పండుగ నింపిన విషాదం | Sakshi
Sakshi News home page

పండుగ నింపిన విషాదం

Published Wed, Mar 27 2024 9:44 AM

Two Died In Medak - Sakshi

    గల్లంతైన యువకులు మృతదేహమై లభ్యం 


    హోలీ రోజు చెరువులో  స్నానానికి వెళ్లిన స్నేహితులు 


    గుమ్మడిదల మండలంలో తీవ్ర విషాదం

 
    మృతుల్లో ఒకరు పదవ తరగతి 

జిన్నారం(పటాన్‌చెరు): ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలికొన్నది. గుమ్మడిదల మండలంలోని వీరన్నగూడ గ్రామంలో సోమవారం చెరువులో మునిగి ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా ఈ ఇద్దరు యువకుల మృతదేహాలు మంగళవారం చెరువులో లభ్యమయ్యాయి. గుమ్మడిదల ఎస్‌ఐ మహేశ్వరెడ్డి కథనం ప్రకారం.. సూరారంలోని నివాసం ఉంటున్న శ్రావణ్‌(16), శంకర్‌ (22)లతోపాటు మరో పది మంది స్నేహితులు హోలి పండుగను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం స్నానం చేసేందుకు వీరన్నగూడ గ్రామంలోని వీరన్న చెరువు వద్దకు వెళ్లారు.

తోటి స్నేహితులు స్నానం చేసి బయటకు రాగా శ్రవన్, శంకర్‌లు చెరువులోకి వెళ్లి బయటకు రాలేదు. గజ ఈతగాళ్లతో వెతికించినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం వీరిద్దరి మృతదేహాలు చెరువులో తేలాయి. మృతుడు శ్రావణ్‌ పదవ తరగతి చదువుతున్నాడు. పరీక్షలు ఉన్నా, తల్లిదండ్రులు చెబుతున్నారా వినకుండా సరాదా  కోసం ఈతకు వెళ్లడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. మృతులు ఇద్దరూ వరుసకు అన్నాదమ్ముళ్లు అవుతారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

ఇద్రేశం చెరువులో మరో యువకుడు
పటాన్‌చెరు టౌన్‌: హోలీ వేడుక స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి స్నేహితుడిని రక్షించబోయి నీటిలో మునిగిపోయి గల్లంతైన ఘటనలో మంగళవారం మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన దాదాపు పది మంది స్నేహితులు సోమవారం హోలీ సంబురాలు జరుపుకున్నారు.

అనంతరం ఇంద్రేశం గ్రామ శివారు సదర్‌ చెరువులో స్నానానికి వెళ్లారు. చెరువులో ఉన్న పుట్టె ఎక్కిన శివ అనే స్నేహితుడిని కాపాడబోయి బండి రాజేశ్‌ గల్లంతు కాగా, గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం తిరిగి గజఈతగాళ్ల సాయంతో గాలింపు  చేపట్టగా ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి సత్యనారాయణ ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 
Advertisement
 
Advertisement