నేడు బీజేపీ కీలక నేతల నామినేషన్లు.. అక్కడి అభ్యర్థిపై ట్విస్ట్‌!  | Sakshi
Sakshi News home page

నేడు బీజేపీ కీలక నేతల నామినేషన్లు.. అక్కడి అభ్యర్థిపై ట్విస్ట్‌! 

Published Fri, Apr 26 2024 10:54 AM

Telangana BJP Leaders Will Filed Thier Nominations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నేటితో నామినేషన్ట ఘట్టం ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి నలుగురు అభ్యర్థులు నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు.. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి విషయంలో ఇంకా ట్విస్ట్‌ కొనసాగుతోంది. బీజేపీ హైకమాండ్‌ ప్రకటించిన అభ్యర్థికి ఇంకా బీఫామ్‌ ఇవ్వకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. 

కాగా, నేడు నిజామాబాద్‌, కరీంనగర్‌, నాగర​్‌ కర్నూల్‌, పెద్దపల్లి స్థానాలకు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి ధర్మపురి అరవింద్‌ నామినేషన్‌ వేయనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ దామి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ పాల్గొననున్నారు. 

ఇక, కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానానికి బండి సంజయ్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు.. నాగర్ కర్నూల్ పార్లమెంట్‌కు పోతుగంటి భరత్ నామినేషన్‌ వేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు గుజరాత్‌ సీఎం భూపేంద్రభాయ్‌ పటేల్‌, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి హాజరుకానున్నారు. 

ఇదిలా ఉండగా.. బీజేపీ పెద్దపల్లి అభ్యర్థి విషయంలో సస్పెన్స్‌ నెలకొంది. అయితే ఇప్పటికే బీజేపీ గోమా శ్రీనివాస్‌ను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆయనకు బీఫాం ఇవ్వలేదు. మరోవైపు.. పెద్దపల్లి సిట్టింగ్‌ ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ నేత తాజాగా కిషన్‌రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా పెద్దపల్లి టికెట్ ఇస్తే పార్టీలో చేరతానని కిషన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. అయితే పార్టీ హైకమాండ్‌తో మాట్లాడి చెప్తానని కిషన్ రెడ్డి అన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇక, 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా గెలిచిన వెంకటేష్‌.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. అయితే, కాంగ్రెస్‌ ఆయనకు కాకుండా గడ్డం వివేక్‌ కొడుకు వంశీకి టికెట్‌ ప్రకటించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా పార్టీ మారేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 

Advertisement
Advertisement