వద్దన్నందుకు చంపేశాడు.. బ్యూటీషియన్‌ దుర్గ మృతిలో వీడిన మిస్టరీ | Sakshi
Sakshi News home page

వద్దన్నందుకు చంపేశాడు.. బ్యూటీషియన్‌ దుర్గ మృతిలో వీడిన మిస్టరీ

Published Thu, Apr 20 2023 5:15 AM

Beautician Durga Prashanthi death mystery - Sakshi

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్‌ దుర్గాప్రశాంతి మృతి కేసులో మిస్టరీ వీడింది. దుర్గాప్రశాంతిది హత్యగా పోలీసులు తేల్చారు. ప్రాణాపాయ స్థితిలో తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు చక్రవర్తి నోరు విప్పడంతో అసలు విషయం బయటపడింది. కొద్దిరోజులుగా తనను పక్కకు పెట్టడం, పెళ్లి విషయాన్ని వాయిదా వేస్తూ రావడంతోనే దుర్గాప్రశాంతిని చంపేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఇక్కడ ఆస్పత్రిలో కోలుకున్న చక్రవర్తి ప్రస్తుతం పోలీసుల పహారా మధ్య తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

మోచేతితో గొంతుబిగించి.. 
చిత్తూరుకు చెందిన పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌ కుమార్తె దుర్గాప్రశాంతికి, తెలంగాణలోని కొత్తగూడేనికి చెందిన చక్రవర్తికి ఫేస్‌బుక్‌ ద్వారా రెండేళ్లుగా పరిచయం ఉంది. దుర్గాప్రశాంతిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో చక్రవర్తి  భద్రాచలంలో ఉన్న తన తల్లిని తీసుకుని చిత్తూరు వచ్చి  దుకాణం తెరచి ఇక్కడే ఉంటున్నాడు. ఇటీవల పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తనకు కాస్త సమయం కావాలని దుర్గాప్రశాంతి కోరేది. వారం రోజులుగా వారి మధ్య విభేదాలొచ్చా యి. తనకు ఫోన్‌ చేయవద్దని, పెళ్లి ఇప్పుడే వ ద్దని ఆమె స్పష్టం చేసింది.

ఈ మాటలను పట్టించుకోని చక్రవర్తి నిత్యం ఫోన్లు చేస్తుండటంతో తన మొబైల్‌ చాట్స్‌ అన్నీ డిలీట్‌ చేయాలని చక్రవర్తికి చెప్పి అతడి మొబైల్‌ నంబర్‌ను బ్లాక్‌ చేసింది. తనను ఎందుకు పక్కకు పెట్టావని ప్రశ్నిస్తూ, పెళ్లి చేసుకోమని కోరుతూ చక్రవర్తి మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తన మెయిల్‌ నుంచి దుర్గాప్రశాంతికి ఎని మిది పేజీల లేఖ రాశాడు. దీనికి ఆమె సమాధానం ఇవ్వలేదు. మధ్యాహ్నం ఆమె బ్యూటీపార్లర్‌లో ఉంటుందని తెలిసిన చక్రవర్తి 12.30 గంటల ప్రాంతంలో పార్లర్‌లోకి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినా దుర్గాప్రశాంతి అంగీకరించలేదు. దీంతో ఓ బ్లేడ్‌ తీసుకుని చేయి కోసుకున్నాడు.

భయపడిన దుర్గ పార్లర్‌ నుంచి బయటకు పరుగెత్తేందుకు ప్రయత్నించింది. వెంటనే తన మోచేతితో దుర్గ గొంతును ఊపిరి ఆడకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఆరడుగుల పొడవు, బలిష్టమైన శరీరంతో ఉన్న చక్రవర్తి పట్టు నుంచి దుర్గాప్రశాంతి తప్పించుకోలేక.. ఊపిరాడక క్షణాల్లో ప్రాణాలొదిలింది. దీంతో భయపడిన నిందితుడు తాను కూడా చనిపోవాలని బ్లేడుతో గొంతు, చేయి, శరీరంపై  కోసుకుని తీవ్ర రక్తస్రావంతో పడిపోయాడు. 

దిశ పోలీసుల దర్యాప్తు
ఈ కేసును చిత్తూరు దిశ పోలీసులకు అప్పగిస్తూ ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.   వన్‌టౌన్‌ పోలీసుల వద్ద ఉన్న సమాచా రాన్ని దిశ స్టేషన్‌ డీఎస్పీ బాబుప్రసాద్‌ తీసుకున్నారు. దిశ సీఐ బాలయ్యతో కలిసి వైద్యులచే దుర్గాప్రశాంతి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితుడు చక్రవర్తిపై హత్య, అట్రాసిటీ, ఆత్మహత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Advertisement
Advertisement