కార్యకర్తలే కాంగ్రెస్‌ పార్టీకి బలం  | Sakshi
Sakshi News home page

 కార్యకర్తలే కాంగ్రెస్‌ పార్టీకి బలం 

Published Sun, Mar 31 2024 2:11 AM

Activists are the strength of Congress party - Sakshi

అసెంబ్లీ తరహాలో అత్యధిక ఎంపీ స్థానాల్లో పార్టీని గెలిపించాలి  

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ 

తెలంగాణకు ఇచ్చిన ఏ హామీని బీజేపీ అమలు చేయలేదు: మంత్రి ఉత్తమ్‌  

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దృఢ సంకల్పం కలిగిన కార్యకర్తలే కాంగ్రెస్‌ పార్టీకి బలమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో నిర్వహించిన నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్య అతి«థిగా హాజరై ప్రసంగించారు. సిమెంట్‌ లేకుండా ఇల్లు ఎలా కట్టలేమో కార్యకర్తలు లేకుండా కాంగ్రెస్‌ గెలుపు లేదన్నారు.

నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ కార్యకర్తల వల్లే పార్టీ బలంగా ఉందని, కార్యకర్తలు చిందించిన చెమట వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచిందని, ఎంపీ ఎన్నికల్లో కూడా నల్లగొండ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మెజారిటీ కోసం ఎలా పోటీ పడ్డారో, అలాగే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. దీపాదాస్‌ మున్షీ ప్రసంగాన్ని నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి తెలుగులోకి అనువదించారు. 

కార్యకర్తలు గెలిపించాలి: మంత్రి తుమ్మల 
మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి 1983 నుంచి ఈ ప్రాంతానికి ఎనలేని సేవలందించారని, అభివృద్ధికి కృషి చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యంగా ఎస్‌ఎల్‌బీసీ, రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల విషయంలో నిబద్ధతతో ముందుకుసాగి కీర్తి గడించారన్నారు ఆయన తనయుడిగా రఘువీర్‌రెడ్డిని కార్యకర్తలు అంతా కలిసి గెలిపించాలన్నారు. 

రావి నారాయణరెడ్డిని మించిన మెజారిటీతో: మంత్రి కోమటిరెడ్డి  
దేశంలోనే నల్లగొండ పార్లమెంట్‌ స్థానంలో అత్యధిక మెజారిటీ సాధించిన రావి నారాయణరెడ్డిని మించిన మెజారిటీతో రఘువీర్‌రెడ్డిని గెలిపించేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తామంతా టీం వర్క్‌ చేస్తున్నామని, నల్లగొండ ఎంపీ అభ్యర్థి 6 లక్షల ఓట్ల మెజారిటీ టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాలునాయక్, జయవీర్‌రెడ్డి, బి.లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్, చెవిటి వెంకన్న యాదవ్‌ తదితరులు మాట్లాడారు. 

పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ఉండదు: మంత్రి ఉత్తమ్‌
పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ మనుగడ ఉండదని కాంగ్రెస్‌ పార్టీ నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గతంలో తెలంగాణకు హామీలు ఇచ్చిన బీజేపీ వాటిని అమలు చేయకుండా, ఈ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. బయ్యారం స్టీల్‌ప్లాంట్, ఖాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ ఇస్తానని ఇవ్వలేదని దుయ్యబట్టారు.

నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుండా మోసం చేసిందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణలో నామరూపాలు లేకుండా పోవడం ఖాయమన్నారు. ఈ ప్రాంత సమస్యలపై తాను ఎంపీగా పార్లమెంట్‌లో గళమెత్తానని, తన స్థానంలో నల్లగొండ ఎంపీగా రఘువీర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.

ఎంపీగా తాను ఐదేళ్లలో ఏడు నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించానన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రాంతానికి రైల్వేలైన్‌ మంజూరు చేయించానన్నారు. వేలాది ఎకరాలకు ఎత్తిపోతల ప«థకాలు ఏర్పాటు చేసి సాగునీరు అందించామన్నారు. ఇతర పార్టీల నేతలను తాము బలవంతంగా కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం లేదని, వారే స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్పారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement