రతన్‌ టాటాకు ప్రాణ హాని | Sakshi
Sakshi News home page

రతన్‌ టాటాకు ప్రాణ హాని

Published Sun, Dec 17 2023 5:52 AM

Threat to industrialist Ratan Tata Life - Sakshi

ముంబై: టాటా సన్స్‌ మాజీ చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటాకు ప్రాణ హాని ఉందంటూ వచ్చి న ఫోన్‌ కాల్‌ శనివారం ముంబై పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. రతన్‌ టాటాకు తక్షణం భద్రత పెంచాలని, లేదంటే టాటా సన్స్‌ మరో మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త సైరస్‌ మిస్త్రీకి పట్టిన గతే పడుతుందని కాలర్‌ హెచ్చరించాడు. సైరస్‌ మిస్త్రీ 2022 సెప్టెంబర్‌ నాలుగో తేదీన కారు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తెలిసిందే.

దాంతో పోలీసులు ఆగమేఘాల మీద రతన్‌ టాటా భద్రతను పెంచారు. కాల్‌ కర్ణాటక నుంచి వచ్చినట్టు తేల్చారు. కాల్‌ చేసిన వ్యక్తిని పుణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, అతను ఐదు రోజులుగా ఆచూకీ లేడంటూ భార్య అప్పటికే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టిన విషయం పోలీసుల దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చింది.

బంధుమిత్రులను విచారించగా ఇంజనీరింగ్, ఎంబీఏ ఫైనాన్స్‌ చేసిన అతనికి కొంతకాలంగా మతిస్థిమితం లేదని తేలింది. కర్ణాటకలో వేరొకరి ఇంట్లోంచి ఫోన్‌ తీసుకుని వారికి చెప్పకుండానే ముంబై కంట్రోల్‌ రూమ్‌కు ఇతను ఫోన్‌ చేసి హెచ్చరించినట్లు దర్యాప్తులో తేలింది. మనోవైకల్య బాధితుడు కావడంతో కేసు నమోదు, విచారణ వంటి చర్యలు చేపట్టకూడదని పోలీసులు నిర్ణయించారు.

Advertisement
Advertisement