Delhi Liquor Scam: సంక్షోభం వేళ ఎంపీల మౌనం! | Sakshi
Sakshi News home page

Delhi Liquor Scam: సంక్షోభం వేళ ఎంపీల మౌనం!

Published Sun, Apr 14 2024 5:52 AM

Delhi liquor scam: AAP Rajya Sabha MPs Silent On Delhi CM Arvind Kejriwal Arrest - Sakshi

కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై ఆప్‌ రాజ్యసభ ఎంపీల స్పందన అంతంతే

నిరసనలు, ర్యాలీలకు దూరంగా రాఘవ్‌ చద్దా, స్వాతి మలివాల్‌

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌తో ఆ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆ పార్టీ ఎంపీలు మాత్రం మౌనవ్రతం పాటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. పారీ్టకి చెందిన 10 మంది రాజ్యసభ ఎంపీల్లో కేవలం ఇద్దరే కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను ఖండిస్తూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మిగతా వారి వ్యవహారంపై పార్టీ సమావేశంలో చర్చించాలనే డిమాండ్లు అంతర్గతంగా ఊపందుకున్నాయి.  

ఎనిమిది మంది గాయబ్‌..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ గత నెల 21న అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఆ పార్టీ ఢిల్లీసహా పలు రాష్ట్రాల్లో నిరసనలు, ర్యాలీలు చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో ఇద్దరు ఆప్‌ రాజ్యసభ సభ్యులు  సంజయ్‌సింగ్, సందీప్‌ పాఠక్‌లు మాత్రమే చురుగ్గా ఉంటున్నారు. మిగతా 8 మంది సభ్యులు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. సంజయ్‌ సింగ్‌ ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచి్చన మరునాటి నుంచే బీజేపీని, దర్యాప్తు సంస్థల పనితీరును తప్పుపడుతూ ప్రకటనలు చేస్తున్నారు.

సందీప్‌ పాఠక్‌ సైతం సోషల్‌ మీడియాతో పాటు జాతీయ మీడియాలో ఆప్‌ గొంతుక వినిపిస్తున్నారు. పార్టీ కోశాధికారి, ఎంపీ ఎన్‌డీ గుప్తా అడపాదడపా మాత్రమే నిరసనల కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. పూర్తి స్థాయి కార్యక్రమాలకు మాత్రం ఆయన దూరంగానే ఉంటున్నారు. మీడియా భేటీల్లో, సభల్లో మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొంటున్న ఎంపీ రాఘవ్‌ చద్దా ఆచూకీ కనిపించడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఆయన ఢిల్లీలో లేరు.

గత నెల మొదటి వారంలో లండన్‌ వెళ్లి కంటికి చికిత్స చేసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. మార్చి చివరి వారంలోనే ఆయన ఢిల్లీ రావాల్సి ఉన్నా, వైద్యుల సూచన మేరకు అక్కడే ఉండిపోయారంటున్నారు. మరో కీలక నేత స్వాతి మలివాల్‌ సైతం అమెరికాలో ఉన్నారు. అక్కడి నుంచి కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను సామాజిక వేదికలపై ఖండిస్తున్నారు. ప్రత్యక్ష నిరసల్లో ఇంతవరకూ పాల్గొనలేదు. తన సోదరి అనారోగ్యం దృష్ట్యా అమెరికాలో ఉండాల్సి వస్తోందని, తిరిగి వచ్చాక ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా పోరాడుతానని అంటున్నారు.

పంజాబ్‌కు చెందిన పార్టీ ఎంపీ సంజీవ్‌ అరోరా కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తర్వాత ఆయన భార్య సునీతతో భేటీ అయ్యారు. అది మినహా రాంలీలా మైదానంలో జరిగిన ర్యాలీ, జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లోగానీ పాల్గొనలేదు. మరో ఇద్దరు ఎంపీలు అశోక్‌కుమార్‌ మిట్టల్, క్రికెటర్‌ హర్బజన్‌సింగ్‌లు కేజ్రీ అరెస్ట్‌ మినహా ఇతర అంశాలపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పర్యావరణ వేత అయిన ఎంపీ బల్బీర్‌సింగ్‌ సీచేవాల్, మరో ఎంపీ విక్రమ్‌జీత్‌ సింగ్‌ చాహ్నీలు సైతం తమ వ్యక్తిగత వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. ఇలా..పార్టీ ఎంపీలు మౌనవత్రం దాల్చడంపై సీనియర్‌ నేతలు గుర్రుగా ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో జరిగే కీలక భేటీలో ఎంపీల తీరుపైచర్చిస్తామని సంజయ్‌ సింగ్‌ చెప్పారు. 

Advertisement
Advertisement