నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు.. | Sakshi
Sakshi News home page

నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు..

Published Tue, Aug 1 2023 12:10 AM

- - Sakshi

భద్రాద్రి: ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక ఆల పిలుపునిచ్చారు. ఐడీఓసీలో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారోత్సవాల వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిపాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, మధుసూదన్‌రాజు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శిరీష, ఆస్పత్రుల సమన్వయ అధికారి రవిబాబు, మహిళా, శిశు సంక్షేమాధికారి సబిత, ఉపాధి కల్పన అధికారి విజేత పాల్గొన్నారు.

వరద నష్టాల నివేదిక అందించాలి

జిల్లాలో వరద నష్టాల నివేదికలను అందజేయాలని కలెక్టర్‌ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో అధికారుల పనితీరును అభినందించారు.

వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలు, పశువులు, ఇళ్లు, పిడుగుపాటు తదితర అంశాలపై సమగ్ర నివేదికలు రూపొందించాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో నాలుగు వంతెనలు దెబ్బతిన్నాయని, పంచాయతీరాజ్‌ పరిధిలో 97 రహదారులు మరమ్మతులకు గురి కాగా 60 పనులు పూర్తి చేశామని తెలిపారు. 11 చోట్ల దెబ్బతిన్న పైపులైన్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు.

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేశారు. వచ్చిన దరఖాస్తులలో కొన్ని..

► ఇల్లెందు సీఎస్పీ బస్తీకి చెందిన ఆదివాసీ వ్యవసాయదారులు.. తాము 1987 నుంచి పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నామని సింగరేణి అధికారులు జేకే 5 ఓసీ ఏర్పాటుకు సర్వే నిర్వహించి ఏర్పాటు చేసిన హద్దుల ప్రకారం తమ భూములను కోల్పోతున్నామని, జీవనోపాధి కల్పించాలని దరఖాస్తు చేయగా రెవెన్యూ అధికారులకు ఎండార్స్‌ చేశారు.

►పాల్వంచ నవభారత్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాలలో సౌకర్యాలు లేక విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారని, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంతో తప్పుదోవ పడుతున్నారని విద్యార్థి, యువజన సంఘాలు దరఖాస్తు చేయగా త్వరలో పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

►కొత్తగూడెం మున్సిపాలిటీ నాలుగో వార్డులో కాలువల నిర్మాణం మంజూరైనా ప్రారంభించ లేదని బీజేపీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అగర్వాల్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు జోగు ప్రదీప్‌ తదితరులు ఫిర్యాదు చేయగా కమిషనర్‌ను పిలిచి సమస్యపై ఆరా తీశారు. సంబంధిత వార్డు కౌన్సిలర్‌, చైర్‌పర్సన్‌ను ఆహ్వానించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

Advertisement
Advertisement