల వివరాలను ఆర్బీఐ మార్చి 28న వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం ఏప్రిల్ 2న రూ.1,000 కోట్లు, 8, 23 తేదీల్లో రెండు దఫాలుగా రూ.2 వేల కోట్ల చొప్పున ఒక్క నెలలో రూ.5 వేల కోట్లు తీసుకోనుంది. మే నెలలో 7, 14, 28 తేదీల్లో మూడు దఫాలుగా రూ.6 వేల కోట్లు, జూన్ 4వ తేదీన రూ.1000 కోట్లు, 11, 25 తేదీల్లో రెండు దఫాలుగా రూ.4 వేల కోట్లను అప్పుగా తీసుకోనుంది. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా సగటున రూ.5 వేల కోట్ల వరకు అప్పులను సమీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
సర్కారుపై ‘విరమణ’ భారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత మొదలైన ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లతో ఆర్థిక శాఖలో ఆందోళన మొదలైంది. పదవీ విరమణ చేసే ఉద్యోగులకు ఇవ్వాల్సిన తక్షణ బెనిఫిట్లను చెల్లించేందుకు ఏటా రూ.3,500 వేలకోట్ల భారం పడనుంది ఈ మేరకు నిధులను ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. 2021లో అప్పటి బీఆర్ఎస్ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (క్లాస్–4 ఉద్యోగులు మినహా) రిటైర్మెంట్లు జరగలేదు. తిరిగి ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 7,995 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నట్టు సమాచారం. వీరికి ప్రభుత్వం చెల్లించాల్సిన తక్షణ బెనిఫిట్ల కింద రూ.3,200 కోట్ల వరకు అవసరమని ఆర్థిక శాఖ అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల మెడికల్ బిల్లుల చెల్లింపు కూడా కష్టమవుతుండటం, ఇక నుంచి ఏటా రిటైర్మెంట్ల భారం మరింత పెరగనుండటం ఆర్థిక శాఖను కలవరపెడుతోంది. సరాసరి రూ.40 వేల మూల వేతనం ఈ ఏడాది రిటైర్మెంట్లను పరిశీలిస్తే 1,419 మంది గెజిటెడ్ స్థాయి, 5,360 మంది నాన్ గెజిటెడ్ స్థాయి, 1,216 మంది క్లాస్–4 ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. నాన్ గెజిటెడ్ వారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. రిటైరయ్యే వారి సగటు మూల వేతనం రూ.40వేల వరకు ఉంటుందని అంచనా. దీనికి హెచ్ఆర్ఏ, సీసీఏ, డీఏలు కలిపితే ఈ మొత్తం రూ.60 వేల వరకు ఉంటుంది. రిటైరయ్యే ప్రతి ఉద్యోగికి లీవ్ శాలరీల కింద 10 నెలల వేతనాన్ని.. అంటే రూ.6 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీనికితోడు గ్రాట్యుటీ కింద రూ.12 లక్షలు, కమిటేషన్ కింద రూ.20 లక్షలు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాలి. అంటే సగటున ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి రూ.38లక్షల నుంచి రూ.40 లక్షల వరకు తక్షణ బెనిఫిట్లను వారి హక్కుగా ఇవ్వాలి. ఈ ఏడాది రిటైరయ్యే 7,995 మందికి ఈ బెనిఫిట్లను చెల్లించాలంటే రూ.3 వేల కోట్లకుపైగా అవసరం. ఇక 2025లో 9,630 మంది, 2026లో 9,719 మంది, 2027లో 9,443 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తారని లెక్కలు చెప్తున్నాయి. అంటే వారికి తక్షణ బెనిఫిట్ల కింద సగటున ఏటా రూ.3,500 కోట్ల వరకు చెల్లించాలి. దీనితో ఖజానాపై భారం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత పరిస్థితేమిటి? ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్స్లకు కూడా చెల్లించే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. వీటికితోడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2022 జూలై, 2023 జనవరి, జూలై, 2024 జనవరిలో చెల్లించాల్సిన నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఐదో డీఏ (జూలై, 2024) కూడా ముందుకు వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో.. ఈ నాలుగు డీఏల చెల్లింపును సర్కారు వాయిదా వేస్తూ వస్తోంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ జీవిత బీమా (జీఎల్ఐ) కింద జమ చేసుకున్న నిధులను కూడా వాడుకోవాల్సి వచ్చిందని ఆర్థికశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు రిటైరైన ఉద్యోగులకు వారి జీఎల్ఐతోపాటు జీపీఎఫ్పై వడ్డీ చెల్లించాలని.. ఇవన్నీ కలిపితే చాలా భారం పడుతుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. గత ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచి అప్పటికి ఈ భారం నుంచి గట్టెక్కిందని.. ఇప్పుడు చెల్లించక తప్పదని తెలిపారు. ఈ చెల్లింపుల కోసం నెలకు రూ.250 కోట్లదాకా అవసరమన్నారు. ఎప్పటికప్పుడే బెనిఫిట్లు చెల్లించాలి: ఉద్యోగ సంఘాలు రిటైర్మెంట్లతో సర్కారుపై భారమన్న ప్రచారంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఉద్యోగి రిటైరవడానికి మూడు నెలల ముందే బెనిఫిట్ల కోసం దరఖాస్తు చేసుకుంటారని, ఉద్యోగుల హక్కు కింద ప్రభుత్వం వాటిని ఎప్పటికప్పుడే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. పదవీ విరమణ వయసును మరోసారి పెంచడం వంటి ఆలోచనలు చేయవద్దని కోరుతున్నాయి. -
ఎన్టీపీసీ విద్యుత్ ఇక చాలు..!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 2,400 (3్ఠ800) మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన రెండో దశ తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో అది రాష్ట్రానికి పెనుభారంగా మారే ప్రమాదముందని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 5–8 ఏళ్ల సమయం పట్టనుందని, దీని ద్వారా వచ్చే విద్యుత్ ధర యూనిట్కు రూ. 8–9 ఎగబాకుతుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది. బహిరంగ మార్కెట్లో దీనికన్నా తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుండగా ఇంత భారీ ధరతో 25 ఏళ్లపాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంటే రాష్ట్ర ప్రజలపై రూ. వేల కోట్ల అనవసర భారం పడుతుందని తేల్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీతో రెండో దశ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. సత్వరమే ఒప్పందం చేసుకోకుంటే ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకొని విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని ఎన్టీపీసీ ఇటీవల రాష్ట్రానికి అల్టిమేటం జారీ చేయడంతో దీనిపై సమీక్షించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయానికి వచ్చింది. విభజన చట్టం కింద ఏర్పాటు..: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లో కేంద్రం హామీ ఇచ్చింది. అందులో తొలి దశ కింద 1,600 (2 ్ఠ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇటీవల ఎన్టీపీసీ పూర్తి చేసింది. రెండో దశ కింద 2,400 మెగావాట్ల ప్లాంట్లను నిర్మించాల్సి ఉంది. తొలి దశ ప్లాంట్ విద్యుత్ ధర యూనిట్కు రూ. 5.90 ఉండగా ఒప్పందం కారణంగా కొనుగోలు చేయకతప్పని పరిస్థితి ఉంది. గత సర్కారు తప్పిదమే! రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్లో 2,400 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందకపోవడానికి కారణం కూడా గత ప్రభుత్వ తప్పిదమేనని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రెండో దశ కింద 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి వీలుగా ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకుండా పదేళ్లపాటు కాలయాపన చేయడమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అప్పట్లో ఒప్పందం చేసుకొని ఉంటే ఇప్పటికే నిర్మాణం పూర్తై తక్కువ ధరకు విద్యుత్ రాష్ట్రానికి వచ్చేదని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పడు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత సర్కారు అధిక ధరతో విద్యుత్ కొనుగోళ్లు చేయడంతోపాటు విచ్చలవిడి విధానాలను అనుసరించడం వల్ల గత పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు దివాలా తీశాయని కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తోంది. ఇక కొత్త థర్మల్ ప్లాంట్లకు స్వస్తి.. దామరచర్లలో తెలంగాణ జెన్కో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నాలుగేళ్ల కిందే పూర్తికావాల్సి ఉండగా ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఈ జాప్యంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మెగావాట్కు రూ. 6–10 కోట్లకు పెరిగింది. కాలంచెల్లిన సబ్–క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన భద్రాద్రి విద్యుత్ కేంద్రం వ్యయం సైతం భారీగా పెరగడంతో దాని విద్యుత్ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ సర్కారు న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జోలికి వెళ్లొద్దని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చింది. ప్రత్యామ్నాయంగా మార్కెట్లో రూ. 2–4కు యూనిట్ చొప్పున లభిస్తున్న పునరుద్పాదక విద్యుత్తో రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం సౌర, జల, పవన, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ విద్యుత్పై సర్కారు దృష్టిపెట్టనుంది. -
భారీగా ‘బ్యాక్లాగ్’! ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మిగిలిపోతున్న పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న నియామక సంస్థలకు బ్యాక్లాగ్ తిప్పలు పట్టుకున్నాయి. ఒకే సమయంలో భారీగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియలు చేపడుతుండటంతో.. గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. పోటీ పరీక్షల కోసం పకడ్బందీగా సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు.. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. వాటిలో ఒకదానిని ఎంచుకోవడంతో మిగతా ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఉద్యోగ నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కౌన్సెలింగ్ను ఒకే సమయంలో నిర్వహించడం వంటివి దీనికి కారణమవుతున్నాయి. ఉద్యోగాలకు ఎంపికైనవారు వాటిని వదులుకుంటే.. తర్వాతి మెరిట్ అభ్యర్థులకు కేటాయించే పరిస్థితి (రిలిక్విష్ మెంట్) లేకపోవడం కూడా సమస్యకు దారితీస్తోంది. ఇలా మిగిలిపోయిన ఉద్యోగాలకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసి, భర్తీ ప్రక్రియ చేపట్టాల్సి వస్తోంది. ఇటీవల భర్తీ చేసిన గురుకుల కొలువులు, పోలీస్ కానిస్టేబుల్, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్ తదితర కేటగిరీ ఉద్యోగాల్లో సుమారు 10శాతానికిపైగా ఇలా మిగిలిపోవడం గమనార్హం. 33వేల కొలువుల్లో.. 4,590 ఉద్యోగాలు ఖాళీ.. రాష్ట్రంలో గత మూడు నెలల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 33 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది. ఇందులో 4,590 ఉద్యోగాలు మిగిలిపోయినట్టు నియామక సంస్థల ప్రాథమిక గణాంకాలు చెప్తున్నాయి. ఉద్యోగులంతా పూర్తిస్థాయిలో విధుల్లో చేరితే ఇందుకు సంబంధించి మరింత స్పష్టత రానుంది. గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు పరిధిలో ఇప్పటివరకు 8.820 ఉద్యోగాల భర్తీ చేపట్టగా.. ఏకంగా 1,810 ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలినట్టు సమాచారం. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇటీవల చేపట్టిన 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో దాదాపు 2వేల ఉద్యోగాలు భర్తీ కాలేదు. ఇక మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7 వేల స్టాఫ్ నర్సు, 1,150 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయగా.. వీటిలోనూ 780 ఉద్యోగాలు మిగిలిపోయాయి. రిలిక్విష్మెంట్ లేకపోవడంతో.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీలో రిలిక్విష్మెంట్ విధానాన్ని అనుసరించారు. అంటే ఏదైనా నోటిఫికేషన్కు సంబంధించి ప్రకటించిన ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ కాకుంటే.. అందులోని తర్వాతి మెరిట్ అభ్యర్థులతో భర్తీచేసేందుకు వీలు ఉండేది. 2018 వరకు ఈ విధానాన్ని అనుసరించారు. కానీ ఈ విధానంలో పారదర్శకత లోపించిందంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, దానికితోడు ఇతర కారణాలతో రిలిక్విష్మెంట్ విధానాన్ని పక్కనబెట్టారు. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చాక జారీ అయిన నోటిఫికేషన్లలో రిలిక్విష్మెంట్ అంశాన్ని జతచేయలేదు. అంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎన్ని పోస్టులు మిగిలినా అదే నోటిఫికేషన్ కింద భర్తీ చేసే అవకాశం లేదు. ఇటీవల రిలిక్విష్మెంట్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి, నిబంధనలపై చర్చించినా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా భర్తీ ప్రక్రియలో బ్యాక్లాగ్ ఖాళీలు మిగిలిపోతున్నాయి. వాటిని భర్తీ చేయాలంటే మళ్లీ కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సిందేనని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నియామకాల ప్రక్రియలు ఇంకా కొనసాగుతుండటంతో.. నోటిఫికేషన్ల వారీగా ఏర్పడే ఖాళీలపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. -
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన
రాజన్న సిరిసిల్ల, సాక్షి: తెలంగాణలో ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న దుస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను పరిశీలించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. గతేడాది ఇదే సమయానికి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో అంతటా నీళ్లిచ్చింది. కేసీఆర్పై కోపంతోనే మేడిగడ్డకు రిపేర్ చేయించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఢిల్లీకి హైదరాబాద్కు తిరగడం తప్ప.. రైతుల్ని పరామర్శించే తీరిక సీఎం రేవంత్రెడ్డికి లేకుండా పోయింది. ఇప్పటికే 200 మంది రైతులు చనిపోయారు. ఇప్పటికైనా రైతుల్ని ఆదుకోండి’’ అని కాంగ్రెస్ సర్కార్ను కోరారాయన. ‘ఎండిపోయి పంట నష్టం జరిగిన రైతులకు పరిహారం ఇవ్వాలి. ఎకరానికి పదివేలా, 25 వేలా.. ఎంతిస్తారో పరిహారం అంత ఇవ్వండి. అధికారం నుంచి దిగేపోయేనాటికి రైతుల కోసం కేసీఆర్ రైతుబంధు పేరిట రూ.7,000 కోట్ల రూపాయలు పెట్టారు. కానీ, అవికూడా రైతులకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఆ డబ్బు చేరవేస్తోంది. ఎన్నికల టైంలో.. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇస్తామన్న బోనస్, కౌలు రైతులకు ఇస్తామన్న రైతుబంధు ఇవ్వాలి. రైతులకు అండగా మేమున్నాం. కేసీఆర్ ఉన్నారు. దయచేసి ఆత్మహత్యల్లాంటి చర్యలకు రైతులు పాల్పడొద్దు’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
5,348 పోస్టుల భర్తీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో 5,348 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్, నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నా, ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్ ఉండొచ్చని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ఈసీ అనుమతి తప్పనిసరి కావడంతో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగం పరిధిలో 3,235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 1,255, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 575, డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ పరిధిలో 11, ఆయుష్ విభాగంలో 26, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో 34, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలో 212 పోస్టులు భర్తీ చేస్తారు. వివిధ విభాగాల్లో భర్తీ చేసే పోస్టుల వివరాలు ► ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్– 351, ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2)– 193, స్టాఫ్నర్స్– 31 ► డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ పరిధిలోజూనియర్ ఎనలిస్ట్ – 11 ► ఆయుష్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ (ఆయుర్వేద)– 6, టెక్నికల్ అసిస్టెంట్ (యునాని) – 8, లెక్చరర్ (ఆయుర్వేద) –1, లెక్చరర్ (హోమియో) –10, మెడికల్ ఆఫీసర్ (యు) లీవ్ రిజర్వుడు–1 ► ఐపీఎంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్– 4, లేబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్–2 లోకల్ క్యాడర్ –6, లేబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్–2 స్టేట్ క్యాడర్ –1, లేబరేటరీ అటెండెంట్ స్టేట్ క్యాడర్– 7, వ్యాక్సినేటర్ –1, స్టాఫ్నర్స్–1, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2) –1, జూనియర్ అనెలిస్ట్ (లోకల్ క్యాడర్)–2, జూనియర్ అనెలిస్ట్ (స్టేట్ క్యాడర్) – 11 ► డీఎంఈ పరిధిలో సీటీ స్కాన్ టెక్నీషియన్–6, డెంటల్ హైజినిస్ట్– 3, ఈసీజీ టెక్నీషియన్ – 4, ఈఈజీ టెక్నీషియన్ – 5, అనెస్థిషియా టెక్నీషియన్ – 93, ఆడియో విజువల్ టెక్నీషియన్ – 32, ఆడియో మెట్రీ టెక్నీషియన్– 18, బయో మెడికల్ ఇంజనీర్–14, బయో మెడికల్ టెక్నీషియన్– 11, డెంటల్ టెక్నీషియన్– 53, రేడియోగ్రఫీ టెక్నీషియన్– 19, ఆప్తోమెట్రిస్ట్– 20, స్టెరిలైజేషన్ టెక్నీషియన్–15, ఫిజియోథెరపిస్ట్–33, అసిస్టెంట్ ప్రొఫెసర్లు– 555, నాన్ మెడికల్ అసిస్టెంట్లు (జి)–17, రేడియోలాజికల్ ఫిజిక్స్ అండ్ రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ లెక్చరర్– 5, పర్ఫ్యూజనిస్ట్–3, లైబ్రేరియన్–14, ఫిజికల్ డైరెక్టర్ – 5, క్లినికల్ సైకాలజిస్ట్ – 2, స్పీచ్ పాథాలజిస్ట్– 1, చైల్డ్ సైకాలజిస్ట్– 21, ఇమ్యునోలజిస్ట్–1, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు–80, మెడికో సోషల్ వర్కర్ (గ్రేడ్–2)– 95, స్టాఫ్నర్సులు–1,545, స్టాటిస్టిషియన్–20, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2) – 125, ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2)– 420 ► తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఫిజియోథెరపిస్ట్– 13, ఏఎన్ఎంలు– 85, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు– 617, స్టాఫ్నర్సులు– 332, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు – 6, ల్యాబ్ టెక్నీషియన్లు– 136, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2)– 66 ► ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. అనెస్థీషియా– 4, బయో కెమిస్ట్రీ –1, డెంటల్ సర్జరీ –1, ఈఎన్టీ– 1, గైనిక్ అంకాలజీ– 2, మెడికల్ ఆంకాలజీ (పీడియాట్రిక్ మెడికల్ ఆంకాలజీతో కలిపి)– 4, మైక్రోబయోలజీ – 1, మాలిక్యులర్ అంకాలజీ –1, న్యూక్లియర్ మెడిసిన్– 2, ఆప్తమాలజీ – 1, పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్– 2, పాథాలజీ– 2, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ – 2, రేడియోలాజికల్ ఫిజిక్స్ – 4, రేడియాలజీ – 2, రేడియో థెరపీ – 4, సర్జికల్ అంకాలజీ – 6, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్–1. సివిల్ అసిస్టెంట్ సర్జన్ (హాస్పిటల్ అడ్మిని్రస్టేషన్) – 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (అనెస్థీషియా)– 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సైటో పాథాలజీ)– 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (పాథాలజీ) –2, లెక్చరర్ (న్యూక్లియర్ అంకాలజీ) – 1, లెక్చరర్ (న్యూక్లియర్ మెడిసిన్/న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్)– 3, బయోమెడికల్ ఇంజనీర్ – 2, స్టాఫ్నర్స్–80, ల్యాబ్ టెక్నీషియన్లు (గ్రేడ్–2 – 8, మౌల్డ్ టెక్నీషియన్ – 1, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ – 2, రేడియోథెరపీ టెక్నీషియన్ – 10, టెక్నీషియన్లు–5, టెక్నీషియన్లు (మెడికల్ ఇమేజింగ్)– 5, థియేటర్ అటెండెంట్లు–5, డెంటల్ టెక్నీషియన్ –1, ఈసీజీ టెక్నీషియన్– 2, ల్యాబ్ టెక్నీషియన్– 8, మెడికల్ ఫిజిసిస్ట్– 5, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్– 3, రేడియోగ్రాఫర్ సీటీ టెక్నీషియన్– 2, రేడియోగ్రాఫర్ మమోగ్రఫీ టెక్నీషియన్–1, రేడియోగ్రాఫర్ ఎంఆర్ఐ టెక్నీషియన్– 2, రేడియోగ్రాఫర్ ఆర్టీ టెక్నీషియన్– 5, రేడియోగ్రాఫర్–6, సోషల్ వర్కర్–6. -
సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగళ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారాయన. ‘‘ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా? వాళ్ల ఆర్తనాదాలు వినిపించవా? ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న శ్రామికులపై కనికరం లేదా? సీట్లు, ఓట్ల పంచాయితీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా? ప్రజాపాలన అంటే 24/7 ఫక్తు రాజకీయమేనా? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు? దెబ్బతిన్న పంటలను పరిశీలించే తీరిక లేదా?.. .. హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొడుతున్న మీకు.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా? ఇంతకాలం పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా? అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు.. రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..? నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు.. నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు.. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా...? అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..?? ఎన్నికల గోల… pic.twitter.com/CUcrdomGku — KTR (@KTRBRS) March 20, 2024 -
2 నెలలు.. రూ.28 వేల కోట్ల రాబడి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఖజానా ప్రస్తుత పరిస్థితేంటి? ఆదాయం బాగానే వస్తోందా? గతంతో పోలిస్తే తగ్గిందా? సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు లాంటి చెల్లింపులకు నెలసరి రాబడులు సరిపోతున్నాయా? ప్రభుత్వం అప్పులు తీసుకుంటోందా? తీసుకుంటే ఎంత తీసుకుంది? కేంద్రం ఏమైనా సాయం చేస్తోందా? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారం చేపట్టిన నేపథ్యంలో..సహజంగానే తలెత్తే ఇలాంటి పలు సందేహాలకు ప్రభుత్వం తాజాగా వెల్లడించిన వివరాలు జవాబిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 2 నెలల (డిసెంబర్, జనవరి)కు సంబంధించిన ఆదాయ, వ్యయ వివరాలను కంప్ట్రోలర్ అండర్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఆ వివరాల ప్రకారం.. గత డిసెంబర్, జనవరి నెలలకు కలిపి ప్రభుత్వ ఖజానాకు రూ.28 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. పన్ను రాబడులు, అప్పులు ఇలా.. పన్ను రాబడుల శాఖలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే..ఎక్సైజ్ ఆదాయం రెండు నెలల్లో రూ.3,300 కోట్ల మేర సమకూరింది. జీఎస్టీ పద్దు కింద రూ.7,500 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2,300 కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ.5,400 కోట్లు సమకూరాయి. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో రూ.1,300 కోట్లకు పైగా ఇవ్వగా, అప్పుల కింద రూ.2,700 కోట్లను ప్రభుత్వం సమకూర్చుకుంది. ఇక పన్నేతర ఆదాయం కింద రూ.1,048 కోట్లు వచ్చాయి. మొత్తం మీద 2023 నవంబర్ చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ పద్దు రూ. 1,49,316.41 కోట్లు ఉండగా 2024 జనవరి నాటికి రూ. 1,77,742.13 కోట్లకు చేరింది. -
ఆరుకు నూరు మార్కులెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. శుక్రవారంతో కాంగ్రెస్ పాలనకు వంద రోజులు పూర్తి కానుండటంతో, ప్రభుత్వ పనితీరుపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంత స్వల్ప వ్యవధిలో ప్రభుత్వ పనితీరును అంచనా వేయడం సరికాక పోయినా, ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటన చేయడం చర్చకు తావిచ్చింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల పేరుతో 13 హామీలను పొందుపరిచింది. ఈ 13 పథకాల అమలుకు ఏటా దాదాపు రూ.1.30 లక్షల కోట్లు అవసరమని నిపుణులు అంచనా వేశారు. కానీ ప్రభుత్వం వీటికి బడ్జెట్లో రూ.53 వేల కోట్లే కేటాయించింది. దీనిపై అప్పట్లోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా ఇప్పటివరకు ఐదు హామీలను ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఇంకా ఎనిమిది హామీలు పెండింగ్లో ఉండగా, ప్రస్తుతం తీవ్రమవుతున్న తాగునీరు, విద్యుత్ సమస్యలను కూడా ప్రభుత్వం అధిగమించాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వంద రోజుల్లో తాను సాధించిన విజయాలను వివరిస్తూ ప్రభుత్వం గురువారం ప్రగతి నివేదిక విడుదల చేసింది. ఎన్నికల తర్వాతే మిగతా హామీల అమలు? అధికారంలోకి వచ్చిన రెండోరోజే డిసెంబర్ 9న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తర్వాత 50 రోజులకు పైగా సమయం తీసుకుని ఫిబ్రవరి 28న మరో రెండు పథకాలు షురూ చేసింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించింది. అనంతరం 12 రోజుల సమయం తీసుకుని మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. పార్లమెంటు ఎన్నికల కోడ్కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించడంతో, ఆరు గ్యారంటీల్లో అమలు కాకుండా మిగిలిన 8 హామీల అమలు లోక్సభ ఎన్నికల తర్వాతేనని అర్థమవుతోంది. వ్యతిరేకత రాలేదేమో కానీ.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు విషయమై ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా ఒకింత అసంతృప్తి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు అందరికీ పథకాలు అందజేస్తామని చెప్పి.. ఇప్పుడు తెల్ల రేషన్కార్డు, ప్రజాపాలన దరఖాస్తు పేరుతో లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఎలాంటి లబ్ధీ పొందనివారు, భవిష్యత్తులో ప్రారంభించే పథకాల్లోనైనా తమకు లబ్ధి కలుగుతుందో లేదోననే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సంక్షేమ పథకాల అమలుకు ఏదో ఒక కొలబద్ధ ఉండాలి కదా... అందుకే తెల్ల రేషన్కార్డు నిబంధన అమలు చేస్తున్నామంటూ ప్రభుత్వం వివరణ ఇవ్వడం గమనార్హం. ఒక్క మహాలక్ష్మికే రూ.40 వేల కోట్లకు పైగా రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో ప్రకటించింది. మహాలక్ష్మి పేరుతో రూపొందించిన తొలి గ్యారంటీలోని మొదటి అంశం ఇదే. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 1.65 కోట్ల మంది మహిళలున్నారు. వీరిలో పింఛన్లు పొందుతున్న 26 లక్షల మంది పోను మిగిలిన వారికి నెలకు రూ.2,500 చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.41,700 కోట్లు కావాల్సి ఉంటుంది. వరికి బోనస్ వచ్చే సీజన్ నుంచా? కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మరో ప్రధాన గ్యారంటీ రైతు భరోసా. రైతులకు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పెట్టుబడి సాయం, వ్యవసాయ కార్మికులకు రూ.12 వేలతో పాటు క్వింటాలు వరికి రూ.500 బోనస్ ఇందులోని ప్రధాన హామీలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసినా క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వలేదు. అయితే వచ్చే వర్షాకాలం సీజన్ నుంచి దీనిని అమలు చేయవచ్చని తెలుస్తోంది. రైతు భరోసా అమలు చేయాలంటే ఏటా కనీసం రూ.34 వేల కోట్లు కావాల్సి ఉంటుంది. చేయూత.. ఎప్పుడో? రాష్ట్రంలోని పేదలు అత్యంత ఆతురతతో ఎదురుచూస్తున్న మరో గ్యారంటీ చేయూత. ఈ గ్యారంటీ కింద రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచాల్సి ఉంది. దీని కోసం 46 లక్షలకు మందికి పైగా పేదలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా చేయూత పథకాన్ని అమలు చేయాలంటే ఏటా రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి రానుంది. యువ వికాసం... గందరగోళం యువ వికాసం గ్యారంటీలో భాగంగా ఇంటర్ నుంచి వృత్తి విద్యా కోర్సుల వరకు అన్ని స్థాయిల్లోని విద్యార్థులకు ఫీజుల నిమిత్తం రూ.5 లక్షల విలువైన విద్యాభరోసా కార్డులు ఇస్తామని ప్రకటించారు. కానీ ఆ కార్డు ఎలా ఇస్తారు? ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందా? వడ్డీ ఎవరు భరిస్తారు? లాంటి వాటిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పటివరకు ఇవీ.. ఆరు గ్యారంటీల్లో భాగంగా తొలుత ప్రారంభించింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి. ఈ పథకం ప్రారంభించే నాటికి ఆర్టీసీ బస్సుల్లో సగటు ఆక్యుపెన్సీ రేషియో 66 శాతం మాత్రమే. కానీ పథకం ప్రారంభమయ్యాక అది క్రమంగా వంద శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించిన మహిళల సంఖ్య 25 కోట్లను మించిపోయింది. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇక గృహజ్యోతి కింద తొలి నెలలో లబ్ధి పొందిన వారి సంఖ్య తక్కువగానే ఉంది. రాష్ట్రంలో 200 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగిస్తున్న గృహ కనెక్షన్ల సంఖ్య 95.23 లక్షలు కాగా, తెల్ల రేషన్కార్డు, ప్రజాపాలన దరఖాస్తుల పేరుతో లబ్ధిదారుల సంఖ్య సగానికి పైగానే తగ్గిందని తెలుస్తోంది. మరోవైపు ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రంలోని 20 లక్షల మందికి ఇళ్ల సౌకర్యం కల్పించాలన్నది లక్ష్యం కాగా, ప్రస్తుతం సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల నగదు సాయం పథకాన్ని ప్రారంభించారు. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోని వారి పరిస్థితేమిటి? ప్రజాపాలన కార్యక్రమంలో సంక్షేమ పథకాల కోసం 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో డూప్లికేషన్లు, ఇప్పటికే లబ్ధి పొందిన దరఖాస్తులు కూడా ఉన్నాయని ప్రభుత్వం చెపుతోంది. ఇదిలావుంటే అసలు చాలా మంది ప్రజలు ఈ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోలేదు. దీంతో తెల్ల రేషన్కార్డు ఉన్నప్పటికీ పథకాల లబ్ధి పొందలేకపోవడం గమనార్హం. ప్రతి నాలుగు నెలలకోసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వం చెపుతోంది. ఈ లెక్కన ఏప్రిల్ నెలాఖరులో మరోమారు ప్రజాపాలన నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఆరు గ్యారంటీల అమలుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 100 రోజుల్లో అమలు సాధ్యం కాదని తెలిసీ ఎందుకు గ్యారంటీ ఇచ్చారని ప్రశి్నస్తున్నాయి. వంద రోజులు పూర్తయిన తర్వాత పోరాట కార్యాచరణకు పూనుకుంటామని హెచ్చరిస్తున్నాయి. -
మరో బెంగళూరు కానివ్వొద్దు.. తాగునీటి ఎద్దడిపై హైకోర్టు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: వర్షపు నీటి నిల్వ విధానం (ఇంకుడు గుంతలు, ఆర్డబ్ల్యూఎస్హెచ్)పై సరైన చర్యలు చేపట్టకుంటే హైదరాబాద్ మరో బెంగళూరులా తాగునీటికి కూడా ఇబ్బందిపడే పరిస్థితి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకుడు గుంతలు లేని నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు కూడా నీటి వినియోగంపై అవగాహన కలిగించేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పింది. తాగునీటికి ఇబ్బంది ఉంటే గార్డెనింగ్ లాంటి వాటికి వినియోగాన్ని నియంత్రించాలంటూ సర్కారుకు పలు సూచనలు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా నీటికొరత ఉందని, ప్రధానంగా జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్లో తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోందని.. అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ జర్నలిస్ట్ సుభాష్ చంద్రన్ 19 ఏళ్ల క్రితం హైకోర్టుకు లేఖ రాశారు. ఇందులోభాగంగా నీటి వినియోగాన్ని నియంత్రించడం, తాగునీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీన్ని న్యాయస్థానం పిటిషన్గా మార్చి సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి కీలక సూచనలతో కూడిన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్కు కాలం చెల్లిపోయిందని చట్టప్రకారం నిర్మాణాలకు అనుమతులిచ్చే విషయంలో నిబంధనలు పాటిస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సిద్ధివర్ధన పేర్కొన్నారు. తాగునీటి సంరక్షణ, నియంత్రణకు సంబంధించిన ఈ పిటిషన్ ద్వారా కోరిన ఉపశమనం.. తీసుకోవాల్సిన చర్యలు వేరని... ఈ నేపథ్యంలో కాలం చెల్లిందన్న వాదన సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ధర్మాసనం చేసిన సూచనలివీ... ► తాగునీటి పరిరక్షణ, పునర్వినియోగం, పంపిణీ లాంటి అంశాలను 3 నుంచి 5వ తరగతి పాఠ్యాంశాల్లో చేర్చే అంశాన్ని పరిశీలించాలి. 6వ తరగతి విద్యార్థులకు ఇదే అంశాలపై కొంత సిలబస్ స్థాయి పెంచి పాఠ్యాంశంగా చేర్చాలి. ► రాష్ట్రంలోని భూగర్భ జలాలను పరిశీలించి.. అవసరమైతే తాగునీటిని గార్డెనింగ్ వంటి పనులకు వినియోగించడంపై ఆంక్షలు విధించాలి. ► ఇంకుడు గుంతల్లేని నిర్మాణాలను గుర్తించడానికి, తగిన చర్యలు తీసుకోవడానికి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి కసరత్తు చేయాలి. ► పట్టణ, స్థానిక సంస్థల్లో ఆర్డబ్ల్యూహెచ్ఎస్ నిబంధనలు అమల్లో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి చర్యలు చేపట్టాలి. ► గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూహెచ్ఎస్ వ్యవస్థ అవశ్యకతను తెలియజేయడానికి సర్కారు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ► గతేడాది మార్చి 31న జారీచేసిన జీవో 49 అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీనికి అదనంగా చిన్న నిర్మాణాల్లో సైతం వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అంశాన్ని అధ్యయనం చేసి చర్యలు చేపట్టాలి. ► వాల్టా చట్టంలోని నిబంధనల అమలుకు సెక్షన్ 11 ప్రకారం సంబంధిత విభాగం నోటిఫికేషన్ జారీచేయాలి. ► రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోర్వెల్స్ నిబంధనల ప్రకారమే కొనసాగుతున్నాయా? లేదా? అనే అంశంపై భూగర్భ జలవనరులశాఖ పరిశీలన చేపట్టి చర్యలు తీసుకోవాలి. ► పంచాయతీరాజ్ చట్టం- 2018లోని సెక్షన్ 43 (6) (2) నిబంబధనలు అమలయ్యేలా పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి చర్యలు తీసుకోవాలి. -
ఇందిరమ్మ పట్టాలు ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సొంత స్థలం లేని నిరుపేదలకు ఇప్పట్లో ‘ఇందిరమ్మ గృహ’ వసతి అందే సూచనలు కనిపించటం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు రోజుల క్రితం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో రెవెన్యూ పరమైన అంశాల జోలికి వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందున నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం అవసరమైన పట్టాల పంపిణీ ఇప్పట్లో జరిగేలా లేదు. పథకం ప్రారంభించడానికి ఒకరోజు ముందు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది. మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే కచ్చితంగా సొంత జాగా కలిగి ఉండాలని అందులో పేర్కొంది. తద్వారా సొంత స్థలాలు లేని వారికి ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లేదనే స్పష్టతనిచ్చింది. ఇటీవల నిర్వహించిన ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. గతంలో ప్రభుత్వం నుంచి ఇళ్లు పొందని వారు 66 లక్షలుగా ఉన్నట్టు ప్రాథమికంగా తేల్చింది. ఇందులో 30 లక్షల మందికి సొంత జాగా లేదని కూడా తేలినట్టు సమాచారం. కాగా వారందరికీ ప్రభుత్వం తొలుత భూమి పట్టాలు జారీ చేసి ఇళ్లను మంజూరు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. సొంత స్థలాలు లేని వీరంతా తదుపరి విడత కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితి నెలకొంది. లక్ష ఇళ్లపైనే దృష్టి: ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఏడాది కాలంలో లక్ష ఇళ్లకు మించి పూర్తి కావని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో తొలుత ఆ లక్ష ఇళ్లకు సరిపడా నిధులు సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ప్రక్రియ కాస్తా పూర్తయి, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అంటే జూలైలో ఈ ప్రక్రియ ఊపందుకుంటుంది. గ్రామ సభలు నిర్వహించి అర్హుల ఎంపిక పూర్తి అయ్యేసరికి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటికి కూడా వానాకాలం కొనసాగనున్నందున అక్టోబర్ తర్వాత గాని ఆ ప్రక్రియలో వేగం పెరగదు. అయితే వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. ప్రభుత్వం ఇచ్చే నిధులకు కొన్ని సొంత నిధులు కలిపి లబ్ధిదారులు పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొన్ని కుటుంబాల్లో అర్థికపరమైన ఇబ్బందులకు కారణమవుతుంది. అలాంటి వారి ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుంది. ఈలోపు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ క్రమంలో వచ్చే మార్చిలోపు కొన్ని ఇళ్లకే పూర్తి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అలా దాదాపు లక్ష ఇళ్లకే నిధులు అందించాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రభుత్వ అంచనా వేస్తోంది. నిధులు సిద్ధం! లక్ష ఇళ్లకు రూ.5 వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటుంది. హడ్కో నిధుల కోసం గతంలోనే ప్రభుత్వం దరఖాస్తు చేయగా, ప్రస్తుతం రూ.3 వేల కోట్ల రుణం మంజూరైంది. ఇందులో రూ.1,500 కోట్లు మాత్రమే ఇప్పుడు విడుదల కానున్నాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మొదటి కిస్తీగా రూ.1,000 కోట్లు మంజూరవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వెరసి రూ.2,500 కోట్లు అందుబాటులో ఉన్నట్టవుతుంది. కాగా మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కేటాయించాల్సి ఉంటుంది. ఈ విధంగా లక్ష ఇళ్లకు నిధులు దాదాపు సిద్ధంగా ఉన్నట్టుగానే ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ ఇళ్లే ఇచ్చినా ఎక్కువ శాతం కన్పించేలా.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తొలుత చిన్న గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ జనాభా ఉండే ప్రాంతాలను గుర్తించి, వాటిల్లో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఆయా గ్రామాల్లో తక్కువ ఇళ్లనే అందించినా.. ఆ గ్రామ జనాభా, మంజూరు చేసిన ఇళ్ల దామాషాను చూస్తే ఎక్కువ శాతం ఇళ్లను కేటాయించినట్టు లెక్కలు కనిపిస్తాయి. అదే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు ఇచ్చే ఇళ్ల సంఖ్యను, ఆ ప్రాంత జనాభాను పరిగణనలోకి తీసుకుంటే తక్కువ ఇళ్లు కేటాయించినట్టుగా కన్పిస్తుంది. దీన్ని గమనంలో ఉంచుకునే తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
17 వరకు ధరణి స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూమి సమస్యలకు సంబంధించి పెండింగ్లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 17వ తేదీ వరకు డ్రైవ్ను కొనసాగించాలంటూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా, ఇంకా మిగిలిపోయిన దరఖాస్తులను క్లియర్ చేయడమే లక్ష్యంగా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీసీఎల్ఏ సూచించారు. ఇది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే: కోదండరెడ్డి, సునీల్ ధరణి పోర్టల్ విషయంలో తాము ఇప్పటివరకు ఫస్ట్ ఎయిడ్ (ప్రాథమిక చికిత్స) మాత్రమే ఇస్తున్నామని, అసలు ట్రీట్మెంట్ను ఇంకా ప్రారంభించలేదని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, భూమి సునీల్ తెలిపారు. సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్లో వారు విలేకరులతో మాట్లాడారు. గతంలో పేరుకుపోయిన దరఖాస్తుల పరిష్కారం కోసమే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ డ్రైవ్ను ప్రభుత్వం మరో వారం రోజులు పొడిగించిందని చెప్పారు. అయితే ధరణి దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం నిరంతరం జరగాల్సిందేనన్నారు. గతంలో కలెక్టర్లు మాత్రమే ఈ దరఖాస్తులను పరిష్కరించేవారని, ఇప్పుడు తహశీల్దార్, ఆర్డీవోల స్థాయిలో అధికార వికేంద్రీకరణ జరపడమే కాకుండా, పరిష్కారానికి నిర్దేశిత టైంలైన్ విధించామని తెలిపారు. ధరణి పోర్టల్ విషయంలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని, చట్టాలు, వ్యవస్థ, సాంకేతికతలో మార్పులు తీసుకు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న అవకాశాల పరిధిలో సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. ధరణి పోర్టల్కు సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారంపై ప్రభుత్వానికి నివేదికలిస్తామని, ఆ మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని అన్నా రు. ప్రస్తుతం చేపడుతున్నవి తాత్కాలిక చర్య లు మాత్రమేనని, 2, 3 నెలల్లో శాశ్వత పరిష్కారాలు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని మాజీ ఎంపీ సంతోశ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, నిషేధిత జాబితాలోని భూములను కూడా రాత్రికి రాత్రి బదలాయించుకున్నారని కోదండరెడ్డి ఆరోపించారు. -
ఎస్హెచ్జీ మహిళలకు రూ.5 లక్షల బీమా!
సాక్షి, హైదరాబాద్: ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) కింద స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళలకు రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే ఎస్హెచ్జీ మహిళలు మరణిస్తే వారికి సంబంధించిన రుణాలను సైతం మాఫీ చేయనుంది. మరణించిన ఎస్హెచ్జీ మహిళలకు సంబంధించిన రుణ బకాయిలను ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేస్తున్నారు. కానీ ఇకపై ఆ బకాయిలను పూర్తిగా మాఫీ చేయనున్నారు. ఎస్హెచ్జీ మహిళలను పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ప్రోత్సహించడానికి ఐకేపీ ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓ మినీ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేయనుంది. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్లు, పోలీసుల యూనిఫామ్లను కుట్టే బాధ్యతను సైతం ఎస్హెచ్జీ మహిళలకే అప్పగించనుంది. వీరి ద్వారానే ప్రభుత్వ బడుల్లోని బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారితో నాప్కిన్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన యంత్ర పరికరాలను కూడా పరిశీలించింది. మండలాన్ని ఒక క్లస్టర్గా తీసుకుని ఆ పరిధిలోని ఎస్హెచ్జీలకు యూనిఫామ్లు కుట్టడం, శానిటరీ నాప్కిన్ల తయారీలో శిక్షణ ఇప్పించాలని భావిస్తోంది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం లక్ష మంది మహిళలతో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎస్హెచ్జీలకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. మహిళలకే సోలార్ ప్లాంట్ల ఏర్పాటు చాన్స్ ఎస్హెచ్జీ మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ 2018 నుంచి నిలిచిపోగా, త్వరలో మళ్లీ పునరుద్ధరిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వడ్డీ లేని రుణాలతో ఎస్హెచ్జీ గ్రూపులను స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహిస్తే వారి ఆర్థిక, కుటుంబ స్థితిగతులు మెరుగుపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వడ్డీ లేని రుణాల పంపిణీ పునః ప్రారంభించడంతో పాటు అన్ని విధాలుగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే విద్యుత్ సబ్ స్టేషన్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా మహిళలకు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించింది. బీమా ప్రీమియం చెల్లించనున్న ప్రభుత్వం ఎస్హెచ్జీ మహిళల కోసం రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని రైతు బీమా పథకం తరహాలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి బీమా కంపెనీలతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏటా ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించనుంది. అన్ని తరహా మరణాలకు జీవిత బీమా వర్తించనుంది. మహిళ మరణించిన పక్షంలో నామినీ ఖాతాలో రూ.5 లక్షలను బీమా కంపెనీ జమ చేస్తుంది. 61 లక్షల మంది మహిళలకు బీమా 18–60 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలు మాత్రమే ఎస్హెచ్జీ గ్రూపుల్లో సభ్యులుగా ఉండడానికి అర్హులు కాబట్టి వారికే ఈ పథకం వర్తించనుంది. రాష్ట్రంలో 6.1 లక్షల ఎస్హెచ్జీ గ్రూపులుండగా, ఒక్కో గ్రూపులో 10 మంది చొప్పున మొత్తం 61లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని 1.74 లక్షల గ్రూపుల్లో 17.40 లక్షల మంది, గ్రామీణ ప్రాంతాల్లోని 4.36 లక్షల గ్రూపుల్లో 43.6 లక్షల మంది సభ్యులుగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు: డిప్యూటీ సీఎం భట్టి చింతకాని: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు హామీ ఇవ్వని మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 12న హైదరాబాద్లో నిర్వహించే మహిళా సదస్సులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని చెప్పారు. ఏడాదికి రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలను వడ్డీ లేకుండా అందించనున్నట్లు..ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని పేదలు దశాబ్ద కాలానికి పైగా ఇళ్ల కోసం ఎదురుచూసి అలసిసోయారని, అయితే ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేకుండా ఏ ఒక్కరూ ఉండకూదనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సోమవారం భద్రాచలంలో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారని భట్టి తెలిపారు. -
‘ధరణి’ పరిష్కారం 'పేపర్పైనే'!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న వ్యవసాయ భూముల సమస్యలకు పరిష్కారం కాగితాలకే పరిమితం అవుతోంది. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్లో 76 వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించినట్టు ప్రభుత్వం చెప్తున్నా.. ఆ వివరాలేవీ పోర్టల్లో అప్డేట్ కాలేదు. అంతేకాదు పోర్టల్లోని సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ పెట్టుకున్న గడువు కూడా ముగిసింది. అయినా ఇంకా పెద్ద సంఖ్యలో పెండింగ్ దరఖాస్తులు మిగిలిపోయాయి. దీనితో డ్రైవ్ను పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నా క్షేత్రస్థాయి అధికారుల్లో మాత్రం గందరగోళం కనిపిస్తోంది. ధరణి పోర్టల్ను నిర్వహిస్తున్న ప్రైవేట్ కంపెనీ అవసరమైన లాగిన్లు ఇవ్వకపోవడంతోనే దరఖాస్తుల పరిష్కార వివరాలను ఆన్లైన్లో నమోదు చేయలేకపోతున్నట్టు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం నెరవేరలేదన్న భావనలో రెవెన్యూ వర్గాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో గందరగోళం రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్లో పరిష్కారం కోసం వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో స్పెషల్ డ్రైవ్లో భాగంగా 76,382 దరఖాస్తులను రెవెన్యూ యంత్రాంగం వివిధ స్థాయిల్లో పరిష్కరించింది. తహసీల్దార్, ఆర్డీవో, జేసీ, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిల్లో ఆయా దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. కానీ ఆన్లైన్లో అప్డేట్ కాలేదు. ప్రస్తుతం ధరణి పోర్టల్లో సమస్యల పరిష్కారానికి కేవలం కలెక్టర్లు, సీసీఎల్ఏ వద్ద మాత్రమే డిజిటల్తోపాటు అధీకృత లాగిన్లు ఉన్నాయి. తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు లాగిన్లు లేవు. గతంలో తహసీల్దార్లకు డిజిటల్ లాగిన్లు ఇచ్చినా.. దరఖాస్తులను పరిష్కరించినట్టుగా పేర్కొని అప్డేట్ చేసే అదీకృత లాగిన్లు లేవు. అ«దీకృత లాగిన్లు ఇచ్చేందుకు మరో 10–20 రోజుల సమయం పడుతుందని ‘ధరణి’ నిర్వహణ కంపెనీ చెప్తున్నట్టు తెలిసింది. గడువు ముగిసిపోయినా.. స్పెషల్ డ్రైవ్ ప్రారంభానికి ముందే.. అన్నిస్థాయిల్లో అదీకృత లాగిన్లు ఇవ్వాలని పోర్టల్ నిర్వహణ కంపెనీని కోరినట్టు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. కానీ కంపెనీ ఇప్పటివరకు ఆ లాగిన్లు ఇవ్వలేదని.. పరిష్కారమైన దరఖాస్తుల్లోని భూముల వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసే వీలు లేకుండా పోయిందని అంటున్నాయి. స్పెషల్ డ్రైవ్ కోసం ప్రభుత్వం పెట్టిన గడువు కూడా ముగిసింది. దరఖాస్తులు ఇంకా భారీగా పెండింగ్లో ఉండటంతో డ్రైవ్ను పొడగించాలని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో అన్నిస్థాయిల్లో లాగిన్లు వచ్చేదాకా పరిష్కారమైన దరఖాస్తుల వివరాలన్నీ కలెక్టర్ల లాగిన్లకు పంపి అక్కడి నుంచి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడి మధ్య ఉన్న కలెక్టర్ల పరిధిలో ఈ ప్రక్రియ కష్టమని స్పష్టం చేస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్కు అభ్యంతరం చెప్పినా..? వాస్తవానికి ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టవద్దనే చర్చ ఉన్నతస్థాయిలో జరిగినట్టు తెలిసింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వద్ద జరిగిన చర్చల సందర్భంగా.. రెవెన్యూ శాఖలోని ముఖ్య అధికారి ఒకరు స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు అభ్యంతరం చెప్పారని, ఎన్నికల కోడ్ వస్తే ఆపేయాల్సి వస్తుందని సూచించారని సమాచారం. ఎన్నికల కోడ్కు, ధరణి సమస్యల పరిష్కారానికి ఎలాంటి సంబంధం ఉండదని.. 2017లో ప్రారంభమైన ఈ ప్రక్రియకు ఎన్నికల కోడ్తో ముడిపెట్టాల్సిన అవసరం లేదని ధరణి కమిటీలోని ఓ సభ్యుడు చెప్పడంతో స్పెషల్డ్రైవ్ ప్రకటన జరిగిందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం విధివిధానాలు రూపొందించే సమయంలోనూ ఇలాంటి సమస్య వచ్చిందని తెలిసింది. రాష్ట్రంలో రెగ్యులర్ సీసీఎల్ఏను నియమిస్తేనే ధరణి సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం సాధ్యమవుతుందని సీఎంతో జరిగిన చర్చల సందర్భంగా ధరణి కమిటీలోని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నట్టు రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ‘ధరణి’పై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్నిస్థాయిల్లో లాగిన్లను ధరణి పోర్టల్ నిర్వహణ కంపెనీ ఎప్పటికి సమకూరుస్తుంది? స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం ఏ మేరకు నెరవేరుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
TS: ‘బాబు పాలనను గుర్తు చేస్తున్న శిష్యుడు’
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న చంద్రబాబు శిష్యుడు.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పిలుపు ఇచ్చారు. తాజా రాజకీయ పరిణామాలపై శనివారం సుమన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు-రేవంత్ రెడ్డి గురు శిష్యుల బంధం మరోసారి బయటపడిందని సుమన్ విమర్శలు గుప్పించారు. ‘‘చంద్రబాబు-రేవంత్ ఇద్దరూ భేటీ అయ్యి మాట్లాడుకున్నారు. ఆ తర్వాతే కాంగ్రెస్ మంత్రులు టీడీపీ ఆఫీస్కు పోయి చంద్రబాబుకి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక్కడే వాళ్ల గురుశిష్యుల బంధం బయటపడింది’’ అని సుమన్ అన్నారు. చంద్రబాబు పాలనలో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందని.. ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్రెడ్డి మళ్లీ ఆనాటి పాలనను గుర్తు చేస్తున్నారని సుమన్ మండిపడ్డారు. ఇక.. బీజేపీతో రేవంత్ రెడ్డి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం పలు అనుమానాలకు తావిస్తోందని సుమన్ అన్నారు. దేశంలో.. ఆఖరికి సొంత పార్టీ(బీజేపీ) సీఎంలకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా ఉంది. అలాంటిది రేవంత్రెడ్డికి చాలా తేలికగా దొరుకుతోంది. రేవంత్ బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వీళ్ల షేక్హ్యాండ్, పలకరింపులు చూస్తే ఎవరికైనా తెలిసిపోతుందా విషయం. పార్లమెంట్ ఎన్నికల తరవాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం కన్ఫర్మ్ అయింది. గంపగుత్తగా, హోల్ సేల్ గా ప్రభుత్వాన్ని నరేంద్రమోదీ చేతులో పెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలారా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని బాల్క సుమన్ పేర్కొన్నారు. -
పాత బస్తీ మెట్రోకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: ఓల్డ్ సిటీ అంటే పాత నగరం కాదని.. ఇదే అసలైన హైదరాబాద్ నగరమని.. దీనిని పూర్థిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఫలక్నుమాలోని ఫరూక్నగర్ దగ్గర పాత బస్తీ మెట్రో లైన్ పనులకు భూమి పూజ చేసి ఆయన మాట్లాడారు. ‘‘ఇది ఓల్డ్ సిటీ కాదు..ఇదే ఒరిజినల్ సిటీ. అసలైన నగరాన్ని పూర్థిస్తాయిలో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాం. అలాగే.. మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. ఇందు కోసమే లండన్ నగరాన్ని ఇక్కడి ఎమ్మెల్యే అక్బరుద్దీన్తో కలిసి పరిశీలించాం. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయంలో ఎంఐఎంతో కలిసి పనిచేస్తాం. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు. మిగతా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యమిస్తాం’’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టు విస్తరణకు తాజాగా సీఎం రేవంత్ ఆయన శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా ఈ మెట్రో రూట్ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం చూస్తోంది. ఇంకా ఆయన ఏమన్నారంటే.. హైదరాబాద్ అభివృద్ధికి 2050 వైబ్రంట్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. పాతబస్తీలో రోడ్ల విస్తరణకు రూ.200 కోట్లు కేటాయించాం. మూసీ నదిని 55 కి.మీ మేర సుందరీకరిస్తాం. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి చూపిస్తాం. మెట్రో రైలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్కే కాదు పాతబస్తీకి ఉండాలి. అందులో సంపన్నులే కాదు మధ్యతరగతి ప్రజలూ ప్రయాణించాలి. చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ మెట్రోలో అతిపెద్ద జంక్షన్ కాబోతోంది. చంచల్గూడ జైలును అక్కడి నుంచి తరలించి.. విద్యాసంస్థ ఏర్పాటు చేస్తాం. రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. వచ్చే నాలుగేళ్లలో పాతబస్తీ మెట్రో రైలు పూర్తి చేసి ప్రయాణిస్తాం. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్కు గుండెలాంటి పాతబస్తీకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డికి స్వాగతం. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తారని ఆశిస్తున్నాం. మీ చేతుల్లో ఐదేళ్లు అధికారం ఉంటుంది. అభివృద్ధికి మేం సహకరిస్తాం. రేవంత్రెడ్డి చాలా పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారు. తెలంగాణలో ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నాయి.. వాటిని అడ్డుకోవాలి. రాష్ట్రాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాలి. పాతబస్తీలో అభివృద్ధి పనుల కోసం సీఎంను కలవగానే రూ.120 కోట్లు విడుదల చేశారు. మూసీ నది అభివృద్ధికి మా పార్టీ సహకరిస్తుంది’’ అని పేర్కొన్నారు. -
‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అను సంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం. 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన. రూ.97 కోట్లతో ప్రాజెక్టు అమలే లక్ష్యంగా, మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటుకు రూ. 4.07 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ఫ్లాట్ ఫారం ఉండనుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చించనున్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్లైన్లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవటం. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవటం. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుంది. తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహాయంతో రైతులకు పలు సూచనలు చేయనున్నారు. ఇదీ చదవండి: టీవీ-5 సాంబశివరావు బాగోతం.. మరో కేసు నమోదు -
దరఖాస్తులు 66.30 లక్షలు.. కట్టేవి 4.16 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారనుంది. ఈ పథకం కింద ప్రస్తుత సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా 4.16 లక్షల ఇళ్లను నిర్మిస్తారు. కానీ ఇళ్ల కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తులు పేరుకుపోయి ఉన్నాయి. ఏకంగా 66.30 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. భారీ కోత ఎలా? రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధి కోసం కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. రకరకాల పథకాలకు దరఖాస్తు చేసిన ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కూడా టిక్ చేశారు. ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన మొత్తం దరఖాస్తులు ఏకంగా 80 లక్షలు దాటాయి. వాటిని ప్రాథమికంగా పరిశీలించిన అధికారులు, గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందిన 14.75 లక్షల మంది కూడా మళ్లీ దరఖాస్తు చేసినట్టు గుర్తించారు. దీంతో మొదటి వడపోతలో భాగంగా ఆ దరఖాస్తులను పక్కన పెట్టేశారు. దీంతో 66.30 లక్షల దరఖాస్తులు మిగిలాయి. వాటి నుంచి లబ్ధిదారుల ఎంపిక ఎలా అన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది. మొదటి ఏడాదిలో 4.16 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సంవత్సరం ఎలాంటి ఆటంకాలు లేకుండా మంజూరు చేస్తూ వెళ్లినా, వచ్చే ఐదేళ్లలో అటుఇటుగా 20 లక్షల ఇళ్లను మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ఏమూలకూ చాలవు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులను రకరకాల అంశాల ఆధారంగా వడపోసి వీలైనంత మేర తగ్గించే కసరత్తు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని నిరుపేదలు 30 – 35 లక్షల మంది ఉంటారన్న అంచనా ఉంది. ఒకవేళ దీన్ని పరిగణనలోకి తీసుకుని తగ్గించినా.. దరఖాస్తుల్లో ఆ సంఖ్య మేరకు పోను మిగిలినవారు అంటే సుమారు 30 లక్షల మంది తప్పకుండా అనర్హులే అవుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్సీసీ కప్పు ఉంటే ఔటే.. ప్రాథమికంగా రూపొందించుకున్న నిబంధనల ప్రకారం.. ఆర్సీసీ పైకప్పు ఉన్న సొంత ఇల్లు ఉంటే ఇందిరమ్మ పథకానికి అర్హత ఉండదు. చుట్టూ కాంక్రీట్ గోడలు ఉండి, కప్పు భాగంలో రేకులు, తడకలు, పెంకులు లాంటివి ఉంటే అర్హత వస్తుంది. దీంతో ఇప్పుడు గుట్టలాగా పేరుకుపోయి ఉన్న దరఖాస్తుల్లో.. అలా ఆర్సీసీ పైకప్పుతో ఉన్న సొంతింటిదారులు ఎవరున్నారని వెతికి పట్టుకునే పనిలో అధికారులున్నారు. తెల్ల రేషన్కార్డు ఉంటేనే.. ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే కచ్చితంగా నిరుపేదలై ఉండాలి. తెల్ల రేషన్కార్డు ఉన్నవారినే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. దీంతో ఈ దరఖాస్తుదారుల్లో ఎంతమందికి తెల్ల రేషన్ కార్డు ఉందో, ఎంతమంది తప్పుడు రేషన్కార్డు నంబర్లు నమోదు చేశారో అన్న వివరాలను కూడా వాకబు చేస్తున్నారు. ఈ సంవత్సరం సొంత జాగా ఉన్నవారికే! సొంత జాగా ఉన్నవారికే ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. సొంత జాగా లేని అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం స్థలం కేటాయించి మరీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా మొదటి సంవత్సరం మాత్రం సొంత జాగా లేని వారిని పరిగణనలోకి తీసుకోకూడదని నిర్ణయించినట్లు సమాచారం.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు
భారత టాప్ రెజ్లర్పై సస్పెన్షన్ వేటు
గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి: సీఎం జగన్
కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
మోదీ, రాహుల్ గాంధీలకు ‘బహిరంగ చర్చ’ ఆహ్వానం
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement