సాగుబడి: పాలేకర్‌ ఫుడ్‌ ఫారెస్ట్‌లో  ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయం! | Sakshi
Sakshi News home page

సాగుబడి: పాలేకర్‌ ఫుడ్‌ ఫారెస్ట్‌లో  ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయం!

Published Tue, Mar 19 2024 8:35 AM

Sagubadi: High Yield In Palekar Natural Farming Method - Sakshi

"పాలేకర్‌ ఫుడ్‌ ఫారెస్ట్‌ ఐదు అంచెల పంటల సాగు నమూనాతో ఎకరానికి ఏటా రూ. 6 లక్షల ఆదాయం సమకూరుతుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్‌ పాలేకర్‌ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. గుజరాత్‌లో ఫైవ్‌ లేయర్‌ ఫుడ్‌ ఫారెస్ట్‌లు తన టెక్నాలజీకి నిదర్శనంగా నిలిచాయని, తొలి ఏడాదే రూ. 2 లక్షలు, ఆరో ఏడాది నుంచి రూ. 6 లక్షల ఆదాయం సమకూరుతోందన్నారు. ఆసక్తిగల రైతులు గుజరాత్‌ వస్తే తానే స్వయంగా చూపిస్తానన్నారు."

ఈ నెల 29,30,31 తేదీల్లో అహ్మదాబాద్‌కు 151 కి.మీ. దరంలోని పాలియాడ్‌ (బోటాడ్‌ జిల్లా)లోని శ్రీ విషమన్‌ బాపు ప్యాలెస్‌ మందిర్‌లో (ఆంగ్లం/ హిందీ) రైతు శిక్షణా శిబిరంలో పాల్గొనే వారికి ఈ ఫుడ్‌ ఫారెస్ట్‌లను స్వయంగా చూపిస్తానన్నారు. 3 రోజులకు ఫీజు రూ.700. ఇతర వివరాలకు.. ఘనశ్యాం భాయ్‌ వాల– 63550 77257, కశ్యప్‌ భాయ్‌చౌహాన్‌– 85303 13211.

పుట్టగొడుగుల సాగుపై 26 రోజుల ఉచిత శిక్షణ..
ఇంటర్‌/డిప్లొమా దశలో చదువు మధ్యలో ఆపేసిన గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, ‘ఆస్కి’ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు పుట్టగొడుగుల పెంపకంపై పూర్తిస్థాయి శిక్షణా శిబిరం జరగనుంది. హైదరాబాద్‌ (రాజేంద్రనగర్‌లోని పిజెటిఎస్‌ఎయు ఆవరణ) లోని విస్తరణ విద్యా సంస్థలో జరిగే ఈ శిబిరంలో పాల్గొనే వారికి బోధనతో పాటు భోజన, వసతి కూడా పూర్తిగా ఉచితం.

చిన్న స్థాయి పుట్టగొడుగుల రైతుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని అంశాలపై నైపుణ్య శిక్షణ ఇస్తారు. 16 ఏళ్లు పైబడిన గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు. ఇంటర్‌ ఫస్టియర్‌ పాస్‌ లేదా టెన్త్‌ తర్వాత వ్యవసాయ/ అనుబంధ విభాగాల్లో 3 ఏళ్ల డిప్లొమా మొదటి ఏడాది పూర్తి చేసిన లేదా పదో తరగతి పాసైన తర్వాత కనీసం ఒక ఏడాది పుట్టగొడుగుల పెంపకంలో అనుభవం పొందిన వారు లేదా 8వ తరగతి పాసైన తర్వాత కనీసం 3 ఏళ్లుగా పుట్టగొడుగులు పెంపకం పని చేస్తున్న వారు.. ఈ ఉచిత శిక్షణకు అర్హులు. విద్యార్హత, కులధృవీకరణ, ఆధార్, ఫోటో తదితర వివరాలను పొందుపరుస్తూ ఆన్‌లైన్‌లో గూగుల్‌ ఫామ్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈ క్యూ.ఆర్‌. కోడ్‌ను స్కాన్‌ చేయండి. ఇతర వివరాలకు.. 040– 2405368, 98666 18107. eeihyd1962@gmail.com

22 నుంచి దేశీ వరి సాగు, నీటి సంరక్షణపై ‘సేవ్‌’ శిక్షణ..
విశాఖపట్నం కృష్ణాపురంలోని సింహాచలం దేవస్థానం గోశాల (న్యూ)లో ఈ నెల 22 నుంచి 26 వరకు దేశీ వరి సాగుదారులు, దేశీ వరి బియ్యాన్ని సేకరించి ఆలయాల్లో నైవేద్యాల కోసం అందించే దాతలతో రైతుల ముఖాముఖి పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ సాధకులు, ‘సేవ్‌’ సంస్థ నిర్వాహకులు విజయరామ్‌ తెలిపారు.

పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దేశీ వరి రకాల సాగు, ఉద్యాన పంటల 5 లేయర్‌ సాగు, వాననీటి సంరక్షణకు ఇంకుడు గుంతల తవ్వకంపై రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. పెళ్లిళ్లలో ఔషధ గుణాలు గల సంప్రదాయ వంటకాలు వడ్డించే ఆసక్తి గల వారికి ఆ వంటకాలను కూడా ఈ శిబిరంలో పరిచయం చేస్తామన్నారు. ‘శబలా భోజన పండుగ’ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ ఐదు రోజులూ జరుగుతాయని, ఆసక్తిగల వారు ఏదో ఒక రోజు హాజరైతే చాలని విజయరామ్‌ తెలిపారు. వివరాలకు.. సేవ్‌ కార్యాలయం 63091 11427, సురేంద్ర 99491 90769.

29 నుంచి సేవాగ్రామ్‌లో జాతీయ విత్తనోత్సవం!
వాతావరణ మార్పుల్ని తట్టుకునే శక్తి దేశీ వంగడాలకే ఉందనే నినాదంతో ఈ నెల 29 నుంచి 31 వరకు మహారాష్ట్ర వార్థా జిల్లా సేవాగ్రామ్‌లోని నాయ్‌ తాలిమ్‌ సమితి పరిసర్‌లో వార్షిక జాతీయ విత్తనోత్సవం జరగనుంది. దేశం నలుమూలల నుంచి అనేక పంటల దేశీ వంగడాల ప్రదర్శన, అమ్మకంతో పాటు సేంద్రియ రైతుల సదస్సులు, క్షేత్ర సందర్శనలు, నిపుణులతో ముఖాముఖి వంటి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. రుసుము రూ. వెయ్యి. వివరాలకు.. యుగంధర ఖోడె – 91302 17662, ప్రతాప్‌ మరొడె – 75888 46544.

ఇవి చదవండి: సాగుబడి: ఈ సరికొత్త ప్రయోగంతో.. కరువును తట్టుకున్న పంటలు!

Advertisement
Advertisement