-
రోజుకు 4,591 ఈవీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) పరుగు జోరుగా సాగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రతిరోజూ 4,591 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022–23లో ఈ సంఖ్య 3,242 యూనిట్లు. మార్చి నెలలో ఏకంగా 2,08, 410 యూనిట్ల అమ్మకాలు తోడవడంతో.. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం దేశవ్యాప్తంగా 16, 75,700 యూనిట్ల ఈవీలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లా యి. 2022–23తో పోలిస్తే ఇది 41 శాతం అధికం కావడం విశేషం. దేశ ఈవీ చరిత్రలో 2024 మార్చి నెలతోపాటు 2023–24 ఆర్థిక సంవత్సరం అత్యధి క విక్రయాలను నమోదు చేసింది. ఇక భారత్లో 2023–24లో అన్ని రకాల వాహన విభాగాల్లో కలిపి 2,45,26,468 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో ఈవీల వాటా 6.78 శాతానికి చేరడం విశేషం. విభాగాల వారీగా ఇలా.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో గత ఆర్థిక సంవత్సరంలో భారత్లో 9,44,082 టూ వీలర్లు అమ్ముడయ్యాయి. 2022–23తో పోలిస్తే ఇది 29 శాతం అధికం. అలాగే 57 శాతం వృద్ధితో 6,32,485 యూనిట్ల త్రిచక్ర వాహనాలు విక్రయం అయ్యాయి. మొత్తం ఈవీల్లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల వాటా ఏకంగా 94 శాతం ఉంది. ఇక ప్యాసింజర్ వెహికిల్స్ 90,379 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడాదిలో ఈ–ప్యాసింజర్ కార్స్, ఎస్యూవీల సంఖ్య 89 శాతం దూసుకెళ్లడం విశేషం. ఈ–బస్లు 3,693 యూనిట్లు, హెవీ గూడ్స్ వెహికిల్స్ 240, తేలికపాటి సరుకు వాహనాలు 4,699, ఇతర వాహనాలు 122 యూనిట్లు విక్రయం అయ్యాయి. పుంజుకున్న డిమాండ్.. దేశంలో 2014–15 నుంచి 2024 మార్చి వరకు 39,55,021 యూనిట్ల ఎలక్ట్రిక్ వెహికిల్స్ రోడ్డెక్కాయి. ఇందులో 72 శాతం అంటే 29,59,218 యూనిట్లు గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో తోడయ్యాయంటే ఈవీల విభాగం ఏ స్థాయిలో వేగం పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు. 2013–14లో మొత్తం 2,627 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. ఈ–కామర్స్ పరిశ్రమ, సరుకు రవాణా కంపెనీల నుండి ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్ వెహికిల్స్ కోసం, అలాగే టాక్సీ ఫ్లీట్ ఆపరేటర్ల నుండి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల కోసం వేగంగా డి మాండ్ వస్తోంది. 2030 నాటికి ఈవీల వా టా వాణిజ్య వాహనాల్లో 70 శాతం, ప్యాసింజర్ వెహికిల్స్లో 30, బస్లలో 40, ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగంలో 80 శాతానికి చేర్చాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. -
ఎలక్ట్రిక్ టూ వీలర్ ఆఫ్ ది ఇయర్.. జాబితాలో నాలుగు - అవార్డు దేనికో?
ప్రతిష్టాత్మక 2023 ఆటో అవార్డ్స్ మూడవ సీజన్ విజేతలను ఈ రోజు సెంట్రల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ 'జితేంద్ర సింగ్' సమక్షంలో ప్రకటిస్తారు. ఇందులో అనేక విభాగాల్లో వాహనాలు ప్రదర్శనకు సిద్దమవుతాయి. ఈ రోజు ఏ విభాగంలో ఏ వాహనం విజేతగా నిలుస్తుందో అధికారికంగా తెలుస్తుంది. ఫేస్లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్, డిజైన్ ఆఫ్ ది ఇయర్, ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్, లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్.. ఇలా అనేక విభాగాల్లో వాహనాలు ప్రదర్శనకు వస్తాయి. ఇప్పటికే కొన్ని వాహనాలు నామినేషన్కు సిద్ధమయ్యాయి. తుది ఫలితాలు, విజేతలు త్వరలో తెలుస్తాయి. ఇదీ చదవండి: విలీనానికి మరో రెండు బ్యాంకులు - డేట్ ఫిక్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్ ఆఫ్ ది ఇయర్ (Electric Two-Wheeler of the Year) అవార్డు నామినేషన్ జాబితాలో 'అల్ట్రా వయొలెట్ ఎఫ్ 77, ఏథర్ 450 ఎక్స్ జెన్3 (మూడవ తరం ఏథర్ 450 ఎక్స్), హీరో విడా వి1, టార్క్ క్రటోస్ ఆర్' ఉన్నాయి. ఇందులో టైటిల్ విన్నర్ ఎవరనేది ఈ రోజే తెలిసిపోతుంది. -
పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి!
విజయదశమి, దీపావళి సందర్భంగా చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కంపెనీలు కూడా ఎక్కువ వాహనాలను విక్రయించడానికి అద్భుతమైన ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందిస్తాయి. ఈ పండుగ సీజన్లో టూ వీలర్ కొనాలనుకునే వారు ఏ కంపెనీ ఎంత ఆఫర్ ఇస్తుందనే సమాచారం ఇక్కడ చూడవచ్చు. హీరో మోటోకార్ప్ భారతదేశంలోని అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన 'హీరో స్ల్పెండర్ ప్లస్' బైక్ కొనుగోలు మీద 'బై నౌ పే ఇన్ 2024' అనే ఓ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. అంటే ఈ బైకుని ఈ ఏడాది కొంటే వచ్చే ఏడాది నుంచి ఈఎమ్ఐ మొదలవుతుంది. హార్లే డేవిడ్సన్ ప్రముఖ లగ్జరీ బైక్స్ తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ ఎంపిక చేసిన కొన్ని బైకుల మీద రూ.5.30 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో పాన్ అమెరికా 1250 స్పెషల్ అడ్వెంచర్ టూరర్, స్పోర్ట్స్టర్ ఎస్, నైట్స్టర్ బైకులు ఉన్నాయి. కంపెనీ 2023 మోడల్స్కి మాత్రమే కాకుండా 2022 మోడల్స్కి కూడా ఈ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఆంపియర్ ఎలక్రిక్ ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఆంపియర్ కంపెనీ గో ఎలక్ట్రిక్ ఫెస్ట్ పేరుతో మంచి ఆఫర్స్ అందిస్తోంది. మాగ్నస్ ఈఎక్స్ మీద రూ.10 వేలు, ప్రైమస్ మీద రూ.14 వేలు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అవకాశం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: పీఎఫ్ పేరుతో మోసం - కోట్ల రూపాయలు కోల్పోయిన వృద్ధ జంట బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద బజాజ్ ఇప్పుడు రూ. 15,000 డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి రూ. 1.30 లక్షల స్కూటర్ ఇప్పుడు రూ. 1.15 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం కర్ణాటక, తమిళనాడుకు మాత్రమే పరిమితం చేశారు. -
AP: కార్ల అమ్మకాలు రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఆటోల విక్రయాల్లోనూ వృద్ధి నెలకొంది. తద్వారా గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు పోల్చి చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయంలో 8.40 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు చూస్తే జాతీయ సగటును మించి రాష్ట్రంలో వృద్ధి చోటు చేసుకుంది. అలాగే ఇదే కాలానికి జాతీయ సగటును మించి రాష్ట్రంలో కార్ల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. ఇక ఆటోల అమ్మకాల్లో ఏకంగా 795.28 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు రవాణా ఆదాయం రూ.1,448.35 కోట్లు రాగా ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.1,570.07 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక దేశవ్యాప్తంగా గూడ్స్ వాహనాల అమ్మకాలు పడిపోగా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చదవండి: కాకినాడకు ‘నానొ’చ్చేస్తున్నా! ఇతర రాష్ట్రాల్లో విధానాలపై అధ్యయనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రవాణా రంగం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో బాగుంటే వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. వాహనాల పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషిస్తున్నాం. కొనుగోలుదారులను ప్రోత్సహించేలా సంస్కరణలపై దృష్టి సారించాం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల కొనుగోళ్లు పెరిగాయి. రవాణా ఆదాయంలోనూ వృద్ధి నమోదవుతోంది. – ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ ఎందుకు పెరిగాయి? కార్లు, ద్వి చక్ర వాహనాల అమ్మకాలు పెరిగాయంటే అర్థమేంటీ..? రాష్ట్రంలో అభివృద్ది వేగంగా జరుగుతోందని అర్ధం. అంతేకాదు.. జనాల చేతుల్లో డబ్బులున్నాయని అర్ధం. సంపదను ప్రభుత్వం ప్రజలకు పంచుతుందని అర్ధం. -
బ్యాటరీ బండి దూకుడు
సాక్షి, హైదరాబాద్: బ్యాటరీ బండి పరుగులు పెడుతోంది. పర్యావరణ హితమైన వాహనాల పట్ల నగర వాసులు క్రమంగా ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో చాలా మంది ఇంధన భారాన్ని తగ్గించుకొనేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. వాటిలో రవాణా వాహనాల కంటే ద్విచక్ర వాహనాలు పెద్ద సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. గతేడాది 23 వేలకు పైగా ద్విచక్ర వాహనాలు రోడ్డెక్కాయి. ఈ సంవత్సరం మే చివరి నాటికి 12 వేలకు పైగా కొనుగోళ్లు నమోదయ్యాయి. ఈ లెక్కన ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 25 వేలు దాటవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మొదటి లక్ష వాహనాలకు జీవితకాల పన్ను నుంచి రాయితీ కల్పించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కేటగిరీకి చెందిన సుమారు 47 వేలకు పైగా కార్లు, బైక్లపైన ఇప్పటి వరకు రూ.220 కోట్ల వరకు రాయితీని అందజేశారు. మరో 53 వేల వాహనాలకు ఈ రాయితీ సదుపాయం వర్తించనుంది. రానున్న రెండేళ్ల వరకు ఈ అవకాశం ఉండవచ్చునని రవాణా అధికారులు అంచనా వేస్తున్నారు. ద్విచక్ర వాహనాలే టాప్.... మొదట్లో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల పట్ల విముఖత చూపారు. నాణ్యత లేని బ్యాటరీల వల్ల ప్రమాదాలు జరిగాయి. షార్ట్సర్క్యూట్ కారణంగా సికింద్రాబాద్లో జరిగిన అగ్నిప్రమాదం ఉదంతంతో చాలా మంది వెనుకడుగు వేశారు. దీంతో వాహన తయారీ సంస్థలు బ్యాటరీల నాణ్యతపైన ప్రధానంగా దృష్టి సారించాయి. ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనరంగంలోకి ప్రవేశించడంతో సమర్థవంతమైన బ్యాటరీలు కలిగిన బండ్లు మార్కెట్లోకి వచ్చాయి. దీంతో వాహనదారుల్లో వాటిపైన నమ్మకం కలిగింది. ఫలితంగా వీటి కొనుగోళ్లు పెరిగాయి. 2021 నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల వాహనాలు కలిపి సుమారు 50 వేలకు పైగా నమోదు కాగా, గతేడాది అనూహ్యంగా 27 వేలకు పైగా రోడ్డెక్కాయి. వీటిలో 23 వేలకుపైగా ద్విచక్ర వాహనాలే కావడం గమనార్హం. భారీగా వెయిటింగ్ లిస్టు... ప్రస్తుతం డిమాండ్ మేరకు వాహనాలు లభించడం లేదు. కొన్ని బ్రాండ్లకు చెందిన వాహనాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకొని కనీసం 3 నెలల పాటు ఎదురు చూడవలసి వస్తోంది. పెట్రోల్ వాహనాల కంటే ధర కొద్దిగా ఎక్కువే అయినా ఇంధన భారాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఒకసారి చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు మాత్రమే బండి నడిచేది. ఇప్పుడు వంద కిలోమీటర్ల వరకు పరుగులు పెట్టే వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. నిస్సందేహంగా కొనొచ్చు ఎలక్ట్రిక్ వాహనాల నాణ్యత చాలా బాగుంది. ఎలాంటి సందేహం లేకుండా వాహనాలు కొనుగోలు చేయవచ్చు. నాణ్యమైన బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్న వాహనాలే ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో భద్రతా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. – సంధ్య గద్దె, ఎలక్ట్రిక్ వాహన డీలర్, లింగంపల్లి పెట్రో ‘బాదుడు’ నుంచి ఊరట పెట్రోల్ ధరల దృష్ట్యా బండి బయటకు తీయాలంటేనే వెనుకడు గు వేయాల్సి వస్తోంది. బ్యాటరీ బండితో చాలా వరకు ఈ భారం తగ్గుతుంది. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ చార్జింగ్ అయ్యే వాహనాలు వస్తే బాగుంటుంది. – కోల రవికుమార్ గౌడ్ ధరలు కాస్త ఎక్కువే లైఫ్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిచ్చి నప్పటికీ ధరలు ఎక్కువగా నే ఉన్నాయి. మధ్యతరగ తి వర్గాలకు భారంగానే ఉంది. పెట్రోల్, డీజిల్ భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాల వైపు వస్తున్నా రు. కానీ ధరలు చూడగానే వెనుకడుగు వేయాల్సి వస్తోంది. – సుధాకర్రెడ్డి -
ఈ–టూవీలర్ల విస్తరణపై మరింత దృష్టి
న్యూఢిల్లీ: వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ ఎలక్ట్రిక్ టూవీలర్ల పోర్ట్ఫోలియోను మరింత విస్తరించడంపై దృష్టి పెట్టనుంది. అలాగే, తమ ప్రస్తుత సేల్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోనుంది. కొత్త సీఈవోగా నియమితులైన నిరంజన్ గుప్తా కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను ఈ మేరకు వివరించారు. ప్రీమియం సెగ్మెంట్లో (160–450 సీసీ) స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో అగ్ర స్థానాన్ని దక్కించుకోవడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో కొత్త ప్రీమియం వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు గుప్తా వివరించారు. మరింత మంది కస్టమర్లకు చేరువయ్యే దిశగా ఈ–టూవీలర్ల కేటగిరీలో కొత్తగా ఎంట్రీ–లెవెల్ మోడల్స్ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. నియంత్రణపరమైన మార్పులతో (ఫేమ్ స్కీము కింద సబ్సిడీలను తగ్గించడంలాంటివి) ఈవీ స్టార్టప్ విభాగంలో కన్సాలిడేషన్కు అవకాశం ఉందని గుప్తా చెప్పారు. అటు 1,000 ప్రధాన డీలర్షిప్లలో 35–40 శాతం డీలర్షిప్లను దశలవారీగా అప్గ్రేడ్ చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా మెక్సికో, నైజీరియా, బంగ్లాదేశ్, కొలంబియా వంటి 8–10 మార్కెట్లలో వ్యాపారాన్ని పటిష్టం చేసుకునేందుకు కసరత్తు చేయనున్నట్లు గుప్తా చెప్పారు. -
ప్యాసింజర్ వాహనాలు పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2023 ఏప్రిల్లో కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 3,31,278 యూనిట్లు నమోదైంది. 2022 ఏప్రిల్తో పోలిస్తే ఇది 13 శాతం పెరుగుదల అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ‘మారుతీ సుజుకీ ఇండియా గత నెలలో 1,37,320 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 1,21,995 యూనిట్లు నమోదైంది. హ్యుండై మోటార్ ఇండియా హోల్సేల్ విక్రయాలు 44,001 నుంచి 49,701 యూనిట్లకు చేరాయి. అలాగే ఈ ఏడాది ఏప్రిల్లో డీలర్లకు 13,38,588 యూనిట్ల ద్విచక్ర వాహనాలు సరఫరా అయ్యాయి. 2022 ఏప్రిల్లో ఈ సంఖ్య 11,62,582 యూనిట్లు. మోటార్సైకిళ్లు 7,35,360 నుంచి 8,39,274 యూనిట్లు, స్కూటర్లు 3,88,442 నుంచి 4,64,389 యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహనాలు రెండింతలై కోవిడ్ ముందస్తు స్థాయికి చేరువలో 42,885 యూనిట్లకు ఎగశాయి. ‘ఏప్రిల్ 2022తో పోలిస్తే అన్ని వాహన విభాగాలు గత నెలలో వృద్ధిని నమోదు చేశాయి. 2023 ఏప్రిల్ 1 నుండి పరిశ్రమ బీఎస్–6 ఫేజ్–2 ఉద్గార నిబంధనలకు చాలా సాఫీగా మారిందని ఇది స్పష్టంగా సూచిస్తోంది. పరిశ్రమ క్రమంగా రుతుపవనాల సీజన్లోకి ప్రవేశిస్తున్నందున మంచి వర్షపాతం కూడా ఈ రంగం వృద్ధిని కొనసాగించడంలో సహాయపడుతుంది’ అని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. -
ఈ వెహికల్స్ కొంటే డ్రైవింగ్ లైసెన్స్తో పనే లేదు - మరెందుకు ఆలస్యం..
భారతదేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డీజిల్, పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ అన్ని విభాగాల్లోనూ కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే ప్రజా రహదారులలో డ్రైవ్/రైడ్ చేయడానికి తప్పకుండా లైసెన్స్ అవసరం. కానీ మన దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అవాన్ ఇ ప్లస్ (Avon E Plus) భారతదేశంలో లభించే సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'అవాన్ ఇ ప్లస్'. దీని ధర కేవలం రూ. 25,000 కావడం గమనార్హం. ఇది ఒక ఫుల్ ఛార్జ్తో గరిష్టంగా 50 కిమీ రేంజ్ అందిస్తుంది. 48v/12ah కెపాసిటీ కలిగిన ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 24 కిలోమీటర్లు మాత్రమే. ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి 6.5 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లలో ప్రధానంగా చెప్పుడోదగ్గ మోడల్ ఈ అవాన్ ఇ ప్లస్ కావడం గమనార్హం. డీటెల్ ఈజీ ప్లస్ (Detel Easy Plus) మన జాబితాలో మరో టూ వీలర్ 'డీటెల్ ఈజీ ప్లస్'. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 40,000 మాత్రమే. ఇది ఒక ఫుల్ ఛార్జ్తో గరిష్టంగా 60 కిమీ రేంజ్ అందిస్తుంది. 1.25 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ కేవలం 4 నుంచి 5 గంటల సమయంలో ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ. ఆంపియర్ రియో ఎలైట్ (Ampere Reo Elite) రూ. 44,500 ధర వద్ద లభించే ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ ఛార్జ్తో 60 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 20Ah లెడ్ యాసిడ్ బ్యాటరీ కలిగి గంటకు 25 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 8 గంటలు. హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ2 (Hero Electric Flash E2) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మన జాబితాలో డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని వెహికల్ కావడం గమనార్హం. రూ. 52,500 ఖరీదైన హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ2 స్కూటర్ వినియోగించడానికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇందులోని 51.2v/30ah బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 4 నుంచి 5 గంటలు. ఇది ఒక ఛార్జ్తో గరిష్టంగా 65 కిమీ రేంజ్ అందిస్తుంది. లోహియా ఓమా స్టార్ లి (Lohia Oma Star Li) రూ. 41,444 వద్ద లభించే ఈ 'లోహియా ఓమా స్టార్ లి' ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ రైడింగ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని వెహికల్స్ లో ఇది ఒకటి. ఇందులోని 48V/20 Ah బ్యాటరీ 60 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. ఒకినావా లైట్ (Okinawa Lite) దేశీయ విఫణిలో ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగానే ఉంది. ఇందులో భాగంగానే ఒకినావా లైట్ మంచి అమ్మకాలతో ముందుకు వెళుతోంది. ఈ స్కూటర్ ధర రూ. 67,000. ఇందులోని 1.25 కిలోవాట్ బ్యాటరీ ఇక ఫుల్ ఛార్జ్తో 60 కిమీ రేంజ్ అందిస్తుంది. ఛార్జింగ్ టైమ్ 6 నుంచి 7 గంటలు. (ఇదీ చదవండి: ఎంజి కామెట్ అన్ని ధరలు తెలిసిపోయాయ్ - ఇక్కడ చూడండి) ఓకినావా ఆర్30 (Okinawa R30) మన జాబితాలో చివరి ఎలక్ట్రిక్ బైక్ 'ఓకినావా ఆర్30'. దీని ధర రూ. 62,500. ఈ స్కూటర్ రేంజ్ 65 కిలోమీటర్లు. ఇది 4 నుంచి 5 గంటల సమయంలో 100 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ డిటాచబుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇందులో 1.25 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది, ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. (ఇదీ చదవండి: భారత్లో విడుదలైన 2023 స్కోడా కొడియాక్ - ధర & వివరాలు) నిజానికి దేశంలో వినియోగించే చాలా వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అయితే తక్కువ వేగంతో లేదా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇలాంటి స్కూటర్లు లాంగ్ రైడ్ చేయడానికి ఉపయోగపడవు, కానీ రోజు వారి ప్రయాణానికి, నగర ప్రయాణానికి చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఫేమ్-2 పెంపుపై ఈవీ పరిశ్రమల డిమాండ్ - మరో నాలుగేళ్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు భారత రోడ్లపై దూసుకెళ్తున్నాయి. సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్ఎంఈవీ) ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 8,46,976 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021–22 విక్రయాలతో పోలిస్తే ఏకంగా రెండున్నర రెట్లకుపైగా వృద్ధి నమోదు కావడం విశేషం. ఎలక్ట్రిక్ టూ వీలర్లు 2021–22లో భారత్లో 3,27,900 యూనిట్లు అమ్ముడయ్యాయి. పెట్రోల్ భారం నుంచి బయటపడేందుకు, అలాగే తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు ఉండడంతో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సబ్సిడీలతో ప్రోత్సహించడం కలిసి వచ్చే అంశం. విభాగాల వారీగా ఇలా.. గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్ల లోపు ప్రయాణించే లో స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1.2 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. గంటకు 25 కిలోమీటర్ల కంటే అధిక వేగంతో ప్రయాణించే హై స్పీడ్ ఈ–టూ వీలర్లు 7,26,976 యూనిట్లు విక్రయం అయ్యాయి. 2021–22లో లో స్పీడ్ 75,457 యూనిట్లు, హై స్పీడ్ 2,52,443 యూనిట్లు రోడ్డెక్కాయి. నీతి ఆయోగ్ లక్ష్యం, ఇతర పరిశోధన సంస్థల అంచనాల కంటే 25 శాతం తక్కువ స్థాయిలో గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. పరిశ్రమకు అడ్డంకులు.. దశలవారీ తయారీ కార్యక్రమం (పీఎంపీ) పథకం కింద మార్గదర్శకాలను పాటించనందుకు ఫేమ్–2 రాయితీలను నిలిపివేయడం ఈ–టూ వీలర్ల అమ్మకాలపై ప్రభావం చూపిందని ఎస్ఎంఈవీ తెలిపింది. ‘స్థానికీకరణలో జాప్యం సాకుతో వినియోగదారులకు ఒరిజినల్ పరికరాల తయారీదారులు (ఓఈఎం) ఇప్పటికే బదిలీ చేసిన రూ.1,200 కోట్ల కంటే ఎక్కువ సబ్సిడీని అకస్మాత్తుగా నిలిపివేయడం హాస్యాస్పదం. అలాగే తక్కువ ఇన్వాయిస్ చేశారనే ఆరోపణ కారణంగా ఖరీదైన ఈ–టూ వీలర్లను తయారు చేస్తున్న ఓఈఎంలకు చెందిన మరో రూ.400 కోట్లు నిలిచిపోయాయి. దీని పర్యవసానంగా మూలధన నిధుల కొరతతో వారి వ్యాపార కార్యకలాపాలు కుంటుపడ్డాయి. నేడు పరిశ్రమలో 95 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న 16 కంపెనీలు ప్రస్తుత గందరగోళ పరిస్థితి నుంచి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. 2023–24లో తమ వ్యాపార ప్రణాళికలు చేసుకోవడానికి వీలుగా ఫేమ్ దశలవారీ తయారీ కార్యక్రమం తాలూకా అడ్డంకులకు తొలగించాలని విన్నవిస్తున్నాయి’ అని వివరించింది. ఎండమావిలా లక్ష్యం.. ద్విచక్ర వాహన రంగంలో 2022–23లో ఈ–టూ వీలర్ల వాటా 5% మాత్రమే. స్వల్పకాలిక లక్ష్యం 30 శాతం. 2030 నాటికి ఇది 80 శాతానికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించుకుంది. ఈ లక్ష్యం మరింత ఎండమావిలా కనిపిస్తోందని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ వ్యాఖ్యానించారు. ‘పరిశ్రమ అన్నీ కోల్పోలేదు. ఈ రంగాన్ని తిరిగి గా డిలో ఉంచగలిగేది దశలవారీ తయారీ కార్యక్రమం (పీఎంపీ) అర్హత ప్రమాణాలను రెండేళ్లు పొడిగించడం. అలాగే దీనిని ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఖచ్చితంగా అమలు చేయడం. ఫేమ్ పథకం కొనసాగింపుపై ప్రభుత్వ నిర్ణయం మొత్తం పరిశ్రమ విధిని నిర్ణయించే కీలకాంశం. ఈ విషయంలో ప్రభు త్వం నుంచి స్పష్టత కోసం పరిశ్రమ ఆసక్తిగా ఎదు రుచూస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహించడానికి, స్వయం–సమర్థ వంతంగా చేయడానికి కనీసం 3–4 ఏళ్ల పాటు ఫేమ్ పథకాన్ని పొడిగించడం చాలా ముఖ్యం’ అని తెలిపారు. కస్టమర్లకే నేరుగా సబ్సిడీ.. ప్రస్తుతం నెలకొన్న గందరగోళం వల్ల దీర్ఘకాలిక వ్యూహాన్ని అభివృద్ధి చేయడం కంపెనీలకు కష్టతరం అవుతోందని గిల్ వివరించారు. ‘సబ్సిడీలలో ఏదైనా ఆకస్మిక తగ్గింపు వృద్ధిపై గణనీయ ప్రభావాన్ని చూపుతుంది. ఈ–మొబిలిటీ కోసం ప్రభుత్వ ప్రణాళికను ప్రమాదంలో పడేస్తుంది. ప్రస్తుత విధానంలో తయారీదార్లు సబ్సిడీని కస్టమర్కు బదిలీ చేస్తారు. విక్రయం తర్వాత ప్రభుత్వం నుండి క్లెయిమ్ చేసుకుంటారు. ఇది మోసపూరితంగా సబ్సిడీని క్లెయిమ్ చేయడానికి ఓఈఎంలు అమ్మకాలను మార్చడానికి దారితీయవచ్చు. ప్రభుత్వం నేరుగా కస్టమర్కు ప్రోత్సాహకాలను చెల్లించడానికి ప్రత్యక్ష సబ్సిడీ విధానాన్ని ప్రవేశపెట్టాలి’ అని వివరించారు. -
2,21,50,222 వాహనాలు రోడ్డెక్కాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో రిటైల్లో అన్ని విభాగాల్లో కలిపి వాహన విక్రయాలు 2,21,50,222 యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 21 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ద్విచక్ర వాహనాలు 19 శాతం వృద్ధితో 1,59,95,968 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. అయితే పరిమాణం పరంగా ఈ విభాగం ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. వాణిజ్య వాహనాలు 33 శాతం, త్రిచక్ర వాహనాలు 84 శాతం దూసుకెళ్లాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 8 శాతం ఎగశాయి. అత్యధిక స్థాయిలో.. ప్యాసింజర్ వాహనాలు రికార్డు స్థాయిలో 23 శాతం అధికమై 36,20,039 యూనిట్లు రోడ్డెక్కడం విశేషం. 2021–22లో 29,42,273 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్యాసింజర్ వాహన రంగంలో ఇప్పటి వరకు దేశంలో 2018–19లో నమోదైన 32 లక్షల యూనిట్లే అత్యధికం. సెమీకండక్టర్ లభ్యత కాస్త మెరుగు పడడంతో అనేక కొత్త మోడళ్లు రంగ ప్రవేశం చేయడం, వాహనాల లభ్యత కారణంగా ఈ విభాగం ప్రయోజనం పొందింది. హై–ఎండ్ వేరియంట్లకు డిమాండ్ ఉండడం అమ్మకాలను కొనసాగించడంలో సహాయపడింది. అయితే ఎంట్రీ లెవెల్ విభాగంలోని కస్టమర్లు ఇప్పటికీ అధిక ద్రవ్యోల్బణంతో ప్రభావితం అవుతున్నందున ఈ సెగ్మెంట్ ఒత్తిడిలో ఉందని ఫెడరేషన్ తెలిపింది. వృద్ధి సింగిల్ డిజిట్లో.. ఇప్పుడు అధిక–వృద్ధి కాలం గడిచినందున అధిక బేస్, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సాధారణ ధరల పెంపుదల, ప్రభుత్వ నియంత్రణ పరంగా మార్పుల కారణంగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాహన పరిశ్రమ 9 శాతం లోపే వృద్ధిరేటును చూసే అవకాశం ఉందని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. ఈ ఏడాది కన్సాలిడేషన్కు అవకాశం ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంపై కోవిడ్–19 మహమ్మారి 2020–21, 2021–22లో తీవ్ర ప్రభావం చూపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి ప్రభావం లేదు. -
టూ వీలర్లు సేల్స్ ఢమాల్!
జిల్లాలో వాహనాల అమ్మకాలు ఏడాదికేడాది తగ్గుతున్నాయి. ముఖ్యంగా బైక్ల అమ్మకాలు పడిపోతున్నట్టు తెలుస్తోంది. మూడేళ్ల రికార్డులను పరిశీలిస్తే ఏటా రెండు వేల పైచిలుకు వాహనాల అమ్మకాలు తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. బైక్ల అమ్మకాలు గణనీయంగా తగ్గగా.. ఆటోలు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతుండడం గమనార్హం. కార్ల అమ్మకాలు పరవాలేదన్నట్లుగా ఉండగా.. వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లు, ట్రాలీల అమ్మకాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. సాక్షి, కామారెడ్డి: వాహనాల రిటైల్ అమ్మకాలను రిజిస్ట్రేషన్ల ప్రాతిపదికగా లెక్కిస్తారు. జిల్లాలో టూ వీలర్లు, ప్రయాణికుల వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు రెండేళ్లుగా తగ్గుతూ వస్తున్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 18,352 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2021–22 లో 15,722 వాహనాలు, 2022–23 లో 13,312 వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అంటే ఏటా 2 వేల పైచిలుకు అమ్మకాలు తగ్గుతున్నాయి. ధరల పెరుగుదల ప్రభావం.. గతంలో బైక్ల అమ్మకాలు ఎక్కువగా ఉండేవి. వీటి ధరలు ఇటీవలి సంవత్సరాలలో గణనీయంగా పెరిగాయి. దీని ప్రభావం వాహనాల కొనుగోళ్లపై పడినట్లు తెలుస్తోంది. జిల్లాలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో 14,318 వాహనాల రిజిస్ట్రేషన్లు జరగ్గా.. 2021–22 లో 12,290 కు తగ్గిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 9,539 వాహనాల రిజిస్ట్రేషన్లే జరగడం గమనార్హం. ధరలు పెరగడంతో చాలామంది కొత్త బైక్లను కొనుగోలు చేయకుండా.. సెకండ్ హ్యాండ్ బైక్లవైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో బైక్ల అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది. కార్ల అమ్మకాలు.. కోవిడ్ తర్వాత చాలామంది కార్ల కొనుగోళ్లపై ఆసక్తి చూపారు. దీంతో కార్ల అమ్మకాలలో కొంత వృద్ధి కనిపించింది. 2020 –21 ఆర్థిక సంవత్సరంలో 1,110 కార్ల రిజిస్ట్రేషన్ జరగ్గా.. 2021–22 లో 1,396 కి పెరిగింది. ఈసారి ఇప్పటివరకు 1,333 కార్ల రిజిస్ట్రేషన్లు రికార్డయ్యాయి. కొందరు కొత్త కార్ల వైపు మొగ్గు చూపుతుండగా.. చాలామంది సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేస్తున్నారు. ఆటో రిక్షాల అమ్మకాలలో వృద్ధి కరోనా మూలంగా ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో చాలామంది ప్రత్యామ్నాయంగా ఆటో రిక్షాలు, ట్రాలీ ఆటోలు కొనుగోలు చేస్తున్నారు. 2020–21 లో 358(141 ఆటో రిక్షాలు, 217 గూడ్స్ క్యారేజీలు), 2021–22 లో 347(107 ఆటోరిక్షాలు, 240 గూడ్స్ క్యారేజీలు), 2022–23 లో 651(245 ఆటో రిక్షాలు, 406 గూడ్స్ క్యారేజీ)ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. టూ వీలర్.. ట్రాక్టర్లు, ట్రాలీలు.. జిల్లాలో వ్యవసాయ అవసరాల కోసం 2020–21 ఆర్థిక సంవత్సరంలో 794 ట్రాక్టర్లు, 435 ట్రాలీలు, 2021–22లో 537 ట్రాక్టర్లు, 257 ట్రాలీలు, 2022–23లో 452 ట్రాక్టర్లు, 136 ట్రాలీలు కొను గోలు చేశారు. కమర్షియల్ అవసరాల కోసం 2020–21లో 672 ట్రాక్టర్లు, 367 ట్రాలీలు, 2021–22లో 457 ట్రాక్టర్లు, 273 ట్రాలీలు, 2022–23 లో 547 ట్రాక్టర్లు, 180 ట్రాలీలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. -
2023 ఫిబ్రవరిలో టూవీలర్ సేల్స్: టీవీఎస్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ వరకు
ఫిబ్రవరి 2023 ముగియడంతో దాదాపు అన్ని కంపెనీలు తమ అమ్మకాల గణాంకాలను వెల్లడించాయి. గత నెలలో దేశీయ మార్కెట్లో వాహనాల అమ్మకాలు కొంత పురోగతి చెందినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. మంచి అమ్మకాలు పొందిన టాప్ 5 టూవీలర్ బ్రాండ్స్ లో హీరో మోటోకార్ప్ మొదటి స్థానంలో చేరింది. గత నెలలో హీరో మోటోకార్ప్ మొత్తం 382317 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే 15.34 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇదే నెల గతేడాది కంపెనీ అమ్మకాలు 3,31,462 యూనిట్లు. ఎగుమతుల విషయంలో మాత్రం -54.68 శాతం తగ్గుదలను నమోదు చేసింది. కంపెనీ మొత్తం అమ్మకాలు 3,94,460 యూనిట్లు (ఎగుమతులు + దేశీయ అమ్మకాలు). హోండా మోటార్సైకిల్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. కంపెనీ దేశీయ అమ్మకాలు 2,27,064 యూనిట్లు కాగా, ఎగుమతులు 20,111 యూనిట్లు. 2023 ఫిబ్రవరిలో మొత్తం అమ్మకాలు 2,47,175 యూనిట్లు. దేశీయ అమ్మకాల్లో కంపెనీ -20.25 శాతం, ఎగుమతుల్లో -25.36 శాతం, మొత్తం అమ్మకాల పరంగా -20.93 శాతం తగ్గుదలను నమోదు చేసింది. టీవీఎస్ మోటార్ విషయానికి వస్తే 2023 ఫిబ్రవరిలో 2,21,402 యూనిట్లను దేశీయ మార్కెట్లో 27.83 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతుల పరంగా 45,624 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే -51.68 శాతం తగ్గుదలను నమోదు చేసింది. మొత్తం అమ్మకాల పరంగా -0.22 శాతం తగ్గుదలతో 2,67,026 యూనిట్ల వద్ద ఆగిపోయింది. 2023 ఫిబ్రవరిలో బజాజ్ ఆటో మొత్తం అమ్మకాలు దేశీయ అమ్మకాలు + ఎగుమతులు 2,35,356 యూనిట్లతో 2022 ఫిబ్రవరి కంటే -15.74 శాతం అతగ్గుదలను నమోదు చేసింది. ఎగుమతులు 1,15,021 యూనిట్లు కాగా, దేశీయ అమ్మకాలు 1,20,335 యూనిట్ల వద్ద ఉన్నాయి. దేశీయ అమ్మకాల్లో కంపెనీ పురోగతిని కనపరిచినప్పటికీ, ఎగుమతుల్లో -37.08 శాతం తగ్గుదలను నమోదు చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాల విషయానికి వస్తే, మొత్తం అమ్మకాలు 71,544 యూనిట్లు (ఎగుమతులు + దేశీయ అమ్మకాలు) కాగా, కేవలం దేశీయ అమ్మకాలు 64,436 యూనిట్లు, ఎగుమతులు 7,108 యూనిట్లు. కంపెనీ ఎగుమతుల్లో 1.18 శాతం వృద్ధిని, దేశీయ అమ్మకాల్లో 23.59 శాతం వృద్ధిని కనపరిచింది. -
20 లక్షల వాహనాలు తుక్కు లోకి!
భువనేశ్వర్: రోడ్లపై రవాణాకు పట్టు కోల్పోయి, 15 ఏళ్లు పైబడిన 20 లక్షలకు పైగా వాహనాలను రద్దు చేయనున్నారు. రాష్ట్ర వాణిజ్య, రవాణాశాఖ మంత్రి టుకుని సాహు అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ పాలసీ–2022 ప్రకారం, వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి 20 లక్షలకు పైగా వాహనాలను దశల వారీగా రోడ్ల నుంచి తొలగిస్తామన్నారు. 15 ఏళ్లకు పైగా రవాణాలో ఉపయోగిస్తూ.. పట్టు కోల్పోయిన 20,39,500 వాహనాలను గుర్తించామన్నారు. రద్దు చేయనున్న వాహనాల్లో 12,99,351 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని తెలిపారు. దీనికి సంబంధించి స్క్రాపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. డొక్కు వాహనాలు రద్దు చేయడంతో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం స్క్రాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. పాలసీ మార్గదర్శకాల ప్రకారం పాత వాహనాల యజమానులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రోత్సాహకాలు కూడా పొందుతారని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. చదవండి వైద్యుల నిర్లక్ష్యం.. ఆస్పత్రి ఎదుటే ప్రసవమైన మహిళ! -
ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలకు స్పీడ్ బ్రేకర్లు! ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: అమ్మకాల్లో శరవేగంగా దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమకు స్పీడ్ బ్రేకర్లు ఎదురుపడ్డాయి. పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్’ పథకం కింద ఒక్కో వాహనంపై పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తోంది. స్థానికంగా విడిభాగాలను సమీకరించుకుని తయారు చేసే వాహనాలకే ఈ సబ్సిడీ ప్రయోజనాన్ని పరిమితం చేసింది. విడిభాగాలు స్థానికంగా సమకూర్చుకోకుండానే, చైనాలో తయారైన వాటిని ఇక్కడివిగా చూపించి కొన్ని కంపెనీలు, నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీలను దుర్వినియోగం చేస్తున్నట్టు కేంద్రం గుర్తించింది. దీంతో కొన్ని కంపెనీలకు సబ్సిడీల మంజూరును నిలిపివేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించాలన్న లక్ష్యాన్ని తాజా పరిణామాల నేపథ్యంలో చేరుకోలేకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం సుమారు రూ.1,100 కోట్ల సబ్సిడీని నిలిపివేసినట్టు తెలిపాయి. ‘‘తాజా పరిణామం కొన్ని కంపెనీలకు ఇబ్బందికరంగా మారింది. మూలధన నిధులకు సైతం కొరత ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే విక్రయించిన వాహనాలపై సబ్సిడీని కస్టమర్లకు అందించాయి. ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ కోసం అవి ఎదురు చూస్తున్నాయి’’ అని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. 25 శాతం తక్కువ అమ్మకాలు.. ‘‘ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) 7,20,000-7,50,000 మించకపోవచ్చు. నీతి ఆయోగ్, ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల సంఘం (ఎస్ఎంఈవీ) అంచనా వేసినట్టు మిలియన్ వాహనాల మార్క్ కంటే ఇది 25 శాతం తక్కువ’’అని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. హీరో ఎలక్ట్రిక్ సీఈవోగానూ గిల్ పనిచేస్తున్నారు. ఫేమ్ నిబంధనలను ఉల్లంఘించినట్టు వచ్చిన ఆరోపణలను ఎస్ఎంఈవీ ఖండించింది. ఫేమ్ సబ్సిడీకి అర్హత సాధించేందుకు కృత్రిమంగా వాహనాల ధరలను తక్కువగా నిర్ణయించినట్టు అనుమానాలతో మరో నాలుగు కంపెనీల వ్యవహారాలను సైతం కేంద్ర సర్కారు పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్పై సమాచారాన్ని పరిశీలిస్తే ఎలక్ట్రిక్ టూ వీలర్ల రిజిస్ట్రేషన్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి 6 లక్షల మార్క్ను చేరుకున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో మరో 1.5 లక్షల విక్రయాలు నమోదు కావచ్చన్నది సోహిందర్ గిల్ అంచనా. 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 2,31,000 యూనిట్లుగానే ఉండడం గమనార్హం. ప్రధాన బ్రాండ్ల జోరు ప్రముఖ బ్రాండ్లు అయిన టీవీఎస్ మోటార్, ఏథెర్, ఓలా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు మంచి వృద్ధిని చూస్తున్నాయి. హీరో ఎలక్ట్రిక్, ఒకినవా, యాంపియర్ తదితర కొన్ని కంపెనీలు సబ్సిడీ దుర్వినియోగం ఆరోపణలతో దర్యాప్తును ఎదుర్కొంటున్నాయి. టీవీఎస్ మోటార్, ఏథెర్, ఓలా, హీరో విదా సంస్థలు ఉత్పత్తుల ధరలను తప్పుదోవ పట్టించే విధంగా నిర్ణయించాయనే ఆరోపణలు చవిచూస్తున్నా యి. మరోవైపు కస్టమర్ల నుంచి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంచి ఆదరణ కొనసాగుతోంది. డిమాండ్ను అందుకునేందుకు కొన్ని కంపెనీలు తయారీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు రెవ్ఫిన్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు సమీర్ అగర్వాల్ తెలిపారు. నూతన బ్యాటరీ ప్రమాణాలతో ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ టూవీలర్ల విక్రయ ధరలు పెరగొచ్చని ప్రరిశ్రమ చెబుతోంది. ధరల పెరుగుదల అమ్మకాల వృద్ధికి అవరోధం కాబోదని, డిమాండ్ గణనీయంగా ఉందని అంటోంది. సబ్సిడీలతోనే వృద్ధి.. దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ల విక్రయాలు శరవేగంగా వృద్ధిని చూడడం వెనుక ప్రధాన మద్దతు ఫేమ్ సబ్సిడీలేనని పరిశ్రమ అంటోంది. ఒక కిలోవాట్ సామర్థ్యానికి కేంద్ర సర్కారు రూ.15,000 సబ్సిడీగా అందిస్తోంది. మొత్తం వాహన వ్యయంలో ఇలా ఇచ్చే సబ్సిడీ గరిష్ట పరిమితి 40 శాతంగా ఉంది. దీంతో ఒక వాహనంపై రూ.30–60వేల స్థాయిలో సబ్సిడీ లభిస్తోంది. సబ్సిడీ అంశాన్ని త్వరగా పరిష్కరించకపోతే, సంప్రదాయ కర్బన ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యాన్ని కేంద్రం కొన్ని సంవత్సరాల పాటు వాయిదా వేసుకోవాల్సి వస్తుందని గిల్ అభిప్రాయపడ్డారు. -
తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత ఎనిమిదిన్నరేళ్లలో రాష్ట్రంలో వాహనాలు రెట్టింపును మించి పెరిగాయి. సరిగ్గా ఆరేళ్ల క్రితం రాష్ట్రంలో వాహనాల సంఖ్య కోటి మార్కును దాటగా, ఇప్పుడది కోటిన్నరను దాటిపోయింది. రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్లో తెలంగాణ ప్రాంతంలో మొత్తం వాహనాలు 71,54,667 మాత్రమే కావడం గమనార్హం. కాగా ఈ ఎనిమిదిన్నరేళ్లలో ఏకంగా 81,50,483 పెరిగాయి. ప్రతి నెలా సగటున 80 వేల కొత్త వాహనాలు రోడ్డెక్కాయి. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే మరో ఐదేళ్లలో రెండు కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోటాపోటీగా ద్విచక్రవాహనాలు, కార్లు గతంలో ఇంటింటికీ ఓ సైకిల్ ఉండగా, ఇప్పుడా స్థానాన్ని ద్విచక్రవాహనాలు ఆక్రమించాయి. కొందరికి రెండు కూడా ఉంటున్నాయి. కార్ల కొనుగోళ్లు కూడా పోటీ పడుతున్నట్టుగా పెరుగుతున్నాయి. రా ష్ట్రంలో ప్రస్తుతం 84 లక్షల గృహాలుండగా, ఈ నెల 23 వరకు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ద్విచక్ర వాహనాల సంఖ్య 1,12,90,406కు చేరు కుంది. 2014 జూన్లో తెలంగాణలో 8,84,870 కార్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 19,84,059 కు చేరింది. కోవిడ్ సమయంలో సెకండ్ హ్యాండ్ వాహనాల క్రయవిక్రయాలు విపరీతంగా సాగగా, కొత్త వాహనాల అమ్మకాలు కాస్త తగ్గాయి. అయితే గతేడాది కొత్త వాహనాల విక్రయం బాగా పెరగటంతో వాహనాల సంఖ్యలో పెరుగుదల ఊ పందుకుంది. ఏడాదిలో 5.61 లక్షల ద్విచక్ర వా హనాలు, 1.52 లక్షల కార్లు కొత్తగా వచ్చి చేరాయి. క్యాబ్ సంస్కృతి పెరుగుదలతో.. రాష్ట్రంలో క్యాబ్ల వాడకం గణనీయంగా పెరిగింది. గతంలో ఆటోలు తప్ప క్యాబ్లు నామమాత్రంగానే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది. 2014 నాటికి రాష్ట్రంలో కేవలం 49 వేలు మాత్రమే ఉండగా, ఇప్పుడు 1.18 లక్షలకు చేరుకున్నాయి. ఆరుగురు కంటే ఎక్కువమంది ప్రయాణించే మ్యాక్సీ క్యాబ్లు అప్పట్లో 6,390 మాత్రమే ఉండగా, ఇప్పుడు 30,904కు చేరుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల జోరు చమురు ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో గత ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. వీటి కొనుగోళ్లు మరింత పెరిగే అవకా శం ఉందని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో 45 వేల ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలుండగా, ఎలక్ట్రిక్ కార్లు 4 వేలను దాటాయి. 2014లో వాటి సంఖ్య సున్నా. ఆర్టీసీ బస్సుల సంఖ్యే తగ్గింది.. అన్ని రకాల కేటగిరీ వాహనాలు గత ఎనిమిదిన్నరేళ్లలో దాదాపు రెట్టింపు అవటమో, అంతకుమించి పెరగటమో జరగ్గా.. ఆర్టీసీ బస్సుల సంఖ్య మాత్రం భారీగా తగ్గిపోయింది. రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో తెలంగాణ ఆర్టీసీ వద్ద 10,579 బస్సులు ఉండేవి. రవా ణాశాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం వాటి సంఖ్య 9,400 మాత్రమే. కొత్త బస్సుల కొనుగోలు అంతంత మాత్రంగానే ఉండటం, నడిచే పరిస్థితి లేని బస్సులను తుక్కుగా మార్చాల్సి రావటంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గి పోయింది. వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరగటానికి ఇదీ ఒక కారణమని నిపుణులు చెపుతున్నారు. -
వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు భలే క్రేజ్.. ఒక్కరోజే 31 లక్షల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ పెరిగింది. వాహనదారులకు ఇష్టమైన నంబర్తో పాటు, లక్కీ నంబర్, పుట్టిన తేదీ, కలిసి వచ్చే నంబర్తో గుర్తింపు దక్కాలని చూస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టి తమకు కావాల్సిన నంబర్లను వేలం ద్వారా దక్కించుకుంటున్నారు. సాధార ణంగా వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రవాణా శాఖకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంటే.. ఫాన్సీ నంబర్ల ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. తాజాగా ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్ను చాటుకున్నారు. ప్రతి సిరీస్లో ఎంతో డిమాండ్ ఉండే ఆల్నైన్ ఈసారి కూడా అ‘ధర’హో అనిపించింది. శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక నెంబర్లకు నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ‘టీఎస్ 09 ఎఫ్జడ్ 9999’ నెంబర్కు ప్రీమియర్ ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రూ.9,50,999 చెల్లించి సొంతం చేసుకుంది. అలాగే ‘టీఎస్ 09 జీఏ 0001’ నెంబర్ కోసం రాజేశ్వరి స్కిన్ అండ్ ఎయిర్క్యూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్లైన్ వేలంలో రూ.7,25,199 చెల్లించి సొంతం చేసుకుంది. ‘టీఎస్09 జీఏ 0009’ నెంబర్ కోసం ఎం.వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2.20,111 చెలించింది. ‘టీఎస్09 జీఏ 0007’ నెంబర్ కోసం స్నేహ కైనెటిక్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,35,007 చెల్లించి నెంబర్ను దక్కించుకుంది. ‘టీఎస్ 09 జీఏ 0003’ నెంబర్ కోసం ధని కన్సల్టేషన్స్ ఎల్ఎల్పీ రూ.1,35,000 చెల్లించి సొంతం చేసుకుంది. ప్రత్యేక నెంబర్లపైన శుక్రవారం ఒక్క రోజే రూ.31,66,464 లభించినట్లు హైదరాబాద్ జేటీసీ పాండురంగ్నాయక్ తెలిపారు. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఆటోమొబైల్ జోరు
ముంబై: దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచిగా కోలుకుందని, వచ్చే ఆర్థిక సంవ్సరంలో సింగిల్ డిజిట్లో అధిక వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, రవాణా కార్యకలాపాలు పెరగడం వృద్ధికి దోహదం చేసే అంశాలుగా పేర్కొంది. విభాగాల వారీగా చూస్తే.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 6–9 శాతం మధ్య, వాణిజ్య వాహనాల అమ్మకాలు 7–10 శాతం మధ్య వృద్ధిని చూస్తాయని ఇక్రా తెలిపింది. అలాగే, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6–9 శాతం మధ్య, ట్రాక్టర్ల విక్రయాలు 4–6 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల విభాగంలో డిమాండ్ ఆరోగ్యకరంగా ఉందని తెలిపింది. కానీ, ద్విచక్ర వాహన విభాగం ఇప్పటికీ సమస్యలను చూస్తోందని, విక్రయాలు ఇంకా కరోనా ముందు నాటి స్థాయిని అధిగమించలేదని వివరించింది. ఇటీవల పండుగలు, వివాహ సీజన్లో విక్రయాలు పెరిగినప్పటికీ.. స్థిరమైన డిమాండ్ రికవరీ ఇంకా కనిపించలేదని తెలిపింది. ఆరంభ స్థాయి కార్ల విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొంది. ధరల పెంపు ప్రభావం.. ‘‘కరోనా కారణంగా ఏర్పడిన అవరోధాలు, సవాళ్లను అధిగమించడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తట్టుకునేందుకు వాహనాల ధరలను కంపెనీలు గణనీయంగా పెంచాయి. దీంతో దిగువ స్థాయి వాహన వినియోగదారుల కొనుగోలు శక్తి తుడిచిపెట్టుకుపోయింది. 2023–24లో అన్ని రకాల వాహన విభాగాల్లో గరిష్ట స్థాయి సింగిల్ డిజిట్ (8–9 శాతం) అమ్మకాలు నమోదవుతాయని అంచనా వేస్తున్నాం’’అని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంషేర్ దేవాన్ తెలిపారు. ద్విచక్ర వాహన విభాగంలో మాత్రం వృద్ధి మోస్తరుగా ఉండొచ్చన్నారు. ‘‘2023–24 బడ్జెట్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం కింద గ్రామీణ ఉపాధి కోసం, అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇరిగేషన్ వసతుల పెంపునకు, పంటల బీమా పథకం కోసం కేటాయింపులు పెంచొచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్కు మద్దతునిస్తుంది’’ అని దేవాన్ అంచనా వేశారు. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
ఈవీల్లో అన్ని విభాగాల్లోకి వస్తాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో అన్ని విభాగాల్లోకి ఎంట్రీ ఇస్తామని అర్బనైట్ వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాలను అర్బనైట్ బ్రాండ్లో బజాజ్ ఆటో ఆఫర్ చేస్తోంది. ఈ–టూ వీలర్స్లో ఏటా ఒక కొత్త మోడల్ను పరిచయం చేయాలన్నది బజాజ్ లక్ష్యమని అర్బనైట్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం తెలిపారు. ‘ఇందుకు అనుగుణంగా నూతన ఉత్పాదనలను అభివృద్ధి చేస్తున్నాం. చేతక్ లేదా ఇతర పేర్లతోనూ వాహనాలు రావొచ్చు. ఈవీ వ్యాపారం ఒక దీర్ఘకాలిక క్రీడ. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ద్విచక్ర వాహనాల అమ్మకాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ టూ వీలర్ల వాటా గతేడాది 9 శాతం. ఇప్పుడిది ఏకంగా 20 శాతానికి చేరింది. రెండేళ్లలో మొత్తం స్కూటర్ల విక్రయాల్లో 70 శాతం ఎలక్ట్రిక్ కైవసం చేసుకుంటుంది’ అని వెల్లడించారు. చేతక్ శకం మళ్లీ వస్తుంది.. నాణ్యతలో రాజీపడని కస్టమర్ల తొలి ప్రాధాన్యత చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని ఎరిక్ అన్నారు. ‘బ్రాండ్ను నిలబెట్టడానికి మన్నిక, సాంకేతికత, ఇంజనీరింగ్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎలక్ట్రిక్ త్రీ, ఫోర్ వీలర్ల విభాగంలోకి రాలేమని చెప్పలేను. చేతక్ అంటే అంచనాలు ఎక్కువ. సామాన్యుడి వాహనంగా వినుతికెక్కిన చేతక్ శకం మళ్లీ వస్తుంది. మొబిలిటీ కంపెనీ యూలు వినియోగిస్తున్న 10,000 పైచిలుకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రత్యేకంగా తయారు చేసి సరఫరా చేశాం. మొబిలిటీని ఒక సేవగా దేశంలో ప్రోత్సహిస్తాం’ అని వివరించారు. ఎలక్ట్రిక్ టూవీలర్లను అద్దె ప్రాతిపదికన బెంగళూరు, ముంబై, ఢిల్లీలో యూలు ఆఫర్ చేస్తోంది. కాగా, నెలకు 200లకుపైగా చేతక్ స్కూటర్లను విక్రయిస్తున్నట్టు శ్రీ వినాయక మోబైక్స్ ఎండీ కె.వి.బాబుల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో చేతక్ ఎక్స్క్లూజివ్ స్టోర్లు మూడు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. -
ఠారెత్తించే ఘోర ప్రమాదం..కానీ చివర్లో అదిరిపోయే ట్విస్ట్
ఇంతవరకు ఎన్నో ఘోర ప్రమాదాలు చూసి ఉంటాం. చచ్చిపోతారు నోడౌట్ అనేంత దారుణమైన ప్రమాదాల బారినపడినవారు సైతం బతికిన ఉదంతాలు చూశాం. ఇవన్నీ ఒకత్తైతే ఇక్కడ జరిగిన ప్రమాదం చూస్తో వామ్మో అని బిగిసుకుపోతాం. ఎందుకంటే కచ్చితంగా బయటపడే ఛాన్స్లేదు అనేంత దారుణమైన ప్రమాదం. వివరాల్లోకెళ్తే...ఒక టూవీలర్ వాహనదారుడు రాత్రిపూటా రద్దీ లేకపోవడంతో రోడ్డును క్రాస్ చేస్తున్నాడు. ఇంతలో సడెన్గా ట్రక్కు వచ్చింది. ఐతే రెండు కూడా చాలా వేగంగానే వస్తున్నాయి. ఇద్దరూ ఓ రేంజ్ స్పీడ్లో వచ్చారు. కచ్చితం దారుణం ఢీ కొట్టారు. ఎవ్వరూ బతికే అవకాశం లేదనిపించేలా గగ్గుర్పాటుకు గురి చేసే ఘటన. అలాంటిది ఊహించని విధంగా ప్రమాదం జరగదు. చివర్లో భలే గమత్తుగా బైకర్ ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. అసలు అదేలా సాధ్యం అనిపిస్తుంది. మిరాకిల్ ఘటన అంటే ఇదేనేమో అన్నంత ఆశ్చర్యంగా ఉంటుంది. బహుశా వారిద్దరికీ భూమ్మీద నూకలు ఉండబట్టి..ప్రమాదం నుంచి సునాయాసంగా బయటపడ్డారు అని అనాలో అర్థంకాదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఊపిరాగిపోతుందేమో అన్నంత రేంజ్లో ఉంటుంది ఆ ఘటన. ऐसी गति राखिये, दुर्घटना कभी ना होय, औरन भी सुरक्षित रहै, आपौ सुरक्षित होय. pic.twitter.com/Gvy6B96EdD — Dipanshu Kabra (@ipskabra) January 5, 2023 (చదవండి: నువ్వు తోపు సామీ.. పాలు అమ్మేందుకు హార్లే డేవిడ్సన్ బైక్తో.. ) -
ఈ–వీ అమ్మకాల్లో రికార్డ్ సేల్స్.. ఆ కంపెనీ బైకులను ఎగబడి కొంటున్న జనం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాల్లో హీరో ఎలక్ట్రిక్ కొత్త రికార్డు నమోదు చేసింది. సవాళ్లు ఉన్నప్పటికీ 2022లో ఏకంగా 1,00,000 పైచిలుకు యూనిట్లు విక్రయించినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. దశాబ్దానికి పైగా మార్కెట్లో సంస్థ నాయకత్వాన్ని అమ్మకాల మైలురాయి ప్రతిబింబిస్తుందని హీరో తెలిపింది.ఆరు లక్షలకుపైగా కస్టమర్లను సొంతం చేసుకున్నట్టు వెల్లడించింది. మూడేళ్లలో 50 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా చేసుకున్నట్టు హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ తెలిపారు. 25,000 మంది మెకానిక్లకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో శిక్షణ, పునర్ శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. భాగస్వాముల సహకారంతో దేశవ్యాప్తంగా 20,000 చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. చదవండి: గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది! -
ఎయిర్బ్యాగ్స్ తయారీ రంగం అప్పటికల్లా రూ.7000కోట్లకు చేరుతుంది
వాహనాల్లో కీలక భద్రత ఫీచర్ అయిన ఎయిర్బ్యాగ్స్ తయారీ రంగం దేశీయంగా 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 7,000 కోట్ల స్థాయికి చేరనుంది. ప్రస్తుతం ఇది రూ. 2,500 కోట్లుగా ఉంది. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. భద్రతా ప్రమాణాలను నియంత్రణ సంస్థ నిబంధనలను కఠినతరం చేస్తుండటం, వాహనాల తయారీ సంస్థలు స్వచ్ఛందంగా వాహనాల్లో ఎయిర్బ్యాగ్స్ సంఖ్యను పెంచుతుండటం తదితర అంశాలు ఈ వృద్ధికి ఊతమివ్వనున్నాయి. ప్రస్తుతం అమ్ముడవుతున్న ప్రతి కారుకు సగటున మూడు ఎయిర్బ్యాగ్స్ ఉంటున్నాయి. 2023 అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక ఈ సంఖ్య ఆరుకు చేరనుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రూ. 2,400–2,500 కోట్లుగా ఉన్న పరిశ్రమ 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 25–30 శాతం వార్షిక వృద్ధి రేటుతో రూ. 6,000–7,000 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు ఇక్రా వైస్ ప్రెసిడెంట్ వినుత ఎస్ తెలిపారు. పెరగనున్న కార్ల తయారీ వ్యయాలు.. 2019 జూలైలో ప్రతీ కారుకు ఒక ఎయిర్బ్యాగ్ (డ్రైవర్ కోసం)ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆ తర్వాత 2022 జనవరి 1 నుంచి తయారయ్యే ఎం1 రకం వాహనాలకు (3.5 టన్నుల కన్నా తక్కువ బరువుండి, ఎనిమిది మంది వరకూ ప్రయాణించగలిగే వాహనాలు) ముందు వైపు రెండు ఎయిర్బ్యాగ్లను నిర్దేశించింది. 2023 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే ఎం1 రకం వాహనాలకు రెండు సైడ్ ఎయిర్బ్యాగ్లు, రెండు సైడ్ కర్టెన్ ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి కానుంది. దీంతో కార్లలో తదనుగుణంగా మార్పులు, చేర్పులు చేసేందుకు, అదనంగా సెన్సార్లు ఏర్పాటు చేసేందుకు తయారీ కంపెనీలకు వ్యయాల భారం కూడా పెరగనుంది. అటు ఎయిర్ బ్యాగ్స్ తయారీ సంస్థలు కూడా డిమాండ్కి తగ్గట్లు సరఫరా చేసేందుకు వచ్చే ఏడాది కాలంలో ఉత్పత్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవాల్సి రానుంది. ‘‘పలు కంపెనీలు గత 6–8 నెలల నుంచి సామర్థ్యాలను పెంచుకునే ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇందుకోసం వచ్చే 12–18 నెలల్లో కంపెనీలు సుమారు రూ. 1,000 – రూ. 1,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి’’ అని ఇక్రా తెలిపింది. దిగుమతులపై ఆధారం.. ఎయిర్బ్యాగ్ మొత్తం తయారీ వ్యయంలో ఇన్ఫ్లేటర్ ఖర్చే దాదాపు 50 శాతంగా ఉంటుండగా, మిగతా భాగం కుషన్ మొదలైన వాటిది ఉంటోంది. వీటికి సంబంధించి దేశీయంగా సాంకేతిక సామర్థ్యాలు, తగినంత స్థాయిలో అమ్మకాలు లేకపోతుండటంతో పరిశ్రమ ప్రస్తుతం తమకు అవసరమైన పరికరాల్లో దాదాపు 60–70 శాతాన్ని విదేశాల్లోని మాతృ సంస్థలు, జాయింట్ వెంచర్ పార్ట్నర్లు మొదలైన వాటి నుంచి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా వీటి తయారీ సామర్థ్యాలను పెంచుకోకపోతే మరింత ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి రానుందని ఇక్రా పేర్కొంది. -
అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Cheapest Electric Scooters: దేశంలో గత పది ఏళ్లలో ద్విచక్ర వాహన విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో ఇంధన వాడకం కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చింది. దీంతో వాటి డిమాండ్ పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం తెరపైకి వచ్చింది. దీనికి తోడు కేంద్రం ఈ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పోత్సాహకాలు కూడా అందిస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే వీటితో ప్రయోజనాలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు కూడా ఈవీల కొనుగోలు వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది గానీ ఈవీ మార్కెట్లో వస్తున్న స్కూటర్లు కొన్ని ఖరీదుగా ఉండడం, కస్టమర్ల బడ్జెట్కు సరిపోనివి రావడంతో ఈ విషయమై సామాన్యుల్లో కాస్త ఆందోళన మొదలైంది. అటువంటి వారి కోసం చౌకగా వారి బడ్జెట్కు సరిపోయే చౌకైన ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. Bounce Infinity E1 ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.45,099(బ్యాటరీ లేని వేరియంట్) నుంచి ప్రారంభమవుతుంది. ఒక వేళ మీకు బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కావాలనుకుంటే దాని ధర రూ.68,999. ఇది 2kWh/48V బ్యాటరీతో కంపెనీ అందిస్తోంది. కంపెనీ తెలిపిన ప్రకారం దీని గరిష్ట వేగం 65kmph, 85km రేంజ్ కలిగి ఉంటుంది. Hero Electric Optima CX ఈ ఈవీ స్కూటర్(సింగిల్ బ్యాటరీ వేరియంట్) ధర రూ.62,190గా ఉంది. దీని గరిష్ట వేగం 45 KM/H & 82KM రేంజ్ కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఇది మూడు కలర్స్లో కస్టమర్లకు లభిస్తుంది. ఇది 51.2V/30Ah బ్యాటరీతో కంపెనీ అందిస్తోంది. కేవలం 4 నుంచి 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. Avon E Scoot ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కంపెనీ తెలిపిన ప్రకారం.. ఈ స్కూటర్ 65 కి.మీల రేంజ్ ఇస్తుంది. గరిష్ట వేగం 24KMPH, 215W BLDC మోటార్ & 48V/20AH బ్యాటరీతో వస్తుంది. కేవలం 6 నుంచి 8 గంటల సమయంలో దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. Ampere Magnus EX ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో LCD స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ USB పోర్ట్, కీలెస్ ఎంట్రీ మరియు యాంటీ-థెఫ్ట్ అలారం ఉన్నాయి. ఇది 1.2 kW మోటార్తో వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 55 కి.మీ. ఇది 60V, 30Ah బ్యాటరీతో వస్తుంది, ఇది 121 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. దీని ధర రూ.73,999. Hero Electric Photon హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ స్కూటర్ 1200W మోటార్తో జతచేసిన 72V, 26 Ah బ్యాటరీ ప్యాక్ ద్వారా ఎనర్జీని పొందుతుంది. ఇది 90 కి.మీల రేంజ్తో వస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 45 కి.మీగా ఉంది. ఫీచర్ల పరంగా ఇది LED హెడ్లైట్, టెయిల్ లైట్తో పాటు అల్లాయ్ వీల్స్ను కలిగి ఉంటుంది. కేవలం 5 గంటల్లో దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కానుంది. -
వావ్ అనిపించే ఫీచర్లతో హీరో కొత్త బైక్.. స్టైలిష్ లుక్తో అదరగొడుతోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టూవీలర్ల తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ తాజాగా అదిరిపోయే లుక్తో ఓ బైక్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తన ఎక్స్పల్స్ 200టీ మోడల్లో కొత్త అప్డేటెడ్ వెర్షన్ను లాంచ్ చేసింది. దీని ధర ముంబై ఎక్స్షోరూంలో రూ.1.25 లక్షలు. కొత్తగా మార్కెటలోకి తీసుకువచ్చిన ఈ అప్డేటెడ్ వెర్షన్లో బీఎస్ 6 200 సీసీ 4 వాల్వ్ ఇంజిన్ను అమర్చారు. ఈ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పవర్ 19 హెచ్పీ, 17.3 ఎన్ఎం టార్క్తో రాబోతోంది. గోల్డ్, రెడ్, ఎల్లో మేట్ ఫంక్ వంటి కలర్స్ యాడ్ చేశారు. ఈ బైక్లో 37 ఎంఎం ఫ్రంట్ ఫోర్క్స్, వెనక భాగంలో 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్ అమర్చారు. ఈ బైక్ను కొనుగోలు చేయాలనుకున్న వారు కంపెనీ వెబ్సైట్లోకి రూ. 2,500తో ఈ బైక్ను ప్రి బుకింగ్ చేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్స్, టర్న్ బై టర్న్ నేవిగేషన్తో ఫుల్ డిజిటల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్, యూఎస్బీ చార్జర్, గేర్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ వంటి ఫీచర్లను జోడించారు. చదవండి: కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు ఊహించని షాక్! -
దేశంలో విద్యుత్ వాహనాల జోరు
సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్ వాహనాల(ఈవీ) అమ్మకాలు జోరందుకున్నాయి. వీటిని ఉపయోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2030 నాటికల్లా దేశంలోని టూ వీలర్ సెగ్మెంట్లో ఏకంగా 40–45 శాతం విద్యుత్ వాహనాలే ఉంటాయని బైన్–కో అనే సంస్థ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాబోయే ఎనిమిదేళ్లలో మొత్తంగా 66 శాతం మంది విద్యుత్ వాహనాలనే వాడతారని ఈ అధ్యయనం తేల్చింది. విద్యుత్ వాహనాలు తక్కువ ధరకే అందుబాటులో ఉండటం, రిపేర్లకు అవకాశం తక్కువ కావడం, మెయింటనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ ఉండటంతో వాహనదారులు వీటిని ఎంచుకుంటున్నారని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే వాయు, శబ్ధ కాలుష్యాలు లేకపోవడం కూడా అమ్మకాల పెరుగుదలకు ఒక కారణంగా తేలింది. కేంద్ర ప్రభుత్వం కూడా కాలుష్యానికి చెక్ పెట్టేందుకు 2030 నాటికి 30 శాతం ఈవీ కార్లు, 80 శాతం ఈవీ టూ వీలర్లు, 70 శాతం ఈవీ కమర్షియల్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వేగంగా పెరుగుతున్న అమ్మకాలు.. మన దేశంలో మొదటి విద్యుత్ వాహనాన్ని స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 1996లోనే తయారు చేసింది. ‘విక్రమ్ సఫా’ అనే పేరుతో త్రీ వీలర్ను మార్కెట్లోకి విడుదల చేశారు. దాదాపు 400 వాహనాలను విక్రయించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో బీహెచ్ఈఎల్ 18 సీట్లున్న ఎలక్ట్రిక్ బస్సును రూపొందించింది. 2001లో బెంగళూరుకు చెందిన ‘రెవా’ అనే సంస్థ కూడా ఈవీ కార్ల పరిశ్రమలోకి ప్రవేశించింది. 2012 నుంచి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో పెరుగుదల మొదలైంది. ఆ ఏడాది 6 వేల వాహనాలకు రిజిస్ట్రేషన్లవ్వగా.. 2015లో 9 వేలు, 2016లో 50 వేల మార్కును దాటేసింది. 2016–2019 మధ్యలో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ 51,129 నుంచి 1.61 లక్షలకు పెరిగింది. 2020లో కోవిడ్ వల్ల 1.19 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలే జరిగాయి. 2021 నుంచి మళ్లీ ఊపందుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13.34 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు తిరుగుతుండగా.. ఇతర వాహనాల సంఖ్య 27.81 కోట్లుగా ఉంది. 2030 నాటికి ఈ సంఖ్యలో సగభాగం ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. -
గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్!
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో వాహన మార్కెట్ గాడిన పడుతోంది. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, ట్రాక్టర్ల విక్రయాలు ఇటీవలి నెలల్లో పుంజుకోవడంతో ఆటోమొబైల్ కంపెనీల్లో భవిష్యత్ డిమాండ్ పట్ల ఆశలు చిగురిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ సెంటిమెంట్ మెరుగుపడిన దానికి ఇది నిదర్శనం. ద్విచక్ర వాహనాలు, కార్లకు గ్రామీణ మార్కెట్ కీలకంగా ఉండడం గమనార్హం. కరోనాతో ఏర్పడిన పరిస్థితులతో గ్రామీణ మార్కెట్లో డిమాండ్ తగ్గడం తెలిసిందే. ఆ డిమాండ్ ఇంకా బలంగా పుంజుకోలేదు. ఇప్పుడు సెంటిమెంట్లో మార్పు కనిపిస్తుండడం ఆశావహం. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహన విక్రయాలు రెండంకెల స్థాయిలో పెరిగాయి. ఈ విక్రయాల్లో గ్రామీణ మార్కెట్ల పాత్ర బలంగా ఉండడం గమనించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) తర్వాత తిరిగి గత నెలలోనే ట్రాక్టర్ల విక్రయాలు సానుకూలంగా నమోదయ్యాయి. ఆల్టో కారుకు డిమాండ్ గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా అమ్ముడుపోయే చిన్న కారు మారుతి ఆల్టో.. గత మూడు నెలల కాలంలో(సెప్టెంబర్–నవంబర్) రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేసింది. అమ్మకాలు 42.5 శాతం పెరిగి 61,767 యూనిట్లుగా ఉన్నాయి. ఆల్టో కే10 పేరుతో నవీకరించిన మోడల్ను మారుతి సుజుకీ ఇండియా ఈ ఏడాది ఆగస్ట్లో మార్కెట్కు పరిచయం చేసింది. విక్రయాల్లో దీని పాత్ర కూడా బలంగానే ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో విక్రయ ధోరణలను పరిశీలిస్తే డిమాండ్ మెరుగుపడుతున్నట్టు తెలుస్తోందని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. ‘‘గత నెల విక్రయాలు కొంత నిదానించడాన్ని చూశాం. గ్రామీణ డిమాండ్ ఎప్పుడూ సీజనల్గా ఉంటుంది. వర్షాలు గత మూడు నాలుగేళ్లుగా మెరుగ్గా ఉన్నాయి. రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆరోగ్యకరంగా ఉన్నాయి. రబీ సాగు కూడా వేగంగానే ఉంది. సాగు తర్వాత వచ్చే నెల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం’’అని శ్రీవాస్తవ వివరించా రు. మారుతీ సుజుకీ వాహన విక్రయాల్లో గ్రామీణ ప్రాంత వాట గత ఆర్థిక సంవత్సరంలో 43.3 శాతంగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అది 43.8 శాతానికి పుంజుకుంది. టూ వీలర్లదీ అదే దారి.. ద్విచక్ర వాహన విక్రయాల మార్కెట్ కూడా పుంజుకుంటోంది. గత త్రైమాసికంలో విక్రయాల్లో ఒక అంకె వృద్ధి నమోదు కాగా, రానున్న రోజుల్లో విక్రయాలు మరింత పెరుగుతాయనే అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్లో విక్రయాలు 41 శాతం పెరిగితే, నవంబర్లో 24 శాతం వృద్ధి ఉన్నట్టు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) డేటా తెలియజేస్తోంది.దేశంలో ద్విచక్ర వాహనాల విక్రయాల్లో మొదటి స్థానంలో ఉన్న హీరో మోటో కార్ప్.. సానుకూల వినియోగ సెంటిమెంట్, ఆర్థిక కార్యకలాపాల మద్దతుతో రానున్న త్రైమాసికంలో విక్రయాలు పెరుగుతాయన్న అంచనాలను వ్యక్తం చేసింది. సాగు బలంగా ఉండడం, వివాహాల సీజన్ను ఉదాహరణలుగా పేర్కొంది. ఎఫ్ఎంసీజీకి అనుకూలం.. గ్రామీణ ప్రాంతాల్లో సన్నగిల్లిన ఎఫ్ఎంసీజీ డిమాండ్.. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి మెరుగుపడుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం ప్రభావంతో గత నాలుగు త్రైమాసికాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. ఇప్పుడు ద్రవ్యోల్బణం దిగొస్తుండడం, మరోవైపు బలమైన సాగు, పంటల మద్దతు ధరలతో డిమాండ్ ఇక మీదట బలపడుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వచ్చే త్రైమాసికంలో డిమాండ్ స్థిరంగా ఉంటుందని భావిస్తున్నాయి. చదవండి: భారత్లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా!
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అలాగే పెళ్లి కూడా చేసిపెట్టమని అడగండి మేడం!
ఆనంద్ మహీంద్రా సండే ట్వీట్.. 'సిటీ ఆఫ్ సీ' వీడియో
ఐశ్వర్య రాయ్ చేతికి సర్జరీ.. డాక్టర్స్ సూచనతోనే కేన్స్లో మెరిసిందా?
రెడ్ కార్పెట్పై తెలుగందం.. చూడటానికి రెండు కళ్లు చాలట్లేదు! (ఫోటోలు)
టీడీపీ అరాచకం.. సిట్ బృందాన్ని కలిసిన మంత్రి అంబటి
సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
మరోసారి పోలీసుల అదుపులో ఉయ్యూరు లోకేష్
నేనే హీరో..నేనే విలన్..తగ్గేదేలే అంటున్న స్టార్స్
ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం.. టెక్ దిగ్గజం వార్నింగ్
వాట్ బంగారు ధూళినా..! దుమ్ము తోపాటు ఎగజిమ్ముతూ..
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement