నాగర్కర్నూల్: ఓటుహక్కు అందరి బాధ్యత అని.. అర్హులైన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు అన్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాగర్కర్నూల్ ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో సోమవారం ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో వందశాతం ఓటింగ్ లక్ష్యంతో ముందుకుసాగాలని తెలిపారు.
క్రీడాకారిణికి
అభినందన
నాగర్కర్నూల్ క్రైం: ఇటీవల దుబాయ్లో నిర్వహించిన 21వ ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 400 మీటర్ల పరుగుపందెంలో జిల్లా కేంద్రానికి చెందిన సాయిసంగీత ప్రతిభ కనబర్చి గోల్డ్మెడల్ సాధించింది. ఈసందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సాయి సంగీతను ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అభినందించారు. భవిష్యత్లో ఒలంపిక్స్లో పాల్గొని దేశానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రామేశ్వర్, డీసీఆర్బీ డీఎస్పీ సత్యనారాయణ, శ్యాంసుందర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
నల్లమలలో
ఈదురుగాలుల బీభత్సం
● విరిగిన చెట్ల కొమ్మలు..
విద్యుత్ సరఫరాలో అంతరాయం
అచ్చంపేట/అచ్చంపేట రూరల్ /ఉప్పునుంతల: నల్లమలలో సోమవారం పెద్దఎత్తున ఈదురుగాలులు వీచాయి. గాలుల ధాటికి చెట్లకొమ్మలు విరగడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఉప్పునుంతలకు చెందిన తాళ్ల శేఖర్ పొలంలో వేసుకున్న రేకులషెడ్ ధ్వంసమైంది. అచ్చంపేట మండలంలోని కన్యతండాలో నాలుగు ఇళ్ల పైకప్పు రేకులు కొట్టుకుపోయాయి. సుమారు రూ. 2లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేశారు. వాతావరణంలో ఏర్పడిన మార్పులు కారణంగా ఆదివారం రాత్రి అమ్రాబాద్, పదర, అచ్చంపేట మండలాల్లో చిరుజల్లులు కురిశాయి.
మరోవైపు భానుడి భగభగ..
మరోవైపు భానుడు నిప్పుల సెగలు రేపుతున్నాడు. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆరెంజ్ అలర్ట్లో ఉన్న ఉష్ణోగ్రతలు.. ఈనెల 2నుంచి రెడ్ అలర్ట్ స్థాయికి చేరాయి. సోమవారం వెల్దండలో 45.8, కల్వకుర్తిలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బిజినేపల్లిలో 44.8, కోడేరు, అచ్చంపేట మండలం ఐనోలు 44.6, పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లి 44.4, వంగూరు మండలం కిష్టంపల్లి 44.1, కల్వకుర్తి మండలం వెలికల్ 43.9, వెల్దండ మండలం బొల్లంపల్లి 43.8, తాడూరు మండలం వెంగంపల్లి, కొల్లాపూర్ 43.5, బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి, పెద్దకొత్తపల్లి, అచ్చంపేట 43.3, ఉప్పునంతల మండలం వెల్టూర్ 43.1, ఉప్పునుంతల 42.9, చారకొండ మండలం సిర్సనగండ్ల 42.8, కల్వకుర్తి మండలం తోటపల్లి 42.7, బల్మూర్ మండలం కొండనాగులు, ఊర్కొండ, పెంట్లవెల్లి మండలం జట్రపోల్ 42.6, తెలకపల్లి మండలం పెద్దూరు, పాలెం 42.4, నాగర్కర్నూల్ 42.3, లింగాల, కుమ్మెర 42.1, బిజినేపల్లి మండలం మన్ననూర్, పెద్దముద్దునూర్, తెలకపల్లి 41.9, తిమ్మాజిపేట, తూడుకుర్తి, అమ్రాబాద్ 40.4, పదర 39.9, వట్టవర్లపల్లిలో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.